Saturday, October 21, 2017

ప్యార్ కియాతో డర్నా క్యా?

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-123
ప్యార్ కియాతో డర్నా క్యా?
(ప్రేమిస్తే భయపడేది దేనికి?)
‘మొఘల్ ఎ ఆజమ్’ సినిమా లో లతా మంగేష్కర్ పాడినపాట.షకీల్ బదాయుని రచన ,నౌషాద్ సంగీతం.
రసపుత్ర వనిత జోధాబాయిని ముసల్మాను ఐన అక్బర్ పాదుషా వివాహమాడాడు. తద్వారా శత్రువుల్ని తగ్గించుకున్నాడు.రాజ్య విస్తరణనూ చేయగలిగాడు. ఐతే సంతానంకోసం పరితపించాడు. అందుకోసం ఎడారిలో మండుటెండలో పాదరక్షలు లేకుండా నడిచి దర్గాను దర్శించి ప్రార్ధించాడు. భావి మొఘల్ సామ్రాట్ ను పొంది సఫలమనస్కుడయ్యాడు.
అలాంటి యువరాజు అస్థానంలో ని నర్తకితో ప్రేమలో పడ్డాడు. నర్తకిగా ఆమె ను అక్బర్ పాదుషా కూడా ప్రసంసించాడు. కాని ఆమెnu  భావి సామ్రాజ్ఞి గా అంగీకరించలేకపోయాడు. ఇప్పుడు తన ఎదుట నర్తిస్తూ గానంచేస్తున్న ఆమె తనపట్ల చూపిన నిరశన, ధిక్కారంలో తన సమస్త శత్రువుల్నీ చూసాడు. తనని ముప్పుతిప్పలు పెడుతున్న రాణా ప్రతాప్ ను అనార్కలి ని పక్కపక్కన ఉంచితే తన ప్రధాన శత్రువుగా అనార్కలీ నే ఎంచుకునేవాడేమో.
ఈ పాటలో అనార్కలి స్వరం, శరీర భాష ధిక్కారానికి పరాకాష్ట గా అనిపిస్తుంది. అదే అనార్కలి ,అదే ప్రేక్షకులు (అక్బర్,జోధా బాయి,సలీమ్) సమక్షంలో అంతకుమునుపు ఒక ప్రదర్శన ఇచ్చింది. (మొహే పన్ ఘట్ మే నంద్ లాల్ ఛేడ్ గయోరే ) అందులో అనార్కలి (దానిమ్మ మొగ్గ) సిగ్గులమొగ్గ గా కనిపిస్తుంది.ప్రేమయుద్ధంలో మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్ తో తలపడ్డాక ఆమె స్వరం మారింది.ఆమె అగ్నికీల గా మారింది.
“మనిషన్నవారు లోకంలో ఒక్కసారే ప్రేమిస్తారు
ఆ బాధను తోడ్కొని జీవిస్తారు. ఆ బాధతోనే మరణిస్తారు
ప్రేమిస్తే భయపడేది దేనికి?
ప్రేమించానంతే! దొంగతనమేమీ చేయలేదు
చాటుగా నిట్టుర్చాల్సిందేముంది ?
నేడు చెబుతాను హృదయపుగాధ
లోకం కావాలంటే ప్రాణాలు తీసుకోనీ
లోకం చూసేదే మరణమనుకుంటే
వెక్కివెక్కి పడుతూ చనిపోయేదెందుకు
తనపై కోరిక మనసులో ఉంటుంది
దీపమ్ ఈ సభలో వెలుగుతూ ఉంటుంది
ప్రెమలోనే జీవించాలి,ప్రేమలోనే మరణించాలి
వేరిక చేసేదేముంది నాకు?
నా ప్రేమను దాచలేను
నలువైపులా అది కనపడుతూనే ఉంది
దేవుని ముందు ముసుగులేవీ ఉండనపుడు
మనుషులముందు ఈ ముసుగులెందుకు?”

1 comment: