Thursday, February 8, 2018

చౌద్వీ కా చాంద్ హో

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-150
చౌద్వీ కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో
(“పున్నమినాటి చంద్రునివా! లేక సూర్యునివా!)
చౌద్వీ కా చాంద్(1960) సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.
సమిష్టి విజయాన్ని పంచుకోవటంలో చాలాసార్లు స్పర్ధలు వస్తాయి. ‘ప్యాసా’ సినిమా వాల్ పోస్టర్లపై దర్శక నిర్మాతల పేర్ల పరిమాణంలోనే ఆ సినిమా కు సంగీత సాహియాలందించిన ఎస్ డి బర్మన్, సాహిర్ లూధియాన్వీ ల పేర్లు కనిపిస్తాయి. ఆ సినిమా విజయంలో పాటల పాత్ర ఎంతో ఉంది. ఆ విజయం లో ఎవరి పాలు ఎక్కువ అన్న సమస్య వారిద్దరిమధ్య దూరం పెంచింది. ఆ చిత్ర దర్శక నిర్మాత, నటుడు ‘గురుదత్ ‘ కు ఇద్దరూ కావలసిన వారే.
ఆ తరువాత ‘కాగజ్ కె ఫూల్ ‘ సినిమాతో గురుదత్ కు ఎస్ డి బర్మన్ తోనూ తగువైపోయింది. ఇది గురుదత్ తర్వాత సినిమాలో ‘చౌద్వీ కా చాంద్ ‘ లో కొత్త కలయికకు కారణమయ్యింది. గీత రచయిత ‘షకీల్ బదాయుని’ సంగీత దర్శకుడు ‘నౌషాద్ ‘ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు. అతను వేరేవారితో పనిచేసింది తక్కువ. ఈ సినిమాతో సంగీత దర్శకుడు ‘రవి’ తో కలసిపనిచేసాడు. తద్వారా అద్భుతమనదగిన పాట పుట్టింది. తర్వాత ఆ పాటననుసరించి లెక్కకు మిక్కిలి పాటలు వచ్చాయి.
పరిమిత సంఖ్యలోనే వచ్చిన గురుదత్ సినిమాలలో విలక్షణత ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కో తరహాలో ఉంటాయి. స్థల కాలాలు సినిమాలో కనపడుతుంటాయి. ప్యాసాలో కలకత్తా కనపడితే చౌద్వీ కా చాంద్ లో లక్నో కనపడుతుంది. ముస్లిం నేపధ్యంతో సాగిన ఈ సినిమాలో ఈ పాట పాTaగానే మధురం, దృశ్యీకరణ ద్వారా పాట విలువ మరింత పెరిగింది.
ఈ పాట తెలుగు రూపం ‘పి బి శ్రీనివాస్ ‘ పాడినది ఉందికాని తెలుగు శ్రోతలకు దానికన్నా హిందీ పాటే దగ్గర. ‘అబ్దుల్లా’ సినిమాలో ‘మైనే పూచా చాంద్ సే ‘ పాటకు స్పూర్తి 'చౌద్వీ క చాంద్’ కావచ్చని నా కనిపిస్తుంది.

“పున్నమిచంద్రునివా! లేక సూర్యునివా!
ఏమైనాకాని దేవునిపై ఆన… నువ్వు సాటి లేనిదానవు.
భుజాలపై వాలిన మేఘాలవంటి కుంతలాలు
నిండిఉన్న మధుపాత్రల వంటి నయనాలు
ప్రేమ మైకం కలిగించే మధువువు నువ్వు
సరస్సులో హసించే కమలం వంటి వదనం
జీవన వీణ పలికించే గేయానివి
వసంతానికి ప్రాణమయ్యేదానా! నువ్వు కవి కనే స్వప్నానివి
విద్యుత్తు వంటి చిరునవ్వు పెదవులపై ఆటలాడుతుంది
తారామండలం నువ్వొచ్చే దారిలో సాగిలబడుతుంది
సౌందర్య భరిత ప్రేమలోకానికి యవ్వనానివి నువ్వే”


సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-149
‘సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్’
(జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు)
పర్ దేశ్ (1997) సినిమాలో పాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం. ఆనంద్ బక్షి రచన. హరిహరన్,శంకర్ మహదేవన్,కవితా కృష్ణమూర్తి ,ఆదిత్య నారాయణ్ గానం.
రోదసి లో ఉన్న రాకేశ్ శర్మ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అడిగింది `అక్కడినుండి భారతదేశమెలా కనపడుతుంద`ని. `సారే జహాసే అచ్చా` అని ఆయన వెంటనే సమాధానమిచ్చాడు.దూరంనుండి అలానే ఉంటుందేమో.
ఎ బి సి డి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ )అని 90లలో ఇండియా టుడే లో ఒక ఆర్టికల్ వచ్చింది. భిన్న సంస్కృతులను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం సంఖ్యాపరంగా గణనీయమైన సమూహానికి అప్పటికి వచ్చినట్టుంది. ప్రత్యేకంగా యువతకు. హిందీ సినిమాలకు చక్కని సబ్జెక్ట్ దొరికింది. చాలానే సినిమాలు ఈ సబ్జెక్ట్ పై వచ్చాయి.
అలాంటి సబ్జెక్ట్ పై వచ్చిన `దిల్ వాలె దుల్హనియా లేజాయెంగే ` వచ్చిచరిత్రాత్మక విజయం సాధించింది. తర్వాత `పర్ దేశ్ `వచ్చింది. రెండు సినిమాలలోనూ మాతృభూమిపై మమతను చాటే పాటలున్నాయి.
అమ్రిశ్ పురి గొంతు ఇనుపగొలుసులు రాపిడితో వచ్చే శబ్దాన్ని పోలిఉంటుందంటారు. తెలుగు సినిమాలలో అతని సంభాషణల్ని మిమిక్రీ కళాకారులు అనుకరిస్తారు. అతను ‘పర్ దేశ్’ సినిమాలోని ఈ పాటలలో గొంతుకలిపాడు.
‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమాలో ఒకపాటలో రచయిత ‘ఇందీవర్’ భారత దేశాన్ని మూడు రంగుల చీరలో ఉన్న వధువు తో పోల్చాడు. ఈ పాటలో భారత దేశాన్ని వధువు నుదిటి పైని బొట్టు తో పోల్చాడు రచయిత ఆనంద్ బక్షి.


“లండన్ చూసాను
పారిస్ చూసాను
ఇంకా జపాన్ చూసాను
మైఖేల్ జాక్ సన్ ను చూసాను,ఎల్విస్ ప్రిస్లీ ని చూసాను
సర్వం చూసాను నా ప్రాణమా!
జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు
ఈ లోకం ఒక వధువైతే
ఆ వధువు నుదుటి బొట్టు
నా ఈ భారతదేశం
ఐ లవ్ మై ఇండియా
ఒకరు మేఘ్ మల్హార్ ఆలపిస్తే
వర్షం తరలివచ్చింది
దీపక్ రాగం వినిపిస్తే
నీటితో దీపం వెలిగింది
సప్త స్వరాల సంగమం ఈ జీవన గీతమాల
మేము మా భగవానునీ వంశీధరుడని అంటాం
వంశీధరా! వంశీధరా!
ఇది నా భారతదేశం”
కోయిల కుహు కుహు పాడుతుంది
హసనాన్ని రోదనను జీవన గీతాలుగా మార్చుకున్నాము
లోకులంతా వారి వారి గీతాలు గానం చేసుకుంటారు
వారు పాడే పాటనుండి ఈ మట్టివాసన గుబాఌస్తుంది
నా మాతృభూమి ఇండియా,నా ప్రేయసి ఇండియా
నా విధి ఇండియా,నా ధర్మం ఇండియా

`యే జిందగీ గలె లగాలే`

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-148
`యే జిందగీ గలె లగాలే`
(జీవితమా! నన్ను కౌగిలించుకో)
`తదియ నాటి చంద్రుడు` అని అర్ధమొచ్చే తమిళ సినిమా తెలుగులో `వసంతకోకిల` గా డబ్ అయ్యింది.సినిమా చూసినా రెండు భాషల సినిమా పేర్లు సినిమాకు అన్వయం చేసుకోలేకపోయాను. అదే సినిమా హిందీ లో `సద్మా` గా వచ్చింది. ఆ పేరు సినిమా కథకు సరైనదే అనిపించింది.
ఒక సెలబ్రిటి , అతన ఉనికిని దాచి మారుమూల ప్రాంతంలో కథానాయకునితో కాలంగడపటం,తర్వాత అతనికి దూరమై చివరికి దగ్గరవ్వటం ..ఇలాంటి కథనంతో అనేక సినిమాలు వివిధభాషల్లోవచ్చాయి. ఆకథకు `మరపు` ను కలిపి దుఃఖాంతం చేసిన కథ తో ఈ సినిమా వచ్చింది.
నటీనటులకు మంచి అవకాశమిచ్చిన సినిమా.దానిని కథానాయికా నాయకులు సద్వినియోగం చేసుకున్నారు.
వస్తుతః ఛాయాగ్రాహకుడైన దర్శకుడు బాలూ మహేంద్ర సినిమాను దృశ్యకావ్యం చేశాడు. దానికి ఇళయరాజా సంగీతం ,గుల్జార్ రచన మరింత జీవం పోసాయి.
సురేష్ వాడ్కర్ పాడిన పాటల్లో అమితంగానన్ను ఆకుట్టుకున్నవాటిలో ఇది ఒకటి.పాట మధ్యలో వచ్చే వయొలీన్ల వాదనం మనోహరం.
``జీవితమా! నన్ను కౌగిలించుకో
నేనూ నీవిచ్చే ప్రతిబాధనూ
కౌగిలించుకున్నాను. ఔనా,ఔనా!
నేను ఒక సాకుతో ,లోకానికి చాటుగా
కనురెప్పల తెరలకింద కనుల ఇంటిని నింపుకున్నాను
జీవితమా! నాకు నీ ఆసరా దొరికింది.
చిన్న మేఘం(నీడ?) కంటిలో ప్రవేశించింది
నేను రెండు చుక్కలతో మనసును నింపుకున్నాను
జీవితమా!నాకు తీరం దొరికింది``
https://www.youtube.com/watch?v=0BXqAnZWqdQ

కచ్చా కచ్చా చోటా చోటా నింబుడా లాయిదో

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-147
‘’కచ్చా కచ్చా చోటా చోటా నింబుడా లాయిదో”
(పచ్చిపచ్చిగా, చిన్నచిన్నగా ఉన్న నిమ్మ తెచ్చిపెట్టు)
‘హమ్ దిల్ దే చుకే సనమ్’(1998) సినిమాలో పాట.
రాజస్థాన్ యాత్రల్లో జానపదకళాకారుల నృత్యంలోనూ , తోలుబొమ్మల ఆటలోనూ ‘పల్లో లట్ కే రె మారో పల్లో లట్ కె’ అంటూ సాగే జానపద గీతం బాగా వినపడుతుంది. నాకు అదే పల్లవితో కిశోర్ కుమార్ ,ఆశాభోన్స్లే పాడిన సినిమా పాట తెలుసు.(ఎనభైలలో ఇది బాగా వినపడేది).
‘లోక్ సంగీత్ ‘ రేడియో కార్యక్రమంలో విన్న మరోరాజస్థానీ జానపదగీతం ‘నింబూడా,నింబూడా’. ఆకర్షణీయమైనరంగురంగుల టర్బన్లతో, సాంప్రదాయ సంగీతవాయిద్యాలతో, బృందగానంచేసే రాజస్థానీ కళాకారులూ ఈ గీతాన్ని ఆలపిస్తూ టీ.వీ ల్లో కనిపిస్తారు.
ఆ గీతం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో వచ్చింది. కవితా కృష్ణమూర్తి,కర్శన్ సర్గతియా గానంచేసారు.సంగీతం ఇస్మాయిల్ దర్బార్ ,రచన ‘మహబూబ్’. జానపదగీతాలు సినిమాపాటలుగా వచ్చినపుడు పాట క్రెడిట్ సినిమా రచయితలు తీసేసుకుంటారు.బహుశా చేసిన మార్పుల నిమిత్తమనుకుంటా.
‘పల్లో లట్ కే ‘పాట సినిమాలో చూడటానికి చాలా సాధారణంగా ఉంటుంది. ‘నింబూడా నింబూడా ‘ పాట చిత్రీకరణ భారీగానూ,సౌందర్యభరితంగా ఉంటుంది.
పచ్చినిమ్మకాయలను ‘దిష్టి ‘ తీయటానికి వాడటం ఇక్కడ తెలుసు. రాజస్థాన్ జానపదుల్లోనూ అదే నమ్మకంఉన్నట్టుంది. పాటలో అదే వినపడుతుంది. పైకి వినపడేది కాక వేరే అర్ధం ఏమైనాఉండవచ్చు.


“నిమ్మ,నిమ్మ,నిమ్మ
పచ్చిపచ్చిగా, చిన్నచిన్నగా ఉన్న నిమ్మ తెచ్చిపెట్టు
పో! పచ్చని పొలంనుండి నిమ్మకాయ తీసుకురా!
తీసుకురా! తీసుకురా!
ప్రేమికుల చెడు చూపునుండి
తప్పించుకోవాలంటే విను
పుల్లపుల్లని నిమ్మ ను పదునైన ఛురికతో తలపై కొయ్యి
అప్పుడు చిన్నచిన్నని నిమ్మ
ఏమి మాయ చేస్తుందో చూడు
ఆ చెడు చూపు
పుల్లనై పోతుంది
ఆపై నాలుగు దారుల్లో
జారిపడుతుంది
చిన్నదే కాని రసభరితం
మంచి కుదుపునిస్తుంది
దీని వాసన మనసులో కోరిక పెంచుతుంది
నాలికపై వేసుకుంటే అంతే
కాని ప్రేమలో ప్రేమికుడు ప్రేయసి
ఒకరి తో ఒకరు కళ్ళకలుపుతారు
అప్పుడు వారిమధ్య చాలాసార్లు
తీయని యుద్ధం జరుగుతుంది
నిమ్మకాయ చెబుతుంది అదే ప్రేమ అని.
నా స్నేహితురాళ్ళూ పోయి తీసుకురండి
చిన్న నిమ్మకాయ”


బహారో ఫూల్ బరసావో !

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-146
``బహారో ఫూల్ బరసావో ! మేరా మెహబూబ్ ఆయా హై``
(వసంతమా! పూలను వర్షించు,నా ప్రియతమ వచ్చింది)
సూరజ్(1966) సినిమాలో మహమ్మద్ రఫీ పాడినపాట.శంకర్ జైకిషన్ సంగీతం ,రాజిందర్ కిషన్ సాహిత్యం.
హీరో రాజేంద్రకుమార్ ను `జూబిలీ హీరో` అంటారు. అతని సినిమాలు ఎక్కువ జూబిలీలు చేసుకున్నయనో లేదా ఇరవై ఐదు హిట్ సినిమాల్లో నటించినందుకో తెలియదు.
నటుడు దిలీప్ కుమార్ ను చాలా మంది నటులు అనుకరించారు.రాజేంద్రకుమార్ కూడా నాకు దిలీప్ కుమార్ ను గుర్తుకుతెస్తాడు. పూర్తి దిలీప్ కాదు. ఆయనలో ఒక పార్శ్వం.( మరో పార్శ్వాన్ని అమితాబ్ బచన్ లో నేను చూశాను)
దిలీప్ కుమార్ తరహా నటనతో రాజేంద్రkumar ఆయనకన్నా ఎక్కువసినిమాల్లో నటించాడు,విజయవంతమయ్యాడు.అతని సినిమాలు విజయంలో సంగీతానిదీ పెద్ద పాత్రే.
ఎన్నో సూపర్ హిట్ పాటలు అతని సినిమాలలో ఉన్నాయి. అందులో రఫీ పాడినవిఎక్కువ.
సూరజ్ సినిమా లో పాటలన్నీ హిట్ ఐనవే. నేను చూసేనప్పుడు(1980లు) సినిమా పెద్ద ఉత్సుకత కలిగించలేదు. అలాంటివి తెలుగులో అప్పటికే చాలావచ్చిఉన్నాయి.(సూరజ్ కూడా సౌత్ నిర్మాతలు,దర్శకుడు ద్వారా వచ్చిందే). సినిమాలో గుర్తుండేట్టు చేసింది పాటలే. వాటిల్లో అమిత ప్రజాదరణ పొందిన ఒకపాట ఇది.
`దీక్ష` తెలుగు సినిమాలో `మెరిసే మేఘమాలికా` పాట దీనిని కొంత పోలి ఉంటుంది.


``వసంతమా! పూలను వర్షించు
నా ప్రియతమ వచ్చింది
పవనమా! రాగమాలపించు
నా ప్రియతమ వచ్చింది
పూల ఎర్రదనమా! మైదాకులా
ఆమె తెల్లని చేతులను చేరు
Naల్లని మేఘమా! దిగివచ్చి
ఈ అందమైన కళ్ళకు కాటుకలా మారు
తారకలారా! ఆమె పాపిడి నింపండి
నా ప్రియతమ వచ్చింది
ప్రకృతీ! ప్రతిచోటా
కాంతి కంబళ్ళు పరుచు
ప్రేయసి బహు సిగ్గరి
సిగ్గుపడి వెఌపోతుంది
కొద్దిగా నువ్వు మనసు ను ఉత్సాహపరచు
నా ప్రియతమ వచ్చింది
లేత మొగ్గలుఈ ప్రేమశయ్యను
అలంకరించాయి
వాటికి తెలుసు
ప్రేమ ఋతువు ఒకనాటికి వస్తుందని
వీచేగాలీ! రంగులు వెదజల్లు
నా ప్రియతమ వచ్చింది``


పియా బసంతీ రే , కాహే సతాయే ఆజా

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-145
పియా బసంతీ రే , కాహే సతాయే ఆజా
ప్రియా! వసంత మిది ..ఎందుకు బాధిస్తున్నావు? రా!
’పియా బసంతీ రే’’ (2000) వీడియో ఆల్బమ్ లో పాట.
ఉస్తాద్ ‘సుల్తాన్ ఖాన్’ రాజస్థానీ సంగీతకుటుంబం నుండి వచ్చాడు. ‘సారంగి’ వాద్యకారుడు.శాస్త్రీయసంగీతం తెలిసినవాడు. ప్రముఖ సంగీతకారులెందరితోనో వేదిక పంచుకున్నాడు. ప్రత్యేక ఆహ్వానం మీద గాయకుడిగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ లో ఒక పాట పాడాడు.
చదువుకు సంబంధించిన పరీక్షా? తనకిష్టమైన సినిమా పాట రికార్డింగా? వీటిమధ్య ఎంపిక సమస్య వచ్చినపుడు రికార్డింగు నే ఎంచుకుంది గాయని ‘చిత్ర’. దక్షిణాది భాషలన్నింటిలో పాటలుపాడి ప్రముఖగాయని అయ్యింది.
సుల్తాన్ ఖాన్, చిత్ర కలిసి ‘పియా బసంతి’ అల్బమ్ లో పాటలు పాడారు. అందులో టైటిల్ సాంగ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గాయకులిద్దరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
పాట చిత్రీకరణ అందమైన నటులున్నారు. అందమైన లొకేషన్లు ఉన్నాయి. చక్కని ఫొటోగ్రఫీ ఉంది.


“ప్రియా! వసంత మిది ..ఎందుకు బాధిస్తున్నావు? రా!
ఏమి మాయ చేసావో తెలియదు
మనసు ప్రేమ ధ్వని ని వినిపిస్తుంది
ఎందుకు బాధిస్తున్నావు? రా!
మేఘం ఒళ్ళు విరుసుకున్నపుడు
ధరణి పైట చెంగు రెపరెపలాడుతుంది
ఈ ఆకులు ఈ పొదలు
ఏదో అలికిడి చేస్తున్నాయి
మనసు ఊగులాడుతుంది, ఏమంటుందో తెలియదు
మనసు ఒప్పుకోదు
నేను నీ సొంతం ప్రియా!
భావి స్వప్నాలు కనురెప్పలపై కూర్చుని ఉన్నాయి
మనసు లోతుల్ని పైకి తెస్తున్నావు
మనసులో ప్రేమను మేలుకొలుపుతున్నవాడా!
సప్తవర్ణ స్వప్నాలు అంటున్నాయి ...ఎందుకు బాధిస్తున్నావు? రా!”


కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-144
‘కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి’
(గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది)
...
కొన్ని పాటల్లోని సంగీతం మనసు ను తేలికపరుస్తుంది, అర్ధం మనసును బరువెక్కిస్తుంది. అలాంటి పాటల్లో ఇది ఒకటి.
మాటల రచయిత ‘సాగర్ సర్హది’ బాల్యంలో దేశ విభజనతో పాకిస్తాన్ నుండి కాందిశికుడిలా ఢిల్లీ కివచ్చాడు. అక్కడినుండి బొంబాయికి. రచయితగా యశ్ చోప్రా తో కలిసి విజయవంతమైన సినిమాలకు పనిచేసాడు. అందులో కభీ కభీ, సిల్ సిలా ,చాందిని వంటివి ఉన్నాయి. అమితాబ్ బచన్ తో ‘మీరు బరువైన గుండె తో రాస్తారు’ అనిపించుకున్నాడు.
‘బజార్’ సినిమాతో దర్శకుడయ్యాడు. ‘బజార్’ సినిమా కన్యాశుల్కం వంటి కథకు మరో రూపంలో హైదరాబాద్ నేపధ్యంగా నడుస్తుంది. (హిందీ సినిమాల్లో అప్పట్లో నాకు హైదరాబాద్ కొత్తగా కనిపించేది. అంతకు ముందటి ‘మెహబూబ్ కి మెహంది’, తర్వాతి ‘నిఖా’ సినిమాల్లో).
సినిమాలో సంగీతం, పాటలు మరపురానివి. పాటలు సినిమాకోసం రాసినవి కాకుండా సాహిత్యం నుండి అవసరం మేరకు ఎంచుకున్నవి. మీర్ తకి మీర్ (దిఖాయి దియె) , మఖ్దూమ్ మొహియుద్దిన్( ఫిర్ చిడీ రాత్ బాత్ ఫూలోన్ కి) కవితలు/గజల్లు అలాంటివే.
‘కరోగి యాద్’ పాట బషర్ నవాజ్ రచన. ఖయ్యాం సంగీతం, భుపెందర్ స్వరం ..వీటి విలువను మరింతపెంచిన నటినటుల నటన, చిత్రీకరణ ...వీటన్నింటితో పాట ఓ గొప్పానుభూతినిస్తుంది.


“గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది
కదిలిపోయే కాలపు, ప్రతి కెరటం ఆగిపోతుంది
ఈ చంద్రుడు కరగిపోయిన కాలానికి అద్దం ఔతాడు
కదలాడుతున్న మబ్బుల్లో ఏదో ముఖం రూపుకట్టింది
బరువెక్కిన దారులు ఏదో కథ వినిపిస్తుంది
వర్షంతో చెమ్మగిల్లిన ఋతువు పొగ గా మారుతుంది
కరగిపోతున్న కొవ్వొత్తి నిచూసి మనసు గర్విస్తుంది
అరచేతిలోని గోరింట ఏవో జ్ఞాపకాలు రేపుతుంది
వీధి మలుపులో ఒక గుమ్మం శూన్యంగా ఉంది
తపించే కళ్ళతో ఎవరిరాకకో ఎదురుచూస్తుంది
చూపులు దూరంవరకూ వెళ్ళి తిరిగి వస్తున్నాయి “




ఇష్క్ బినా క్యా జీనా

నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-143
ఇష్క్ బినా క్యా మర్నా యారా! ఇష్క్ బినా క్యా జీనా
(ప్రేమ లేనిది ఏమి జీవితం? ప్రేమలేనిది ఏమి మరణం మిత్రమా!)
తాల్ (1999) సినిమాలో ఏ ఆర్ రెహ్మాన్, సోను నిగమ్,అనూరాధ శ్రీరామ్,సుజాత పాడిన పాట.
హీరో ఔదామని చిత్రరంగానికి వచ్చిన ‘సుభాష్ ఘయ్ ‘ దర్శక నిర్మాతగా పెద్ద సినిమాసినిమాలు తీసి పేరుగాంచాడు. అందులో ఎక్కువ భాగం మల్టి స్టారర్లుఅందులోనూ అరుదైన కాంబినేషన్లతో తీసాడు. దిలీప్ కుమార్ తో మూడు సినిమాలు తీసాడు. అందునా ఒకటి దిలీప్ తో పాటు రాజ్ కుమార్ ను కూడా కలిపి. వీటన్నింటిలో యాక్షన్ భాగమూ ఎక్కువే.
ఐతే ‘తాల్ ‘ సినిమాలో యాక్షన్ ను పూర్తిగా పక్కనపెట్టాడు. తనతో చాలా సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేసిన లక్ష్మికాంత్ ప్యారేలాల్ స్థానంలో ఏ ఆర్ రెహ్మాన్ ను తెచ్చాడు.
సినిమాలో కథకు నేపధ్యం సంగీతమే.
హిమ పర్వత పాదప్రాంతం నుండి జానపద సంగీతం ముంబై ప్రవహించింది. ఆ ప్రాకృతిక సంగీతం ఎలా మారింది? ఆ సంగీతానికి వాహకమైన సంగీతకుటుంబం లో యువతి జీవితం ఎలా మలుపులు తిరిగింది సినిమా చూపుతుంది.
సినిమాలో ఫొటోగ్రఫీ, సంగీతం ,లొకేషన్లు, రంగులమేళవింపు ,నృత్యాలు ఆనీ సౌందర్యభరితమే.
“ప్రేమ లేనిది ఏమి జీవితం? ప్రేమలేనిది ఏమి మరణం మిత్రమా!
బెల్లం కన్నా తీయనిది ప్రేమ
చింతపండు కంటే పుల్లనిది ప్రేమ
ఈ ప్రేమ ప్రమాణం నిక్కమైనది
ఈ ప్రేమ బంధాలు సున్నితమైనవి
కింద ప్రేమ ఉంది ..పైన భగవంతుడున్నాడు
ఈ రెంటి నడుమ సమస్తమున్నది
ఒకటికాదు వంద మాటలు చెప్పు
వందమాటల అర్ధం ఒక్కటే
భగవంతుడు అతి సుందరం ..భగవంతునుకన్నా సుందరం ప్రేమ
మణి కాదు మాణిక్యం కాదు ప్రేమ
ఒకటే కోరిక ..ప్రేమ
ప్రేమ ఏమిటో ఎవరికి తెలుసు
ఐనా ప్రేమ ఏమిటొ అందరికీ తెలుసు
ఈ ప్రేమ నగరపు తెలియని దారుల్లో
ప్రియురాలి ఇంటి జాడ ఎవరికి తెలుసు?
చిన్నపాటి జీవితం పెద్దదైన యానం
ఈ ప్రేమఏమిటో ఎవరికి తెలుసు
ఇది బాధా లేక బాధకు మందా?
ఈమె ప్రియురాలా లేక దైవరూపమా?
……
నువ్వు ప్రేమ పేరు విన్నావు
నేను ప్రేమించాను
ప్రేమ ఒక పూలతోట
ప్రేమ ముళ్ళతోకూడిన వస్త్రం”

కహీ ఎక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-142
‘కహీ ఎక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి’
(ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.)
‘శంకర్ హుస్సేన్’(1977) సినిమాలో పాట. కమల్ అమ్రోహి రచన,ఖయ్యాం సంగీతం,మహమ్మద్ రఫీ గానం
‘శంకర్ హుస్సేన్’ సినిమా తెలుగునాట ప్రదర్శితమయ్యిందోలేదో తెలియనంత అనామకంగా సినిమా వచ్చివెఌంది. కాని అందులోని రెండుపాటలు సినిమా పేరును మరులేనట్టు చేసాయి. అందులో ఒకటి ‘బహుత్ ఖూబ్ సూరత్ ...కహీ ఏక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి’. (మరొకటి ‘ఆప్ యూ ఫాసిలోం సె గుజర్ తే రహే’ లతామంగేష్కర్ గానం)
చాలా తక్కువ సంగీత ఉపకరణాలు, హెచ్చు తగ్గులు లేకుండా ఒకే స్థాయిలో సాగే గానం, విభిన్నతతో కూడిన గీతరచనలతో సాగే పాట మనసుకు హాయిగొలుపుతుంది.
‘పాకిజా’ ‘రజియా సుల్తాన్’ వంటి పెద్దసినిమాలమధ్య దర్శక, నిర్మాత, రచయిత ఐన ‘కమల అమ్రోహి’ తీసిన చిన్నసినిమా ‘శంకర్ హుస్సేన్’.ఆయన పరిమితమైన సంఖ్యలో రాసినపాటల్లో ఇది ఒకటి.
చిన్నసినిమాలో పెద్దపాట. కాలవ్యవధిలోనూ, నాణ్యతలోనూ పెద్దదే.



“ఎంతో అందం
ఎంతో అందం...కొద్దిగా ఛాయతక్కువకానీ..
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
తన కలలో నన్ను చేతుల్లోకి తీసుకుని
ఎప్పుడో నిద్రలో నవ్వుతూ ఉందేమో
నిదురలో అటూ ఇటూ దొర్లుతూ ఉందేమో
తల కింది దిండును జార్చుకుని ఉందేమో
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
పగటికలలు మనసు వాకిలిలోకి వచ్చి
ఆమెను లోలోపల సమ్మోహనపరుస్తుండవచ్చు
నిశ్చలంగా ఉన్న ఆమె గుండెలోని నిశ్శబ్దాన్ని
నాజ్ఞాపకాలసడి భంగపరచి ఉండవచ్చు
అసంకల్పితంగా నెమ్మదైన స్వరంతో
నాపాటలో తనూ గొంతుకలుపుతూ ఉండవచ్చు.
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
లేఖ రాయాలని తనకు అనిపించిందేమో
కాని వేళ్ళు కంపిస్తున్నాయేమో
చేతినుండి కలం జారిపోతుండవచ్చు
కోరిక తిరిగి చేతితో కలాన్ని పట్టించి వుండవచ్చు
నాపేరు తన పుస్తకంలో రాసి
పళ్ళమధ్య వేలు పెట్టి వుండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి
ఎప్పుడో నిట్టూర్చి ఉండవచ్చు
తనువు కొంచెం కొంచెం జ్వలిస్తూవుండవచ్చు
తన అడుగులు తడబడుతుండవచ్చును
ఆమె దుపట్టా వేలాడుతూ నేలకు ఆనివుండవచ్చును
ఎప్పుడో ఉదయాన్ని సాయంత్రమనుకునివుండవచ్చు
ఎప్పుడో రాత్రిని పగలు గా అనుకుని వుండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి
చేతులనుండి అన్నీ జారిపోతూవుండవచ్చు
పనులన్నీ అన్యమనస్కంగా చేస్తుండవచ్చు
పళ్ళేలు జారి పగిలిపోతూండవచ్చు
అప్పుడు పొయ్యిమీది పాలు పొంగిపోతుండవచ్చు
చివరగా, తన పసితనపు అమాయకత్వంతో
ఆ నాజూకు తనువు సిగ్గుపడుతూ ఉండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.”


ఢోల్ బజ్ నే లగా ! గావ్ సజనే లగా

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-141
ఢోల్ బజ్ నే లగా ! గావ్ సజనే లగా
(డోలు మోగసాగింది,ఊరు అలంకరించుకుంటుంది)
విరాసత్ (1997) సినిమాలో పాట. ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి గానం. జావెద్ అఖ్తర్ రచన, అను మలిక్ సంగీతం....
తమిళంలో మదురై పరిసర ప్రాంతాలు నేపధ్యమనుకోదగిన పేరులు ,వేషభాషలతతో వచ్చిన సినిమా తేవర్ మగన్.
తేవర్ మగన్ (తేవర్ పుత్రుడు) తెలుగులో క్షత్రియ పుత్రుడు అయ్యాడు. హిందీ లో ఠాకుర్ పుత్రుడు అయ్యాడు. హిందీ సినిమా పేరు విరాసత్ (వారసత్వం) గా మారింది.
దాయాదుల కక్షలు, వారితో పాటు విడిపోయిన గ్రామప్రజలు. అందులో ఒకటి మంచి పక్షం. ఆ పక్షపు నాయకుడి కొడుకు విదేశాలలో చదివి స్నేహితురాలితో ఊరికి తిరిగి వచ్చాడు. వచ్చినతను తమతో ఉండి తమబాగోగులు చూస్తాడని అతని పక్షం ఆశపడుతుంది. తండ్రి ఆశా అదే. పాట సందర్భం కొడుకు రాక.
శివాజీ గణేశన్ నటించిన అనేక పాత్రలు మిగతా భాషల్లో లబ్దప్రతిష్టులైన నటులనేకులు పోషించారు. మాతృక, రిమేక్ లు చూసిఉన్నపుడు శివాజీని మరపించటం కష్టమని చాలాసార్లు అనిపించింది. (మేజర్ చంద్రకాంత్ లో కట్టబ్రహ్మన పాత్రలో కనిపించిన ఎన్ టి ఆర్ , ఆ సందర్భం లో ‘కట్టబ్రహ్మన అంటే వారే గుర్తొస్తారు’ అన్నట్టు ఒకచోట చదివాను)
తేవర్ మగన్ సినిమాలో శివాజీ ధరించిన పాత్ర హిందీ లో అమ్రిశ్ పురి ధరించారు. నాకు ‘విరాసత్’ సినిమాను గుర్తు తెచ్చుకున్నపుడు భోజనం చేస్తూ కొడుకు ఊరిలో ఉండనని సిటీ లో ‘చైన్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ ..రెస్టారెంట్స్’ పెట్టుకుంటానన్నపుడు ,’చాయ్ కి దుకాన్ ?‘అన్న ‘అమ్రిశ్ పురి’నే గుర్తొస్తాడు.
దర్శకుడు ప్రియదర్శన్ హిందీ లో నిలబడటానికి దోహదం చేసిన సినిమా. చెట్టినాడు హవుస్ (తమళనాడు) లో సినిమాతీసి ఉత్తరభారతమని నమ్మించగల సత్తా ఉన్నదర్శకుడు. ఈ పాటలో మాత్రం ఠాకుర్ ఇంటిలో రవివర్మ చిత్రం ‘ లక్ష్మిదేవి’ పటాన్ని ఉంచేసాడు.

“డోలు మోగసాగింది
ఊరు అలంకరించుకుంటుంది
ఎవరో తిరిగి వచ్చారు
తనతో ఎన్నో రంగులు తెచ్చాడు
మన మిత్రుడు వచ్చాడు
మనం ఆడుతూ పాడుదాం!
మన హృదయాలు నాట్యం చేస్తున్నాయి
మనం ఆడుతూ పాడుదాం!
వచ్చినవారు మననొదిలి తిరిగి పోగూడదు
చేతులు జోడించి పాదాలు మొక్కుతాం
మనసు గాయపరచి పోనివ్వం
మా యువరాజు వచ్చాడు ,రాజేశ్వర్ వచ్చాడు
తనతో రంగులెన్నో తెచ్చాడు
మన మిత్రుడొచ్చాడు
ప్రేమతో నిండిన మనసొకటి ఉంది
నా చిన్ననాటి నేస్తం,నా గ్రామం
ఈ నూతినీరు బహు తియ్యన
ఈ చెట్టు నీడ బహు చల్లన
ఈ గాలిలో విచ్చిన సంగీతం లా
గాలిమరల శబ్దం విను
శ్రావ్యమైన పాట లాఉంది
స్వరబద్దమైన పక్షికూత
ఎన్నోయేళ్ళతరవాత తిరిగి వచ్చాను
తెలుసుకున్నాను... ఈ ఊరి రీతి రివాజులు శతాబ్దాలనాటివి”

లిఖే జో ఖత్ తుఝే

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-140
లిఖే జో ఖత్ తుఝే
(నీకు లేఖ రాస్తే )
...
కన్యాదాన్ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.నీరజ్ రచన,శంకర్ జై కిషన్ సంగీతం.
శశికపూర్ సినిమాల్లో పాటలు బాగుంటాయి. కారణం అవి శశి కపూర్ వి కావటమా? లేక అరవై డెబ్భైలలో అతని సినిమాలు రావటమా?
`చోర్ మచాయే షోర్` సినిమా లో మొదటిసారి శశికపూర్ ను చూసాను. ఆ తర్వాత ‘ఫకీరా’ సినిమా. ఇవి చూడటానికి కారణంఅవి తెలుగులో కృష్ణతో రావటం. రెంటిలోనూ తెలిసిన పాటలున్నాయి. అప్పటికి వివరాలు తెలియవు కానీ రెంటికీ రవీంద్ర జైన్ రచన, సంగీతం చేసారు. చోర్ మచాయే షోర్ లో రెండు పాటలు కిశోర్ కుమార్ వి,రెండు రఫీ వి.ఇప్పటికీ మనసుకోరే పాటలే. జాగ్రత్తగా `పావ్ మె డోరీ ` పాట వింటే అందులో `గోరి తెరా గావ్ బడా ప్యారా`(చిత్ చోర్) కు బీజాలు దొరుకుతాయి.
`ఫకీరా`లో ఖవాలీ, టైటిల్ సాంగ్, `దిల్ మె తుఝె బిఠాకె` పాటలు వినసొంపైనవే.
అంతకుముందుపాటలు..షర్మిలి లో `ఖిల్ తె హై గుల్ యహా`, ` ఓ మెరి శర్మిలి` పాటలు ,ప్యార్ కా మౌసమ్ లో `తుమ్ బిన్ జావూ కహా`, ని సుల్తనా రే రేడియోలో తరచూ వినపడేవి. జబ్ జబ్ ఫూల్ ఖిలే లో బాగుండని పాటఏది?

డెబ్బైఐదు తర్వాత శశికపూర్ నటించిన మల్టీ స్టారర్ లు .త్రిశూల్ నుండి సిల్ సిలా వరకూ మహమ్మద్ రఫీ,కిశోర్ కుమార్ లు పాడిన పాటలు మనోరంజితాలు.
శశి కపూర్ ను పాతసినిమాలలో చూస్తే సంస్కారవంతంగా పెరిగిన పెద్దింటి అబ్బాయిలా ఉంటాడు. రాజేశ్ ఖన్నా లా అమ్మాయిలకు హార్ట్ థ్రోబ్ కాడు. ధర్మేంద్ర లా కండగల వాడుకాదు. అమితాబ్ లా హై ఇంటెన్సిటీ నటన చూపగలవాడుకాదు. ఐనా వీరందరిమధ్యా సంవత్సరానికి ఐదారు సినిమాలు చొప్పున నటించగలిగాడు.
వారితో పాటు అనేక మల్టి స్టారర్లలో పాత్రోచితంగా నటించి తన ఉనికిని తెలియజెప్పాడు. అందులో అనేక సన్నివేశాలను బాలెన్స్ చేయగలిగాడు.
దీవార్ లో అన్నదమ్ముల బావోద్వేగాలతో కూడిన సంభాషణ నలభైయేళ్ళుగా ప్రతిధ్వనిస్తూనేఉంది.

కాలా పత్థర్ సినిమాలో వేరు వేరు కారణాలతో జ్వలిస్తూ సంఘర్షించే అమితాబ్, శతృఘన్ సిన్హా ల మధ్య సయోధ్యయత్నించే పాత్రను ప్రతిభావంతంగా పోషించాడుఱోటి కపడా ఔర్ మకాన్, కభీ కభీ, సిల్ సిలా సినిమాలలో అర్ధవంతమైన నటన చూపాడు.

నటుడు శశి కపూర్ కు వీరాభిమానులు తక్కువ.అలాగే అభిమానించనివారు ఇంకాతక్కువ. అతను సినిమాను తన భుజానవేసుకుని విజయపధానికి చేరవేసినవి అరుదు. అలాగని అతనున్న సినిమాకు అతనెప్పుడూ బరువుకాలేదు. అతను తన సినిమాలలో `ప్రదర్శనను కొల్లగొట్టిన` సందర్భాలు ఉండవు.కాని అతను ఆ సినిమాలో లేకుంటే అది లోటే ఔతుంది.



''నీకు లేఖ రాసినపుడు, నీ జ్ఞాపకాలతో
వేలాదిరంగులతో నిండిన దృశ్యమయ్యింది
పొద్దుపొడిచినపుడు పువ్వులామారింది
రాత్రివేళలో తారల్లా మారింది
ఎక్కడ ఏ పాట వినపడినా నువ్వొచ్చావని మనసు చెప్పింది
ఎప్పుడు ఏ మొగ్గ వికసించినా నువ్వు సిగ్గుపడుతున్నవని అనుకున్నాను
ఏ సుగంధం వ్యాపించినా నీ కురులు తేలియాడుతున్నాయనిపించింది
వాతావరణం రంగులమయం, సొగసు రంగులమయం, ఈ లజ్జ,ఈ సిగ్గు
ఈ వళ్ళు విరుపు, ఈ వంటరితనం, బాధించటం, వదలిపోవటం
ఈ యవ్వనమాయ పిచ్చివాడిని చేయనిదెవరిని?
నీవెక్కడో నేనక్కడే, నాహృదయ స్పందన నువ్వే
నేను యాత్రికుడ్ని నూవ్వు గమ్యానివి, నేను దాహాన్ని నువ్వు వానజల్లువు
నీ చూపులే నా ప్రపంచం, నీ పైటనీడే నా స్వర్గసీమ''

`శ్రీదేవి `సినిమా లో రాసాను ప్రేమలేఖలెన్నో పాటపై ఈ పాట ప్రభావం ఉందనిపిస్తుంది.

జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-139
‘ జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్..పావ్ కె నీచే జన్నత్ హోగి ‘
(“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో,వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది)
దిల్ సె సినిమాలో సుఖ్విందర్ సింగ్ ,సప్నా అవస్థి పాడిన పాట. ఏ ఆర్ రెహ్మన్ సంగీతం. గుల్జార్ రచన
రైలు ప్రయాణపు చప్పుళ్ళు, సైరన్ (సీటీ) మోత (రైలు కూత) పాట సంగీతంలో కలిసిపోవటం చాలాపాటల్లో వుంది. అందులో చాలా పాటలు పాపులర్ అయ్యాయి.
రైలు లోపలి పాటలు (రుఖ్ సే జరా నకాబ్, పల్ దో పల్ కా, యే గోటేదార్ ), కథానాయిక రైలులో ఉంటే హీరో రోడ్ ప్రయాణం పాటలు ( మేరే సపనో కి రానీ) ఆతర్వాత రైలు పైన ప్రయాణిస్తూ పాడే పాటలు వచ్చాయి.
రైలు పైన గుర్తొచ్చే పాటలు ‘హమ్ దోనో దో ప్రేమీ’ (అజ్ నబీ), హోగా తుమ్సే ప్యారా కౌన్ (జమానే కో దిఖానా హై), ‘జిస్కె సర్ హొ ఇష్క్ కి ఛావ్’ (దిల్ సె 1997).
‘హమ్ దోనో దో ప్రేమీ ‘ పాట ,పాట అనటంకంటే సంభాషణల్ని ఆర్ డీ బర్మన్ తన సంగీతంలో ఇమిడ్చేసి మాయచేసాడనవచ్చు. అర్ధం బహు సామాన్యం. వినటానికీ చూడటానికీ ఆనందకరం. ‘హోగా తుమ్సే ప్యారాకౌన్ ‘పాట స్టూడియో తీసారు.చూడటానికి ఇబ్బందికరం.
‘జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్ ‘ పాట అన్నిరకాలుగా ఆనందకరం.
అందమైన నీలగిరి కొండలు,మెలికలుతిరిగేరైలు మార్గం, తెరనిండా రంగులు,నటులు,ఆకర్షణియమైన నృత్యం, అంబరాన్నందుకునే సుఖ్వీందర్ స్వరం, చక్కని బీటు తోపాటు ‘ జిస్కి జుబా ఉర్దూ కి తరాహ్ ‘ ‘ తావీజ్ బనాకె పెహనూ ఉసే’ వంటి చిత్ర పద బంధాలతో సాగే రచన.


“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో
వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది
ఆ నీడన నడు ….
ప్రేమ నీడన నడు ...నడు
స్వర్గం పై కాలిడి నడు ..నడు
ఆ సహచరి సుగంధం లాంటిది
ఆమె నోటిమాట ‘ఉరుదూ’ లాంటిది
నా సాయంత్రాలు రాత్రులు,నా లోకం
నా సహచరి,ప్రియురాలు.
పూలలో దాగుతుంది, అత్తరులా
పరిమఌంచి ఎక్కడుందో తెలుపుతుంది
అద్భుతంలా ఎక్కడైన దొరికితే
తావీదు లా తనను ధరిస్తాను
నా సహచరి నా ప్రార్ధన లాంటివి
నా పాటా ఆమే..నా విశ్వాసప్రకటనా ఆమే
ఆ సహచరి పోలిక కదిలే మంచుబిందువు
ఆమె పాదాలకింద స్వర్గం కదలాడుతుంది
కొన్నిసార్లు కొమ్మలలో ...కొన్నిసార్లు ఆకులలో...
గాలిలో ఆమెజాడను వెతుకుతాను నేను
వెలుగునీడలమధ్య దోబూచులాడే
తన అన్ని రూపాలసారాన్నినేను
తను చిలిపిదనంతో రంగులు మారుస్తుంది
నేను రూపురంగుల అన్వేషిని”


సుహానీ రాత్ ఢల్ చుకీ

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-138
మనసు కొన్ని పాటల్ని ,అవి విన్నప్పటి పరిసరాలు, వాతావరణం, మనసికస్థితి...వీటితో కలిపి ముద్దచేసి దాచుకుంటుంది.
తిరిగి ఆ పాట విన్నప్పుడు ,ఆ ముద్ద వెన్నలా కరుగుతుంది.
1989 అక్టోబరు నెల. ట్రైనింగు లో భాగంగా ‘ఇల్లెందు ‘ కాలరీస్ లో గెస్ట్ హవుస్ లో మకాం. ఆ గెస్ట్ హవుస్ బ్రిటిషర్స్ కాలంలో కట్టబడింది. పొడవైన వరండాలు, అసాధారణమైన ఎత్తులోఉన్న రూఫు, మామూలు గదులనుమించి విశాలంగాఉన్న స్నానశాలలు,పాతకాలపుడిజైన్లతో టేకు ఫర్నిచరు.పాశ్చాత్యశైలిలోఉన్న వంటశాల,అ...ందులోనుండి కిటికీ ద్వారా వంటకాల రవాణా. నాణ్యమైన పింగాణీ సామాను. ..
ఒకనాడు ఉజ్వలంగావెలిగిన రాజసౌధాన్ని ఆ గెస్ట్ హౌవుస్ నాకు గురుతెచ్చేది.
దానితో కూడిన వాతావరణం తెలియకుండానే నాతో లేని గంభీరాన్ని ప్రదర్శింపజేసేట్టుండేది.
ఒకరోజు సెకండ్ షో సినిమాచూసి నడుచుకుంటూ వస్తున్నాను.చేతులు జేబులోపెట్టుకునేమాత్రపు చలి.ఇల్లందు పారిశ్రామికవాడ మనసులో ఏమిదాచుకుందో తెలియదు కాని భయంగొలిపేలాంటి ప్రశాంతత.అక్కడక్కడా మిణికుమిణుకుమనే వీధిదీపాలు. శిక్షణలో ఉన్న ఫారెస్ట్ ఉద్యోగులతో కోలాహలంగా ఉండే అటవీశాఖ హాస్టలు దగ్గర సడిలేదు. గెస్ట్ హవుస్ గేట్ దగ్గర వాచ్ మన్ స్వెటరుతో కూర్చుని ఉన్నాడు. ఆరిపోతున్న చలిమంట, గేట్ ని ఆనుకునే ఇద్దరు చేతులుకలిపితే అందేంత కాండమున్న చెట్టు. పైనుండి జలపాతంలా జారుతున్న వెన్నెల. వాచ్ మన్ పక్కనున్న ట్రాన్సిస్టర్ నుండి ఈ పాట. వెంట్రుకలు నిక్కబొడుచున్నాయి.వళ్ళంతా మైమరపు.

‘సుహానీ రాత్ ఢల్ చుకీ ,న జానె తు కబ్ ఆవొగీ’
“అందమైన రేయి గడచిపోతుంది, నీ రాక ఎపుడో తెలియదు
లోకపు ఋతువు మారిపోతుంది, నీ రాక ఎపుడో తెలియదు
చోటులన్నీ తమ ఆనందాలు వెదజల్లి నిదురించాయి
తారలన్నీ తమ వెలుగులు చూపి చూపి నిదురించాయి
ప్రతి దీపము వెలిగి మలిగింది ,నీ రాక ఎపుడో తెలియదు
నీకై ఎదురుచూపుతో నేనిక్కడ తపిస్తున్నాను
వసంత ఋతువులోనే శిశిరం వచ్చింది
గాలి కూడా దిశను మార్చుకుంది ,నీ రాక ఎపుడో తెలియదు”
మహమ్మద్ రఫీ పాడిన షకీల్ బదాయుని రచన. నౌషాద్ స్వర రచన. హిందీ సినిమా పాట ఈ పాటతోనే కొత్తపుంత తొక్కిందంటారు. అదే పుంత పై యాభైయేళ్ళు హిందీ పాట నడచింది


ఖుదా అప్నె వాలియోంసె హోత హై రాజీ

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-137
‘ఖుదా అప్నె వాలియోంసె హోత హై రాజీ’
(భగవంతుడు తనను అనుసరించేవారిని అనుగ్రహిస్తాడు)
ఫిజా (2000) సినిమాలొ బృందగీతం.బృందంలో ఎ. ఆర్. రెహ్మాన్ ఉన్నాడు. సంగీతం ఎ ఆర్ రెహమాన్. రచన షౌకత్ అలి ఖాన్....
కళా విమర్శకుడు కళాకారుడిగా మారినపుడు అతని కళాసృష్టి ఎలాఉందో అని ఎందరో ఎదురుచూస్తారు. ప్రత్యెకంగా అతని విమర్శకు అప్పటిదాకా లోనైనవారైతే మరింత ఉత్సుకతతో చూస్తారు.
ఖాలిద్ మొహమ్మద్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు. ఫిల్మ్ ఫేర్ మాగజైన్ లో పనిచేసారు.అనేక సినిమాలపై విమర్శ రాశాడు.అతను దర్శకత్వానికి పూనుకున్నాడు. ‘ఫిజా’ సినిమా తీసాడు.సినిమాకథ కు కాలం ,నేపధ్యం 1993 మతసంఘర్షణ తర్వాత ముంబై నగరం.
ఘర్షణల తర్వాత ఒక ముస్లిమ్ కుటుంబంలో యువకుడు కనపడకుండాపోయాడు. అతనికి తల్లీ చెల్లీ ఉన్నారు. స్నేహితురాలు ఉంది. అందరూ అతనికోసం ఎదురుచూస్తున్నారు. అతనొస్తాడని తల్లికి అపారనమ్మకం. అతనికోసం ప్రార్ధనలు చేస్తుంది. అందుకు హజి దర్గాకు వచ్చింది. ఆ సందర్భంలో పాట.
ముంబై నగరంలో భాగమ్గా అరేబియాసముద్రంలో హజి అలి దర్గా ఉంది.సయెద్ పీర్ హజి అలి షా బుఖారి పెరుపై ఉన్న దర్గా అది.


“భగవంతుడు తనను అనుసరించేవారిని అనుగ్రహిస్తాడు
ఈ ద్వారం తల ఎత్తుకు బ్రతికేట్టు చేస్తుంది
ఇక్కడ మనసు తో కోరుకో ..ఇది హాజి అలి స్థలం
ఆయన ఖుదా కు స్నేహితుడు
సముద్రాలకు రాజా! హైదర్ కుమారుడా!
సముద్రాలకు రారాజా! ఒక్క చూపు
ప్రియ హాజి అలీ
నువ్వు సముద్రమంత ధనికునివి
బాబా హాజి అలీ ,బాబా హాజి అలీ
నీ ద్వారం పవిత్రమైనది స్వచ్చమైనది ఎంతో గొప్పది
ఓ తేజోమయా
నిర్మలచిత్తుడా
అందరికీ ఇంత నీడనివ్వు
ఇక్కడ హిందు ముస్లిమ్ శిఖ్ఖు క్రిస్టియన్లు అందరూ సఫలులౌతారు
ఈ సముద్రం నీ ద్వారానికి పహారా కాస్తుంది
నీ ముఖమెపుడూ వెలుగుతో నిండి ఉంటుంది
ప్రియ హాజి అలీ, ప్రియ హాజి అలీ
మొహమ్మద్ ముస్తఫా పేరుపై దానం చేయండి
ఆయన పేరుపై దానం చేయండి
నీ ద్వారంనుండి నిరాశ తో ఎవరూ వెఌంది లేదు
బాబా! వెనక్కివెఌంది లేదు
ఎవరి మనసులో ఏమి దాచారో అంతా నీకు తెలుసు
నీ దాతృత్వం దాక్షిణ్యం ఆకాశంలోనూ పొగడబడుతుంది
బాబా! హజి అలీ
ఈ పేదవారి ప్రార్ధనలు విను దయచూపు
ప్రియ హాజి అలీ, ప్రియ హాజి అలీ
లోకానికి నీవు గర్వకారణం
దురదృష్టవంతులు నీ ద్వారంలో అదృష్టవంతులౌతారు
అదృష్టవంతులౌతారు
నా కోరిక తీరేవరకు
జీవితాంతం నా కన్నీరు నీ ద్వారంపై ప్రవహిస్తుంది
బాబా! హజి అలీ
నీవారైన వారికి నువ్వు ఇవ్వనిదేమిటి?
బాబా! హజి అలీ”

హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-136
`హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్`
(గాలుల పేరుమీద ...గాలుల పై వ్రాస్తాను)
దో దూని చార్ -1968 (రెండు రెళ్ళు నాలుగు) సినిమా లో కిశోర్ కుమార్ పాడిన పాట. గీత రచన గుల్జార్. స్వర రచన హేమంత్ కుమార్.
పురవాయీ /పురవయ్యా( తూరుపు గాలి) పదం హిందీ సినీ సాహిత్యంలో బాగా వినిపిస్తుంది. ...
తూరుపుగాలి ఒక దశలోహిందీపాటల్లో కూడా బాగా తోలింది. పంకజ్ మలిక్,ఎస్ డి బర్మన్, సలీల్ చౌధురి,హేమంత్ కుమార్ వంటి సంగీతదర్శకులు వంగ ప్రాంతపు సంగీతాన్ని, రవీంద్ర సంగీతాన్నిహిందీ పాటలద్వారా దేశం మొత్తానికి పంచి ఇచ్చారు. ప్రత్యేకంగా అరవైలవరకూ బెంగాలీ ముద్ర వారిపాటల్లో కనిపిస్తుంది.
ఆ కాలంలో వచ్చిన పాట ఇది.ప్రకృతిని వర్ణించేది. కిశోర్ కుమార్ తనకోసం తానే పాడుకున్నాడు. పంచె కట్టు, బెంగాలీ లాల్చీ తో అచ్చమైన బెంగాలీ బాబులా కనిపిస్తాడు. పాటలో కనిపించే బాలనటి తర్వాత హీరోయిన్ గా ఎదిగిన నీతూసింగ్. ‘దో దూనీ చార్ ‘ (2010)పేరుతోనే వచ్చిన సినిమాలో గృహిణి గా నటించింది .
ఈ ‘కిశోర’ ’హేమంత’ సమీరం వింటున్నపుడు అది శరీరాన్ని తాకుతున్నట్టే కాదు మనసునూ స్పృశిస్తున్నట్టనిపిస్తుంది. 

“గాలుల పేరుమీద గాలుల పై వ్రాస్తాను
ఈ అపరిచిత పరదేశి ప్రణామం.

ఓ పక్షీ ! నీ ఈ రాగయుక్తమైన ఈ ప్రణామం
ఎవరిపేరుమీద ఎవరికోసమో చెప్పు

తరుశాఖలపై వెలుగుకిరణం వచ్చి
చేయి సాచినపుడు
చీకటి నెమ్మదిగా కిందికి దిగి
నవ్వుతూ చెప్పింది
ఇక్కడ ఉదయ సాయంత్రాలు ఆటలాడుతూఉంటాయని

ఆకతాయి నీరు తన దారిన ప్రవహించటం మరచి
అద్దంలా మారి పూలపైకి ప్రతిఫలిస్తుంది
ఈ అమాయకపు పసి ముఖాలను.”


బేసన్ కి సోన్ధి రోటి పర్ ఖట్టి చట్ని జైసి మా

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-135
బేసన్ కి సోన్ధి రోటి పర్ ఖట్టి చట్ని జైసి మా
(చక్కని శనగ రొట్టె పై, పుల్లనైన పచ్చడిలా అమ్మ)
తొంభైల మధ్యలో మొదలైన ప్రవేటు టి వీ చానెళ్ళ అవసరాలకోసమనుకుంటా , ఎన్నో వీడియో ఆల్బమ్ లు వచ్చాయి. అందులో ఒకటి `అమన్`. పంకజ్ ఉధాస్ పాడిన గజళ్ళతో వచ్చిందది. ఆ ఆల్బమ్ లో ఒక పాట ఇది. దీనిని రాసినవారు నిదా ఫజ్లి. ...
పంకజ్ పాడటమే కాదు అందులో నటించాడుకూడా. ప్రత్యేకంగా క్లోజ్అప్ లలో పాటకు తగినట్టు కనిపించాడతను. తల్లి గా కనపడే ఆమె నటి `బీనా`. తల్లి పాత్రల్లో చాలా చిత్రాల్లో నటించింది.
పాటలో ఉన్న చాలా పదాలకు నేను అర్ధం చేసుకున్నది కరెక్టో కాదో తెలియదు. పాట వింటున్నా ,చూస్తున్నా అర్ధం అవసరం పడలేదు.
ఇల్లు అనే సామ్రాజ్యానికి కోట గోడలు పెద్ద బలమైనవి కావు. అలాంటి ఇంటికి ఎలుకనుండి దొంగ వరకూ ఎందరో శత్రువులు. అమ్మ ఇంటికి కాపలాదారు. అమ్మ ఎపుడూ మేలుకునే ఉంటుంది.పొయ్యిలా మండిపోతుంటుంది. గిలక లా తిరుగుతుంటుంది. ఆమె గాజుల శబ్దంలోనూ మనకి ధైర్యాన్నిచ్చే `మార్చింగ్` సాంగు వినగలం. తన సౌందర్యాన్ని ,వయసుని కళ్ళలో వెలుగునూ పిల్లలకూ కుటుంబానికి పంచేసింది.అందరిలోనూ కొద్ది కొద్దిగా కనపడుతుంది.
పాటలు కొన్ని మనని గతంలోకి తీసుకెళతాయి. అప్పటిని ,ఇప్పటి కళ్ళతోనో మనసుతోనో చూసేలా చేస్తాయి. దానితో కొన్ని ఆనందాలు కొన్ని పశ్చాత్తాపాలు కలుగుతాయి. కొన్ని సార్లు చేయాల్సిని పనులను గుర్తుచేసి కార్యోన్ముఖులను చేస్తాయి. అలాంటి పాట ఇది.

``చక్కని శనగ రొట్టె పై
పుల్లనైన పచ్చడిలా అమ్మ
గుర్తొస్తున్నాయి వెదురు మంచం
పొయ్యి ,పటకారు, బావి గిలక ….
నులక మంచం పైనుండే
ప్రతీ అలికిడి పైనా చెవివొగ్గుతుంది
సగం నిద్ర, సగం మెలకువతో
అలసిన మధ్యాహ్నం లా అమ్మ
ఆమె గాజుల శబ్దంలో
కొన్నిసార్లు అన్నపేరు,కొన్నిసార్లు నాపేరు వినవస్తాయి
కోడికూతతోనే తెరుచుకునే
ఇంటి వాకిలి ముగ్గులా లా అమ్మ
భార్య, కూతురు, సోదరి, పక్కఇంటి ఆమె
అందరిలో కొద్ది కొద్దిగా...
రోజంతా తాడుపై
నడుస్తున్నఆమెలా అమ్మ
తన వదనాన్ని ,నుదుటిని,కళ్ళను
పంచేసి తను ఎక్కడికెఌందో
చిరిగిపోతున్న పాత ఆల్బమ్ లో
చలాకీ పిల్లలాఉన్న అమ్మ``

కల్ కీ దౌలత్ ఆజ్ కీ ఖుషియా

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-134
“కల్ కీ దౌలత్ ఆజ్ కీ ఖుషియా”
(నిన్న సంపద, నేడు ఆనందం)
అస్లీ -నక్లీ (1962) సినిమాలో మహమ్మద్ రఫీ పాడినపాట. శైలేంద్ర రచన, శంకర్ జై కిషన్ సంగీతం.
...
కథానాయకుడు సంపదలో పుట్టి పెరిగాడు. ఆ సంపద అతను సృష్టించింది కాదు. నచ్చని ఆమె ను పెల్లి చేసుకోవటం ఇష్టం లేక సంపదకు దూరమయ్యాడు. వేరే జీవితాన్ని చూస్తున్నాడు. తనుచూసిన పాత ప్రపంచం , చూడబోయిన ..చూస్తున్న కొత్తప్రపంచం...వీటిలో ఏది అసలు ఏది నకిలీ అన్నది అతని ప్రశ్న.
పనిలో ఇష్టం ,నైపుణ్యం ఉండి ,శక్తి మేరకు మాత్రమే పని చేస్తూ , పనికి సరిపడా ప్రతిఫలం పొందుతున్న వారు పనిచేసేటపుడు చేస్తుంటే కళాసృష్టి ని చూస్తున్నట్టే ఉంటుంది.
ఈ పాట చిత్రీకరణ లో అనేక వృత్తులవారు శ్రమ చేస్తూ కనపడతారు.శ్రమ సౌందర్యం కనపడుతుంది. చిత్రీకరించే కెమేరా కథానాయకుని కళ్ళద్వారా చూస్తుంది. అతనికి కలిగిన ఆలోచనల్ని మనకి చూపుతుంది. అతనికి కొత్తప్రపంచంలో ఆనందం కనపడుతుంది.అక్కడ అందరూ ఆనందం తో ఉన్నారనీ నమ్ముతున్నాడు. అక్కడి మనుషుల్లో మంచి కనపడుతుంది. అది అసలా నకిలీనా అన్నదో ప్రశ్న.

నిన్నటి సంపద ... నేటి ఆనందం
వారి దర్బారులు ,...మన వీధులు
అసలు ఏది ? నకిలీ ఏది ? నా మనసు నడుగు
అబద్ధపు సంబంధాలు వదులుకుని మనసున్నవారిలోకి వచ్చాను
నిజం చెబుతాను సంపద కూడబెట్టేవాళ్ళలో దొంగలు అధికం
ఆ ప్రపంచంలో పలకరించేవాడేలేడు. ఈ ప్రపంచం ప్రేమ ఇచ్చింది
మనసనే రాజమందిరంలో కూర్చుండబెట్టి కలలప్రపంచాన్ని ఇచ్చింది
ఆకాశంలో బ్రతికేవారూ ..నేలను గుర్తుపట్టండి
నమ్మూ నమ్మకపో !పువ్వులు ఈ మట్టిలోనే పరిమఌస్తాయి

మై యహా తూ వహా ,జిందగి హై కహా

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-133
‘మై యహా తూ వహా ,జిందగి హై కహా’
(నేనిక్కడ, నీవు అక్కడ ,జీవితం ఉన్నదెక్కడ?
బాఘ్ బన్ (2002) సినిమాలో అమితాబ్ బచన్,అల్కా యాగ్నిక్ పాడిన పాట.
సమీర్ రచన ,ఆదేష్ srivatsava,ఉత్తమ్ సింగ్ .
...
బాఘ్ బన్ (తోటమాలి) తోట కు తానే యజమానిననుకుంటే ఏమౌతుంది.
వయసుమీరిన తల్లిదండ్రులకు పిల్లలవలన బాధ కలిగేది వాళ్ళు తమ బాగోగులు చూడకపోవటం వల్ల లేదా పట్టించుకోకపోవటం వల్లనేనా? తల్లితండ్రులకు తినటానికి ,ఉండటానికి ఏర్పాటుచేస్తే వారిని పట్టించుకున్నట్టేనా? వాళ్ళపట్ల బాధ్యతతో ప్రవర్తించితేచాలా? పెద్దవాళ్ళను బానే చూసుకుంటున్నాం అని చెప్పటంలోని `బానే` గురించి ఎవరి నిర్వచనాలు వారివి.
ప్రాధమిక అవసరాలకోసం ఏర్పాటు తర్వాత కూడా రెండు తరాలు దూరంతనాన్ని అనుభవించటానికి కారణాలు ఎన్నోవింటుంటాం.దూరం అయ్యాం అని పెద్దవాళ్ళు అనుకోవటానికి నాకు తెలిసీ తెలియనట్టుండి, అమూర్తంగాఉన్న ఆలోచనకు ఒకమాటలో తెలియజెప్పింది `బాఘ్ బన్` సినిమాలో ఒకమాట.
తండ్రి కొడుకుల్ని పెద్దవాళ్ళనుచేసాడు.పెఌళ్ళు చేసాడు. వాళ్ళ ఇళ్ళు తన స్వంత ఇళ్ళే అనుకున్నాడు. కాని అతని అనుభవాలు తాను వారికి దూరమౌతున్నాని చెబుతున్నాయి.
అలాంటి స్థితి లో కొడుకు తండ్రితో అన్నమాట సుమారు అర్ధం `` అతిధిలా వచ్చినవారు అతిధిలా ఉండండి``.
దూరమవ్వటమంటే స్వంతమనుషులనుకున్నవారికి అతిధి కావటం.
ఎందుకు స్వంతమనుకున్న మనుషులు ఒకరినొకరు దూరం చేసుకుంటారు? పెద్దప్రశ్న. వందలాది సమాధానాలు.
`బాఘ్ బన్` సినిమా మూలకథ ఎనభైయేళ్ళనాటిది. భారతీయభాషల్లోనే సుమారు ఐదు సార్లు సినిమాగా వచ్చింది. అందులో `బడి పంతులు` సినిమా ఒకటి. ఐతే `బాఘ్ బన్ `సినిమాలో వివరాలు మరింత లోతుగా డీల్ చేయబడ్డాయి.
"నేనిక్కడ నీవక్కడ , జీవితం ఉన్నదెక్కడ?
నేనెక్కడ చూసినా నువ్వే నువ్వే
నిదుర రాదు, జ్ఞాపకం పోదు
నీవేలేకుంటే ప్రాణముండదు
చూచిన చోటల్లా తెలియని ఉదాసీనత తో కాలం ఆగిపోయింది.
గుబులుతో తనువు ఒంటరిదయ్యింది,కాలం దప్పికతో ఉంది
నా కళ్ళనుండి నీ వదనం ఒక్క క్షణమూ దూరమెందుకు కాదు?
రాత్రులు పగళ్ళు గడుస్తాయి కాని ఒంటిదైనకాలం గడవదెందుకు?
చెప్పాలనిఉన్నా నీతో ఏమీ చెప్పలేకున్నాను
బాధనెలా చెప్పగలను
ఏ అలికిడైనా నువ్వు వచ్చావని అనిపిస్తుంది
సుగంధపవనంలా నా ఊపిరీపరిమఌస్తుంది
మనం సదా కలిసున్న కాలముండేది
ఇప్పుడు ఎన్నో దూరాలు
ఒంటరిగాఉన్నపుడు గతకాలపు మాటలు గుర్తుకొస్తాయి
నిశ్శబ్దం మాట్లాడుతుంది, చాటుగా రోదిస్తాను
నవ్వి సంవత్సరకాలమైంది
కన్నీళ్ళు కథలను నింపుకున్నాయి"
https://m.youtube.com/watch?v=1lPAE9yq41s

అభీ అల్విదా మత్ కహో దోస్ తో!

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-132
అభీ అల్విదా మత్ కహో దోస్ తో!
(ఇప్పుడే వీడుకోలు చెప్పకండి మిత్రులారా)
...
నికాహ్ (1982) సినిమా లో మహేంద్ర కపూర్ పాడిన పాట. రవి సంగీతం, హసన్ కమాల్ రచన.

ప్రయాణ సాధనాలు, ప్రసార, సమాచార సాధనాలు
ఇప్పట్లా లేని రోజుల్లో వీడుకోలు సందర్భాలు ఉద్వేగభరితంగా ఉండేవి. అప్పటిదాకా విలువ తెలియని,విలువ కట్టని బంధాల విలువ తెలుస్తుందప్పుడు. హైస్కూళ్ళలో ,కాలేజీలలో ఆఖరి పని(?) దినంలో విద్యార్ధులు ఎమోషనల్ ఐపోయేవారు. ఆటో గ్రాఫ్ పుస్తకాలో సంతకాలతోపాటు కవిత్వమూ దొర్లేది.
నికాహ్ సినిమాలో ఈ పాట అలాంటి వీడుకోలు (అల్విదా) సందర్భంలోనిదే.
అల్విదా అనగానే కిశోర్ కుమార్ ‘కభి అల్విద న కెహనా’ అంటాడు. ‘అభీ అల్విదా మత్ కహో దోస్ తో ‘ అంటూ మహేంద్ర కపూర్ వస్తాడు. సంధ్యా సమస్య లో ఎంపిక రెండవదే. కారణం సినిమా లో ఆ పాటకున్న ప్రాధాన్యత, సినిమాలో ఇమిడిన విధానం.
బి ఆర్ చోప్రా (దర్శక నిర్మాత) చిరకాల మిత్రులు రవి, మహేంద్ర కపూర్ లు కొద్ది విరామం తర్వాత ఈ సినిమాతో జత కట్టారు. లోటల్లా ఆ బృందంలో ‘సాహిర్ లూధియాన్వి’ లేకపోవటమే.( ఆయన 80 లొ కాలం చేసారు).
‘యాదోం కి చిరాగోం కొ జలాయె హుయె రఖనా, లంబా హై సఫర్ ఇస్ మె కహీ రాత్ తో హోగీ’ పాదం వింటుంటే సాహిర్ లోటును హసన్ కమాల్ కలం భర్తీ చేసిందనిపిస్తుంది.
పాటలో చరణాలమధ్య సంగీతం వింటుంటే పరిమళాన్ని మోసుకొచ్చే చల్లగాలి శరీరాన్ని స్పృశించినట్టు అనిపిస్తుంది.

“ఇప్పుడే వీడుకోలు చెప్పకండి మిత్రులారా
ఎవరికితెలుసు.. తిరిగి కలయిక ఉంటుందేమో
గడచిన క్షణాల తీయని బాధ వెంట వస్తూనే ఉంటుంది
కోరితే కలలలోనైనా కలయిక ఉంటుంది

ప్రేమలో మునిగిన వర్ణ మయ స్థలాలు
ఈ వదనాలు, ఈ దృక్కులు, ఈ యవ్వనభరితఋతువు, ఈ పవనాలు
ఎక్కడికి వెఌనా వీటి సుగంధం వెంట వస్తూనే ఉంటుంది

పూలలా మనసులో నిలిపే ఉంచండి
జ్ఞాపకాల దీపాలను వెలిగించే ఉంచండి
బహుదూరపు ప్రయాణం ..దీనిలో ఎప్పుడైనా రాత్రి కావచ్చు

మీతో కలిసి నడిచే ఈ క్షణాల సంపద
అనుభూతుల సంపద,భావనల సంపద
ఏది వెంటనున్నా లేకున్నా ఉండే అరుదైన సంపద”

ధీరేసే ఆజా రి అఖియన్ మే

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-131
ధీరేసే ఆజా రి అఖియన్ మే
కన్నులపైకి నెమ్మదిగా రా
అల్బెలా(1951) సినిమాలో లతామంగేష్కర్,సి రామచంద్ర పాడిన పాటరాజేందర్
ర్ కిషన్ రచన. సి రామచంద్ర సంగీతం....
ఈ పాట ఉత్తరాన `లోరీ` అనబడే మన దగ్గరి జోల పాట. మనసుకి లోకపు మంచిచెడులు తెలియని పసిపిల్లలు జోలపాడితే తేలిగ్గా నిదురలోకి జారుకుంటారు. కలతచెంది ఉన్న పెద్దవాళ్ళను నిద్రపుచ్చటం అంత తేలికకాదు. ఆ జోలపాట బరువైనదై ఉండాలి.
కథానాయకునికి కళాకారుడవ్వాలని కలలున్నాయి. అవి తీర్చుకునేందుకు అనేక యత్నాలు చేస్తున్నాడు. అలా అలసిన అతను చెల్లెలు పాడిన జోలపాటలో సేద తీరాడు. రెండో చరణం వచ్చేసరికి కలలు నిజంచేసుకున్న అతను సంతృప్తితో ప్రేయసిని నిద్రపుచ్చటానికి పాడుతున్నాడు. చివరి చరణం బాధల్లొ ఉన్న చెల్లెలు అదే పాట పాడి తండ్రిని ఓదారుస్తుంది.
చితల్కర్ గా కూడా పిలవబడే సంగీత దర్శకుడు సి. రామచంద్ర ఒక తెలుగు సినిమాకు సంగీతమందించారు. ఐతే ఆ పాటలన్నీ కొత్తబాణీలే. కానీ అంతకుమునుపే అతని హిందీ బాణీల ఆధారంగా తెలుగులోవచ్చిన పాటలు వినిఉన్నాం. వాటిలో ఒక పాట ` నీలాల కన్నుల్లో మెల మెల్లగా`.నాటకాలరాయుడు సినిమాలోది.
ఆ సినిమా కు ఆధారం `అల్ బెలా` హిందీ చిత్రం ,పాటకు ఆధారం అదే సినిమాలోని ` ధీరె సే ఆజారే `

``కన్నులపైకి నెమ్మదిగా రా
నిదురా ! రా ! నెమ్మదిగా రా
చాటుగా కన్నుల తోటలోకి
నిదురా ! రా ! నెమ్మదిగా రా
సుందరస్వప్నాల మొగ్గలుతీసుకుని
వచ్చి కనుపాపల్లో బస చేయి
కనుపాపల చిరువీధుల్లో
నిదురా ! రా ! నెమ్మదిగా రా
చుక్కల నుండి చాటుగా , చుక్కలనుండి దొంగిలించి
ఈ రాత్రి చంద్రునికి జోల పాడు
చంద్రుడూ నిదురలో నవ్వుకుంటున్నాడు
కనులు మెలకువతో ఉంటాయి అదృష్టం నిద్రిస్తూఉంటుంది
అదృష్టం పేదవానికి విరోధి
ఒక క్షణం పేదవాని కుటిరానికి
నిదురా ! రా ! నెమ్మదిగా రా
కనులనేవి ఎవరికైనా ఒకేలా ఉంటాయి
ఉన్నావారికెలానో లేనివారికీ అలానే
అదృష్టం చాటేసిన కన్నులపైకి
నిదురా ! రా ! నెమ్మదిగా రా``
https://www.youtube.com/watch?v=8h94Qg1g-JI

Wednesday, February 7, 2018

హోష్ వాలోం కో ఖబర్ క్యా , బేఖుదీ క్యా చీజ్ హై

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-130
``హోష్ వాలోం కో ఖబర్ క్యా , బేఖుదీ క్యా చీజ్ హై``
(మెలకువతో ఉన్నవారికేం తెలుసు మైమరపు అంటే ఏమిటో)
సర్ఫరోష్ (1999) సినిమాలో జగ్ జిత్ సింగ్ పాడిన పాట .జతిన్ -లలిత్ సంగీతం. నిదా ఫజ్లి రచన....
నిదా ఫజ్లి ,గుప్పెడు పాటలే సినిమాలకు రాసినా అవి గుప్పెడు గుండెను తట్టేవే. సంగీత దర్శకులు జతిన్ -లలిత్ లు సంగీత కుటుంబానికి చెందినవారే. పాటలు పాడిన నటి సులక్షణా పండిట్ సోదరులు వీరు.
ఎనభైలలో వచ్చిన కొన్ని సినిమాలలో జగ్ జిత్ సింగ్ గజళ్ళు చోటుచేసుకున్నాయి. సున్నితమైన అనుభూతులతో మనసును నెమ్మదిగా ఊయలలూపేవి అవి. అలాంటి అనుభూతిని 1999 లో మరోసారి ఈ పాటతో పొందగలిగాం. పాట చిత్రీకరణా అప్పటికి పాతకాలపుదే. కనపడేవి పాట వింటున్న కథానాయకుడి కాలేజి రోజుల జ్ఞాపకాలే.

``మెలకువతో ఉన్నవారికేం తెలుసు మైమరపు అంటే ఏమిటో
ప్రేమించు. అప్పుడు తెలుసుకో జీవితమంటే ఏమిటో
తనతో చూపు కలిసాక పరిసరాలు వెలుతురుతోనిండాయి
నేడే తెలుసుకున్నాను ప్రేమలో ఉన్న మాయ ఏమిటో
విడివడిన కురులు ఋతువుకు గీతాలు నేర్పాయి
వాలిన కన్నులు చెప్పాయి మద్యపానమహిమ ఏమిటో
తనతో మనసు ఉన్న స్థితి ని పెదవులతో చెప్పలేకపోయాను
తనూ అర్ధంచేసుకోలేక పోయింది మౌనమంటే ఏమిటో``

పంఖ్ హోతే తో రె ఉడ్ aatiరె

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-129
పంఖ్ హోతే తో రె ఉడ్ aatiరె
(రెక్కలుండి ఉంటే ఎగిరి వచ్చేదానిని)
సెహ్రా (1963) సినిమాలో లతా మంగేష్కర్ పాట. సంగీతం రామ్ లాల్, రచన హస్రత్ జైపురి.
తెలుగునాట కొన్ని హిందీ పాటలు తెలుగు పాటలతో సమానంగా గ్రామీణప్రాంతాలలో కూడా ప్రాచుర్యం పొందాయి.ఆ ప్రాచుర్యానికో కొలమానం ఆ పాట వరసలు భజన గీతాల్లో చొచ్చుకుపోవటం....
మా వూరి భజన బృందం సంప్రదాయ భజన గీతాలే కాక , సినిమా పాటల వరసల్లో భక్తి పాటలు కట్టి పాడుతుండే వారు. `అబ్బాయే పుడతాడు` లాంటి పాటను `శ్రీ శైలా శిఖరానా` అని పాడేస్తున్నా మాకు సినిమా పాటే గుర్తొచ్చేది. అలా కొన్ని హిందీ పాటలూ వయా తెలుగు సినిమాద్వారా భజనలో చేరేవి. ఐతే కొన్ని హిందీ పాటలు తెలుగు సినిమాల్లో రాకున్నా భజన లోకి వచ్చేవి. `హే నీలే గగన్ కి తలే `, పంఖ్ హో తో ` పాటలు అలాంటివే.
`పంఖ్ హో తో ` పాట విన్నచాలాకాలానికి దూరదర్శన్ లో దర్శనమిచ్చింది. తెలిసిన నటులు కారు,చిత్రీకరణా విలక్షణమే.
ఉత్తర భారతంలో కబూతర్ ఖానా లు కనిపిస్తుంటాయి. అక్కడ వందలాది పావురాలు గుమిగూడి మేత మేస్తూ,నీళ్ళు తాగుతూ కువకువలాడుతుంటాయి. ఎగిరొస్తూ పోతూ శబ్దంచేస్తుంటాయి. నీళ్ళలో మునిగి తడిరెక్కలు విదులిస్తుంటాయి. వీటన్నిటి శబ్దాలు ఈపాటలో వినిపిస్తుంటాయి. పావురాల విన్యాసాలన్నీ నటిమణుల నృత్యంలో కనిపిస్తాయి.

``రెక్కలుండి ఉంటే ఎగిరి వచ్చేదానిని,
హృదయంలేని ప్రియతమా!
నీకు (గాయపడ్డ)గుండె మచ్చలు చూపేదానను
పక్షిగా మారి ,మనసు లగ్నంచేసి
తలపుల్లో మునిగి గగనానికి చేరాను
దూరంనుంచి చూసాను, ఋతువు ఎంతో అందంగాఉంది
ఉండాల్సిన నువ్వే లేవక్కడ
బాహువులు కిరణాల్లా చాచి ఉన్నాయి
ఆశల మేఘాలపై చేరి అలల్లాకదలాడుతున్నాయి
నేను మాట నిలుపుకున్నాను
నీవు మాత్రం ఇచ్చినమాట మరచావు``


తుమ్ మిలె దిల్ ఖిలే ఔర్ జీనేకో క్యా చాహియే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-128
`తుమ్ మిలె దిల్ ఖిలే ఔర్ జీనేకో క్యా చాహియే)
(నువ్వు కలిసావు. హృదయం వికసించింది,ఇక జీవించటానికి ఏమి కావాలి)
క్రిమినల్ (1996) సినిమాలో కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడిన పాట. ఎమ్ ఎమ్ క్రీ సంగీతం, ఇందీవర్ రచన.
దక్షిణాది సంగీత దర్శకులు రాజేశ్వర రావు,ఆది నారాయణ రావు వంటివారు తమసంగీతాన్ని ఉత్తరాదికి వినిపించినా అది చుట్టపుచూపే....
బహుశా ఇళయరాజా నే తొలిగా హిందీ సీమలో గుర్తింపు పొందినవాడు కావచ్చు. తర్వాత ఏ ఆర్ రెహ్మాన్ ను హిందీ ఆంకర్లు `రెహ్మాన్ ..దో దిన్ కి మెహ్మాన్` అని వెక్కిరించినా అతడు రెండు దశాబ్దాలుగా అక్కడ నిలబడే ఉన్నాడు.
తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి కూడా,ఎమ్ ఎమ్ క్రీమ్ పేరుతో కొన్ని హిందీ సినిమాలకు సంగీతమిచ్చాడు. వాటిలో కొన్ని పాటలు దేశం నలుమూలలనుండీ `ఫర్మాయిష్` చేయబడుతూనే ఉన్నాయి.
క్రిమినల్ సినిమా రెండు భాషల్లో `మహేశ్ భట్` దర్శకత్వంలోవచ్చింది. సినిమాలో చెప్పుకోదగింది సంగీతమే. అందులో ముఖ్యంగా ఈ పాట. శ్రావ్యమైన సంగీతం, ప్రశాంతతతో నిండిన అలాపన,చక్కని విజువల్స్.

~నువ్వు కలిసావు. హృదయం వికసించింది
ఇక జీవించటానికి ఏమి కావాలి
నువ్వు చింతించకు,నీ వెనువెంట
నేను ఉంటాను జీవితాంతం
లోకంలోని ప్రేమంతా నేను నీలోనే పొందాను
నిన్ను చూడటానికే చంద్రుడు ఉదయిస్తుంటాడు
నిన్ను తనలో చూసుకోవటానికే అద్దం పరితపిస్తుంది
ఇంత అందమైనది వేరొకటి లేదు
రెండు లోకాల సౌందర్యం ఒక్క నీలోనే కలసి వచ్చింది
మనం మరణిస్తాము ప్రేమ ఎప్పడూ మరణించదు
ప్రేమించినవారు అమరులవుతారు
ఎంత సౌందర్యమో అంత నమ్మిక
ప్రేమతో ఒక సారి చూడు..తిరిగి బ్రతికించు

మన్ రె తూ కాహె ధీర్ ధరె

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-127
`మన్ రె తూ కాహె ధీర్ ధరె`
(మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు?)
`చిత్ర లేఖ` సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, రోషన్ సంగీతం.
నాకు ఆలస్యంగా దగ్గరైనపాట. రేడియో లో ఎక్కువగా వినపడేదికాదు.పాట లలితమైన పదాలతో సాగుతుంది. ఎక్కడా ఉర్దూ పదాలులేవు. ఇది సాహిర్ లూధియాన్వి రచనాశైలి కి భిన్నమైనది. బహుశా సినిమా కథ ప్రాచీన భారతానికి చెందినది కావటం వల్ల కావచ్చు....
ఐతే పాటలో నేను సాహిర్ ను పట్టుకున్నాను.
సాహిర్ రాసిందే`బర్నింగ్ ట్రెయిన్ ` సినిమాలో జనరంజకమైన ఖవ్వాలీ ఉంది. జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తూ సాగుతుందది.జీవిత ఆనందాన్ని అనుభవించమని చెబుతుంది. అందులో
''జో భీ జిత్నా సాథ్ దే ఎహసాన్ హై..,
(ఎవరైనా మీతో కలసిగడిపినదే, వారు మీకు చేసిన ఉపకారం) అని ఒక పాదం ఉంది.
అదే అర్ధం వచ్చే ఒక పాదం `మన్ రె తూ కహే` లోనూ ఉంది. అది
`ఉత్నా హి ఉపకార్ సమఝో కోయి జిత్నా సాథ్ నిభా దే`
(ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో!)
`మన్ రే తూ కాహే ` విషాద భరితమైన పాట. అందులో చెప్పిన తత్వమూ, ఎంతో ఆనందకరంగా సాగే `పల్ దో పల్ కా సాథ్ ` లో చెప్పిన తత్వమూ ఒకటే కావటం ఆసక్తికరం.


''మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు?
నువ్వు మోహించే తను నిర్మోహి, మోహం తెలియదు
జీవితపు పొద్దు పొడుపు ,పొద్దు కుంగులను ఎవరాపగలరు?
రంగును పహరా కాసేదెవరు ,అందాన్ని బంధించేదెవరు?
ఎందుకు ఇంత యత్నం చేస్తావు?
ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో!
స్వప్నమనేది జనన మరణాల కలయిక, ఆ స్వప్నాన్ని మరచిపో!
నీతో కలిసి ఎవరూ మరణించరు''

సందేశే ఆతే హై హమే తడపాతే హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-126
`సందేశే ఆతే హై హమే తడపాతే హై`
(సందేశం వస్తుంది నన్ను బాధిస్తుంది)
బోర్డర్ సినిమాలో సోనూ నిగమ్,రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట. జావెద్ అఖ్తర్ రచన, అను మాలిక్ సంగీతం.
హకీకత్ సినిమా ను `యుద్ధ చిత్రాలకు తల్లి` (మదర్ ఆఫ్ వార్ మూవీస్) అంటారు. ఆ తల్లికి తగిన తనయ 1997లో వచ్చిన `బోర్డర్` సినిమా.
దర్శకుడు జె పి దత్తా సినిమాలు గులామి మొదలు ఉమ్రావ్ జాన్ (కొత్తది) వరకూ అన్నీ విభిన్నమైన అభిరుచి తో తీసినట్టుంటాయి. నావరకూ వాటిపట్ల ఆకర్షణ ఉంది.
పాకిస్తాన్ తో భారత్ కు జరిగిన `బాటిల్ ఆఫ్ లాంగెవాల్` (1971)నేపధ్యంతో వచ్చిన పీరిడ్ ఫిల్మ్ ఇది. సినిమా లో యుద్ధం అనివార్యత చెబుతాడు .అది ఎందుకు నివారించబడాలో చెబుతాడు. సందిగ్ధత చివరకీ మిగిలేవుంటుంది.
సినిమాలో ఈ పాట భరతఖండంలోనే కాదు భారతీయులున్న ఖండ ఖండాలలోనూ మారుమోగింది. ఇప్పటికీ ప్రతిధ్వనులు వినిపిస్తునే ఉన్నాయి.
హకీకత్ సినిమాలో `హోకె మజ్ బూర్ ముఝె ఉస్ నె భులాయా హోగా` మరపురాని పాట.ఆ పాటలో కదన రంగంలో సైనికులు విపత్కర పరిస్థితుల్లో ఇంటిని గుర్తుతెచ్చుకుని పాడే పాట.
`నామ్` సినిమాలో `చిట్టీ ఆయీ హై` పాట దూర సీమల్లో,తీరాల్లో ఉన్నవానినుద్దేశించి ఇంటి దగ్గర తండ్రి పాడేపాట.
పై రెండు పాటల కలయిక ` సందేశే ఆతే హై ` పాటలో కనిపిస్తుంది. పదినిముషాలవరకూ సాగే ఈ పాట క్రమక్రమంగా గాఢమౌతూ మనసుల్ని తడుతుంది.దృశ్యపరంగానూ,శ్రవణ పరంగానూ,అర్ధ పరంగానూ ఉన్నతమైన పాట.
యుద్ధంలో ఉన్న వారికి వదిలివచ్చిన వాటిని తిరిగి కలిసే /చూసే అవకాశాలు అనుమానమే. పాట చివరలో `మై వాపస్ ఆ ఊంగా ` పదం విన్నాక ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది.
``సందేశం వచ్చింది
నన్ను బాధించింది
వచ్చిన ఉత్తరం
నన్ను అడుగుతుంది
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే ఈ ఇల్లు శూన్యంగా ఉంది
మనసైన, మోహనమైన అమ్మాయి
నాకు ఉత్తరం రాసింది
నన్ను అడుగుతుంది
తన శ్వాస,తన హృదయ స్పందన
తన గాజులు,తన కడియం
తన జడ, తన జడలో పూలు
పరిమళించే ఉదయాలు, మత్తెక్కించే సాయంత్రాలు
ఒంటరి రాత్రులు, ముగియని మాటలు
తపించే బాహువులు
తపించే చూపులు అడుగుతున్నాయని..
ఎప్పుడు ఇంటికి వస్తావు
ఎప్పుడొస్తావో రాయి.
నీవు లేకుంటే హృదయం శూన్యంగా ఉంది
నన్ను ప్రేమించే వారు,నా స్నేహితులు
నాకు రాసారు. నన్ను అడిగారు
మా ఊరు, మామిడిచెట్టు నీడ
పాత రావి చెట్టు,వర్షించే మేఘాలు
గోధుమ పంట పొలాలు, పచ్చని మైదానాలు
బంతి పూలు, ఊగే రెమ్మలు
ఊగుతున్న ఉయ్యాల, తలలూపే పూవులు
విచ్చుకునే మొగ్గలు
ఇంకా ఊరి వీధులు అడుగుతున్నాయని.
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే ఈ ఊరు శూన్యంగా ఉంది
ఒక మమత తో
గంగ అంత ప్రేమతో
వచ్చిన ఉత్తరం
వస్తూ తెస్తుంది
నా బాల్యపు రోజులు
వాకిటిలో ఆటలు
అమ్మ పైటచెంగు నీడ
ఆమె చిక్కని కాటుక
ఆ జోలపాటల రాత్రులు, ఆమె మెత్తని చేతులు
ఆ కళ్ళల్లో ప్రేమ, మాటలలో చింత
పైకి చూపే కోపం,లోపల ప్రేమ
చూపే అమ్మ
ప్రతీ జాబులో లో అమ్మ అడుగుతుంది
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే వాకిలి శూన్యంగా ఉంది
తిరుగాడే గాలీ ! చెప్పు
నాకో చిన్న పని చేస్తావా?
మా ఊరు వెళ్ళు, నా స్నేహితులను అడిగానని చెప్పు
మా ఊరిలో ఉన్న ఓ వీధిలో
నా హృదయేశ్వరి ఉంటుంది
ఆమెతో ప్రేమ మాట చెప్పు
అక్కడికి కొద్ది దూరంలో మా ఇల్లు ఉంటుంది
మా ఇంటిలో మా అమ్మ ఉంటుంది
మా అమ్మ పాదాలు స్పృశించి
ఆమె కు ఆమె కొడుకు పేరు చెప్పు
ఓ తిరుగాడే గాలీ! కొద్దిగా
నా స్నేహితులకు,ప్రేయసికి
మా అమ్మకు నా వార్త చెప్పు
అక్కడికి వెళ్ళి ఈ వార్త చెప్పు
నేను తిరిగి వస్తాను
తిరిగి నా ఊరికి
ఊరి నీడలోకి
అమ్మ పైటచెంగు కు
ఊరి రావి చెట్టుకు
ఆమె కాటుకకు
ఇచ్చిన మాటను నిలుపుకుంటాను
నేనొక రోజు వస్తాను
-ముళ్ళపూడి సుబ్బారావు

బాబుల్ కి దువాయే లేతీ జా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-125
“బాబుల్ కి దువాయే లేతీ జా,జా తుఝ్ కో సుఖీ సన్ సార్ మిలీ”
“తండ్రి ఆశీస్సులు తీసుకొని వెళ్ళు,వెళ్ళు ,నీకు అనందకరమైన జీవితం దొరుకుతుంది)
‘నీల్ కమల్ ‘ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన ,రవి సంగీతం.
...
కూతురు వివాహమై అత్తింటికి వెళుతుంది. తండ్రి వీడ్కోలు పలుకుతున్నాడు.పెఌ ని కళ్యాణమనీ అంటారు. అంటే ఆనందకరమైదని. ఐతే పెఌ వేదనకూ గురిచేస్తుంది. సొంత గడప వదిలి పరాయి గడప తొక్కిస్తుందది. కొత్తప్రపంచంలో కూతురెట్లా ఇముడుతుందోనని తండ్రికి ఎంతో భయం. అక్కడ కూతురు జీవితం ఎలాగడవాలని తండ్రి ఆశ పడుతున్నాడో ఈ పాట చెబుతుంది. ఎంత ఆశో అంత భయమూ పాటలో కనపడుతుంది.
తండ్రి గా బలరాజ్ సాహ్ని కూతురుగా వహీదారెహ్మాన్ కనిపిస్తారు.బలరాజ్ సాహ్ని ఎప్పుడు నటనాపరంగా నిరుత్సాహపరచాడు? ఈ సినిమాలోనూ /పాటలోనూ గుండెల్ని తడుపుతాడు.
సాధారణంగా బలరాజ్ సాహ్ని పాటంటే ‘మన్నాడే’ గుర్తుకొస్తాడు. ఐతే ఇది నేపధ్య గీతం. దీనిని ఎంతో కరుణరసాత్మకం గా రఫీ పాడారు.

“ తండ్రి ఆశీస్సులు తీసుకొని వెళ్ళు
వెళ్ళు ,నీకు అనందకరమైన జీవితం దొరుకుతుంది
కన్నవారిల్లు నీకు ఎప్పుడూ గుర్తురాకుండాలి
అత్తవారింట అంత ప్రేమ దొరకాలి
మృదువుగా నిన్ను పెంచాను
మొగ్గలా, పువ్వులా
చిన్నతనంలో ఉయ్యలలూపాను
నా చెతుల్ని ఉయ్యల చేసి
నా తోటలో నాజూకైన కొమ్మా!
అనుక్షణం నీకు వసంతమవ్వాలి
,
నీ భాగ్యం నిన్ను ఏ ఇంటితో కలిపిందో
ఆ ఇంటిలో సదా నీ మాట నడవాలి
పెదవులపై నవ్వుల వెలుగులు పూయాలి
తలపై ఆనందపు కిరీటం నిలవాలి
ఎన్నటికి ఆరనిజ్యోతి
వంటి అలంకరణ నీది కావాలి
నీ జీవన ఘడియలు
చల్లని నీడలో ప్రశాంతంగా గడవాలి
ఏనాడూ నీ కాలు కి
ముల్లుకూడా గుచ్చరాదు
నీ ఇంటి ద్వారం కలిసే దారికి
కూడా దుఃఖమనేది దూరంగా ఉండాలి”