Thursday, March 30, 2017

హజారొ ఖ్వాహిషె ఐసీ కి హర్ ఖ్వాఇష్ పె దమ్ నికలె

"హజారొ ఖ్వాహిషె ఐసీ కి హర్ ఖ్వాఇష్ పె దమ్ నికలె”
('వేలాది కోరికలు ,,ప్రతీ కోరికా దానికొరకు ప్రాణమీయదగినదే')
మిర్జా గాలిబ్ టీ.వీ సిరియల్ (1988) లో గాలిబ్ రచించిన ఈ గజల్ జగజిత్ సింగ్' పాడారు.
మనిషి కోరికలు అనంతమైనవి అంటుంది ఆర్ధిక శాస్థ్రం. కోరికే బాధకు మూలమంటాడు గౌతమ బుద్ధుడు.అనంతమైన కోరికల్లో ప్రాణమిచ్చైనా తీర్చుకోవాలనుకోనేవి ఎన్నివుంటాయి?
అల్లాంటివికూడా కూడా వేలకొద్దీ అంటాడు గాలిబ్.
గాలిబ్ ను తొలిసారిగా పరిచయంచేసింది 8(?) తరగతి తెలుగువాచకంలో ఒక పాఠ్యభాగం. దాశరధి అనుసృజన చేసిన గాలిబ్ గజల్లు ' గాలిబ్ గీతాలు ' పుస్తకానికి ముందుమాట మా పాఠం. ఆ ముందు మాట రచయిత శ్రీ దేవులపల్లి రామానుజరావు . తర్వాత గాలిబ్ గీతాలు పుస్తకం దొరికింది. బాపు బొమ్మలతో ఇప్పటికీ ఆ పుస్తకం అచ్చు ఔతూనే ఉంది. అలా గాలిబ్ తెలుగు వాకిళ్ళలోకి అడుగు పెట్టాడు. ఐతే తర్వాత కాలంలో గుల్జార్ గాలిబ్ పై టీ.వీ సీరియల్ తీసి నట్టింట్లో కి గాలిబ్ ను తెచ్చాడు.అందులో నజీరుద్దీన్ షా గాలిబ్ గా నటించాడు. జగ్ జిత్ సింగ్ గితాలాలపించాడు.
(అంతకు చాలా ముందు మీర్జా గాలిబ్ పేరుతో హిందీ సినిమా వచ్చింది.బైజు బావరా గా నటించి ప్రసిద్ధికెక్కిన భరత్ భూషణ్ గాలిబ్ గా నటించాడు.)
పాట అర్ధం దగ్గర దగ్గరగా (పూర్తి గజల్ )
“వేలాది కోరికలు ,,ప్రతీ కోరికా దానికొరకు ప్రాణమీయదగినదే
నాకోరికలు ఎన్నో తీరాయి..కాని కొద్దిగానే తీరాయి.
నా హంతకి భయపడెది దేనికి?ఆమెను కారణమన్నారా
నా కళ్ళనుండి జీవితాంతం అవిశ్రాంతంగా స్రవించే రక్తానికి
ఆడం ను స్వర్గంనుంచి నెట్టేయటం విన్నాను ఆని
మరింత హీనంగా నీ వీధినుండి బైటపడ్డాను.
ఓ దయాహీన! నీ రహస్యాలు నేను బైటపెడితే
నా తలపాగా లోపలి కేశపు పాయల్లా తేటతెల్లమౌతాయి.
ఆమె కెవరైనా లేఖ రాయాలంటే నాతోనే రాయించుకొండి
ప్రతి ఉదయం ఇంటినుండి కలాన్ని చెవిలో ఉంచుకుని బయలుదేరతాను
ఈ వయస్సులో మధుపానం చేసేవారి గుంపులో కలిసాను.
తిరిగి మధు పాత్రే సమస్తమయ్యే కాలమొచ్చింది.
ఎవరినుంచి నా గాయాలకు న్యాయం కోరానో
ఆగాయాలకు మరింత కత్తి గాటు తగిలింది.
ప్రేమలో జీవితానికి మరణానికి అంతరం లేదు
ఎవరిని చూసి బ్రతుకుతామో ఆ అవిశ్వాసి కోసం ప్రాణమిస్తాము
గుండెలొ గయంచేసిన బాణాన్ని బలంగా లాగితే
దానితో గుండె వ్లికి వస్తుంది..దానితో ప్రాణమూ వెలికి వస్తుంది.
దేవుని కోసం…నిర్దయీ ,,రహస్యాలపై ముసుగు తీయకు
అవిశ్వాసి ఐన ప్రేయసి అక్కడ కూడా బయటపడవచ్చు.
ఎక్కడ పానశాల ద్వారం,ఎక్కడ ప్రబోధకుడు
కాని నేను పానశాల నుండి బయటకొస్తుంటే అతను లోనికెళుతున్నాడు.”
-ముళ్ళపూడి సుబ్బారావు

Wednesday, March 29, 2017

ఝూమ్ బరాబర్ ఝూమ్ షరాబీ


ఝూమ్ బరాబర్ ఝూమ్ షరాబీ

(సరిగ్గా ఊగు… తాగుబోతు..,సరిగ్గా ఊగు)
'మందిరాలలో కాదు మదిర లోనే శాంతి దొరుకుతుంది’ అని చెప్పే పాట....
(5రైఫిల్స్ సినిమా లొ అజీజ్ నజా పాడిన పాట.నజా షోలాపురి రచన,కల్యాణ్ జీ ఆనంద్ జీ సంగీతం)
ఝూమ్ బరాబర్ ఝూమ్ బరాబర్ ' పాట అమితాబ్, అభిషేక్ బచ్చన్ల నృత్యంతో ఇటీవల బాగా ప్రాచుర్యంపొందింది.ఐతే ఆ పాట వేరే సినిమా పాటగా చిన్నప్పటినుండీ వింటున్నా. ఆ గాయకుడిది విభిన్నమైన స్వరం. ఆ పాట మినహా అతనివి వేరే సినిమా పాటలు వినలేదు. కొత్తగాఉన్న సంగీతం,తమాషాగా ఉన్న పాట అర్ధం.సినిమా పేరు పాంచ్ రైఫిలె’ . రేడియో లో కొన్నిసార్కు ఫైవ్ రైఫిల్స్’అని కూడా వినపడేది. పేరు వినపడటమే కాని సినిమా ఎక్కడా (చూడటానికి) కనపడలేదు.
ఆ పాట ఒక ఖవ్వాలి. పాడినాయన ‘అజీజ్ నజా’ . ఖవ్వాలీ గాయకునిగా ప్రసిద్ధుడు. రాసినాయన 'నజా షోలాపురి’’.
ఖవ్వాలీలను సూఫీ గాయకులు తాత్వికతతో ముడిపెట్టి గానంచేసేవారంటారు. ఐతే సినిమాలలో ఎక్కువభాగం ఖవ్వాలీలు ప్రేమకు సంబంధించో, పోటి లాగానో లేదా మదిరాపానాన్ని గొప్పచేసేవిగానో ఉంటాయి.చాలా సినిమా ఖవ్వాలీలు హిట్ ఐనవే.ఖవ్వాలీ పాటల్ని ప్రత్యేకంగా కాసెట్టుగా రికార్డ్ చేయించుకుని కూడా వినేవాడిని.వాటిలో ఎక్కువ రఫీ,మన్నాడే,(కొద్దిగా కిశోర్ కుమార్) ,లతా,షంషాద్ బేగం,ఆశా భోన్‌స్లే లు పాడినవి.
పాటల ప్రేమికులైన నా స్నేహితుల మద్యపాన గోష్టులలో ‘ఝూమ్‌బరాబర్ ఝూమ్ షరాబీ' పాట ఖచ్చితంగా ప్రస్తావన వస్తుంది.మిగతా హిందీ పాటల అర్ధంగురించి పట్టించుకోకపోయినా ఈ పాట అర్ధం తెలుసుకుమరీ ఆనందించిన స్నేహితులు తెలుసునాకు.

పాట అర్ధం రమారమీ
“నిషేదాలలో మందిరాల లో శాంతి దొరకదు
ప్రశాంతత ఎక్కడైనా దొరుకుతుందంటే ,అది నీ మధుశాలలోనే ….
ఊగు ఊగు ఊగు
సరిగ్గా ఊగు… తాగుబోతు..,సరిగ్గా ఊగు
నల్లటి మబ్బులున్నాయి, మహదానందకరమైన వాతావరణం వుంది.
మధుపాత్ర ఎత్తిపట్టి గిరగిరా తిరుగు
ఈరోజు ద్రాక్ష కుమారితో ప్రేమలో పడు
గురువుగారి సలహాలపై తిరుగుబాటు చెయ్యి
ఈ ద్రాక్ష కుమారి తన శిరసు పై ప్రపంచాన్ని నిలుపుకుంది
ద్రాక్షకు కుమారుడు ఉండకపోవటం మంచిదయ్యింది
కనీసం మెరుస్తున్న సాకీ ముఖమన్నా చూడు
మధుశాల కు వచ్చి జీవించటానికి ఆసరా తీసుకో
కళ్ళు కలిస్తే యవ్వనపు మజా తెలుస్తుంది
నీకు ద్రాక్ష రసం మజా తెలుస్తుంది
నీ ప్రతీ చూపును గులాబీ రంగులోకి మార్చుకో
ప్రపంచాన్ని తాగుబోతు చేసేంతగా తాగు
మధుపాత్ర చెంతకు వస్తే దూరంగా వుంచేదెలా?
విషయం తాగేదైనప్పుడు బెదిరేందుకేముంది?”

-ముళ్ళపూడి సుబ్బారావు

షోఖియోమె ఘోలా జాయ్ ఫూలోంకా షబాబ్


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-57’
“షోఖియోమె ఘోలా జాయ్ ఫూలోంకా షబాబ్ “26 March at 18:08

(‘చిలిపిదనాన్ని పూలలోని యవ్వనం తో రంగరించు’)
...
ప్రేమ్ పుజారి సినిమాలో కిశోర్ కుమార్,లతా మంగేష్కర్ పాడిన పాట.
దేవానంద్ సోదరులిద్దరు (చేతన్ ఆనంద్,విజయ్ ఆనంద్) చిత్ర దర్శకులు.దేవానంద్ తో సొంత బానర్ పై హిట్ సినిమాలు తీశారు.తర్వాత రోజుల్లో దేవానంద్ స్వయంగా దర్శకుడయ్యాడు.అలా దర్శకత్వం చేసిన మొదటిసినిమా ప్రేమ్ పుజారి.సినిమాలో అన్నీ హిట్ పాటలే.దేవానంద్ ఎక్కువ సినిమాలకు సంగీతమిచ్చిన ఎస్.డి.బర్మన్ దీనికీ సంగీతం ఇచ్చారు.అలాగే నీరజ్ గీతరచన కూడా.
సినిమా కథానాయకుడు సున్నిత హృదయుడు.హింస అంటే ఇష్టం లేనివాడు.తన గ్రామసీమల్లొ ,పంటపొలాల్లో ప్రకృతిని, అన ప్రేయసిని ప్రెమిస్తూ తిరుగుతుంటాడు.ఊరిలో జరిగే కోడిపందేలవంటివి కూడా అతనికి గిట్టవు.తగువులు ఇష్టం లేవు. అతని తండ్రి మిలటరీలో ఉండి యుద్ధంలో కాలు పోగోట్టుకుని ఉన్నాడు.సైనికుడిగా తన వారసత్వం కొడుకు తీసుకోవాలనుకుంటున్నాడు.
వూరిలో గొడవల్లోనే తలదూర్చనివాడు దేశాలమధ్య జరిగే యుద్ధంలోపాల్గొనాలి. సీతకోక చిలకల్ని పట్టుకుంటూ కాలంగడిపేఅతను తుపాకి పట్టుకోవాల్సి ఉంటుంది. బలవంతంగా మిలటరీలో చేరిన అతని జీవితం ఎన్నో మలుపులు తిరిగింది.
ఈ పాట కథనాయకుడు మిలటరీ లో చేరకముందు ప్రేయసితో ఆటపాటల్తో ఉన్నప్పటిది.అతను సీతాకోక చిలుకల ను పట్టటానికి వలతో వున్నాడు.పంటపొలాల్లో,గడ్డివాముల్లో,విశాలమైన మైదానాల్లో ఆమె తో విహరిస్తున్నాడు. ప్రేమంటే ఏమిటో,ఎలా ఉంటుందో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.సీతాకోక చిలకను బంధించటంలో ఉన్న హింస అతనికి అర్ధమైనట్టు లేదు.
‘చిలిపిదనాన్ని పూలలోని యవ్వనం తో రంగరించు
దానికి కొద్దిగా మధువు కలుపు
నిషా అనేది అలా తయారౌతుంది
ఔను..నిషా అనేది అలా తయారౌతుంది...అదే ప్రేమ
అది చిన్నప్పటి నవ్వు,పొంగిపొర్లే ఋతు సౌందర్యం
కవ్విస్తే మంటలాంటిది...కోరితే మంచులాంటిది.
వూరిలోనూ,జాతరలోనూ,దారిలోనూ,ఒంటరితనంలోనూ
పదే పదే గుర్తుకొస్తుంటే ..అదే ప్రేమ
రంగులో కరిగిన బంగారం,రూపంలో మకరందం
రాత్రుల్లో సుతిమెత్తగా మోగే వాద్యంలా వుండేది.
ఎండలో, నీడలో ,తిరుగాడే గాలుల్లో
ప్రతి క్షణం చూసే ఎదురు చూపు..అదే ప్రేమ
అదిగనుక గుర్తొస్తే ...ఒంటరితనం ఎలా దూరమౌతుందంటే
శూన్యమైన నగరంలో షెహనాయి మోత మొదలైనట్టు
వస్తునా ,వెళ్ళిపోతున్నా ,లోకమెటు పోతున్నా
ఎప్పటికీ తగ్గని నిషా...అదే ప్రేమ”

-ముళ్ళపూడి సుబ్బారావు

ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలొ

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-56’
‘ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలొ జనం సఫల్ హో జాయే’24 March at 19:05

(నీ బాహువుల్లోకి తీసుకో ఈవేళ నన్ను.జన్మ సఫలమయ్యేలా.)
...
ప్యాసా సినిమాలో గీతాదత్ పాడిన పాట ,సంగీతం ఎస్.డి.బర్మన్,రచన సాహిర్ లూధియాన్వి
హైస్కూల్లో ఉన్నప్పుడు పెద్దాళ్ళతో ఏలూరెళ్ళే అవకాశం వస్తే పండగే. కారణంకొత్త సినిమా చూసే అవకాశం దొరుకుతుందనే. అలాంటి అవకాశం ఒకసారి వచ్చింది. పోస్టర్లలో మురళి వాయిస్తూ ఎన్.టి.ఆర్ ‘ఆరాధన ‘కు రమ్మని పిలుస్తున్నాడు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ‘మల్లె పూవు ‘ (1977)సినిమాకు తీసుకెళ్ళబడ్డాను.
శోభన్ బాబు పార్కులోపడుకుని రాలినపూవు మీద పాట పాడుతున్నాడు. ఇంతలో ఎవరో ఆ పూవు ను తొక్కేశారు. శోభన్ బాబు కోపంతో లేచి వెళ్ళిపోయాడు..సినిమా చివర్లోకూడా లోకం మీద కోపంతోనో,విరక్తితోనో తనంటే ఇష్టపడే ఆమెతో వేరే ఎక్కడికో దూరంగా వెళ్ళి పోదామని చెబుతాడు. సినిమా అర్ధమయ్యీ కానట్టుంది.
ఆ సినిమా కు ఆధారమైన హిందీ సినిమా ‘ప్యాసా ‘ పదిహేనేళ్ళతర్వాత చూసాను. చూసేటప్పటికే దానిగురించి చాలా విని ఉన్నాను. ఆ 'సినిమా'కు అభిమానులున్నారు. దానికో క్లాసిక్ హోదా ఉంది. సినిమాలో ప్రతిసన్నివేశం లోని వివరాలు వర్ణించి చెప్పే మిత్రులున్నారు.
చిత్రాన్ని నిర్మించిన ‘గురు దత్ ‘ చిత్ర కథానాయకుడు కూడా. నిర్మాతగా, దర్శకుడిగా ,నటుడుగా తనకో ప్రత్యేక గుర్తింపు,ముద్ర కలిగిఉన్నాడు. తన సినిమాల్లో సంగీతం, ఫొటోగ్రఫీ కి, ఈస్తటిక్స్ కు ప్రాధాన్యతనిచ్చాడు.
‘ప్యాసా ‘ సినిమా తగిన గుర్తింపు పొందలేకపోయిన ఒక కవి కథ. ఆ కవి సమకాలీన జీవితంలో ఇమడలేకపోయి పక్క పక్కకు జరిగిపోతున్నాడు. ప్రేయసికి దూరమయ్యాడు.కుటుంబసభ్యులుల ఈసడింపుకు లోనయ్యాడు.అతని కవిత్వం తూకపు సరుకయ్యింది. ఓ సంఘ
టనతో సమాజం దృష్టిలో మరణించాడు. అప్పుడు అతని రచనలు గొప్పకావ్యాలయ్యి ప్రచురణకర్తలకు సొమ్ములు కురిపించాయి. నేను బ్రతికున్నానని చెబితే అతడ్ని పిచ్చివాడన్నారు. ఈ క్రమంలో ఒక వేశ్య అతని పాటల్ని అభిమానించి అతన్ని అరాధించింది.
ఆమె ఆరాధన్ని తెలియచెప్పే పాట ఇది.
గాయని గీతా రాయ్ గురుదత్ ను పెళ్ళాడి గీతా దత్ గా మారింది. అలా ప్యాసా సినిమా ఆమెకూ సొంతసినిమానే.
భజన్ లా సాగే ఈ పాట ఓ భక్తురాలు భగవంతుడ్ని ఉద్దేశిస్తూ పాడుతుంది. ఆ పాట అర్ధం మొత్తం కథానాయకుడైన కవి పట్ల అతన్ని అభిమానించే వేశ్యకున్న ఆరాధన్ని తెలియజేస్తుంది. పాట మొత్తాన్ని తనలో ఆవహింపజేసుకున్నట్టు వహీదా రెహ్మాన్ నటన పాట విన్నపుడల్లా గుర్తుకొస్తుంది.
పాట అర్ధం...
విరహపు దుఃఖంతో బాధపడుతూ ఒక రోజు రాధ తన మన్మోహనుని దగ్గరకు వెళ్ళి చెప్పింది
“నీ బాహువుల్లోకి తీసుకో ఈవేళ నన్ను
జన్మ సఫలమయ్యేలా.
హృదయ వేదన,దేహ జ్వాల
శీతలమయ్యేలా..
ఎన్నోయుగాలుగా నిద్రకాచిఉన్నాను
నా కనులు అభాగినులు
నీవులేక మనసు దేనిపైనా లగ్నంకావటంలేదు
సుఖమేదీ ముందు కానరాదు
దుఃఖం వెనకనే వెంటాడుతుంది
నీవులేక జగమంతా శూన్యంగా కనిపిస్తుంది
నా ప్రియతమా…
ఇంత ప్రేమసుధ కురిపించవా
జగంఅంతా జలం తో తడిసేలా.
నన్ను నీదాన్ని చేసుకో
నా చేయి పట్టుకో
నేను జన్మజన్మల దాసిని
మనహర గిరిధారీ నా దాహం తీర్చు
నేనూ అంతరాంతరాలలో దాహంతో ఉన్నాను.
ఎంతో యత్నించించాను
మనసు తపన,దేహపు జ్వలన
పోనే పోవు.
నీపై మనసు ఎలా లగ్నమయ్యిందో, ఈ అగ్ని ఎలా పుట్టిందో?
మనసుకు ధైర్యం చిక్కదే

--------ముళ్ళపూడి సుబ్బారావు

చింగారీ కోయీ భడ్ కే


'చింగారీ కోయీ భడ్ కే ,తో సావన్ ఉసే భుఝాయే '22 March at 20:31
 (మంటలు రేగినప్పుడు,వాన జల్లు వాటిని ఆర్పుతుంది)
...
అమర్ ప్రేమ్ (1972) సినిమాలో కిశొర్ కుమార్ పాడిన పాట.ఆనం బక్షి రచన.ఆర్ డి బర్మన్ సంగీతం.
వార్తాపత్రికలు,మాగజైన్లలో ఆర్టికల్స్ కు ఆ ఆర్టికల్ ప్రధానోద్దేశాన్ని తెలియజెప్పటానికి ఎదైనా కొటేషన్ని ప్రారంభంలో ఉదహరిస్తారు. ఎదైనా కావ్యాలనుండో, పెద్ద రచయితల రచనలనుండో, ప్రముఖల మాటలనుండో తీసుకుంటారు.సినిమా పాటలకు కూడా అలాంటి గౌరవం అప్పుడప్పుడూ దొరుకుతుంది.
2005/6 ప్రాంతాలలో బిజినెస్ లైన్ పేపర్లో ఒక ఆర్టికల్ పెన్షన్ ఫండ్ మీద వచ్చింది. ఆ ఆర్టికల్ ప్రారంభంలో ఒక హిందీ పాట చరణంలో ఒక లైను కోట్ చేశారు. ఆ లైను 'మఝ్ దార్ మే నయ్యా డోలే,తో మాఝీ పార్ లగాయే..మాఝీజో నావ్ డుబాయే ఉసే కౌన్ బచాయే '.ప్రభుత్వ,ప్రభుత్వ సంస్థల ఉద్యోగులనుండి,సంస్థలనుండి, భవిష్యత్తులో పెన్షన్ చెల్లించటం కోసం తీసుకున్న డబ్బును, షేర్ మార్కెట్లో ఇన్వెస్త్ చేయటాన్ని ఆ ఆర్టికల్ చర్చించింది.
ఏమాత్రం రిస్క్ ఉండని విధంగా ఉండాల్సిన పెన్షన్ ను రిస్క్ కు గురిచేయటం. అది చెప్పటం కోసం వ్యాస రచయిత పై పాటలో భాగం తీసుకున్నాడు. పడవను నడిపేవాడే పడవను ముంచబూనితే ...నమ్మితే నట్టేట ముంచితే?
ఈ పాట ముందునుండీ ఇష్టంగానే వింటున్నాను. పైన చెప్పింది చదివాక సినిమా పాటకు కావ్య గౌరవం దక్కిందనిపించింది.
మంటలు రేగినప్పుడు
వాన జల్లు వాటిని ఆర్పుతుంది
వానజల్లే మంటలు రేపితే
వాటిని ఆపేదెవ్వరు?
శిశిరం తోటని నాశనం చేస్తే
వసంతం దానిని చిగిరింపజేస్తుంది
వసంతంలోనే తోట నాశనమైతే
దానిని వికసింపజేసేదెవరు?
స్వప్న మందిరం ఎలా కూలిందని
నన్ను అడగవద్దు
ఇది వేరేవారు చేసింది కాదు
ఇది నా వారి కథే.
శత్రువెపుడైనా గాయపరిస్తే
మిత్రుడు ఓదారుస్తాడు
ఆప్తులే గాయంచేస్తే
ఆర్చేవారెవ్వరు?
జరగబోయేదేదో తెలియదు
నేను చేయాల్సిందీ తెలియదు
తాగటంవల్ల బ్రతికిఉన్నా
తాగకపొతే చనిపోతా
లోకమంతా నిన్ను దాహంతో ఉంచినప్పుడు
మధువు నీ దాహాన్ని తీరుస్తుంది.
మధువే నీ దాహానికి కారణమైతే
ఆ దాహంతీర్చేదెవ్వరు?
తుఫానుకు ఎదురుగా
ఎవరూ నిలువలేరని తెలుసు
ఇది కెరటాల దోషంకాదు
అది వేరేవారిది
నది మధ్యలో పడవ ఊగిసలాడితే
పడవ నడిపేవ్యక్తి ఒడ్డుకి తెస్తాడు
అతనే పడవను ముంచేస్తే
పడవను కాపాడేదెవరు?
-ముళ్ళపూడి సుబ్బారావు

దిల్ ఐసా కిసీనే మేరా తోడా



“దిల్ ఐసా కిసీనే మేరా తోడా ,బరబాదీ కి తరఫ్ ఐసా మోడా”18 March at 19:49

(ధ్వంసమయ్యేంతగా హృదయాన్ని గాయపరచారు )
('అమానుష్ ' సినిమాలో కిశోర్ కుమార్ పాడిన పాట.ఇందీవర్ రచన,శ్యామల్ మిత్రా సంగీతం)
...
డెబ్భైలలో నాకు సంబంధించి ప్రతీ ప్రాంతీయ భాష లోనూ ఒక్కో ఎన్.టి.ఆర్ ఉండేవాడు.తమిళ్ లో శివాజీగణేశన్ (ఎం.జి.ఆర్ సినిమాలు అంతగా నాకు అందుబాటులోకి రాలేదు), కన్నడంలో రాజ్ కుమార్, మలయాళంలో ప్రేం నజీర్..ఇలా. సినిమా పుస్తకాలద్వారా బెంగాలీ సినిమా ఎన్.టి.ఆర్ ఉత్తమ్ కుమార్ అని తెలిసింది. ఐతే అతని సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవ్వలేదు కనుక నాకు ఆయన్ను చూసేఅవకాశం అప్పట్లో కలగలేదు.
ఉత్తమ్ కుమార్ కొన్ని హిందీ సినిమాల్లో నటింఛాడు.వాటిలో 'అమానుష్ '(1975) సినిమా ఒకటి. డెబ్భైలలో హిందీ సినిమాలు చాలా ఎక్కువ తెలుగులోకి రిమేక్ చెయబడ్డాయి. ఆక్రమంలో అమానుష్ సినిమాకూడా తెలుగులోకి ఎదురీత పేర నిర్మించబడింది. అందులో ఎన్.టి.ఆర్ నటించాడు. దానికి సంగీతం సత్యం అందించారు.సాధారణంగా సంగీత దర్శకుడు 'సత్యం' ,రిమేక్ లకు సంగీతం చేసేటప్పుడు హిందీ పాట వరసల్నే యధాతధంగా ఉంచేవాడు. ఈ సినిమాలో మాత్రం టైటిల్ సాంగ్ ను మాత్రమే మాతృక నుంచి తీసుకున్నారు. ఆ పాట తెలుగులో కూడ బాగా హిట్ అయ్యింది.ఆ పాట 'ఎదురీత కు అంతం లేదా?'.హిందీ లో 'దిల్ ఐసా కిసీనే మేరా తోడా '
సొంతమనుషులతోనే మోసపోయి,అపనిందలు పడి,జైలు పాలయ్యి బయటకు వచ్చాడు కథానాయకుడు. ప్రేయసికి దూరమయ్యాడు. మృగం లా కనిపిస్తున్న అతను గాయపడ్డ మనసుతో ఉన్నాడు.అనుకోకుండా పాత ప్రేయసిని ఆపదనుండి కాపాడాడు. ఆ సందర్భంలో పాట
“ధ్వంసమయ్యేంతగా హృదయాన్ని గాయపరచారు
ఒక మంచి మనిషిని రాక్షసుణ్ణి చేసి వదిలారు
సముద్రం ఎంత సమీపంలోఉనా,నా జీవితం లో ఇంకా దాహమే
దాహం పెద్దది.జీవితం చిన్నది...
లోకపు దారులన్నీ చెబుతున్నాయి..నీ కోసమంటూ గమ్యమేమీ లేదని
వైఫల్యంతో జతకట్టాను...
అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించి చీకటి లేకుండా చేస్తాడు.
కాని నా సూర్యుడు కోపించాడు..నాకు తిరిగి ఉదయమనేది లేదు
వెలుతురు నా జట్టు వదిలి వెళ్ళింది...”
పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ కథ అన్ని భారతీయ భాషలకు,ప్రాంతాలకు తగినట్టు ఉంటుంది. అందుకే కావచ్చు హిందీ, బెంగాలీ (ఉత్తమ్ కుమార్),తెలుగు, తమిళ(శివాజీ గణేశన్), మళయాళీ భాషల్లోకి వెళ్ళగలిగింది.
-ముళ్ళపూడి సుబ్బారావు

 

ఇన్ ఆంఖొం కి మస్తి కె మస్తానె హజారోం హై

’ఇన్ ఆంఖొం కి మస్తి కె మస్తానె హజారోం హై’20 March at 18:10
(ఈ కళ్ళ లోని మత్తుకు మైకంలో మునిగారు వేలకొద్దీ)
...
(ఉమ్రావ్ జాన్ సినిమాలో పాట. షహర్యార్ రచన ఖయ్యాం సంగీతం, ఆశా భోన్ స్లే గానం)
80ల ప్రారంభకాలంలో ఉమ్రావ్ జాన్ పాటలు బాగా వినపడుతుండేవి. పాటలు మందంగా నడిచేతీరూ, సాధారణంగా వినె హిందీ పాటల్లో వుండే సంగీతవాద్యాలకు భిన్నమైనవేవో ఉపయోగించినట్టుందే సంగీతం.సినిమా వచ్చిన పుష్కర కాలంతర్వాత సినిమా చూసాను. ఆ మధ్యకాలంలో పాటలు మరింత దగ్గరైనాయి.
సినిమా 'మీర్జా హది రుసువా' ఉర్దూ నవల 'ఉమ్రావ్ జాన్ అదా ' (తెలుగు అనువాదం లభ్యం) ఆధారంగా తీయబడింది. లక్నో ప్రాంత ముస్లిం రాజవంశానికి చెంది 'ముజాఫర్ అలి ' ఈ చిత్ర దర్శకుడు.
1850 ప్రాంతాలకు చెందింన దేవదాసి(?)వంటి స్త్రీజీవితం చెప్పే కథ .కథా స్థలం అవధ్ రాజధాని లక్నో.సిపాయి తిరుగుబాటు కు కొద్ది ముందు కాలం.సంధికాలం,సందిగ్ధకాలం ..అప్పటి సాంస్కృతిక,సాంఘిక వాతావరణం..వీటిని ఉమ్రావ్ జాన్ జీవితంద్వారా సినిమాలో చూడగలం.
ఉమ్రావ్ జాన్ జీవితంలో ఒక అంకం నవాబ్ తో ప్రేమ, దాని వైఫల్యం.
ఉమ్రావ్ జాన్ సంగీత నృత్యాలకు రసజ్ఞుడైన నవాబ్ ఆకర్షింపబడ్డాడు.చాటుగా ఆమె నృత్యగానాలను చూడటానికి వస్తున్నాడు. వాటిని అస్వాదిస్తూ పరవశుడౌతున్నాడు.
ఆ సందర్భంలో 'ఇన్ ఆంఖొం కి మస్తి కె మస్తానె హజారోం హై ‘పాట వస్తుంది.
ఆమె తన కళ్ళు కలిగించగల మైమరుపు ను, తన కళ్ళ నే మధుపాత్రలు గా చేయగలగటాన్నితెలియజేస్తుంది , తను దీపమైతే అందులో పడి కాలిపోయే దీపపు పురుగులు అనేకమందని చెప్పుకుంటుంది.
పాట చిత్రీకరణలో నృత్యం (కథక్?) మరీ ఎక్కువ లేదు.ఎక్కువ భాగం క్లోజ్ అప్ దృశ్యాలే.పాట అర్ధాన్ని తెరపై ఆమె ముఖంలో చూడగలం.
“ఈ కళ్ళ లోని మత్తుకు
ఈ కళ్ళ లోని మత్తుకు మైకంలో మునిగారు వేలకొద్దీ
ఈ కళ్ళతో ప్రేమకథలు అల్లబడ్డాయి వేలకొద్దీ
నీవొక్కడివే కాదు
నీవొక్కడివే కాదు నా మీద ప్రేమతో నింద పడ్డవాడవు
ఈనగరంలో నీలాంటి వెర్రివాళ్ళు వేలకొద్దీ
నేనొక్కదాన్ని మాత్రమే మధువును
నేనొక్కదానిని మాత్రమే మధువును కళ్ళతో తాపుతాను
చెప్పటానికి లోకంలో మధుశాలలు వేలకొద్దీ
ఈ దీపాన్ని గాలివాన పేరుతో భయపెడుతున్నావు
ఈ దీపానికి ఆకర్షింపబడే శలభాలు వేలకొద్దీ”
-ముళ్ళపూడి సుబ్బారావు

జిస్ కో తూనే ఘర్ సంఝా హై


“జిస్ కో తూనే ఘర్ సంఝా హై ఓ దునియా ముసాఫిర్ ఖానా హై.”16 March at 19:49

(ఇల్లు అని నువ్వు దేనిని అనుకుంటున్నవో ఆ ప్రపంచం యాత్రీకులుండే ఒక సత్రమే.)
‘సురంగ్’(1953) సినిమాలో షెవాన్ రిజ్వి రాసిన పాట, పండిట్ శివ్ రామ్ కృష్ణ సంగీతం....
కన్యాశుల్కంలో దాసరి వేషంలో కరటకశాస్త్రి శిష్యుడు పాడతాడు “ఇల్లు ఇల్లనియేవు,ఇల్లు నాదనియేవు “ అంటూ.

ఇంచుమించు అదే అర్ధం వచ్చే పాటే ‘సురంగ్ ‘ సినిమాలో దర్శక నిర్మాత వి.శాంతా రామ్ పెట్టాడు.అక్కడ పాడెది దాసరి ఐతే ఇక్కడ శ్రమచేసి బ్రతికే కష్టజీవులు. బైరాగులు జీవితపు బరినుండి ఇవతలకువచ్చి తత్వం చెబుతారు. ఈ శ్రామికులు జీవితవాస్తవాన్ని అనుభవిస్తూనే చెబుతున్నారు.
రేపటి మీద ఆశ ఉండి,ఎదగాలనే కోరిక ఉన్నవాడి ప్రార్ధనలు,మొత్తుకోళ్ళు ఒకలా ఉంటాయి.
ఏపూట గ్రాసం ఆపూటే సంపాదించుకుని,మరుక్షణం పట్ల భరోసా లేని వాని ప్రార్ధనలు ,మొత్తుకోళ్ళు వేరేలా ఉంటాయి.
ఈ విషయాన్ని ఒక అనుభవశాలి ఓ యువకునికి చెబుతున్నాడు. ఆ యువకుడు పెద్ద ఇంటినుండి బయటకు వచ్చి, తనకు తెలియని మనుషులదగ్గరకు కిందకు వస్తున్నాడు. అతని కుటుంబానికి చెందిన క్వారీ లోనే ఆ మనుషులు పనిచేస్తున్నారు.
రాత్రివేళ శ్రామికులు పాడుకుంటున్న ఈ పాటలో ఉన్న వైరాగ్యం(?) స్మశాన వైరాగ్యం లాంటిది కాదు.వారిది నిత్యవైరాగ్యమే.ఇంతకుమించిన ఆశ 'అందని ద్రాక్షపండు ' అనుకున్నారా ? ఇలా అనుకోకపోతే ఈ మాత్రం శాంతి ఉండనుకున్నారా?
జీవితమొక తప్పనిసరి ఆటే ఐతే ముగిసేంతవరకు ఆడేద్దాములే అన్నట్టు వినిపిస్తుందా పాట. పూర్తిస్థాయిలో అవలంబించవలసిన ఆలోచన కాకపోయినా ఇలాంటి ఆలోచన కూడా కలిగివుండాలని అనిపిస్తుంది.
సినిమాకాని,అందులో నటవర్గంకాని అంతగా గుర్తింపు పొందిందికాదు. ఫిలసాఫికల్ పాటల కోసం తొలి ఎంపికైన 'మన్నాడే 'ముఖ్యగాయకుడు. చిత్రీకరణ,నటుల హావభావాలు,సంగీత వాద్యాలు,నర్తనం అన్నీ..పాట మూడ్ ను మరింత సాంద్రతరం చేసేట్టున్నాయి.
“నిద్రలో ఉన్నవారూ..లేవండి.
ప్రభాతకాలమయ్యింది.
ఎవరో యాత్రికుడు డేరా వేసుకున్నాడు.
??????
ఇల్లు అని నువ్వు
దేనిని అనుకుంటున్నవో
ఆ ప్రపంచం యాత్రీకులుండే ఒక సత్రమే.
ఏదో ఒక రోజు
ఈ ఇంటిని అన్నింటినీ వదులుకుపోవలసిందే
నాలుగు రోజుల జీవితాన్ని పట్టుకు
లోకానికి వచ్చావు.
మట్టితో చేసిన బొమ్మవు నువ్వు
అద్దాలమేడలు కడతావు.
నువ్వు మట్టిలోనే కలవాల్సి వుంటుందని
నువ్వెప్పుడు ఆలోచించలేదు.
వెర్రివాడా...లోకమొక సత్రమే.
ఇది కొద్ది సేపటి తమాషానే
ఇది కొద్దిసేపటి వసంతమే
తుఫానొకటి కొట్టిందంటే
నీ ఈ తోటంతా నాశనమౌతుంది.
ఎప్పటికీ ఇక్కడే వుండాలనుకుంటున్నావు
నీకు ఇది తెలుసా?
వెర్రివాడా..లోకమొక సత్రమే.
లోకంఅంతా ఎగ శ్వాస ..దిగ శ్వాస
శ్వాసకెక్కడిది భరోసా?
గంట గంటకి గడియారం పిలుస్తుంది
స్పృహలోకి రా
దారినే నువ్వు గమ్యమనుకుంటున్నావు
ఆ గమ్యం నీకు దొరకదు
-ముళ్ళపూడి సుబ్బారావు

సునియో జీ అరజ్ మారియో


‘సునియో జీ అరజ్ మారియో ' 14 March at 20:21
(నా మొర వినిపించుకో ..ఓ ..నాన్నా)
‘లేకిన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన పాట.సంగీతం హృదయనాధ్ మంగేశ్కర్,సాహిత్యం గుల్జార్.
...
'రచన ' మాస పత్రిక వచ్చిన కొత్తలో ,ఒక నెల లో నండూరి పార్థసారథి 'లేకిన్ ' సినిమా పాటలనుసమీక్షించారు.ఆ సమీక్ష నన్ను చాలా ఆకట్టుకుంది.ఆపాటలున్న కేసెట్టు దొరకబట్టాను. దానికి రెండోవైపు 'రుడాలి ' సినిమా పాటలు.డబల్ ధమాకా అంటే అదేనేమో. కాసెట్టును అరిగిపోయేదాకా విన్నాను. రెండు సినిమాల సంగీతదర్శకులు నాకు కొత్తవారే. లేకిన్ సినిమాకు లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకుడు. రెండోదానికి 'భూపేన్ హజారికా 'సంగీత దర్శకుడు.ఒకరి పూర్వికులు మాండవీ నది పరిసరాలకి చెందినవారు.మరొకరు 'బ్రహ్మపుత్ర ' నది పరిసరాలకు చెందినవారు. రెండు సినిమాల నేపధ్యం రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతం. రెంటిలోను కథానాయిక 'డింపుల్ కపాడియా'నే. రెండు సినిమాలలోనూ గీతకారుడు 'గుల్జార్ ' కలం బలిమి ఉంది.
రెండిటి కథాబలానికి కారణం ఉంది.లేకిన్ సినిమాకు రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఒక కథ ఆధారం.రుడాలి సినిమా కు మహాశ్వేతాదేవి నవల ఆధారం.
లేకిన్ సంగీతం వింటుంటే పొద్దుజారే సమయంలో ఎడారిలో నిలుచున్నట్టుంటే , రుడాలి పాటలు వింటుంటే మధ్యహ్నవేళ ప్రచండమైన ఎడారి గాలులకు ఎదురు నిలిచినట్టనిపిస్తుంది.
లేకిన్ సినిమా 'ఫాంటసీ ' కథలా ఉంటూంది. ఒక సంస్థానానికి చెందిన వస్తువులు స్వాధీనం చేసుకోవటానికి ఒక ప్రభుత్వోద్యోగి వస్తాడు. అతనికి మాత్రమే కనిపిస్తూ ఒక స్త్రీ అప్పటికథను అతనికి 'చూపెడుతూ ' ఉంటుంది. సంఘటన జరిగేనాటికి ఉన్న వయసులోనే ఆమె ఆగిపోయింది. ఆమె కు సంబంధించినంతవరకూ కాలం ఆగిపోయింది. సంగీతం పాడటానికి వచ్చిన యువతిని,ఆమె చెల్లెల్ని ఆ సంస్థానాధీసుడు వాంఛించాడు.అక్క తప్పించుకోగగింది.దొరికిపోయిన చెల్లెల్ని ఆమె సంగీతగురువును సంస్థానాధీసుడు ఎనిమిదేళ్ళపాటు బందించాడు.ఆ ఎనిమిదేళ్ళు చెరలో పక్క గదిలో ఉన్న సంగీతగురువు నుండి సంగీతం నేర్చుకుంది.
ఆ బందిఖానా నుండి ఇంటికి తీసుకెళ్ళమని ఆమె ఎక్కడో ఉన్న తండ్రిని ప్రార్ధిస్తుంది.
ఆ సందర్భంలో పాట
“నా మొర వినిపించుకో ..ఓ ..నాన్నా!
వానా కాలం వచ్చింది..నన్ను ఇంటికి తీసుకొనిపో.. ఓ.. నాన్నా!
వానకు తడిసిన మన వాకిలి గురుతొస్తే
తడి ఆరి ఉన్న కళ్ళలో వడగాల్పు వీస్తుంది.
ఒంటరిగా శూన్యంగా ఉన్న కళ్ళ నుండి
నీళ్లు నదిలా ప్రవహిస్తున్నాయి.
ఎందుకు నీదగ్గరనుండి నన్ను పరదేశం పంపేశావు?
నాన్నా! నన్ను నీ దగ్గరకు పల్లకీ తెచ్చి తీసుకుపో
పంపు తండ్రీ...
మోయటానికి నలుగురినిచ్చి పల్లకీ పంపు తండ్రీ.”
-ముళ్ళపూడి సుబ్బారావు


డకియా డాక్ లాయా


డకియా డాక్ లాయా…. 12 March at 18:28
(పోస్ట్ మాన్ పోస్ట్ తీసుకు వచ్చాడు)
గుల్జార్ రచనను lakshmikaanth pyaarelaal స్వరపరచగా కిశోర్ కుమార్ పాడారు.సినిమాపేరు 'పల్కోమ్‌కి చావ్ మె ' (కనురెప్పల నీడల్లో ).
...
పోస్టు,పోస్ట్ మాన్,పోస్ట్ మాస్టర్ ,పోస్ట్ ఆఫీసు ....ఇందులో ఏమాటవిన్నా ఎన్నో ఉద్వేగాలు,ఏవేవో అనుభూతులూ గుర్తొస్తాయి.రవీంద్రుని 'పోస్ట్ మాస్టరు ' కథ, బాలగంగాధర తిలక్ కవిత ' తపాలా బంట్రోతు ' అసంకల్పితంగా గుర్తొస్తాయి.
టెలిఫోన్లు, ఇతర సమాచార వ్యవస్థ రాకమునుపు,ఇంచుమించు మధ్య తొంభైలవరకూ, సమాజాన్ని అనుసంధానించింది తపాలా వ్యవస్థే. అందులో పోస్ట్ మాన్ ముఖ్యమైన ఇంటర్ ఫేస్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పోస్ట్ మాన్ ఓ కుటుంబసభ్యునిలా మారిపోతాడు.
అతను దూరాల దారాల్ని విచిత్రంగా... ఒకేనిముషం ..అనే కండె చుట్టూ తిప్పగల నేర్పరి.. కూర్పరి.అతని మేజిక్ సంచిలో నిట్టూర్పులు,నవ్వులు,పువ్వులు,ఆనందాలు,అభినందనలు,ఏడుపులు..ఏ క్షణంలో ఏది తీస్తాడో ..ఆక్షణాన అతను రాజుతో సమానం.(ఈ వాక్యాలు తిలక్ వి)
ఈ సినిమాలో కథానాయకుడు ఒక వూరిలో పోస్ట్ మాన్ గా పనిచేస్తున్నాడు.సైకిల్ పై తపాలా తెస్తూ పాట పాడుతున్నాడు.అతని సైకిల్ బెల్లుకోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.కొన్నిసార్లు ఎదురు చూసిన వారికి నిరాశ,కొందరికి అనుకోని అదృష్టం,శుభాలు,అశుభాలు,కొన్నిసార్లు రెండు కలిసి.అతను పోస్ట్ తేవటమే కాదు..చదివిపెడతాడు..కొన్నిసార్లు లేఖకుడు కూడా. కొందరితో మేలమాడుతాడు.కొందర్ని ఆటపట్టిస్తాడు.ఆ వూరివాళ్ళతో హోలీ ఆడతాడు.
పాట అర్ధం దగ్గరదగ్గరగా
పోస్టు తిసుకొచ్చాడు
పోస్ట్ మాన్ పోస్టు తెచ్చాడు
ఒకసారి శుభవార్త ..ఒక్కోసారి దుర్వార్తలు
రాబోయే పున్నమినాడు
బావమరిది మేనల్లుడి మరదలు నిశ్చితార్ధం
మామ నిన్ను తీసుకెళ్ళటానికి రాలేకపోతున్నాడు
పిల్లలతో నువ్వు తప్పనిసరిగా రావాలి..
తాతయ్య ..అరెరె..తాతయ్య కాలధర్మం చెందారు..తాతమ్మ కి బాగోలేదు
అమ్మ గారి నాన్న కు సోమవారం తర్పణాలు
చిన్నవారికి ఆశీస్సులు,పెద్దలకు నమస్కారాలు
నా అసహాయత గమనించు..ఇది టెలిగ్రాము గా భావించు.
ఓ సోమనాథ్….నీ పెళ్ళికబురు తెచ్చాను
ఓ పోస్ట్ మాన్ అబ్బీ...
ఏమిటి?
ఆరునెలలయ్యింది అతను ఉత్తరం రాసి..
ఉత్తరం అతను రాయలేదా? ...చెప్పు ఏమి రాయను?
త్వరగా వచ్చేటట్టు రాయి.
విరహంతో రాత్రులు గడిపేదెట్లా?
వర్షం తడి తడి మాటలు చెబుతుంది
చినుకులు నిప్పుల్లా దహిస్తున్నాయి
నౌకరీ వదులుకుని తిరిగి వచ్చేయవా..
రావా ప్రియతమా...వైశాఖం వస్తుంది
ఓ మునియా!
హోలీ ఆడేవారూ...
ఈ కవరులో ఇంటినుండి రంగులుపంపారు
ప్రియుడు గులాల్ పంపాడు
కొందరికి పండగ రోజు
కొందరికి చెడ్డరోజు
నిమ్మోకు కడుపు పండింది
ఖైరూకు పళ్ళెం నిండింది

-ముళ్ళపూడి సుబ్బారావు




'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-49’
“రామయ్యా వస్తావయ్యా”10 March at 18:34
(శ్రీ 420 లో రఫీ,లతా మంగేష్కర్,ముఖేశ్ పాడిన పాట)
...
చార్లీచాప్లిన్ తరహా నటన తో, నెహ్రూ ఆలోచనలను గుర్తుచేసే కథనంతో రాజ్ కపూర్ తీసిన సినిమా’శ్రీ 420’. అంటే తెలుగులో ‘ఘరానా మోసకారి’ గా చెప్పుకోవచ్చేమో. వామ పక్ష మేధావి కె.ఎ.అబ్బాస్ రచన,సంభాషణల బలానికి ,రాజ్ కపూర్ ఆకర్షణీయమైన, సౌందర్యమయమైన చిత్రీకరణ తోడయ్యాయి.
కొన్ని విలువలు,చదువు ఉన్నసాధారణ నిరుద్యోగ యువకుడు అలహాబాద్ నుండి బొంబాయి కి తన ఆస్తి భుజాన వేసుకుని అదృష్టాని వెతుక్కుంటూ బయలుదేరాడు.చదువుకున్నవాడూ, నిజాయితీపరుడూ,కష్టపడిచేసేవాడూ ఐతే ఆ వ్యక్తికు బొంబాయి లో ఉద్యోగం దొరకదని కథ్హనాయకుడికి తొలిరోజే ఓ బిచ్చగాడు తెలియజెప్పాడు. జీవన ప్రవాహంలో ఎక్కడెక్కడ మునిగాడు ఎక్కడ తేలాడు, ఏవి పొందటంలో ఏవి ఫొగొట్టుకున్నాడు..అదే సినిమా కథ.
సినిమాలో అనేకం పోటీ పడతాయి.నైతికత-అనైతికత, నిజాయితీ-కపటత్వం, విద్య-మాయ,కలిమి-లేమి.. ఇలా.
కథానాయకుడు చాలా మందిని కలుసుకుని అనేక మజిలీలతోముందుకు సాగాడు.పైకొచ్చాననుకున్నాడు. ఎవరెవరిదగ్గర ఆసరా పొందాడో,వారంతా ఉన్నచోటే ఉన్నారు. అతను వారందరితో అనేక అనుభవాలు పొందాడు.నడిచొచ్చిన మార్గం తిరిగి చూసుకోవాల్సిన ఘడియ వచ్చింది. తనెక్కడుండాలో,తనకేది సరైన చోటో చివరకు తెలుసుకున్నాడు.ఆ తెలుసుకున్న క్రమంలో వచ్చే పాట 'రామయ్యా వస్తావయ్యా '.
ఈ పాట ప్రారంభంలో వినవచ్చే 'రమియ్యా వస్తావయ్య ' లా ధ్వనించే తెలుగు పదం తొలినాళ్ళలో దీనిపట్ల నా ఆకర్షణకు కారణం.బొంబాయి లో భవన నిర్మాణ కూలీలైన తెలుగు వాళ్ళ దగ్గర శైలేంద్ర ఈ పదం విని రాశాడంటారు.కొందరు శంకర్ జైకిషన్ ద్వయంలో తెలుగు వాడైన శంకర్ కారణంగా ఈ పదం కలిసిందంటారు.
తప్పిపోయిన గొర్రె, ప్రొడిగాల్ సన్ వంటి క్రైస్తవ గాథల్ని తలపింపజేసే సంఘటనతో పాట నడుస్తుంది.తను వదులుకు వెళ్ళింది వెతుక్కుంటూ రాజు (రాజ్ కపూర్) వెనక్కి వస్తున్నాడు. అతని పాత స్నేహితులు అతన్ని 'వస్తావయ్యా ' అని పిలుస్తున్నారు.
అంతకు ముందు అతన్ని అమ్మలా ఆదరించిన స్త్రీమూర్తి అతన్ని తిరిగి అక్కున జేర్చుకుంది.అక్కడ సాగే పాట తోపుడు బండి,జట్కా, సైకిల్ మీదా ప్రయాణిస్తూ అతనికి మనసిచ్చిఉన్న స్త్రీ దగ్గరకు చేరింది.ఆమే పదం కలిపింది.
పాట అర్ధం సుమారుగా
“రామయ్యా వస్తావయ్యా
నా మనసు నీకు ఇచ్చేసా
ప్రేమకాంతి నీ కళ్ళలో ఉండేది.
నీ కళ్ళలో ఇలాంటి లౌక్యం ఉందేది కాదు.
నువ్వు అప్పటి వాడవు కాదు, నీ మనసూ అప్పటిది కాదు
నీ మనసులో ఈ తీయని కత్తి అప్పుడు లేదు.
నేను దుఃఖ పడితినేమి
పశ్చాత్తాప పడితేనేమి
నా మనసు నీకు ఇచ్చేసా
నీ ఆ పరదేశంలో
వెండి బంగారాలకు మనసు అమ్ముడౌతుంది
ఈ పల్లెలో, బాధనీడలో
ప్రేమ పేరు వింటునే గుండె కొట్టుకుంటుంది.
చంద్రునితొ చుక్కలతో
ఈ రాత్రి పాటలతో గడవనీ
నా మనసు నీకు ఇచ్చేసా
జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయి, మనసు దుఃఖ పడుతూనే ఉంది
మనసును సముదాయించటం తెలియట్లేదు నాకు
నువ్వు రాక పోతేనేమి,మరచిపొతేనేమి
ప్రేమించి మరచిపోవటం తెలియట్లేదు నాకు
ఇక్కడికి దూరం నుంచి కూడా
నువ్వు అప్పుడప్పుడూ చెబుతూనె ఉన్నావు
నా మనసు నీకు ఇచ్చేసా
అవే దారులు, వారే ప్రయాణీకులు
ఒక తార మాత్రం ఎక్కడ దాక్కుందో తెలియట్లేదు
లోకం అదే, లోకులూ వారే
ఎవరికి మాత్రం ఏం తెలుసు ఎవరి ప్రపంచం ధ్వంసం అయ్యిందో?
నా కళ్ళలో జీవిస్తానని
నాతో చెప్పినవారెవరో
నా మనసు నీకు ఇచ్చేసా”

-ముళ్ళపూడి సుబ్బారావు



'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-48’
‘అబ్ తో హై తుమ్ సే హర్ ఖుషి అప్ని’ 6 March at 20:21
(ఇప్పుడు నా ప్రతీ సంతోషమూ నీతోనే).
‘అభిమాన్’ సినిమాలోలతా మంగేష్కర్ పాట. సంగీతం ఎస్.డి.బర్మన్,మజ్రూహ్ సుల్తాన్ పురి రచన.
"ఇవ్వటమంటూ చేస్తే నన్ను నేను మొత్తంగా ఇచ్చుకుంటాను" అంటాడు అమెరికన్ రచయిత ‘ వాల్ట్ విట్ మాన్ ‘తన రచన 'సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్' లో.
...
'అబ్ తో హై తుమ్ సే హర్ ఖుషి అప్ని ' పాట వింటుంటే పాడే ఆమె తనది అలాంటి అర్పణే అని చెప్పుతున్నట్టుంది.
'అభిమాన్ ' సినిమా రిలవెన్స్ ఇప్పటి సమాజంలో మరీఉందనిపిస్తుంది.దంపతులిద్దరూ ఫైనాన్షియల్ ఇండిపెండెంన్స్ తో ఉండటం, ఒకే రంగంలో పోటీపడాల్సిరావటం ఇవన్నీ సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. అదే గ్లామర్ ఫీల్డ్ లోనైతే మరింత ఎక్కువ.ఒకప్పుడు చాలా కొద్దిమంది అనుభవం ఇప్పుడు మెజారిటి కి అనుభవమౌతూ ఉంది.
ప్రాధాన్యాల ఎంపిక, దేనికోసం దేనిని వదులుకోవాలి అనే వాటిలో ఎవరి విజ్ఞత వారిదే.
గాయకుడిగా ఉన్నతస్థితిలోఉన్న హీరో, సంగీతంలో ప్రవేశం ఉన్న అమ్మాయిని ఇష్టపడి పెళ్ళి చెసుకున్నాడు. ఆమేను గాయనిగా ప్రోత్సహించాడు.ఆమె తనకన్నా ఎదుగుతుంటే తట్టుకోలేకపోయాడు.ఆమెను దూరంచేసుకున్నాడు.అంతర్మధనానికి లోనయ్యాడు.పశ్చాత్తాపపడ్డాడు.అహాన్ని గెలిచాడు.తిరిగి ఆమెకు దగ్గరయ్యాడు.
'అభిమాన్ ' సినిమా చూసినపుడల్లా బాధపెడుతూనే ఉంటుంది.తన బాధకి కారణమైనదాన్ని గుర్తించలేక ఒక రకంగా స్వయం హింసకు గురయ్యే కథానాయకుడు, తన ప్రమేయం లేకుండానే బాధించబడే కథానాయికలకు పట్ల ప్రేక్షకులకు సానుభూతి కలుగుతుంది.

ఎస్.డి.బర్మన్ సంగీతం హీరో,హీరోయిన్లతో సమానమైన పాత్ర సినిమాలో పోషించింది.అన్ని పాటలూ శ్రవణానందం కలిగించేవే.ప్రత్యేకంగా 'అబ్ తో హై తుం సే హర్ ఖుషీ అప్ని"పాట వింటున్నా, చూస్తున్నా మనసు ఆర్ధ్రమౌతుంది.లతా మంగేష్కర్ స్వరం, ప్రేమ,బాధ,నిష్టూరం..వీటన్నిటినీ పలికిస్తుంది.మధ్యలో వచ్చే సంగీతం,హృదయ స్పందనల్ని బైట వినిపిస్తున్నట్టనిపిస్తుంది. ఇ.సి.జి. గ్రాఫు నో,మోనిటర్నో చూస్తున్నట్టనిపిస్తుంది. కథ సుఖాంతమౌతుందని తెలిసినా....ఆ క్షణపు బాధ భరించాల్సిందే.
ఇప్పుడు నా ప్రతీ సంతోషమూ నీతోనే
నీకై మరణించటమైనా అదే నా జీవితం
నీకోసం నా మనసు పిచ్చిదయ్యాక
లోకం నా గురించి ఏమనుకున్నా నాకు లెక్కలేదు.
ఎవరు నా గురించి ఎన్ననుకున్నా..
నీ ప్రేమలొ నేను పడ్డ అపవాదు ఎంత దూరమో పాకింది
ప్రియా…. నీతో అంతే కీర్తినీ పొందాను.
నీ పై ఈ మైకం ఎక్కడిదాకా తీసుకెళుతుందో చూద్దాం.

-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-47’

చాంద్ మేరా దిల్,చాందినీ హో తుమ్..4 March at 19:02
(నా హృదయం ఒక చందమామ,నువ్వు వెన్నెలవు)
'హం కిసీ సే కమ్ నహీ ' సినిమాలో ఒక మెడ్లీ. మహమ్మద్ రఫీ,కిశోర్ కుమార్,ఆర్.డి.బర్మన్,ఆశా భోంస్లే పాడిన పాట.సంగీతం ఆర్.డి.బర్మన్.రచన మజ్రూహ్ సుల్తాన్ పురి.
...
నాసిర్ హుసేన్ నిర్మాత,దర్శకుడిగా మూడు దశాబ్దాల పాటు సినిమాలు తీసాడు. తన చిత్రాలలో పాటలు పట్ల చాలా శ్రద్ధ పెట్టేవాడు.ఎనభైల మొదట్లో వచ్చిన 'జమానేకో దిఖానా హై' వరకూ అన్నీ సినిమాల్లోనూ పాటలు హిట్లే.అతని సినిమాల మరో ప్రత్యేకత, చాలా సినిమాల్లో ఒకే పాట రెండేసి వెర్షన్లు ఉండటం. చిన్నప్పుడు పాడిన పాట పెద్దయ్యాక పాడటమో, హీరో పాడిన పాట మరోసారి హీరోయిన్ పాడటం ..ఇలా. ఐతే ఆ తరహా పాటలన్నీ సక్సెస్ అయ్యాయి.
అతని 'యాదోంకి బారాత్ ' సినిమా సూపర్ హిట్ అయ్యింది.అందులో నేపధ్యం-నగరవాతావరణం, ధనిక వర్గాల జీవిత చిత్రణ,క్లబ్ సంస్కృతి,అందులో గిటార్ తో పాటలు పాడే హీరోలు,విదేశాలనుండి వచ్చే హీరో/హీరోయిన్లు .
అలాంటి నేపధ్యంతోనే అతని మరో సినిమా 'హం కిసీ సే కమ్‌నహీ' తీశాడు.(1977).
మ్యూజికల్ హిట్ అని చెప్పటానికి ఒక ఉదాహరణగా ఈ సినిమా నుచెప్పవచ్చు.అందమైన, రంగురంగుల,పరిమళభరిత పుష్పాలను ఒక చోట అమర్చితేఅది ఫ్లవర్ బొకే అవుతుంది.అలాంటి పాటల్ని ఒకే చోట చేర్చితే అది 'హమ్ కిసి సె కమ్ నహీ' అవుతుంది.
బాల్యంలో స్నేహాన్ని,బాసల్ని గుర్తుచేసే నాసిర్ హుసేన్ ట్రేడ్ మార్క్ లాంటిశ్రావ్యమైన పాట 'క్యాహువా తేరా వాదా',రోడ్ సాంగ్స్ లాంటి రెండు డ్యూయెట్లు (యే లడకా హాయ్ రే అల్లా,హం కో తో యారా తేరీ ), ఒక ఖవాలీ(హై అగర్ దుష్మన్), డాన్స్ తో స్టేజ్ సాంగు (బచనా యే హసీనో) ఇంకా ప్రత్యేకమైన ఒక మెడిలీ (మెడ్లీ)..నాలుగు వేరు వేరు పాటలనదగిన వాటిని ఒకటిగా గుదిగుచ్చి దానికీ రెండు నిముషాల సంగీతాన్ని కలిపి సుమారు 10 నిముషాలు సాగే 'చాంద్ మేరా దిల్ ' అంటూ మొదలయ్యే పాట..వేటికవే అన్నీ మనోరంజకమైనవే.
సినిమాలో పాటలు వేటికవే 'హం కిసీ సే కమ్ నహీ '(మేమెవరికంటేనూ తక్కువ కాదు) అన్నట్టుంటాయి.
'చాంద్ మేరా దిల్ ' పాట ఇద్దరు హీరోలమధ్య సాగే సంగీత/నృత్య పోటీ నేపధ్యంలో వస్తుంది.
కొంత సేపు సంగీతం,తర్వాత మెలోడియస్ గా రఫీ స్వరంతో గుతుంది.
కొనసాగింపుగా మరో బాణీ లో కిశోర్ కుమార్ స్వరంతో 'ఆ దిల్ క్యా మెహఫిల్ హై తెరీ ' మొదలౌతుంది.
వెంటనే ఆర్.డి.బర్మన్ గొంతుతో వేరే బాణీ తో 'తుమ్ క్యా జానొ మొహబ్బత్ క్యా హై ' .
ఆపై లతా మంగేష్కర్ పాడే మరో చరణం ఇంకో బాణీ లో 'మిల్ గయా ..హం కో సాథీ. తర్వత రెండు నిముషాలు సంగీతం.
సినిమా గా కాకుండా ఒక సింగింగ్ కాంపిటీషన్నో,డాన్స్ కాంపిటిషన్నో నిజంగా చూసిన అనుభూతి ఈ పాట అప్పుడు కలగజేసింది. .హిందీ పూర్తిగా అర్ధం కానీ,వాడుకలో లేని ప్రాంతం లోని చిన్న పట్టణాలలో సైతం కాంపిటీషన్ సాంగుకు ప్రేక్షకులు ఈలలతో,చప్పట్లతో హోరెత్తిస్తూ ఆనందించటాన్ని చూడటం ఒక అనుభవం

-ముళ్ళపూడి సుబ్బారావు



'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-46’'మైనే పూచా చాంద్ సే ' 3 March at 13:02
“మీర్ కీ ఘజల్ కహూ తుఝే మై, యా కహూ ఖయాం కీ రుబాయీ”
(నిన్ను మీర్ రాసిన ఘజల్ అందునా,లేక ఖయ్యాం రాసిన రుబాయీ అందునా?)
...
మహమ్మద్ రఫీ పాడిన 'మైనే పూచా చాంద్ సే " పాటలో భాగం.సినిమా పేరు 'అబ్దుల్లా'
ఏలూరులొ కలెక్టరు ఆఫీసు పక్కనున్న గ్రౌండు లో ప్రతీసంవత్సరం పారిశ్రామిక/వ్యవసాయ ప్రదర్శన పేరు తో 'ఎగ్జిబిషన్ ' జరిగేది.చుటుపక్కల వూర్లకు అదో పెద్ద ఆకర్షణ.80లో కాలేజిలోజేరినాక తొలిసారి ఎగ్జిబిషన్ చూసాను. బాగా గుర్తుండిపోయింది మాత్రం అక్కడ చూసిన మ్యూజికల్ నైట్. సినిమాలోనో,రేడియోలోనో మాత్రమే విన్న గాయకుడిని ప్రత్యక్షంగా తొలిసారి చూడటం. ఆ గాయకుడు కె.బి.కె.మోహన్ రాజు.అతను పాడింది ఒక హిందీ పాట. ఆ పాట 'మైనె పూచ చాంద్ సే కి దేఖ్ హై కహి '.ఒరిజినల్ గా పాడింది మహమ్మద్ రఫీ( ఆ సంవత్సరమే రఫీ కాలం చేశాడు).
ఆ సినిమా నిర్మాతా దర్శకుడూ కథానాయకుడు 'సంజయ్ ఖాన్ '.అబ్దుల్లా సినిమాను చాలా ఇష్టంగా తీసాడంటారు.మధ్యయుగాలనాటి,అరబ్బీ ప్రాంతపు నేపధ్యంలో సినిమా సాగుతుంది.అందులోనూ మతసామరస్యాన్ని ప్రబోధిస్తాడు. అబ్దుల్లా పాత్ర సీనియర్ నటుడు'రాజ్ కపూర్ ' ధరించాడు.పెద్ద తారాగణం, మంచి పాటలు (మైనే పూచా చాంద్ సే (రఫీ),యే ఖుదా హర్ ఫైస్లా (కిశోర్ కుమార్),భీగా బదన్(ఆశా భోంస్లే) వంటివి వున్నా సినిమా జనాన్ని రంజింపజేయలేదు.
ఐతే ఇప్పటికీ ఈ సినిమా అంటే గుర్తొచ్చేది రఫీ పాడిన 'మైనే పూచా చాంద్ సే ' పాటే.రఫీ రెండిషను,ఆనంద్ బక్షి సాహిత్యం,ఆర్ డి బర్మన్ సంగీతం, ఎప్పుడు విన్నా చివరిదాకా వినాలనిపించేలా చేశాయి.
ముఖ్యంగా చివరి చరణం ' మీర్ కీ ఘజల్ కహూ తుఝే మై, యా కహూ ఖయాం కీ రుబాయీ ' బాగా నచ్చుతుంది. మీర్ తఖి మీర్ గజళ్ళు, ఒమర్ ఖయ్యాం రుబాయీ పట్ల ఆసక్తి పెరగటానికి ఈ పాట కొంత కారణమయ్యిందేమోననిపిస్తుంది. ఆరకంగా ఈ పాటకు నేను ఋణపడినట్టే.
“చంద్రుడిని అడిగా
ఎక్కడైనా చూసావా
నా ప్రేయసి వంటి అందాన్ని?
చంద్రుడు అన్నాడు
వెన్నెల మీద ఒట్టు..ఉహూ..లేదు.
ముసుగులో ఉన్న నీకై వెతికాను
ప్రతిచోటా నీ యవ్వనాన్ని వెతికాను
మొగ్గలను నీతోపోలికా అని అడిగాను
పువ్వుల్లో నీ సరి ఉందా అని వెతికాను.
తోటను అడిగా
గగనంలో,ఇలలోనూ
ఇలాంటి కుసుమం ఉందా ఎక్కడైనా?
తోట అన్నది
ప్రతీ మొగ్గ మీద ఒట్టు...ఉహూ..లేదు.
అవి నడకలా? అలల కదలికలా?
అవి కురులా ? నిశీధి కథలా?
అవీ అధరాలా? కలువ రేకులా?
అవి కన్నులా? మధుశాల పాలికలా?
మధుపాత్రని అడిగాను
గగనంలో,ఇలలోనూ
అలాంటి మధువు ఉందా ఎక్కడైనా
మధుపాత్ర అన్నది
మైకం మీద ఒట్టు...ఉహూ..లేదు.
నువ్వు పొందిన ఈ అందం మేరా
దేవుడు తన దైవత్వాన్ని పోగోట్టుకున్నాడు.
నిన్ను మీర్ రాసిన ఘజల్ అందునా
లేక ఖయ్యాం రాసిన రుబాయీ అందునా?
కవులనడిగా
అలాంటి కవిత ఉందా ఎక్కడైనా
కవులు చెప్పారు
కవిత్వం మీద ఒట్టు..ఊహూ...లేదు.”
-ముళ్ళపూడి సుబ్బారావు




'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-45’
‘యె రాతే యె మౌసమ్ యె హస్నా హసాన”28 February

(“ ఈ రాత్రులను,ఈ ఋతువులను ,ఈ నవ్వుల్ని,ఈ సంతోషఘడియల్ని)
గానం, సంగీతం 'పంకజ్ మల్లిక్ ',ప్రయివేట్ పాట.
...
లతామంగేష్కర్ 93/94(?) ప్రాంతాలలో సంగీతరంగంలో కొందరు ప్రముఖులకు శ్రద్ధాంజలి ఘటించదలచింది. అందులో కొందరు ఆమె ముందు తరం వారు,కొందరు సమకాలికులు.కీర్తి ని శేషంగా మిగుల్చుకున్నవారు.వారిలో కుందన్ లాల్ సైగల్,పంకజ్ మాలిక్,హేమంత్ కుమార్,తలత్ మొహమూద్,ముకేశ్,రఫీ,కిశోర్ కుమార్ లు ఉన్నారు.
‘శ్రద్ధాంజలి’ పేరు తో వచ్చిన కాసెట్లలో లో పై గాయకులు పాడిన పాటలు లతామంగేష్కర్ తిరిగి పాడింది.సైగల్,పంకజ్ మాలిక్ పాడిన పాటలు లతామంగేష్కర్ గొంతుతో క్వాలిటీతో కూడిన రికార్డింగుతో విన్నాక ఆ గాయకులు ఒరిజినల్ గా పాడిన తిరిగి విన్నాను.
ఆ పాటలు అప్పటివరకూ మరీ ఆకర్షింపకపోవటానికి కారణం ముఖ్యంగా క్వాలిటీ లోపం. ఆ రత్నాల మెరుపును వాటిపై పడ్డధూళి కప్పేసింది.మెరుగైన టెక్నాలజీ ఉపయోగించి అప్పటి పాటల్లో ఉన్న డిస్టర్బెన్స్ ను తీసేయగలిగితే వాటిలో చాలా వరకూ మణిపూసలే.
ఆ పాటల్లో మిగతావారి పాటలు ఎపుడో ఒకప్పుడు చెవిన పడినవే కాని’ పంకజ్ మాలిక్ ‘ పాట లతా మంగేష్కర్ ద్వారానే వినటం.ఆ పాట ‘'యే రాతే,యే మౌసం,యే హసనా హసానా '.
అంతకు ముందు పంకజ్ మల్లిక్ ను సంగీత దర్శకుడుగానే విని ఉన్నాను.40 దశకంలో గాయకులైన కుందన్ లాల్ సైగల్ గురించి కొద్దిగా,పహారి సన్యాల్ పేరు మరీ కొద్దిగా విన్నాను.
గాయకుడుగా సైగల్,సంగీతకారుడుగా పంకజ్ మల్లిక్ గొప్పగా వెలిగారు.వారిద్దరి కాంబినేషన్ గురించి ఒకమాట.పంకజ్ మల్లిక్ ను సైగల్ గురించి అడిగితే 'సైగల్ తో నేను జీవించాను ' అన్నాడట..
(భజన సంప్రదాయానికి,జానపద రీతులకు సంబంధించినదైన బెంగాలీ సంగీతాన్ని రవీంద్రనాథ్ టాగోర్ ఆధునీకరించగా ,దానిని మెరుగు పెట్టినవారిలో ఒకనిగా పంకజ్ మల్లిక్ ను చెబుతారు..ఆధారం నండూరి రామమోహన్ రావు 'స్వర శిల్పి 'వ్యాసం. )
పంకజ్ మాల్లిక్ స్వయంగా పాడిన పాట‘'యే రాతే,యే మౌసం,యే హసనా హసానా ' విన్నాను. అదృష్టవశాత్తూ నాకు దొరికిన పాట ఎవరిద్వారానో 'రెస్టొరేషన్ ' చేయబడ్డదనుకుంటా.మంచి నాణ్యతతో ఉంది.మార్దవమైన గొంతు,జోలపాటో,లాలి పాటో విన్నట్టు తన్మయం కలిగింది. ఆ పాట సినిమాపాట కాదు.ఒక ప్రయివేటు పాట. (ఇలాంటిదే మరో అనుభవం నీరాజనం సినిమాలో తొలి(?) తెలుగు ప్లే బాక్ గాయకుడు ఎం.ఎస్.రామారావు పాడిన 'ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో ' పాట విన్నపుడు కలిగింది.)
ఇప్పుడు వినబోయేది పంకజ్ మల్లిక్ స్వరంతో ఆ పాతపాట .
పాట అర్ధం రమారమీ:
“ ఈ రాత్రులను,ఈ ఋతువులను
ఈ నవ్వుల్ని,ఈ సంతోషఘడియల్ని
నన్ను మరువు కాని వీటిని మరువవద్దు
మత్తైన చూపులు,కదలికలు
నీ కాటుక కళ్ళలో నిండిన నల్లమబ్బులను
ఈ గాలి...ని పెదాలమీద తేలివచ్చే నిశ్శబ్ద రాగాలను
నన్ను మరువు కాని వీటిని మరువవద్దు
మనకలయికల్ని కథలుచేసిన ఈ వనాలను
నా ప్రేమ,నీ యవ్వనం
మన ఇరువురి వేడైన శ్వాస ఒకటైన వేళ
ఈ మేఘ చలనాలు,వర్ష బిందువుల నర్తనాలు
ఈ మత్తుగొలిపే స్థితిని,మనని మనం మరచిన కాలాన్ని
మనం కలసితీసిన రాగాలను....
నన్ను మరువు కాని వీటిని మరువవద్దు”
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-44’
..'కస్మె వాదే pyaar వఫా sab.baate హై బాతోమ్ కా Kyaa? 26 February
(ఒట్టు పెట్టటం,ప్రతిజ్ఞలు,ప్రేమ,నమ్మకం
ఇవన్నీ మాటల్లో వచ్చే మాటలే(నిలబడేవికావు))
రైతుబిడ్డ(1970) సినిమాలో రామారావు ఇంటిబాధ్యత వహించే అన్నపాత్ర వేశాడు. కుటుంబానికి ఉపయోగపడ్డాడు.ఊర్లోవారికి ఉపయోగపడ్డాడు.
‘ఎవరినుంచి పొందామో వాళ్ళను క్షమించటం కష్టం ‘ అంటారు.
అలాంటివారిని ఎక్కువకాలం భరించటం లోకానికి కష్టమే. అందుకే వదిలించుకునే ప్రయత్నం చేస్తారు.
.
చుట్టుముట్టిన పరిస్థితులు అతన్ని ఊరిబైటకు తోవచూపాయి.అలా పోతున్న వానిని ముందునుంచీ చూస్తున్న వ్యక్తి వున్నాడు.అతనికి లోకరీతి ముందే తెలుసుకుని లోకాన్ని రోసిఉన్నాడు. ఆతనొ పాట పాడుతున్నాడు. ఆ పాట “మనిషిని నమ్మితె ఏముందిరా…మబ్బును నమ్మినా ఫలితముందిరా..”
తర్వాత ఐదేళ్ళకు(1975/76)లో కృష్ణ ‘పాడిపంటలు ‘ సినిమాలో ఇంచుమించు అదే పాత్ర వేశాడు.లోకచేతిలో దెబ్బతిని బంజరు బాగుచేయటం మొదలుపెట్టాడు.అతన్ని,లోకాన్ని బాగా చూసిఉన్న కాలు పోగొట్టుకున్న ఓ మాజీ సైనికుడు పాడుతున్నాడు.ఆ పాట “నీతీ న్యాయం మంచి మమత ..అన్ని నీటి మీది రాతలురా..అనుబంధాలు,అభిమానాలు ..అన్ని గాలి mootalu raa “
మరో ఐదేళ్ళకు ‘ఉప్ కార్ ‘అనే హిందీ సినిమా చూశాను.’మిస్టర్ భరత్ ’ మనోజ్ కుమార్ అదే అన్నపాత్రలో. ఫైన చెప్పిన రెండు సినిమాలపైనా ఈ ఉప్ కార్ సినిమా ప్రభావం ఉండి.రైతుబిడ్డలో కొద్దిగా.. పాడి పంటలు పైన ఎక్కువగా.
జై జవాన్ జై కిసాన్ స్లోగన్ స్పూర్తిసినిమా అంతటాకనపడుతుంది. తూర్పు అన్నయ, పడమటి తమ్ముడు..వ్యక్తిత్వాలవిబేధం,కుటుంబబంధాల్లో సంఘర్షణ ..ఇవన్నీ కథానాయకుణ్ణి ఒంటరిని చేశాయి.అతనికి తోడునిలిచిన వ్యక్తి ఓ మాజీ సైనికుడు.యుద్ధంలో కాలు పోగొట్టుకుని ఉన్నాడు.అతను పాడే పాట ..'కస్మె వాదే pyaarవఫా sab బాత్ హై బాతోమ్ కా kya'
విలన్ గా లబ్దప్రతిష్టుడైన ప్రాణ్ తర్వాత రోజుల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చిత్రప్రేమికులకు మరింత చేరువయ్యాడు.చాలా సినిమాలో హీరోకు సమానమైన పాత్రలు వేశాడు. దీనికి పునాది వేసిన సినిమా ఉప్ కార్ '. ఇందులో ప్రాణ్ మాజి సైనికునిగా హీరో కు ఆసరాగా నిలిచే పాత్ర ధరించాడు. ప్రాణ్ పై తొలిసారిగా పాట చిత్రీకరణ జరిగింది దీనితోనే.తర్వాత అనేక పాటలు అతనికోసం ప్రత్యేకంగా రాయబడ్డాయి,తీయబడ్డాయి.
హిందీపాటల్లోనూ,కల్యాణ్ జీఆనంద్ జీస్వరపరచిన పాటల్లోనూ,మన్నాడే ఆలపించినపాటల్లోనూ ఎంపికచెయ్యబడే ఈ పాట వెనుక ఆసక్తిగొలిపే అంశాలున్నాయి.ప్రాణ్ పై ఈ పాట చిత్రీకరిస్తామంటే సంగీత దర్శకులు ససేమిరా అన్నారు.వారిని ఒప్పించి కిశోర్ కుమార్ ను పాడమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు.సినిమా కు నిర్మాత ,దర్శకుడు,కథానాయకుదూ ఐన మనోజ్ కుమార్ పట్టువదలలేదు. మన్నాడే తో ఈ పాటను పాడించి ప్రాణ్ పై చిత్రీకరించాడు.( పాట రచన ఇందీవర్)
సంగీత దర్శకద్వయం కల్యాణ్ జి అనంద్ జీ లలో ఎవరిమాటలో తెలియదు కాని వారు పాటలో నటించిన ప్రాణ్ కు గొప్ప కితాబు ఇచ్చారు.తమ పాట కు పెదవుల కదలిక గాక,హృదయపు కదలికల ద్వారా...చిత్రీకరణలో మెడపైని కండరాల కదలికలు చూపుతు ప్రాణ్ పాటకు ప్రాణ ప్రతిష్ట చేశాడని చెప్పారు.
“ఒట్టు పెట్టటం,ప్రతిజ్ఞలు,ప్రేమ,నమ్మకం
ఇవన్నీ మాటల్లో వచ్చే మాటలే(నిలబడేవికావు)
ఎవరికెవరూ ఉండరు..అన్నీ అబద్ధాలే
బంధుత్వాలన్నీ వట్టివే
దేవుడు ఎదురుగా వున్నా
అప్పటికీ నిన్నెవరూ కాపాడలేరు.
నీ సొంత రక్తమే చివరికి నీకు చిచ్చు పెట్టింది
ఆకాశంలో విహరించేవారైన..మట్టిలో కలవాల్సిందే.
సుఖాలలో ఉన్నంతవరకూ అందరూ వెంటనడుస్తారు.
కష్టాలలో అందరూ ముఖం చాటేస్తారు.
లొకులంతా నీవారూ ఔతారు..నీహృదయాన్ని ముక్కలూ చేస్తారు.
భగవంతుణ్ణే మోసంచేసేవారు మనిషిని వదులుతారా?
ఇది హిందువు చేసిన పనే ఐతే ..దేవాలయాన్ని దోచిందెవరు?
ఇది ముసల్మాను పనే ఐతే...ఖుదా మందిరమెందుకు ముక్కలయ్యింది?
దీనిని ఆమోదించింది మతమే ఐతే అది మతమెందుకు ఔతుంది?”
--ముళ్ళపూడి సుబ్బారావు

Tu kaha ye batas


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-43’'తూ కహా ఏ బతా ..ఇస్ నషీలీ రాత్ మే'  24 February
'చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని '
...
కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట విన్నప్పుడు బాగున్నట్టు అనిపించి ఏదో పాత పాట జ్ఞాపకాల్లో మెదిలీమెదలక ఉండిపోయింది.అదే పాట టీ వీ లో చూశాక మళ్ళీ ఎక్కడో కదలిక.అలాంటిదే ఎక్కడో విన్నట్టు…….సన్నటి తీగల అరిసెలపాకంలా తీయగా సాగిన రఫీ గొంతు,ఎస్.డి.బర్మన్ సంగీతం , ఆపై లవర్ బాయ్ గా దేవానంద్ అభినయం ..ఇంకా... విలక్షణమైన నూతన్అందం ఇవన్నీ గుర్తొచ్చాయి..... ఆ పాట 'తూ కహా ఏ బతా ..ఇస్ నషీలీ రాత్ మే' .(సినిమా 'తెరె ఘర్ కె సామ్‌నె ' పాట రచన హస్రత్ జైపురి)
నిద్ర పట్టి పట్టని సమయంలో పక్కింట్లోనుంచి ఛాయాగీత్ ప్రోగ్రాం లాంటి దాన్నుంచి వచ్చే ఈ పాట వింటుంటే చిరు చలిలో,వెన్నెట్లో ఖాళీ ఐన పట్నపు వీధుల్లో ఇధమిద్ధంగా తెలియని దేనికోసమో తిరుగాడుతున్నట్టు..కళ్ళకు రంగులేవీ కనపడకుండా నలుపు తెలుపు సినిమాలా పరిసరాలున్నట్టు ...రఫీ గొంతు తోడుగా వస్తున్నట్టు...
పాట చిత్రీకరణ ఆహ్లాదకరంగా సాగుతుంది.కథ్హనాయకుడు ప్రేయసి జాడకోసం పొద్దు పోయాక రాత్రివేళలో నగరపు వీధుల్లో తిరుగాడుతున్నాడు.నిద్రలో సోలిపోబోతున్న వీధిని తన పాటతో విసిగించాడు.కొందరు కోపగించారు.ఒకతను ప్రేమబిక్షగాడిని నిజమైన బిక్షగానిగా తలచాడు.ఎదురైన ప్రేమ జంట అతని బాధను అర్ధంచేసుకున్నట్టున్నారు. మొత్తంమీద అతను కార్యసాధకుడయ్యాడు.
“ఈ మత్తుగొలిపే రాత్రిలో నువ్వెక్కడున్నవో అది చెప్పు
ఉన్మత్తమైన మనసు నా మాట వింటేనా?
ఈ పరిసరాలు చిలిపివైనవి
ప్రతి చోటూ అందంతో నిండి ఉంది.
నాnitturpula nuMDi వచ్చిన మేఘాలు నలువైపులా కమ్ముకున్నాయి.
నా ప్రియా..నా గుండెను మండించకు ...నువ్వెక్కడ?
చల్లగా వీచే చిరుగాలిని
నీ జాడ నేనడిగా..
నన్ను మరింత అలజడిలో ముంచి అది తప్పించుకుంది.
ప్రేమతొ నన్ను శిక్షించు...నువ్వెక్కడ?
తారలు, చంద్రుడు విన్నారు
ఈ వసంత కాలం వింది
నా వేదనాగీతాన్ని,రహదారులు విన్నాయి.
ప్రియా..నువ్వూ విను ..ఇప్పుడే రా..నీవెక్కడా?
ప్రేమ శక్తిని చూడు
ప్రేమవత్తిడితో నువ్వొచ్చావు.
నేడు నేను కోరిన దారి దొరికింది.
ఎందుకు దాగుతావు.ఒక సారి కనిపించు...నీవెక్కడ?
-ముళ్ళపూడి సుబ్బారావు




'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-42’
'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా '22 February

 (ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది).'హకీకత్ ' సినిమాలో పాట.
యుద్ధం తాతయ్య గారని ఒకాయన మా చిన్నతనంలో వుండేవాడు.మిలటరీ లో పనిచేసి రావటంవల్ల ఆయనకాపేరు. భజన కార్యక్రమాల్లో హార్మొనీ వాయించేవారు.చనిపోయేదాకా తాడిచెట్టులా ఏ మాత్రం వంగకుండా వున్నాడు. మామ వరసయ్యే మరొకాయన మిలటరీ లో పనిచేసి మా వూహ తెలిసేసరికి ఆర్ టి సి లో డ్రైవరు గా కుదురుకున్నాడు.మావూర్లోనే పనిచేసే ఫారెస్ట్ ఉద్యోగికొడుకొకాయన అప్పటికి మిలటరీలో పనిచేస్తూ సెలవలకు మా వూరొచ్చేవాడు.ఆయన సాహసాలు వినటానికి,అతనుతెచ్చే మిలటరి నేపధ్యపు తెలుగు మాగజైనుకోసం అతని చుట్టూ మూగేవాళ్ళం.
ఇంట్లోంచి పారిపోయి గుంటూరెళ్ళి యుద్ధంలో చేరిపోవటం గురించి పెద్దాళ్ళు అనుకునేవారు.సైన్యానికి సంబంధించి నా జ్ఞాపకాలు ఇవి.
వివిధభారతిలో సాయంత్రం 7.05నిముషాలకు 'జయ్ మాల 'పేరుతో సైనికులకోసం ప్రత్యేకంగా పాటల ప్రోగ్రాం వస్తుండేది. కాలేజి రోజుల్లో మెస్ కు వెళ్ళేప్పుడో ,వచ్చేప్పుడో దారిలో ఇళ్ళనుండి ‘జయ్ మాల’ ప్రోగ్రామ్ ట్యూన్ వినవచ్చేది. డ్రమ్ముల శబ్దం,మార్చింగు తరహా సంగీతంతో ఆకర్షించేది.
ఆ కార్యక్రమం లో సైనిక నేపధ్యపు పాటలు వచ్చేవి.చాలా పాటలు రిపీట్ ఔతుంటాయి. అలా విన్న పాటల్లో మెల్ల మెల్లగా మనసుకు దగ్గరైన ఒక పాట..."హోకె మజ్ బూర్ ఉస్ నే భులాయా హోగా".ఇది 'హకీకత్ ' సినిమాలోనిది.
ఈ సినిమా శ్రీనివాస టాకీస్(ఏలూరు ) లో 83లోమార్నింగు షో గా వచ్చింది. పాట కోసం సినిమా చూశాను.నలుపు తెలుపు సినిమా. అప్పుడు నన్ను గొప్పగా ఆకర్షించ లేదు.
క్రమంగా అవగతమైన విషయం ..’హకీకత్’ సినిమా 'మదర్ ఆఫ్ ఇండియన్ వార్ మూవీస్ ' గా పేరుపొంది అనేక సినిమాలకు ఆధారమయ్యింది.
చేతన్ ఆనంద్ దర్శకత్వం ,బలరాజ్ సహ్ని,ధర్మేంద్ర,విజయానంద్,సంజయ్ ఖన్ వంటి పెద్దనటులు, అప్పుడే జరిగిన ఇండో చైనా వార్ నేపధ్యం, దేశం కోసం రక్త తర్పణ చేయమంటూ రోమాంచితంచేసే కర్ చలే హం ఫిదా జాన్ ఓ తన్ సాథియో వంటి పాటలు .. చిత్రాన్ని యుద్ధ సినిమాలకు ఒక కొలమానం గా మార్చాయి.
ఐతే 'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా ' పాట మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ పాట ఒక్క సైనికులకనే కాదు, ఇష్టమైన తనవారి ఎడబాటు అనుభవిస్తూ,దానికి తోడు కష్టాలు అనుభవిసూ,రేపటి పట్ల భరోసా లేకుండా, అసహాయులైన తనవారికోసం తల్లడిల్లే అనేకమందిని గుర్తుతెస్తుంది.
సినిమానే కాదూ, నాకు సంబంధించి ఈ పాట కూడా మల్టి స్టారరే.. పాత తరం గాయకుడు 'తలత్ మొహమూద్ ',శాస్థ్రీయ గానంలో ఉద్దండుడు 'మన్నాడే ', విశేషణాలు అవసరం లేని మహమ్మద్ రఫీ, తలత్ మొహమూద్ నుండి బాటన్ అందుకుంటున్నట్టు 'భూపేందర్ '(అతనికిది తొలిపాట?) ..వీరందరి గాన వాహిని ఈ పాట.ఈ పాట రచన దిగ్దంతుడు 'కైఫీ ఆజ్మీ ' సంగీతం 'మదన్ మోహన్ '.
“ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది
మౌనంగా బాధను విషంలాంటి మందులా మింగి ఉంటుంది
పాత కథలు ను ఆమె మనసు వినిపించి ఉండి ఉంటుంది
కన్నీటిని కళ్ళతో తాగేసి పొర్లనీకుండా చేసుంటుంది
తలుపులు మూసిన గదిలో నా ఉత్తరాన్ని కాల్చేసి ఉంటుంది.
అందులోని ప్రతీ అక్షరం తన నుదిటిపైకి ఉబికి వస్తుండి వుంటుంది.
చూపుల్లోని భయన్ని బయటకు తెలియనీకుండా ఉంచుంటుంది
ముక్కలైన హృదయం?????
మేజా బల్ల మీది నా ఫొటో తిసినపుడు నేను పడే బాధ ఆమెకు అర్ధమౌతూ ఉంటుంది.
ఆమె కోరికలన్నీ ఆవిరౌతూ ఉండిఉండాలి
బాధను స్పురింపజేసేలా నవ్వుతూఉండి ఉండాలి
నాపేరు విన్నంతనే అశృవులు రాలుతూ ఉండిఉండాలి
జతరాలి భుజంపై తలవాల్చుకుని ఉంటుంది
తలను అయిష్టంగా దువ్వించుకుంటూ ఉండి ఉంటుంది
బాధామేఘాలు ముఖంపై కమ్ముకుని ఉండి ఉంటాయి.
కళ్ళలో కాంతి చానాళ్ళుగా ఉండి ఉండదు.
ముఖం చానాళ్ళగా కళ తప్పే ఉండిఉంటుంది.”
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-41’
"మొహబ్బత్ బడే కామ్ కీ చీజ్ హై"! …...యే బేకార్ బేదామ్ కి చీజ్ హై! 20 February

 (ప్రేమ చాలా అక్కరకొచ్చే విషయం) .......(ఇది ఎందుకూపనికిరాని చవకైన వస్తువు.)
...
త్రిశూల్ సినిమాలో జేసుదాస్,కిశోర్ కుమార్, లతామంగేష్కర్ పాడిన పాట.ఖయాం సంగీతం సాహిర్ లూధియాన్వి
రచన.
యాంగ్రీ యంగ్ మాన్ గా అమితాబ్ స్థిరపడిఉన్న కాలం(1978). మల్టిస్టారర్ సినిమా అంటే అమితాబ్ తోపాటు ఇంకా ఎవరున్నారు అని ప్రశ్నించే కాలం.ఒకే సంవత్సరం డాన్,ముకద్దర్ కా సికందర్,త్రిశూల్,కస్మే వాదే వంటి హిట్ సినిమాలు వచ్చాయి.
త్రిశూల్ చిత్రంలో తండ్రీకొడుకులమధ్య తారా స్థాయి సంఘర్షణ,కుటుంబసభ్యులమధ్య భావోద్వేగాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
తన తల్లి ని మోసంచేసి తన పుట్టుకకు కారణమైన వ్యక్తిపై హీరో కత్తిగట్టాడు. తండ్రి అప్పటికే పెద్ద సివిల్ కంట్రాక్టరు గా స్థిరపడిఉన్నాడు.అతని మరోకొడుకు విదేశాలలో చదువుకుని తిరిగొచ్చి ఇష్టంలేకపోయినా తండ్రి వ్యాపారం లో అదుగుపెట్టాడు.అతనికి ప్రపంచమంతా ఆటస్థలం,లోకమంతా ప్రేమమయం.హీరో అనుభవాలు వేరు.అతను చూసిన ప్రపంచం దగా,వంచన తో నిండి ఉంది.అక్కడ ప్రేమనేదే లేదు.
హీరో తన పగ సాధించే క్రమంలో తన కు తమ్ముడికి తనెవరో తెలియకుండా దగ్గరయ్యాడు. ఓ పెద్ద పార్టీ ఏర్పాటుచేశాడు. తమ్ముడు తన ప్రేయసితో వచ్చాడు. హీరో పట్ల ఆకర్షితురాలైనామె కూడా అక్కడ ఉంది.
ఆ సందర్భంలో పాట:
తమ్ముడు, అతని ప్రేయసి దృష్టిలో:
“అంతటా అందం, యవ్వనం
ఈ రేయి ఎంతో ఆహ్లాదం
పట్టు వంటి శరీరం కంపిస్తుంది.
సున్నితమైన స్వప్నాలు గానంచేస్తున్నాయి.
గుండె చప్పుడులో మైకం కమ్ముకుంది.
ఇక్కడనుండి ఎక్కడెక్కడికో రంగులు వ్యపిస్తున్నాయి.
వాతావరణం ప్రేమ విందు చేస్తుంది.
ఈ రోజు ఏదో అందం పై మనసు పోతుంది..ఎందుకు?
ప్రేమ చాల ఉపయోగపడే విషయం.
ప్రేమ ఉండటం వల్లే లోకం ప్రకాశిస్తుంది.
ప్రేమలేకుంటే ఏమీ లేదు
కంటికి, హృదయానికి ??????
ప్రేమనే ఈ స్వర్గం లేకపోతే..ఏమీ లేదు
ఇది ఒక ప్రశాంతినిచ్చే విషయం.
కథానాయకుని(అన్న) దృష్టిలో:
అచ్చు ఐన కథలపుస్తకాలలో ప్రేమ ఉంటుంది.
యదార్ధ జీవితంలో ప్రేమలేదు
ఇది లోకపు బజారుల్లో ఉంటుంది
ఇది ఎవరికి అవసరం పడేది కాదు
ఇది ఎందుకూపనికిరాని చవకైన వస్తువు.
తమ్ముడు:
ఇది ప్రకృతి ఇచ్చిన బహుమతి
అన్న:
ఇది పేరుకి మాత్రమే ఉన్న వస్తువు.
తమ్ముడు:
ప్రేమంటేనే ఇంత కలత చెందే వాడివి
పద,నీకు ప్రేమంటే తెలియజెబుతాను.
ఎంతోకాలంగా ఒంటరిగాఉన్న నీమనసుకి
అందమైన బస చూపుతాను
నామాట ఎంతో విలువైనది “
వేరు వేరు నేపధ్యాలనుండి వచ్చినవారు ,వారి వారి అనుభవాలతో ప్రేమ గురించి చెప్పే పాట. నిజంఈ రెంటి నడుమా ఎక్కడో ఉండి ఉంటుంది.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-40’
'భర్-భర్ ఆయీ మొరి అఖియా పియా బిన్..ఖిర్ ఖిర్ ఆయి బదరియా '18 February

 (ప్రియుడు లేక మేఘంవర్షించినట్టు కళ్ళు వర్షించాయి)
జల్సా ఘర్ సినిమాలో బేగం అఖ్తర్ గానం చేసిన థుమ్రీ ఇది.బహుశా బేగం అఖ్తర్ కనిపించిన గానంచేసిన ఆఖరి సినిమాపాట కావచ్చు.
జల్సా ఘర్ (సంగీత శాల/సంగీతగృహం) బెంగాలీ సినిమా కుసత్యజిత్ రే దర్శకత్వం వహించారు.
దేశం బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నప్పటి (1920ల) కాలం.జమీందారీ వ్యవస్థ స్థానే ఆధునిక వ్యాపారాలు,యాంత్రీకరణ ప్రవేశిస్తున్నాయి. సాంఘికంగా వచ్చేమార్పులు గమనించకపోవటం ,మారే కాలంలో మరని మనుషులు,మార్చుకోని విలువలు వీటి పర్యవసానాల చర్చ ఈ సినిమా.
వస్తున్న,రాబోయే మార్పులు తమపై చూపబోయే ప్రభావాన్ని ఏమాత్రం గుర్తింపదలచుకోని(?) జమీందారు కేంద్రం గా సినిమా సాగుతుంది.
అప్పటికాలాన్నిబట్టి జమీందారీ హవేలీలో సంగీతశాల కలిగిఉండటం ప్రతిష్టాత్మకం. అందులో సంగీత కాలక్షేపం ఉత్తమాభిరుచికి ఓ కొలమానం.
సినిమాలో జమీందారు సంగీతశాల, సంగీతంపట్ల అతని అనురక్తిని సౌందర్యదృష్టి కి నిదర్శనం.సంగీతం అతని ప్రాణం.
అతని మితిమీరిన సంగీతాభిరుచే అతని ఆర్ధికపతనానికికారణమయ్యిందా?
లేక వేరే కారణాలవల్ల జరిగేపతనాన్ని ఆపలేక సంగీతపు నీడకు చేరాడా?
జీవనశైలిలో భాగంకావాల్సిన కళలు,అభిరుచులు, అవే జీవనమైపోవటం ఎప్పుడు జరుగుతుంది?
మార్పును గమనించలేకఫోవటంవల్లా?
మార్పుకు తగ్గట్టు మారలేకపోవటంవల్లా?
మారినా ఉపయోగంలేదనే స్థితి..పాయింట్ ఆఫ్ నో రిటన్ కు చేరిపోయినప్పుడా?
ఇవన్నీసినిమా చూసినప్పుడు కలిగే సందేహాలు.
మధ్యవయస్కుడైన ఒక జమిందారు రంగులు మాసి,పెచ్చులూడిన తన రాజమహలు వంటి బంగళా టెర్రేసు మీద కూర్చుని తనలోకంఉండి,తనదగ్గర మిగిలిన చివరిద్దరి సేవకుల్లో ఒకణ్ణి అడుగుతున్నాడు "ఇది ఏ నెల" అని. రోజుల్ని,నెలల్నే కాదు సీజన్లను కూడా అతను మరచిఉన్నాడు.పొరుగున జరిగే శుభకార్యక్రమాన్ని గమనించి గతాన్ని గుర్తుచేసుకున్నాడు.
తరిగిపోతున్న ఆస్తులపట్లగమనింపులేకుండా,చివరకు స్త్రీ ధనంవెచ్చించి సంగీతంపట్ల తన అనురక్తిని చాటుకుంటాడు.అంతస్తు లో తనకి మించాలని చూస్తున్న పొరుగువాడైన 'కొత్త వ్యాపారి 'పై తన ఆధిక్యం చూపాలని తలపెట్టిన సంగీతకార్యక్రమానికి దూరంలో ఉన్న భార్యా,కొడుకులను పిలిపించి, తుఫానులో వారి మరణానికి కారకుడయ్యాడు.
జమిందారు తన వంశం,తన రక్తం ఎంతో ఉన్నతమైనవని, డబ్బు సంపాదించినంత మాత్రాన గొప్పలక్షణాలు రావని తనని తాను నమ్మబలుక్కుంటాడు. తన సౌందర్య దృష్టి, తన ఉత్తమ సంగీతాభిరుచి తన గొప్పదనపు కారణాలలో కొన్ని అనుకుంటాడు.
మారుతున్న కాలంలో తనస్థానమేమిటో తేల్చుకోలేకపోతున్నాడు.తనింటిలో ఆరిపోతున్న కొవ్వొత్తులు చూశి చలితుడౌతున్నాడు. బయట ఉదయకాంతుల్ని చూసి భయపడుతున్నాడు.శిధిలమైన శరీరం పై గమనింపులేకుండా ఉక్రోషంతో తలపాగా ధరించి గుర్రపు స్వారీ ప్రారంభించాడు. బెదిరిన గుర్రం నుండి పడి మరణించాడు.
జమీందారుగా ఛాబీ బిస్వాస్ నటించాడు.అతన్ని మొదటిసారి చూసింది ఈ సినిమాలోనే..షావుకారు సినిమాలో గోవిందరాజుల సుబ్బారావును తొలిసారి షావుకారు చంగయ్య గా చూస్తే కలిగిన అబ్బురం మళ్ళీ జల్సా ఘర్ చూసినప్పుడు కలిగింది.
ఈ పాట కు సంబంధించి..
సినిమాలో సంగీతశాల లో జరిగేమూడు కార్యక్రమాలో ఒకటి బేగం అఖ్తర్ పాడిన ఈ థుమ్రీ.ఈ పాట చిత్రీకరణలో నెమ్మదిగా కదిలే కెమేరా అనేక వివరాలను పట్టుకుంటుంది.సంగీతాన్ని వినే వివిధ వ్యక్తుల ఫీలింగ్స్ ..బిస్వాంబర్ కళ్ళలో తన్మయం,ఆ తన్మయాన్ని కళ్ళతోనే పక్కవానితో పంచుకోవటం,గంగూలీ(కొత్తగా వృద్ధిలోకి వస్తున్న వ్యక్తి) సంగీతాన్ని ఆనందిస్తున్నట్టు ఇబ్బంది పడుతూ నటించటం, సంగీతశాలలో పెచ్చులూడిన స్థంభాలు,చాండ్లియార్లో ఉన్న గాజు క్వాలిటీ… ప్రతీ సూక్ష్మ విషయం సినిమాను అర్ధం చేసుకోవటానికి దోహదపడేదే.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-39’
'నసీబ్ ఇన్సాన్ కా చాహత్ సె హి సవర్ తా హై'14 February

 (“మనిషి అదృష్టమనేది అతని కోరికలతోనే రూపుదిద్దుకుంటుంది)
“హమ్ తుమ్హే చాహతే హై ఐసె “(నేనూ నిన్ను ఎంత కోరుకుంటున్నానంటే)
...
కుర్బానీ సినిమాలోఈ పాటలో మొదటి రెండు లైన్లు పాడింది ఆనంద్ కుమార్,మిగతా పాటంతా మన్ హర్ ఉధస్ పాడారు.ఇందీవర్ రచన కల్యాణ్ జీ ఆనంద్ జీ సంగీతం.
1980 లో కుర్బానీ సినిమా ఒక సంచలనం. మామిత్రుల మాటల్లో 'షోలే తర్వాత ఇదేరా సినిమా ' .ఎక్కడవిన్నా నాజియా హసన్ పాట 'ఆప్ జైసా కోయి మెరీ జిందగీమె ' ఒకపక్క, మరోపక్క 'లైలా మై లైలా'పాటలే.
సినిమాలో ఒక కథానాయకుడు ఫిరోజ్ ఖాన్ స్వయం దర్శకత్వంలో నిర్మించాడు.మరో హీరో వినోద్ ఖన్నా. అప్పటికే అమితాబ్ కు పోటిదారుడుగా గుర్తింపుపొందాడు.
సినిమా చూసాక రఫీ,కిశోర్ కుమార్, కంచన,నాజియాహసన్ వీళ్ళందరి పాటలకన్నా నన్ను ఆకట్టుకున్న పాట 'హం తుమ్హే చాహతే హై ఐసే'. పాట నచ్చే నాటికి పాట అర్ధంతెలియదు. మెలోడియస్ గా సాగే పాట,సముద్రపు ఒడ్డు,సంధ్యా సమయం, ఆకర్షణీయమైన హీరో హీరోయిన్లు ..ముఖ్యంగా పాట మొదలయ్యే విధానం ...మరింత చూస్తే హీరో పాత్ర పట్ల నచ్చటం కారణాలు కావచ్చేమో.
ఇప్పుడు అర్ధం తెలిసాక, ప్రత్యేకంగా మొదట్లి లైను 'నసీబ్ ఇన్సాన్ కా చాహత్ సె హి సవర్ తా హై' (మనిషి అదృష్టమనేది అతని కోరికలతోనే రూపుదిద్దుకుంటుంది) బాగా నచ్చుతుంది. అలాగే సినిమాలో పదే పదే వినిపించే మాట 'ఈశ్వర్ కా దూసరా నామ్ దోస్తీ'.
పూర్తి కమర్షియల్ హంగులతో నిండిన సినిమా. ఐతే అరుదుగా సంభవించే హంగుల సరైన మేళవింపు ఇందులో ఉంది.
చిల్లరదొంగతనాలు చేసే హీరో.అతనికి క్లబ్ లో పాటలు పాడే ప్రేయసి. ఓ తెలివైన పోలీసు ఆఫీసర్ వల్ల హీరో జైల్లో పడ్డాడు. మరో హీరో భారీస్థాయి దొంగ.అతను పోలీసు ఆఫీసరుకు చిక్కట్లేదు.భార్యచనిపోయిన అతనికో చిన్న కూతురు.అతనికి మొదటిహీరో జైల్లో ఉన్నపుడు అతని ప్రేయసి పరిచయమయ్యింది. ఆమె ను ఇష్టపడ్డాడు. ఆమె కు తన ప్రేమ తెలియజేసే సందర్భంలో ఈ పాట.
“మనిషి అదృష్టమనేది అతని కోరికలతోనే రూపుదిద్దుకుంటుంది
ఎవరినైనా చచ్చేంత కోరుకుంటే తప్పేముంది?
నేనూ నిన్ను ఎంత కోరుకుంటున్నానంటే
చనిపోయే మనిషి జీవించాలని ఎంతకోరుకుంటాడో అంత
నువ్వు కోపిస్తే ఏమనిపిస్తుందంటే
ఒక్క క్షణంలో
శరీరంనుండి ప్రాణం విడివడిపోయినట్టు
నీవులేని జీవితం అసంపూర్ణం
నిన్ను పొందగలిగితే
అది పరిపరిపూర్ణమౌతుంది.
నిన్ను నేను అలాంటిచోటుకు తీసుకెళతాను
ఎక్కడైతే
ఒంటరితనం కూడా షెహనాయివాదనౌతుందో అక్కడికి “
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-38’
"అకేలా గయా.. థా మై ..న ఆయా అకేలా"12 February
"ఒంటరిగా వెళ్ళాను ...ఒంటరిగా తిరిగి రాలేదు"
(రాజ్ పూత్ (రాజపుట్ 1981) సినిమాలో కిశోర్ కుమార్ పాడిన పాట,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగిటం, ఆనంద్ బక్షి రచన.)
...
రాజస్థాన్,రాజ్ పుటానాల నేపధ్యంలో 'రేష్మా ఔర్ షేరా' నుండి 'పహేలీ' వరకూ చాలానె వచ్చాయి.వీటిలో ఎక్కువభాగం భారీ తారాగణం,రాజపుటాన్ల శౌర్య సాహసాలు,వీరత్వం,వారి విలువలకు కట్టుబడి ఉండటం,కోటలు,హవేలీలు,ఒక విధమైన మిస్టిక్ ఫీలింగు కలిగించే ఎడారి భూములతో ...జానపదకథలు అనిపించేట్టు ఉంటాయి. ఐతే వాటి ఆకర్షణ వాటిదే.
ఈ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోలు ధర్మేంద్ర,వినోద్ ఖన్నా లు.వారిద్దరికి తోడు మరో పెద్ద నటుడు రాజెష్ ఖన్నా,హేమమాలిని తోడై, విజయానంద్ (దేవానంద్ సోదరుడు)వంటి పెద్ద దర్శకుడు, ముషీర్ రియాజ్ లాంటి నిర్మాత కలిసినప్పుడు విజయం వరించదా? ... వరించాలనేంలేదని చెప్పిన సినిమా రాజ్ పుట్.
మార్కెటింగులో చెబుతారు ప్రతీ ప్రోడక్ట్ కి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుందని.ఈ సినిమా నిర్మాణంలో కూడిన అందరూ ఆ లైఫ్ సైకిల్లో డౌన్ స్లోప్ పై ఉన్నవారే.
అప్పటికి ఒక పుష్కరం ముందు రాజేష్ ఖన్నా 'మేరే సప్నో కి రానీ' అని కిశొర్ కుమార్ గొంతుతో 'ఆనంద్ బక్షీ' పాటపాడి చరిత్ర సృష్టించాడు. అదే నటుడు,అదే గాయకుడు, అదే గీతకారుడు ...కానీ పాత మాజిక్ రిపీట్ కాలేదు.
అవన్నీ అటుంచితే నాకైతే ఈ పాట తొలిసారి చూసి విన్నప్పటినుండి నచ్చుతూనే వుంది. రాజస్థానీ పల్లెపడుచు ను పోలీసు అధికారి పెళ్ళాడే ఉద్దేశంతో ఆమె ఇంటిదగ్గర ,ఆమే ఇంటి పనుల్లో(పొయ్యి రాజేస్తూ,ముల్లంగి కోస్తూ,మైదా కలుపుతూ,రొత్తే కాలుస్తూ) ఉన్నప్పుడు చూశాడు. ఆమే తలపులతో తన జాతిగుర్రం మీద తిరుగు ప్రయాణంలో అతని పాట.అంతటా ఆమే కనిపిస్తుంది,ప్రతీ పడుచులో నూ ఆమే,నింగిలో నీటిలో ....వీటన్నిటితో అందమైన రాజస్థానీ కట్టడాలు,మైదానాలు....ఒకరకంగా చూస్తే రాజస్థాన్ టూరిజానికి యాడ్ గా వాడుకోవచ్చేమోననిపించే చిత్రీకరణ.
పాట అర్ధం స్థూలంగా
“ఒంటరిగా వెళ్ళాను ...కాని ఒంటరిగా తిరిగిరాలేదు
నీజ్ఞాపకాల సమూహాలు నావెంట వస్తున్నాయి.
నీ ఇంటిని వదిలి వచ్చినప్పటినుండి అంతా మారిపోయినట్టు కనిపిస్తుంది
అప్పుడెలా ఉండేది ఇప్పుడెలా ఉంది ..ఈ ఋతువంతా కొత్తకొత్తగావుంది
మనసు కోరుకుంటుంది వెనక్కి వెళదామని
వెళ్ళి నిన్ను జత తెచ్చుకోమని
ఈ జ్ఞాపకాల వెల్లువలో ఒంటరిగా ఎలా ఉండను?”
పాటలోగుర్రం నీరుతాగే సన్నివేశం ఎందుకో బాగా గుర్తుండిపోయింది.అలాగే అతని వూహల్లో ఆమెని పెళ్ళి చేసుకుని గుర్రం పై వస్తుంటాడు.పల్లకీలో ఆమె. అది చూసినప్పుడు ట్రెజర్ హంట్ లో సఫలుడై నిధి ని తెచ్చుకుంటున్న కౌబాయ్ హీరో అనుకోకుండా గుర్తొస్తాడు.
-ముళ్ళపూడి సుబ్బారావు