Saturday, October 31, 2020

 Dil ka bha.Nwar kare pukaar

దిల్ క భవర్ కరే పుకార్

తెరే ఘర్ కె సామ్నె (1963)

హస్రత్ జైపురి  ఎస్. డి. బర్మన్, మహమ్మద్ రఫీ ల కలయిక వీనులవిందు చేస్తే  దేవానంద్, నూతన్ లు నేత్రపర్వం చేసారు. కాలంతో నిమిత్తం లేకుండా విన్నప్పుడూ,చూసినప్పుడూ కొత్తలోకాలకు తీసుకెళ్ళే పాట. 

పాటకు నేపధ్యం లో కనపడేది కుతుబ్ మినార్ లోపల ఉన్న మెట్లు. మినార్ పైభాగంనుంది ప్రేమికులు కిందకు వస్తున్నారు. ఇరుకైన మార్గం, అందులో ప్రేమికుడు ఆమెతో మనసు మాట తెలియజేస్తున్నాడు. వివిధరకాల పర్యాటకులు అతని మాటకు అడ్డువస్తున్నారు. కిందకు దిగేసమయానికి అతనామెకు చెప్పాల్సింది చెప్పాడు.

పాట దృశ్యీకరణకు కుతుబ్ మినార్ ఇరుకైన మెట్లు సహకరించక పోవటంతో కుతుబ్ మినార్ సెట్ లో నే చిత్రీకరణ జరిగింది. పాట చూస్తున్నపుడు అది తెలియకపోవటానికి ఒక కారణం చూపరులదృష్టి దేవానంద్, నూతన్ లపైనుండి మరలకపోవటం.

*******

హృదయ భ్రమరం పిలుస్తుంది
ప్రేమరాగం విను

నీవొక గులాబివి..నీకు సరి ఏది
నీ శైలే ఒక వసంతం
మనసు లోపలి సందిగ్ధం పెదవిపైకి  వచ్చింది
నీవంటే ప్రేమనే మాటగా
నీకే మనసిచ్చాగా
ప్రేమరాగం విను

కావలిస్తే నన్ను మాయం చెయ్యి కాని కిందకు తోయకు
నీ కంటి అశ్రుకణంలా!
నాప్రేమ ఉన్నతి, లోతును
నా నిట్టూర్పులనడుగు
అవి ఆకాశాన్ని అంటుతున్నాయి.
ప్రేమరాగం విను

ఈ అందమైన చోట నేను ఓడిపోయి కూర్చోను
నీడనై నీవెంట నడుస్తాను
నేడు నాపక్కన నీవు.. మనసు కోరిక ప్రతిధ్వనిస్తుంది
నీతో నా చూపు కలిసినపుడు
నువ్వేమి చేసావో తెలియదుగా
ప్రేమరాగం విను

నీ ఈ పైట ఒక ప్రేమ మేఘంలా
తిరిగి నన్ను నేలమీదకు తెచ్చింది
నా చేయి అందుకో ఇపుడు, నీచూపు మధుపాత్ర ఇవ్వు
ఈ కొత్తయాత్ర కోసం
నీవు నా సాకీ వి
ప్రేమరాగం విను


Saturday, October 17, 2020

జీవితాన్ని ఎంతో దగ్గరనుండి చూసాను-देखा है ज़िंदगी को कुछ इतना करीब से

देखा है ज़िंदगी को कुछ इतना करीब से - dekhaa hai zindagii ko kuchh itanaa kariib se


ఏక్ మహల్ హో సప్నో కా (1975) సినిమాలో పాట. సాహిర్ లూధియాన్వి రచన, రవి సంగీత దర్శకత్వం, కిశోర్ కుమార్ గానం. 

కథానయకుడు ఒక కవి. అతనికి రావలసినంత ఖ్యాతి రాదు. బాధ్యతలున్నాయి. ప్రేయసి ఉంది. ఆమె కొద్దిరోజుల్లో కంటిచూపు కోల్పోబోతుందని తెలుసుకుంది. కథానాయకునికి బరువు కాకూడదని అతనికి దూరమై ఒక పెద్ద మనిషి ని పెఌచేసుకుంది. ఆ పెద్దమనిషి కూతురు కథానాయకుని పట్ల ఇష్టం పెంచుకుంది. కథానాయకుడు తన ప్రేయసిని వేరేవ్యక్తి భార్యగా పార్టీలో చూసాడు. ఆమె తనకు తన పేదరికం వల్లే దూరమైందనుకున్నాడు. ఆ సందర్భంలో పాట ఇది. 


సాహిర్ లూధియాన్వి ,కథానాయకులు కవులుగా కనపడే ప్యాసా, కభీ కభీ  సినిమాలకు పాటలు రాసాడు. అవి మన్ననలనందుకున్నాయి. ఐతే ఈ సినిమాలో పాటలకు ఆ స్థాయి ఖ్యాతి రాలేదు.


 జీవితాన్ని ఎంతో దగ్గరనుండి చూసాను

ప్రతి ముఖమూ ఎంతో వింతగానే తోస్తుంది


మనసులో మాట చెప్పటాని ఎవరికోసం వెతుకుతున్నానో

తానే ఈ వేడుకకు నా అదృష్టాన వచ్చింది


అందాలరాశి ప్రేమ వేలానికి పెట్టబడింది

ఒక నిరుపేద ఆ వెలను చెల్లించలేడు.


 నీ  నమ్మకపు మృతదేహం పై 

ప్రత్యర్ధి ఇచ్చిన  పట్టు ముసుగు పరచుతాను




Wednesday, October 14, 2020

ఆప్ కి నజరో నె సంఝా ప్యార్ కె కాబిల్ ముఝే,आप की नज़रों ने समझा


ఆప్ కి నజరో నె సంఝా ప్యార్ కె కాబిల్ ముఝే

आप की नज़रों ने समझा


అన్ పఢ్ (1962) సినిమా లతా మంగేష్కర్ పాడిన పాట. హిందీ సినిమా లో ఉత్తమమైన ఘజల్ లో ఒకటిగా చెప్పబడే ఈ పాట 'రాజా మహ్ది అలి ఖాన్' విరచితం. స్వరకర్త మదన్ మోహన్. సంగీత దర్శకుడు నౌషాద్ కూ ఈ పాత ఎంతో నచ్చి, మదన్ మోహన్ ను ప్రత్యేకంగా అభినందించాడట. ఆరు దశాబ్దాలుగా ఈ పాత శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. 

2015 లో 'ఆలిఘర్' సినిమా వచ్చింది. అందులో 'మనోజ్ బాజ్ పాయ్' ప్రొఫెసర్ గా నటించాడు. ఏవో కారణాలతో ఒంటరిగా కాలంగడుపుతుంటాడు. అతని ఒంటరితనాన్ని చూపటానికి ఈ పాటను ఉపయోగించారు.

 


నీ చూపులు చెబుతున్నాయి నేను నీ ప్రేమకు తగినదాననని

హృదయమా! స్పందించటం ఆపు. నేను గమ్యం చేరుకున్నాను.


నీ ఈ నిర్ణయం నాకు సమ్మతమే

నా ప్రతీ చూపూ దేవునికి కృతజ్ఞత చెబుతుంది

నవ్వుతూ నీజీవితంలో నన్ను కలుపుకున్నావు



నేను నీ గమ్యాన్ని , నువ్వు నా గమ్యానివి
నా ఒడ్డువు నువ్వైనపుడు   నేను తుఫానుకు ఎందుకు భయపడతాను? 
ఎవరైనా తుఫానుకు చెప్పండి నేను గమ్యానికి చేరానని


నా హృదయం పై నీ ఛాయ పరచుకుంది
అన్నిదిక్కులనుండి వందలాది షెహనాయి మోతలు మొదలయ్యాయి
రెండు లోకాల ఆనందం నేడు  నాకు దొరికింది
                                                                     -ముళ్ళపూడి సుబ్బారావు



Tuesday, October 13, 2020

హుస్న్ పహాడో కా, ఓ సాహిబా, हुस्न पहाड़ों का ओ साहिबा

 Husn Pahadon Ka, O Sahiban, Husn Pahadon Ka 

हुस्न पहाड़ों का ओ साहिबा
హుస్న్ పహాడో కా, ఓ సాహిబా, హుస్న్ పహాడో కా

రాజ్ కపూర్ ఎక్కుభాగం సొంత సినిమాలకు శంకర్-జైకిషన్ లు సంగీతం అందించారు. గీతకారుడు మాత్రం ఎక్కువగా
 శైలేంద్రనే.  
తర్వాత    కాలంలో మూడు సినిమాలకు లక్ష్మికాంత్ ప్యారేలాల్ లు పనిచేసారు.  ఆనంద్ బక్షి గీతకర్త.

రాజ్ కపూర్ చివర సినిమాలు 'రామ్ తెరి గంగా మైలీ' , 'హెన్నా' సినిమాలకు రవీంద్ర జైన్ పాటలు రాసి స్వరపరచాడు.

'రామ్ తెరి గంగా మైలీ' సినిమా లో కథానాయిక పాత్ర గంగానదిని పోలిఉంటుంది. గంగోత్రినుండి కలకత్తావరకూ
 ప్రవహించే గంగ  మలినమౌతున్నక్రమాన్ని కథానాయికకు అన్వయిస్తూ కథ సాగుతుంది. పర్యావరణం, మతం,
రాజకీయం,ధనస్వామ్యం ..ఇవన్నీ కానవస్తాయి.

కలకత్తా నగరవాసి ఐన హీరో గంగోత్రిలో హీరోయిన్ చూసి ప్రేమించి అక్కడే పెఌ చేసుకున్నాడు. వారి మధ్య ప్రేమ 
చోటుచేసుకున్న సందర్భంలో వచ్చే పాట ఇది. లలితమైన పదాలతో కూడుకున్నది. సందర్భానికితగినట్టు, 
సూచన ప్రాయం గా  భవిష్యత్తు ను తెలియజేస్తున్నట్టు ఉంటుంది. 



ఈ అందమైన పర్వతాలలో ,
పన్నెండు నెలలూ శీత కాలమే!

ఋతువు ఎంతో ఆహ్లాదకరం
ఇక చలి పట్ల భయమెందుకు! ఋతువు ఎంతో ఆహ్లాదకరం
ఇక చలి పట్ల భయమెందుకు! చెంత వేడి వయసుండగా

విరిసిన పూలతో లోయ నిండి ఉంది
రాత్రికి రాత్రి ఎవరు   దీనిని  అలంకరించారు?
మన కల్యాణం ఇక్కడే జరుపుకోవాలనిపిస్తుంది.
పూలు, పొదలు, కొండలు ఏమి చెబుతున్నాయి?
పరదేశులు అబద్దాలకోరులని!!

నువ్వు పరదేశివి,ఎక్కడినుండి వచ్చావో
వచ్చి నామనసులో చేరావు
ఏమిచేయను మనసు చేజారింది.

చిన్నచిన్న జలపాతాలున్నాయి, వాటి నీటిని తాకుతూ కొన్ని మాటలు ఇవ్వాలి..
జలపాతాలు సాగిపోతుంటాయి, పర్వతాలపై ఒట్టు పెట్టు , అవి ఎప్పుడూ నిలిచి ఉంటాయి.

చేతిలో చెయ్యి , ప్రేమభాషణలతో దారి తరిగిపోతుంది
లోకం  ఇదే గానం చేస్తుంది  ! విను! 
ప్రేమలో దారులే కాదు జీవితమూ గడచిపోతుంది.



Sunday, October 4, 2020

ये दिल और उनकी, निगाहों के साये

ये दिल और उनकी, निगाहों के साये

నటుడు ఎమ్.బాలయ్య మంచి అభిరుచి కలిగిన నిర్మాత. విభిన్న కథాంశాలతో సినిమాలు తీసాడు. చెల్లెలి కాపురం,నేరము-శిక్ష, అన్నదమ్ములకథ, ఈనాటిబంధం ఏనాటిదో, ప్రేమ పగ ,  చుట్టలున్నారు జాగ్రత్త  వాటిలో కొన్ని . చిత్రాలన్నింటిలోనూ సంగీతానికి ప్రాధాన్యతనిచ్చాడు. మొదటి రెండు సినిమాలకు  కె విశ్వనాథ్ దర్శకుడు.  కేవి మహదేవన్, ఎస్. రాజేశ్వరరావు (మూడు సినిమాలకు), ఎమ్ ఎస్ విశ్వనాథన్ వంటి లబ్ద ప్రతిష్టులతో సంగీతం తీసుకున్నాడు.


'ఈ నాటి బంధం ఏనాటిదో'  సినిమానాటికి కృష్ణ పూర్తిస్థాయి కమర్షియకల్ హీరో గా ఉన్నాడు. ఐతే ఈ సినిమాలో అతని పాత్రలో గొప్ప హీరోయిజమ్ తో కూడిలేదు. సినిమా జయప్రద చుట్టూ తిరుగుతుంది, అల్లు రామలింగయ్య పాత్ర కూడా ప్రాముఖ్యతతో కూడినదే. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానిఈ సినిమా పాటలద్వారా ఎక్కువ గుర్తింపు పొందింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి -ఎస్ రాజేశ్వర రావులు అందుకు కారకులు. సినిమాలో ఒక  పాట సుశీల పాడిన 'ఎవరికి చెప్పేది ఏమని చేప్పేది ' . ఆ పాట పై నిర్వివాదంగా హిందీ పాట 'ఏ దిల్ ఔర్ ఉన్ కి' పాట ప్రభావం ఉంది. ఆ పాట తెలుగునాటనూ బహు ప్రసిద్ధం.

లతా పాడిన హిందీ పాట 'ప్రేమ్ పర్బత్' (1973)సినిమా లొది. స్వరకర్త 'జై దేవ్' , గీతకారుడు 'జాన్ నిసార్ అఖ్తర్'. సినిమా దర్శకుడు,రచయిత  వేద్ రాహి డోంగ్రీ భాష లో పేరున్న రచయిత. ప్రేమ్ పర్బత్ సినిమా ఇపుడు అందుబాటులో ఉన్నట్టులేదు

*********
అతని చూపుల నీడ నా మనసుపై వాలితే 
అతని చేతులు నన్ను చుట్టుముట్టినట్టుంటుంది.

చంచలించే సూర్యకిరణాలు పర్వతాలను ముద్దాడుతున్నాయి
గాలికెరటాలు నదులతనువుల్ని ముద్దాడుతున్నాయి
ప్రతీచోటా ప్రేమ నీడలు పరచుకున్నాయి

చెట్టు కొమ్మల్ని దట్టమైనమేఘాలు పెనవేసుకున్నాయి
ఒక్కక్షణం కాంతివంతం , మరోక్షణం అంధకారం
 చల్లని  నీడలతో దారులు నిండాయి


గుండె స్వేచ్చగా కొట్టుకుంటుంది
ఈ  ప్రకృతిని అనుకరిస్తూ
వర్ణమయ ప్రేమ ఛాయలు పరచుకున్నాయి

**** 
ఎవరో ఔత్సాహికులు ఈ పాటను  వైజయంతి మాల (మధుమతి సినిమా) విజువల్స్ తో కలిపారు.