Monday, May 29, 2017

సోనా రే ! తుఝే కైసే మిలూ

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-88
‘సోనా రే ! తుఝే కైసే మిలూ’
(బంగారమా! నిన్ను ఎలా కలువగలను)
సులక్షణా పండిట్, మహమ్మద్ రఫీ పాడిన పాట.
ఈ పాట నాకు పూర్తిగా అర్ధంకాదు.మేఘగమనాన్నీ,ఆగమనాన్నీజలపాత,నదీప్రవాహాల్నీ వర్ణిస్తున్నట్టు అనిపిస్తుంది. .ప్రకృతి చేసే శబ్దాల్ని పాట గా మలచినట్టు ఉంటుంది. పచ్చని కొండల్లో, లోయల్లోసంచరిస్తూ అక్కడ ఏవో రాగాలు, వాటి ప్రతి ధ్వనులు విన్నట్టుంటుంది. ఈ పాటను పోలిన పాటలు చాలా విన్నట్టు...నైనో మె నిందియా,నిందియామె సప్నే,సప్నే మె సాజన్ అంటూ సాగే ‘సిల్ సిలా’ పాట గుర్తొస్తాయి.
సులక్షణా పండిట్ నటిగా కన్నా, గాయనిగానే నాకు ముందు పరిచయం.ఆమె పేరు వినగానే రఫీ తో పాడిన మూడు పాటలు గుర్తుకొస్తాయి. అవి ‘పరిదేశియా ! తేరే దేశ్ మే ప్యార్ ఇస్ తరాహ్(గరమ్ ఖూన్)’, జిస్ కేలియే సబ్ కో చోడా( సాజన్ కి సహేలి)’, ‘సోనారే ! తుఝే కైసె మిలూమ్(ఆంఖె దేఖి)’
‘సోనారే !’పాట రేడియో లో ఎప్పుడన్నా అనుకోని ప్రియమైన అతిధిలావచ్చి వినపడుతుండేది.సిడిలు అందుబాటు లోకి వచ్చినా ఎక్కడా ఈ పాట దొరికేది కాదు.వినపడినప్పుడూ విని ఆనందించటమే.
తరువాత ఎవరో పుణ్యంకట్టుకుని నెట్ లోకి ఎక్కించారు. ఐతే అదీ ఆడియోనే.ఇప్పు వీడియో కోసం వేట మొదలు. నెమ్మది మీద తెలిసిన విషయం సినిమా విడుదలే కాలేదని.ఈ పాటకు సంగీత దర్శకుడు జె.పి.కౌశిక్. గీతకారిణి పద్మాసచ్ దేవ్.
రచయిత గానూ, సినిమా డైలాగ్ రైటర్ గాను పేరుగాంచిన రాజిందర్ సింగ్ బేడి ఈ సినిమాకు దర్శకుడు.బిమల్ రాయ్,హృషికేశ్ ముఖర్జీ వంటి వారి సినిమాలకు మాటలు రాశారు. నాకు చాలా ఇష్టమైన సినిమా’ సత్యకామ్’ కు మాటల రచయిత ఈయనే.
“ సోనా రే ( బంగారమా!)
నిన్ను ఎలా కలవగలను?
ఎలా ఎలా కలువగలను?
మామిడి తోటా?
జలపాతపు నదా?
ఎక్కడ కలవను?
మబ్బులు కమ్ముకుంటున్నాయి
??????
ఎప్పటికీ పోని రంగును ఇస్తాను
ఎప్పటికీ వాడని పూలదండ ఇస్తాను
ఆగిపోయిన నది ధారలను చూడు
పరుగెడుతున్న ఒడ్డును చూడు
నది నీరంతా బిందె నింపేసుకుంది
మట్టి బంధనం లో కొండ ఊగుతుంది

-ముళ్ళపూడి సుబ్బారావు


జల్ తే హై జిస్ కేలియే..తేరీ ఆంఖోకే దియే.

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-87
జల్ తే హై జిస్ కేలియే..తేరీ ఆంఖోకే దియే..(నీ కళ్ళు దివ్వెల్లా దేనికోసం వెలుగుతున్నాయో)
సుజాత(1959) సినిమాలో తలత్ మొహమూద్ పాడిన పాట.
సినిమా కళను అర్ధంచేసుకుని తమ ఆలోచనలను ప్రతిభావంతంగా చెప్పిన ప్రభావశీలురైన దర్శకులుకొందరున్నారు. అలాంటి దర్శకుల సినిమాలు మొత్తం చూడాలని నాకనిపిస్తుంది. వారిలో బిమల్ రాయ్ ఒకరు. ఆయన సినిమాల్లో చూడకుండా మిగిలిన వాటిలో ఒక సినిమా ‘సుజాత’.ఆ విషయాన్ని పదే పదే ‘తలత్ మొహమూద్’ ఈ పాట ద్వారా గుర్తుచేస్తుంటాడు.
నండూరి రామమోహన్ రావు గారి వ్యాసం ఒకటి హిందీ గాయకుల గురించి చదివాను. అందులో ఆయన అభిప్రాయమో ,వేరే వారిదోగానీ ‘తలత్ మొహమూద్’ పై ఒక కామెంటు గుర్తుంది. ఆయన(తలత్)ఊటీ లో చలికాలం(రాత్రి?) లో చొక్కాతీసేసి చలికి వణుకుతూ పాడినట్టు కాకుండా, మామూలుగా పాడితే మరింత గొప్పగా ఉంటుంది.
ఇది అతిశయోక్తిలా ఉన్నా ముందుపాటల్లో లేని సన్నని కంపనం అతని గొంతులో తర్వాత పాటల్లో తెలుస్తుంది. ఈ పాటలో కూడా అది గమనించవచ్చు. ఐతే ఆయన అభిమానులు ఆ కంపనను ఒక అందంగానే స్వీకరిస్తారు.
ఎస్. డి.బర్మన్ సంగీతంలో పాటమధ్య వచ్చే కొన్ని శబ్దాలు ,ప్యాసాసినిమాలో ’జిన్హే నాజ్ హై’ పాటను గుర్తుకు తెస్తాయి.
మజ్రూహ్ సుల్తాన్ పురి ఈ గీత రచయిత.’మజ్రూహ్’ అంటే ‘గాయపడ్డవాడు ‘ అని అర్ధమట. అతను గాయపడటం అటుంచితే, అతను చాలా పాటలతో శ్రోతల హృదయాలని గాయపరచాడు.
ఈ పాట ఫోన్ లో కథానాయకుడు పాడుతున్నాడు. ఎవరినుద్దేశించి పాడుతున్నాడో ఆమె ఇష్టంతోనూ,కష్టంతోనూ వింటుంది.
పాటను చూడకుండా మనసుపెట్టి వింటే మనసుకైన గాయాలకు వెన్న రాస్తున్నట్టుంటుంది..
“ నీ కళ్ళు దివ్వెల్లా
దేనికోసం వెలుగుతున్నాయో
ఆ గీతాన్ని నీకోసం
వెతికి తెచ్చాను.
నొప్పిలా మారి నా మనసులో చేరింది,వదలనంది
మాయలా మారి నీ కన్నుల్లో ఆగింది,కదలనంది
నేడు తెచ్చాను
ఆ గీతం నీకోసం.

గుండెలో దాచుకో, చేజారనీయకు
నా గీతం గాజుకన్నా సున్నితం..పగలనీకు
రాగంతీస్తూనే ఉంటాను
ఈ గీతం నీకోసం.
ఇది నీ రసభరితమైన పెదవుల్ని చేరేంతవరకు
నీ ముంగురులనీడల్లో తిరుగాడుతూనే ఉంటుంది
పాడుతూనే ఉంటాను
ఈ గీతం నీకోసం.”
-ముళ్ళపూడి సుబ్బారావు

ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-86
“ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ”
(జీవితమొక రహదారి,ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు). కాలా పత్తర్ సినిమాలో కిశోర్ కుమార్,లతా మంగేష్కర్ పాడిన పాట.
బొగ్గు గనుల పారిశ్రామిక ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఈశాన్యప్రాంతం నుండి దక్షిణాదివరకూ కూడా దూరాలతో నిమిత్తం లేకుండా చాల సిమిలారిటీలు కోల్ బెల్ట్ లోకనిపిస్తాయి. లక్షలాది మంది పనిచేస్తున్న ఈ పరిశ్రమనేపధ్యంలో వచ్చిన సినిమాలు తక్కువే.వచ్చిన సినిమాల్లోకూడా మిగితా సాంఘిక సినిమాల్లోచూపేజీవితానికీ,నిజజీవితానికి ఉన్నంత దూరం ఉంది.
దీవార్ సినిమా లో నౌకాశ్రయంలో అమితాబ్ ను కోపధారియువకునిగా చూపి విజయం సాధించిన యాశ్ చోప్రా, ఈ సినిమాలో అమితాబ్ ను బొగ్గుగనుల నేపధ్యంలో ‘యాంగ్రీ యంగ్ మాన్’ గా చూపదలచాడు.
అమితాబ్,శత్రుఘన్ సిన్హా, శశి కపూర్, సంజీవ్ కుమార్ వంటి ‘స్టార్లు’, ముగ్గురు హీరోయిన్లు, సలీమ్ - జావెద్ రచన.. ఇవన్నీ సినిమా బలం.
కోల్ ఇండస్ట్రీ కి సంబంధించి మరువలేని ఒక చేదు జ్ఞాపకం ‘చస్నాల మైన్ డిజాస్టర్’ ఈ సినిమాకు క్లైమాక్స్.
సినిమాలో పాత్రలమధ్య సంఘర్షణ తారాస్థాయిలో ఉంటుంది.మూడు ముఖ్యపాత్రలూ భిన్న కారణాలతో పారిశ్రామిక ప్రాంతానికి వచ్చారు. అమితాబ్ గతంలో నౌకలో అధికారిగా పనిచేసి ఆపత్కాలంలో తన పిరికి చర్య కారణంగా అవమానాలకు గురయ్యాడు. అపరాధ భావన వెంటాడుతుంటే కోల్ మైన్స్ లో షెల్టర్ తీసుకున్నాడు. మరో పాత్ర శత్రుఘన్ సిన్హా చట్టంనుండి దాకోవటానికి అక్కడికి వచ్చి గనిలో పనికి కుదురుకున్నాడు. శశి కపూర్ మైనింగ్ ఇంజనీరుగా మంచి ఉద్దేశాలతో అక్కడికి పనిచేయటానికి వచ్చాడు.
తొలి సంఘర్షణ అమితాబ్ కి తనతో తనకే.దానిని ఎదుర్కోవటానికి స్వయం హననానికి పాల్పడేటంత తీవ్రమైనది. దానికో ఉదాహరణ గాయానికి ఆపరేషన్ చేసే సమయంలో అనస్థీషియా కు నిరాకరించటం. దానికి అతను చెప్పే సమాధానం ‘నొప్పి భరించడం అతని విధి’.
అతని తర్వాత సంఘర్షణ శత్రుఘన్ సిన్హాతో. మౌనం గా సీరియస్ గా ఉన్న అమితాబ్ లోపలి అగ్నిని అతడు కనిపెట్టి ,దానిని ఎక్స్ పోజ్ చెయ్యటానికి యత్నిస్తున్నట్టున్నాడు. అందుకోసం అమితాబ్ ను రెచ్చగొడుతుంటాడు.
వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ, సంభాషణలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.
వీరిమధ్య సయోధ్య పెంచి ,అందరి ఉమ్మడి శత్రువుతో వాళ్ళు తలపడేట్టు చేసే పాత్ర శశి కపూర్ ది. అలాగే మరో శత్రువైన ఉపద్రవం(మైన్ అక్సిడెంట్) తో వారు ఉమ్మడి పోరు చేశారు.
సినిమాలో పాటలకు ‘రాజేశ్ రోషన్’ సంగీతమిచ్చారు.పాటల రచయిత సాహిర్ లూధియాన్వి.
ఈ పాట శశికపూర్ మైనింగ్ ప్రాంతానికి తొలిసారి మోటార్ సైకిల్ పై వెళుతున్న సందర్భంలోనిది.
రహదారి మీద పాట. రహదారిని జీవితంతో పోలుస్తూ సాగే పాట.పాడేఅతను ప్రయాణం ఆపి అక్కడి స్త్రీలు పాడేది వింటాడు. దానికి తనధోరణిలో సమాధానం చెబుతాడు.
కిశోర్: జీవితమొక రహదారి
ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు
ఈ అడుగు ఎక్కడ
ఆగినా ఏమీ మిగలదు.
లత: ఓ సాగిపోయే యాత్రికుడా!
నా చేతిని, ఈ దారిని
విడవవద్దు.తిరిగిరా!
కిశోర్: అందపు సెగలైనా
ప్రేమ పిలుపులైనా
స్వతంత్రంగా ఎగిరే పక్షుల్ని ఏమిఆపగలవు.
వచ్చేదారులు పోయేదారులు
యాత్రికులతో నిండిఉంటాయి
మనం లేకున్నా ఏం కాదు.
లత: అలాంటి బాధ పెట్టకు
ప్రియా! పరదేశం పోకు
నన్ను కూడా వెంటతీసుకునిపో
కిశోర్: సాగిపోయే బాటసారికి
నీడలతో బంధాలెందుకు?
క్షణకాలపు యాత్రికునికి
మనసుపెనవేతలెందుకు?
వచ్చేవారి,పోయేవారి అడుగులతో
రహదారులన్నీ నిండి ఉంటాయి
మనం లేకున్నా పోయేదేంలేదు.
-ముళ్ళపూడి సుబ్బారావు

Tuesday, May 23, 2017

సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-85
‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’. (బంగారంలా మెరుపులు …)
పహేలి (1977) సినిమాలో సురేష్ వాడ్కర్,హేమలత పాడినపాటగాయకుడు సురేష్ వాడ్కర్ కు ఇది తొలిపాట.


శబ్దాలకూ భాష ఉంటుందనుకుంటా. వర్షించే చినుకులు తెలుగులో ‘చిటపట’ మంటాయి(‘చిట పట చినుకులు పడుతూ ఉంటే’),. హిందీలో ‘టిప్ టిప్’ అంటాయి (‘ టిప్ టిప్ బరసా పానీ’). అదే బెంగాలీ లో ఐతే ‘టాపుర్ టూపుర్ ‘ అంటాయట.(‘బ్రిష్టి పడో టాపుర్ టూపుర్’).

వర్షం మీద వచ్చినపాటలు కోకొల్లలు. హిందీ వర్షపు పాటల్లో నాకిష్టమైన పాట ఒకటి . ‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’.

95/96 లలోతీవ్రమైన వేసవి కాలం.కొత్త కాలనీలోపచ్చదనం పెరగలేదు. నీటి ఎద్దడి.సరఫరాఐన మంచినీరు తాగలేనట్టు ఉండేది.కాలనీ పక్కనున్నవాగులో చెలమలు ఎండిపోయాయి. పళ్ళబిగువున కాలం నడుస్తుంది. హఠాత్తుగా వాన వచ్చింది. వేలాది కూలర్లు ఒకేసారి మొదలైనట్టు చల్లదనం, గుట్టలకి మైదానాలకీ మబ్బులు గొడుగు పట్టేశాయి. కుంభ వృష్టి మొదలయ్యింది.ఇంట్లో టీ వీ లో ‘ఎ టి ఎన్’ చానెల్లో బైట వాతావరణాన్ని చూపుతూ ఈ పాట. ..’సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’.  ఆ పాట పట్ల  ఇష్టం అప్పుడు మొదలయ్యింది . అప్పటికే అది పాత పాట.

పాట రచయిత ,సంగీత దర్శకుడు ‘రవీంద్ర జైన్’. ఆయనకు దృష్టి లోపం ఉంది. సృష్టి ని అసలు చూడకుండానే ఉన్నాడా? కొంత కాలం చూసి చూపు కోల్పోయాడా అన్నది నాకు తెలియదు. అతను రాసిన పాటల్లో ప్రకృతి వర్ణన వింటుంటే అసలు చూడకుండా అలా రాయటం సాధ్యమా అనిపిస్తుంది.

‘బ్రిష్టి పరే టాపుర్ టుపుర్’ పదం బెంగాలీ లో ప్రసిద్ధమట. రవీంద్రనాథ్ టాగోర్ కవితాపంక్తి కూడా.కలకత్తా లో కొంతకాలం గడపిన రవీంద్ర జైన్ పై ‘రవీంద్ర సంగీత్ ‘ ప్రభావం ఉంది. అలాగే అక్కడికవిత్వం ప్రభావం కూడా. అలా ఈ బెంగాలి కవితాపంక్తి హిందీ పాటలో కి వచ్చిచేరింది.

పాట చిత్రీకరణలో  వర్షం ,పచ్చని ప్రదేశాలు, వాగులు, వంకలు, వ్యవసాయపు పనులవారు, పూర్తిగా వదలని నటీనటుల పసిదనం  పాటను మరింత ఆకర్షణీయం చేసాయి.

పాట లో ఒక చరణం లో పదం ‘ మేఘం ఘర్జన కు పర్వతంబెదిరింది.పిట్ట అల్లుకున్న గూడు చెదరకుండా ఉంది’ అని వస్తుంది. భలే ఉంది అనిపిస్తుంది.


పాట అర్ధం నేను అర్ధం చేసుకున్నంత వరకు

“  బంగారంలా మెరుపులు ,వెండిలా వికసించే నవ్వులు
చిట పటలతో కురిసే వాన

కాగితపు చిన్న పడవ ..నీటి అలల్ని పట్టుకుని సాగుతుంది
ఈ పడవలో సవారీ చేసి , నది దాటి వెళదాం పద
అక్కడి నేరేళ్ళు మధురం, తీయ తీయగా.. మధురం,మధురం

మేఘం ఘర్జించేసరికి  పర్వతం గుండె కంపించింది
కానీ గిజిగాడు  చాలా తెలివితో ఉన్నాడు
తన గూడు ఇటు అటు చెదరకుండా కట్టాడు.

ఎరుపు,గులాబి,నీలం,పచ్చదనం
ఇవన్నీ ఇంద్రధనుస్సు ను అలంకరించాయి.
చూడు గగనంలో వర్షాగమనం
రంగులమ్మే అంగడిలా ఉంది
గినియా పువ్వు చినుకుల్ని  చూస్తుంది, చినుకులే ఒక ఆట.’


Sunday, May 21, 2017

హై దునియా ఉసీకి, జమానా ఉసీ కా

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-84
“హై దునియా ఉసీకి, జమానా ఉసీ కా”
(వారిదే ఈ ప్రపంచం  , వారిదే ఈ కాలం)

హీరోగా షమ్మి కపూర్ నటించిన  సినిమాలు ధియేటర్ లో చూసినవి  తక్కువే.నాకు తెలిసేసరికే అతను హీరోగా నటించటం మానుకున్నాడు.  చూసిన అతని  పాత సినిమాలు కూడా మహమ్మద్ రఫీ పాటలు పిలవటం వల్లే. ‘యా...హూ...’ అంటూ తారా స్థాయి లో పిలుస్తుంటే ఆగేదెలా?

షమ్మీ కపూర్ సినిమాల్లో పాటలు బాగాలేనివి ఏమైనా ఉన్నాయా? చూడటం కష్టమైన పాటలు ఉంటాయి కాని వినలేనివి ఉండవు. ‘బై డిఫాల్ట్ ‘షమ్మి కపూర్ పాట అంటే రఫీ పాడిందే.

‘కాశ్మీర్ కి కలీ’ లో అన్ని పాటలూ బాగుంటాయి. ఐతే  “హై దునియా ఉసీకి, జమానా ఉసీ కా” పట్ల నాకు ప్రత్యేకమైన ఇష్టముంది. వెతుక్కుంటే దొరికిన కారణం పాటలో రఫీ గొంతుకు సమాంతరం గా సాగే శాక్సోఫోన్ వాదనం. .అది యుగళ గీతమే. రఫీతో పాటు రెండో గాయకుడు శాక్సో ఫోన్.
 
పాట ఒక మాదిరి విషాద గీతం. మద్యం సేవించిన నాయకుడు ప్రేమలో గాయపడి పాడుతున్నాడు. మహమ్మద్ రఫీ మద్యం తీసుకునేవాడు కాదని  చెబుతారు. ఈ పాటతో శ్రోతల్ని మధుసేవనం చేయిస్తాడు.
తక్కువ సంగీత పరికరాలు, డామినేట్ చేసే   శాక్సోఫోన్ .. వీటితో ఒక  భిన్నమైన ‘మూడ్’ ఏర్పడింది.
శాక్సోఫోన్  పలికించే అతనికి దృశ్యపరంగానూ ప్రాముఖ్యత ఇవ్వబడింది. బహుశా అతను నిజమైన కళాకారుడు కావచ్చు.
చిత్రానికి సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్, పాట రచయిత ఎస్‌. హెచ్. బిహారి.  

“ఎవరు ప్రేమలో వేరేవారికి  సొంతమౌతారో
వారిదే ఈ ప్రపంచం  , వారిదే ఈ కాలం

ప్రేమ రహదారిలో దోచుకోబడ్డ బాటసారి,
అతని దృష్టిలో ఈ లోకమే స్వర్గలోకం
అతనే జీవితంలో ఆనందాన్ని కొల్లగొట్టాడు

ప్రేయసి కి ప్రతిరూపం ఐపోయిన వాడు
మోకరిల్లి మొక్కదగిన  పిచ్చివాడు
వాని పిచ్చితనాన్ని గౌరవించు

ధ్వంసం కావటం ఎవరి రీతో
ప్రేమలోవ్యధ ఎవరికి ఔషధమో  
వానిని ఈ లోకపుదుఃఖాలు ఏవి బాధించగలవు?”

-ముళ్ళపూడి సుబ్బారావు



యే రాతే ..నయీ పురానీ..ఆతే .ఆతే జాతే

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-83
“యే రాతే ..నయీ పురానీ..ఆతే .ఆతే జాతే ..కెహతా హై కోయి కహాని”
(“ ఈ రాత్రులు...కొత్తవి పాతవి ..ఏవో కథలు చెబుతాయి).లతా మంగేష్కర్ గానం, ఆనంద్ బక్షి రచన,రాజేష్ రోషన్ సంగీతం.

హైస్కూల్లో ఉన్నపుడు స్వతంత్రంగా 79 నాటికి స్నేహితులతో కలిసి ఏలూరెళ్లి సినిమాలు చూసే ధైర్యం వచ్చింది. సెలవురోజుల్లో ఐదారు రూపాయిలు దొరకబట్టుకోగలిగితే ఉదయం బస్సో లారీయో ఎక్కి మార్నింగు షో టైముకు ఏలూరు చేరేవాళ్ళం.కనీసం రెండు సినిమాలు చూద్దామని. చూడదలుచుకున్న కొత్తసినిమాలు మార్నింగు షో లు ఉండేవి కావు. పాత హిందీ/ఇంగ్లీష్ సినిమాలో,డబ్బింగు సినిమాలో ఉదయపుఆటలు ‘ఆడేవి’.ఇష్టమై కాకపోయినా అలా కొన్ని సినిమాలు చూడాల్సివచ్చేది.

అలా చూసిన ఒక సినిమా ‘జూలీ’. హిందీ సినిమాల్లో ఆశించే పెద్దనటులూ, ఫైటింగులూ ఏమీ లేవు. పాటలు మాత్రం అన్నీ విన్నవే. సినిమా అప్పుడు ఏమాత్రం ఆకట్టుకోలేదు.

తర్వాత రోజుల్లో టివీ లో చూసేంతవరకూ పాటలతో సినిమా టచ్ లోనే ఉంది.
సినిమా వచ్చిన కాలం నాటికి(1975) ఇది ధైర్యవంతమైన సినిమానే. సినిమా నడిచే స్థలం రైల్వే ఉద్యోగులు నివసించే కాలనీ. రైల్వేలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కావటం వల్లకావచ్చు భిన్న భాషలు, మతాలకు చెందినవారక్కడ వున్నారు. కథానాయిక కుటుంబానిది ఆంగ్లో ఇండియన్స్ నేపధ్యం. బెంగాలుకు చెందిన హిందువుల అమ్మాయితో ఆమెకు స్నేహం. చదువు నుండి సెలవలకు వచ్చిన స్నేహితురాలి తమ్ముడుతో ప్రేమలో పడిందామె.

కాలనీక్లబ్బులో ఫంక్షన్ (న్యూ ఇయర్ పార్టీ??) జరుగుతుంది. కథానాయిక స్నేహితురాలు ఈ పాట పాడుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మరింత ముందుకు పోవటానికి ఈ ఫంక్షన్ దోహదపడింది.

సినిమాతో సంబంధం లేకుండా ఈ పాట ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేకంగా రాత్రుల్లో వింటుంటే మనసు వూగుతుంది, జోగుతుంది.అప్రమేయంగా ‘వక్త్’ సినిమాలో ‘ఆగే భీ జానే న తూ..పీచే భీ జానే న తూ ‘ పాట గుర్తుకు వస్తుంది.

“ ఈ రాత్రులు...కొత్తవి పాతవి
వస్తుంటాయి ,వచ్చి పోతుంతాయి.
ఏవో కథలు చెబుతాయి

చూడు ఎవరో వస్తున్నారు.
చూడు ఎవరో వెళుతున్నారు.
అందరి హృదయాలు మెలకువతోనే ఉన్నాయి.
అందరి కళ్ళు అర్ధ నిద్రలో ఉన్నాయి
నిశ్శబ్దం మాత్రమే మాటలాడుతూ ఉంది.

ఎలాటి తీయని సమయమిది?
కనురెప్పల వీదుల్లో
తిరుగాడే నిదురలాంటి
సుందర స్వప్నాల బృందాల్లాంటి
పూలనుండి వీచే సుగంధం.

ఏ వైపునుండి గాలులు
ఎప్పుడు వీస్తాయో ఎవరికి తెలుసు?
ఏడాది వరకైనా గుర్తుంచుకో
ఏమాత్రం మరవవద్దు
ఈ కలయిక రాత్రిని.”


షీషా హో యా దిల్ .. ఆఖిర్ టూట్ జాతా హై

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-82
షీషా హో యా దిల్ .. ఆఖిర్ టూట్ జాతా హై
(అద్దమైనా, హృదయమైనా ,చివరికి ముక్కలైపోతుంది.)

1980 ఒక సూపర్ హిట్ గీతం ఇది.అప్పుడే కాదు ఇప్పటికీ శ్రోతలు ఈ పాటను కోరుతూనే ఉంటారు.దృశ్యపరంగా గొప్పగా ఉండదు.

సినిమా పేరు ‘ఆశా’. పాట లో నిరాశ ఉందా? నిర్వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందా? ఉన్నదాంతో సర్దుకుపొమ్మంటుందా?

సినిమాలో హీరోయిన్ వృత్తి గాయకురాలు. లారీ డ్రైవర్ ఐన హీరో ఆమె కు ఒకసారి సాయపడి స్నేహితుడయ్యాడు. అప్పటికే అతనికి భార్య ఉంది. భార్యతో గాయకురాలి ప్రదర్శన కు వెళ్ళాడు. అప్పటి పాట ఇది. పాటలో ప్రతిఫలించేటంత నిరాశ అప్పటికి ఆమె జీవితంలో కనపడదు. ‘ఫోర్ షాడోయింగ్’ ద్వారా జరగబోయేది చెబుతున్నారా? ‘యధ్బావం తద్భవతి’ అంటారు. ఆమె ఆలోచనలను బట్టి ఆమె ఆశ ఫలించదని చెలియజెబుతున్నారా?

పాట రచయిత ‘ఆనంద్ బక్షి’. 70ల తర్వాత పాటల రచయితగా ఎక్కువగా వినపడిన పేరు. అతని పాటలు తేలికైన చిన్న చిన్న పదాలతో సాగుతూ ఒక మాదిరి హిందీ తెలిసిన వాళ్ళకుకూడా అర్ధమయ్యేట్టు ఉంటాయి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వర కల్పన.లతామంగేష్కర్ గానం.

(ఈ సినిమా తెలుగు రూపం ‘అనురాగదేవత’లో ఈ పాటకు వేటూరి రాసిన పల్లవి “చూసుకో పదిలంగా, హృదయాన్ని అద్దంలా,పగిలేది ఖాయం ఏదైనా! రగిలేను నీలో వేదనా!”)

హిందీ పాట అర్ధం:

అద్దమైనా, హృదయమైనా
చివరికి ముక్కలైపోతుంది.

చేతినుండి పెదవులకు అందేలోపే
సముద్రం వెనక్కి వెళ్లిపోతుంది

కోరికలు ఉండగానే సరిపోదు
కలయిక అంత తేలిక కాదు
లోకం అసహాయుల్ని చేస్తుంది
విధిరాత రాసి ఉండాలి
కోరికలకు ఒకదానితో ఒకటి పోటీ
వాటికి రాజీ ఎలా?
ఒక దానిని కోరితే
రెండవది కోపగిస్తుంది.

గట్టున కూర్చుని
అలల్ని గమనిస్తూ
నేను తుఫానులతో ఆడుకుంటున్నాను
హృదయపు కోరికలతో ఆడుకుంటున్నాను

నాకు అప్పుడు తెలియదు
ఎవరూ తోడు రారని
నావికుడు వదిలి వెళ్లిపోతాడని
ఒడ్డు దూరమైపోతుందని
******
ప్రపంచం ఒక నాటకం
ఆశ నిరాశలమయం
కొద్దిగా పూలు ఉన్నాయి,ముళ్ళు ఉన్నాయి
విధి వారికి పంచుతుంది
ఎవరి బాకీ ఎంతో అంత
ఎవరి కథ ఎంతో అంత
కొందరు దోచుకోబడతారు
కొందరు దోచుకుంటారు.

Monday, May 15, 2017

తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ,హైరాన్ హు

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-81

“తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ,హైరాన్ హు”
(జీవితమా! నాకు నీపట్ల కోపం లేదు. ఆశ్చర్యం కలుగుతుంది). మాసూమ్(1983) సినిమాలో పాట.

బాగానచ్చిన  సినిమాలు కొన్ని తిరిగిచూసేటపుడు  జీవితాన్ని క్లోజ్ అప్ లో చూసినంత  భయంవేస్తుంది. సినిమాలో ఒకటికి మించిన పాత్రలతో ఐడెంటిఫై ఐనపుడు , ఆ సినిమా కరుణరసాత్మకమో, విషాందాంతమో ఐనపుడు అది మరింత ఎక్కువ. అలాంటి సినిమాకు చప్పున గుర్తొచ్చే ఉదాహరణ ‘మాసూమ్’(1983).

ఇద్దరు పిల్లలు, అన్యోన్య దాంపత్యం తో ఉన్న కుటుంబం. ఆ కుటుంబంలోకి ప్రవేశించిన పదేళ్ళ పిల్లవాడు. ఆ కుటుంబ యజమానిలో తన తండ్రిని వెతుక్కుంటున్నాడు. యజమాని భార్య పిల్లవాడిలో తన భర్త నమ్మకద్రోహాన్ని చూస్తుంది.యజమానికి ఆ పిల్లవాడు తను దాచిఉంచిన రహస్యం తాలూకూ నీడ.
చెట్టుమీది గూడునుండి పుట్టగానే నేలమీద జారిపడ్డ పక్షికూన లాంటి పిల్లాడు సినిమా నిండా కనిపిస్తాడు.
 
చేసిన పొరపాటు కు పర్యవసానాలు చేసిన వారిని మాత్రమే బాధిస్తే పరవాలేదు. పొరపాటు కు సంబంధం లేని వారికి కలిగే వ్యధలకు ,బాధలకు సమాధానం చెప్పాల్సివచ్చినపుడు? అతనికి  అమాయకపు మూగమోములోనే ప్రశ్నలు కనిపిస్తాయి.

ప్రతీ అనందానికీ ఖరీదు ఉంటుంది.ప్రతీ రహస్యం వెంటాడుతుంది. గతం నుండి విముక్తి అంతతేలికగా దొరకదు అని  ఈ పాట చెబుతుంది.
బెంగాలీ గాయకుడు అనూప్ ఘోషాల్ ఈ పాట పాడాడు. ఆర్డి.బర్మన్ సంగీతం,గుల్జార్ రచన.

“జీవితమా!
నాకు నీపట్ల కోపం లేదు. ఆశ్చర్యం కలుగుతుంది
నీ అమాయకపు ప్రశ్నలతో ఇబ్బంది కలుగుతుంది

అనుకోలేదు,
జీవించటం కోసం గాయాల్ని భరించాల్సి ఉంటుందని
నవ్వినందుకు, నవ్వుకు ఋణపడాల్సివస్తుందని

అనిపిస్తుంది
నవ్విన ప్రతి  నవ్వుకు పెదాలపై ఋణం మిగిలిఉంటుంది


జీవితమా! నువ్వు కలిగించే వ్యధను ఒక కొత్త బంధంగా భావించాను
ఎండలో కలిసిన ప్రతికలయికా చల్లని ప్రేమనీడగా భావించాను.

కళ్ళు అశృవులతో నిండినప్పుడు అవి వర్షిస్తాయి
ఎవరికి తెలుసు    రేపు ఈ కళ్ళు ఎవరికోసం తపిస్తాయో

నేను దాచుకున్న  ఒక కన్నీటిబొట్టును
ఎక్కడపోగుట్టుకున్నానో తెలిసేదెలా?”


Saturday, May 13, 2017

నయన్ లడ్ జైహె తొ మనవా మె కసక్ హొయి బె కరి

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-80

నయన్ లడ్ జైహె తొ మనవా మె కసక్ హొయి బె కరి
(కన్ను కన్ను కలిస్తే గుండెలో నెప్పి మొదలౌతుంది). గంగా జమునా సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన పాట. నౌషాద్ సంగీతం,షకీల్ బదాయుని రచన.

మదర్ ఇండియా సినిమాలో నర్గీస్ కొడుకుగా నటించటానికి దర్శకుడు మెహబూబ్ ఖాన్ ,దిలీప్ కుమార్ ను సంప్రదించాడు. అంతకు పూర్వం నర్గీస్ తో హీరో గా నటించిన దిలీప్ కుమార్ కొడుకుగా నటించటానికి విముఖత చూపాడు. వేరే నటులతో వచ్చిన ఆ సినిమా చూసిన దిలీప్ కుమార్ ఆ తరహా సినిమా చేయాలనుకున్నాడు. స్వయంగా చిత్ర నిర్మాణానికి చేపట్టాడు. నటుడుగా ఒడుదుడుకులు ఎదుర్కుంటున్న తన సోదరుడు ‘నాసిర్’ తోడ్పడాలన్న తలంపుతో అతన్నీ సినిమాలోకి తీసుకున్నాడు.

ఆ సినిమా ‘గంగా జమునా’. మదర్ ఇండియా సినిమాతో కొన్ని పోలికలున్నా,ఆ సినిమాకు కొనసాగింపుగా కూడా ఉంటుంది.గ్రామీణ నేపధ్యం తో సహజ వాతావరణంలో అవుట్ డోర్ లో నిర్మింపబడింది. 1960ల నాటి సాంఘిక స్థితి గతుల్ని స్పృశిస్తూ సాగుతుంది.

భోజ్ పురి భాష ఎంతో సహజంగా మాట్లాడుతూ, పరిణామం చెందిన పల్లె యువకునిగా దిలీప్ కుమార్ నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది.సినిమా అత్యంత ప్రజాదరణతో ఒక బెంచ్ మార్క్ చిత్రంగా మారింది. ఐతే దిలీప్ కుమార్ ఆశించిన మరో ఫలితం..సోదరుడు నాసిర్ ఖాన్ కి లిఫ్ట్ ఈ సినిమా ఇవ్వలేకపోయింది.

సినిమాలోని పాట ‘నయన్ లడ్ జైహె తొ’ కూడా భిన్నమైన డయలెక్ట్ ( భోజ్ పురి?) తోనే ఉంది. పాట్ చిత్రీకరణలో దిలీప్ కుమార్ కదలికలు చూస్తే దానికోసం అతను చేసిన సాధన అర్ధమౌతుంది.

“ఆ అందగత్తె చుట్టూ నాకళ్ళు తిరుగాడుతుంటే
నా పని మొత్తం పాడయ్యింది.

కన్ను కన్ను కలిస్తే గుండెలో నెప్పి మొదలౌతుంది
ప్రేమ తారాజువ్వ ఎగిరితే పెద్ద చప్పుడౌతుంది

నీ రూపాన్ని మనసులో పెట్టుకుంటే తప్పేమిటి?
నీ మీద మనసైతే తప్పేమిటి?

నాకూ ప్రేమనగరంలో ఉండటానికి కొంచం హక్కు ఉంది.
నీ చిలిపి చూపులు నాగుండెను గుద్దుకున్నాయి

ఆ అందగత్తెను చూడకుంటే నాకు నిదరే పట్టదు.
ఉరి చుట్టుకున్నట్టు నా మనసు ని ఇబ్బంది పెడుతుంది.

తనతో కళ్ళు కలిసాక నాట్యం మొదలుపెట్టాను
మనసు ప్రేమతో తీయని పాట పాడుతుంది

తాళం మోగుతుంటే నడుము మెలికలు తిరుగుతుంది

బట్టలు ఉతుకుతూ మనసు ఎత్తుకు పోయింది..ఎలా మాయ చేసింది
ఎలాంటి మంత్రమేసింది. మాయ చేసింది?”

-ముళ్ళపూడి సుబ్బారావు


ఆ చల్ కే తుఝే మై లేకే చలూ

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-79
‘ఆ చల్ కే తుఝే మై లేకే చలూ’
(“పద నిన్ను తీసుకెళతాను అలాంటి ఒక ఆకాశం కిందికి).

కిశోర్ కుమార్ గాయకుడుగానే కాక నటుడుగానూ ప్రసిద్ధుడే.అతను నటించిన సినిమాలలో ఎక్కువభాగం సరదాగా సాగేవే.ఐతే అతను స్వయంగా దర్శకత్వం వహించిన తొలిచిత్రం ‘దూర్ గగన్ కి చావ్ మె’ (1964) అలాంటిది కాదు.

సైన్యంలో పనిచేసిన వ్యక్తి తిరిగివచ్చాడు. ప్రమాదంలో భార్య చనిపోయిందనితెలుసుకున్నాడుఽప్పుడే కొడుకు స్వరం కోల్పోయాడు.కొడుకును తీసుకుని ప్రయాణం కట్టాడు. అతని లక్ష్యం కొడుకు చేత తిరిగి మాట్లాడించటం. ఇది సినిమా కథ. ఇదే కథ తెలుగులో ‘రాము’ సినిమా గా పరిణామం చెందింది. మాతృక కు దక్కని విజయం రిమేక్ కి దక్కింది.

కిశోర్ కుమార్ ఎంతో ఇష్టంగా ఈ సినిమా తీసాడు. సినిమాపై సత్యజిత్ రే ప్రభావం వుంది. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత గా కిశోర్ కుమార్ తన ప్రజ్ఞ చూపారు.

ఇందులోని పాటల్లో ‘ఆ చల్ కే తుఝే మై లేకే చలూ’,’కోయి లౌటాదే ముఝే బీతే హుయె దిన్’ చాలా బాగుంటాయి.
కిశోర్ కుమార్ ప్రేమికులు తప్పని సరిగా గుర్తు తెచ్చుకునే పాట ‘ఆ చల్ కె తుఝే మై లేకె చలూ’.
పాటకు గీతరచన, స్వర రచన, గానం అతనే చేసారు. చిత్రీకరణ అతను, అతని కుమారుడు అమిత్ కుమార్ పైనే సాగింది. అలా ఈ పాట కిశోర్ కుమార్ ‘పూర్తి స్వంత గీతం’.
పాట అర్ధం:
“పద నిన్ను తీసుకెళతాను అలాంటి ఒక ఆకాశం కిందికి
అక్కడ ఎలాంటి వ్యధ ఉండదు, కన్నీరుండదు..ప్రేమ మాత్రమే ఉంటుంది.

అక్కడ సూర్యుని తొలి కిరణాలు తో ఆశల ఉదయం మేల్కుంటుంది
అక్కడ చంద్రుని కిరణాలతో పెను చీకట్లు పరుగెడతాయి.
దూరపు దారులు కనపడనట్టు కొన్ని సార్లు ఎండ విచ్చుకుంటుంది కొన్ని సార్లు నీడ కమ్ముకుంటుంది

అక్కడ చూపు సాగినంతమేరా, స్వతంత్ర గగనం రెపరెపలాడుతుంది
అక్కడ రంగురంగుల పక్షులు ఆశల సందేశాలు మోసుకొస్తాయి
స్వప్నాల్లోఆనందపు మొగ్గలు వికసిస్తాయి.సాయంత్రాలు ఆనందమయమౌతాయి.

అక్కడ కలల ప్రపంచంలో ప్రేమమాత్రమే వికసిస్తుంది
అక్కడకు మనమెళ్లి పోదాం.. ఎలాంటి చింతా విచారం లేకుండా
అక్కడ విరోధులు లేరు. అపరిచితులు లేరు. అందరూ కలసి నడవవచ్చు”
-ముళ్ళపూడి సుబ్బారావు