Saturday, April 29, 2017

ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా ఖుషీ ఆజ్ తక్ నహీ మిలీ

నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-73’
ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా ఖుషీ ఆజ్ తక్ నహీ మిలీ’
(నేటికంటే ఎక్కువ ఆనందం ఇదివరకెన్నడూ కలగలేదు)
చిత్ చోర్ సినిమాలో జేసుదాస్ పాట. రచన, సంగీతం రవీంద్ర జైన్.

రాజశ్రీ ఫిల్మ్స్ వారి సినిమాలు  పాటల కు పెట్టింది పేరు. మంచి కథతో ,చిన్న బడ్జెట్ తో, మరీ పాపులర్ కాని నటులతో, మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలు తీసేవారు.70 లలోనూ,80ల తొలినాళ్ళలోను వారి ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి
. ఐతే తర్వాత వారు తమ పంథా మార్చారు.పెద్ద బడ్జెట్, ఎక్కుమంది తారాగణం తో వైభవోపేతమైన ఎగువతరగతికి కుటుంబ జీవితాన్ని చూపించే సినిమాలు తీయటం మొదలు పెట్టారు.
వారి అప్పటి ,తర్వాతి సినిమాలు చూస్తే  కొన్నిపాత సినిమా కథలనే లనే  మళ్లీ తీసారని అర్ధమయ్యింది. కథ ,పాత్రలు అవే. వారి నేపధ్యం మధ్యతరగతి నుండి  ఎగువతరగతికి మారింది. సాదాసీదా జీవనశైలి నుండి పైపైకి ఎగబాకింది.ఆలోచనలు అవే,సమస్యలు అవే,ఆశలు అవే. కాని చూపించే వాతావరణంవేరు.
1976 లో చిత్ చోర్  సినిమా వారి సంస్థ నుండి వచ్చింది. స్కూల్ టీచర్ రెండొ అమ్మాయి పెళ్లి కి సంబంధించిన కథ. పెద్దమ్మాయి పట్నంలో ఉంది. ఆ పల్లెకి రాబోతున్న ఒక ఇంజనీర్ అమ్మాయికి తగినవాడని, ప్రయత్నించమని ఇంటికి ఉత్తరం రాసింది.
అలా పల్లెకి వచ్చిన ఉద్యోగి ని ఆ కుటుంబం దగ్గర చేసుకుంది. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతలో తెలిసిన విషయం ఆ ఉద్యోగి ,వాళ్ళ పెద్దమ్మాయి చెప్పిన ఇంజనీర్ కాదు,అతనికింద పనిచేసే ఉద్యోగి అని. ఆ ఇంజనీర్ ఇప్పుడు వస్తున్నాడు.
ఇలా సాగిన కథ నెమ్మదిగా కంచికి వెళుతుంది.
2003 లో వారి రాజశ్రీ సంస్థ నుండే వచ్చిన సినిమా ‘మై ప్రేమ్ కి దీవాని హూ’. టౌన్ లో చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి అక్క అమెరికా నుండి ఇంటికి ఫోన్ చేసి చెప్పింది ‘ఒక అబ్బాయి ఇండియా వస్తున్నాడు ,చెల్లి కి వరుడుగా ప్రయత్నించమని’.
వచ్చిన వ్యక్తి అతను కాదు. మళ్లీ అదేకథ.

చిత్ చోర్ సినిమాలో పాటలు ‘గోరి తెరా గావ్ బడా ప్యారా’,’తుజో మేరే సుర్ మే’,’జబ్ దీప్ జలే ఆనా’,’ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా’ ఇలా అన్నీ కర్ణపేయాలే.
‘ఆజ్ సె పెహ్లే ‘ పాట పట్ల నా ఇష్టానికి కారణం అది రోడ్ సాంగ్ కావటం.
అసలైన ఇంజనీర్ పల్లెకు వచ్చాడు. అతను, అతనికింది ఉద్యోగి , అమ్మాయి, అమ్మాయి పొరుగింటి పిల్లాడు కలిసి జీప్ లో ప్రయాణిస్తున్నారు. ఇది ఆ సందర్భంలో  పాట. సాగిపోతున్న చక్కటి అటవీ నేపధ్యం,  శ్రావ్యమైన జేసుదాస్ గానం,చక్కని సంగీతం, మధ్యలో ఈలపాట తో ఇది నిలబడిపోయే పాట అయ్యింది.

“నేటికంటే ఎక్కువ ఆనందం
ఇదివరకెన్నడూ కలగలేదు
ఇంత ఆహ్లాదకరమైన ,ఇంతకంటే తీయని
ఘడియలు నేటివరకూ దొరకలేదు

దీనిని యాదృచ్చికమనాలా? విధి అనాలా?
మనసుకిష్టమైన వారిని కలిసిన మనందరి ముఖాలు
ఎలా వికసించాయో చూడండి.
విధి కలిపిన ఈ జత
ఇలాంటి కలయిక  నేటివరకూ దొరకలేదు.

మనమంతా కన్న కల సఫలమౌతుంది
ఇది నా మనసు కోరుతుంది.
గడుస్తున్న ఈ క్షణాలు కలిగించే మైమరపుతో
నా మనసు పాడటం మొదలుపెట్టింది
ఇలాంటి సంతోషం కోసం వెతుకుతున్నాను
అది ఈ రోజువరకు దొరకలేదు.”

-ముళ్ళపూడి సుబ్బారావు.

Thursday, April 27, 2017

'కోయీ హోతా జిస్కో అప్నా '


'కోయీ హోతా జిస్కో అప్నా '
నావాళ్ళు అనుకునేవాళ్ళు ,ఎవరైనా ఉంటే బాగుండును
(మేరే అప్నే సినిమాలో పాట గుల్జార్ రచన, సలీల్ చౌధరి సంగీతం)

కొన్ని అభిమానాలు అనుకోకుంకుండానో,యాదృచ్చికంగానో కలుగుతాయనిస్తుంది. వెతికితే వాటికి కారణాలు కనిపిస్తాయేమో.


నాకు పదిహేనేళ్ళ వయసపుడు వినోద్ ఖన్నా సినిమాలు చూడటం మొదలు పెట్టాను. నేనతని అభిమానినా అంటే అప్పుడు ఔననే చెప్పాలి.


కనీసం పది సంవత్సరాలు (80- 90) అతనివి పాతవి కొత్తవి అనేక సినిమాలు చూసి ఆనందించాను. ఇప్పటి వరకూ అతనికి సంబంధించిన న్యూస్ ను ఫాలో ఔతూనే వున్నాను.
అతని నటజీవితానికి,వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి సంబంధం వుండే వుంటుంది. నావరకు వినోద్ ఖన్నా అంటే డెబ్భైల మొదలుకుని 90 వరకూ సాగిన అతని తెర జీవితమే. అది నాకు ఆనందాన్ని ఇచ్చింది. మేరె అప్నే,కచ్చే ధాగే, ఇంతిహాన్,అమర్ అక్బర్ ఆంథొని,కుర్బాని సినిమాలలో అతని పాత్రలతో ఎక్కడో ఐడెంటిఫై ఔతానని పిస్తుంది.


అతని నట జీవితాన్ని చూస్తే రెండు ఫేజ్ లు కనిపిస్తాయి.
సపోర్టింగ్ ఆర్టిస్ట్ గామొదలై,విలన్ గా  నటించి ,హీరోగా మారి హఠాత్తుగా నటనను విరమించుకున్నంతవరకూ ఉన్నకాలం, ఐదేళ్ళ విరామమ్ తర్వాత తిరిగి నటించిన కాలం.


70 కి అటూ ఇటుగా సినిమాలలోకి వచ్చి  కమర్షియల్ సినిమాల్లో రాణిస్తూనే మేరే అప్నే,అచానక్,మీరా వంటి ఆఫ్ బీట్ సినిమాల్లో నటించి దర్శకుల నటుడనిపించుకున్నాడు.


మల్టిస్టారర్ సినిమాలలో సునీల్ దత్,ధర్మేంద్ర,రాజేశ్ ఖన్నా,జితేంద్ర,అమితాబ్ బచన్ వంటి నటులతో తెర పంచుకున్నాడు.


సునీల్ దత్ తన సొంత సినిమా రేశ్మా ఔర్ షేరా సినిమాలో సపోర్టింగ్ కారక్టర్ ఇచ్చి వినోద్ ఖన్నా ను ప్రోత్సహించాడు.తరువాత వారిద్దరు నెహ్లే పె డెహ్లా, డాకూ ఔర్ జవాన్ వంటి సినిమాల్లో నటించారు.


ధర్మేంద్ర తో నటించిన సినిమాలలో మొదట్లో విలన్ గాను తరువాత సమానమైన పాత్రలలోనూ నటించాడు. వారు నటించిన సినిమాలలో ఎమోషనల్  కంటెంట్ ఎక్కువ వుండేది. మొదటగా వారు కలిసి నటించిన మేరా గావ్ మేరా దేశ్ సినిమా ఒక మైలు రాయి లా నిలిచింది. వినోద్ ఖన్నా పునఃప్రవేశం తర్వాతకూడా వారుబట్వారా, క్షత్రియ    వంటి  ఆక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపించారు.


కబీర్ బేడి తో అతను కలసి నటించిన ‘కచ్చే ధాగే ‘ సినిమాకు కొందరు వీరాభిమానులున్నారు.


డెభై ఐదు -డెబ్భై ఎనిమిది మధ్య అమితాబ్ తో కలిసి వినోద్ ఖన్నా ఎనిమిది సినిమాల్లో నటించాడు. జమీర్,పర్వరిష్, అమర్ అక్బర్ ఆంథనీ ,ఖూన్ పసీనా, ముకద్దర్ కా సికందర్ ఇలాంటి సినిమాలు అన్నీ విజయంసాధించాయి.


86/87 లో తిరిగి చిత్రరంగ ప్రవేశం చేసి మరో పదేళ్ళు కథానాయక పాత్రలు ధరించాడు.అప్పుడు వచ్చిన సినిమాలలో ఇన్సాఫ్,సత్యమేవ జయతే వంటి హిట్లు ఉన్నాయి.కమల్ హసన్ ‘నాయకన్’ సినిమాను వినోద్ ఖన్నా తో అతని మిత్రుడు ఫిరోజ్ ఖాన్ నిర్మించాడు. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా హిట్ అయ్యింది. మరో చెప్పుకోదగ్గ సినిమా ‘ యాష్ చోప్రా నిర్మించిన చాందిని’. అదే కాలంలో వచ్చిన మహేష్ భట్ సినిమా ‘జుర్మ్ ‘ కూడా మంచి గుర్తింపు పొందింది.


70 లలో వినోద్ ఖన్నా తో తన తరహా సినిమాలు తీసిన ‘గుల్జార్’  90లలో కూడా డైరెక్టర్ మూవీ అనదగ్గ ‘లేకిన్’ సినిమా తీశాడు.


తర్వాత రోజుల్లో వినోద్ ఖన్న చాలా సినిమాల్లో నటించినా అతనిదైన మార్క్ వాటిల్లో కనపడదు. తండ్రి తరహా పాత్రలలోకి మళ్లి కొన్ని సినిమాల్లోనూ,టివీ సీరియళ్లలోనూ కనిపించాడు.ఐతే అవేవీ నావంటి అభిమానుల్ని అలరించేవికావు.


ఈ రోజు (27/04/2017) తన డెబ్భైఒకటో సంవత్సరంలో అతను చనిపోయాడు.


1971 లో గుల్జార్ దర్శకత్వం లో వచ్చిన ‘మేరే అప్నే’ సినిమా అతనికి మంచి గుర్తింపు నిచ్చింది. అప్పటి నగరజీవితం,యువత ఆలోచనలు,నిరుద్యోగం, నేరప్రపంచం వైపు యువత చూపు వంటి విశయాలను చర్చించిందా సినిమా. అందులో పాట ఇది.


“నావాళ్ళు అనుకునేవాళ్ళు
ఎవరైనా ఉంటే బాగుండును
దగ్గరగా కాకున్నా దూరంగానైనా
ఎవరో నావాళ్ళు


కళ్ళకు నిద్రలేదు
అది కన్నీటిలో ఈదులాడుతుంది
రాత్రంతా కలల్లో మెలకువగా ఉంటాను
ఎవరో బాధ పంచుకొనేవారు
ఎవరో వెంట నడిచేవారు


మరచిపోయిన కొన్ని వాగ్దానాలు..  
గడచిపోయిన కొన్ని జ్ఞాపకాలు..
ఒంటరితనం రాత్రంతా వాటిని తిరిగి చెబుతుంది
ఏదో ఓదార్పు దొరికితే

ఎవరో నావారు దొరికితే”


Tuesday, April 25, 2017

అబ్ క్యా మిసాల్ దూ తుమ్హారె శబాబ్ కి



‘అబ్ క్యా మిసాల్ దూ తుమ్హారె శబాబ్ కి’
(నీ యవ్వనానికి ఇప్పుడేమి పోలిక చెప్పగలను?)

ఆరతి  (1963) సినిమాలో మాహమ్మద్ రఫి పాడిన పాట.మజ్రూహ్ సుల్తాన్ పురి రచన రోషన్ సంగీతం.

అర్ధం తెలియనప్పుడు  అదీ రాత్రివేళ వింటుంటే ఒక జోలపాట వింటున్నంట్టుండే పాట ఇది.అలా అనేకసార్లు విన్నాక పాట కంటికి కనపడింది.
నటుడు ప్రదీప్ కుమార్ ని తొలిసారి తెరపై చూసింది రజియా సుల్తాన్ సినిమాలో  ‘ఇల్టుట్ మిష్ ‘పాత్రలో.  తర్వాత మార్నింగ్ షో లొ నడచిన ‘నాగిని’ సినిమా లో మాత్రమే.దూరదర్శన్ లో (రంగోలీ?) అప్పుడప్పుడు తాజ్ మహల్, చిత్రలేఖ వంటి చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాలు,కొన్ని జానపద, సాంఘిక  సినిమాల్లో రఫీ పాడిన సూపర్ హిట్ గీతాలకు అతను పెదవి కదల్చడం చూశాను.

అలాగే పాకీజా,దుష్మన్ మినహా మీనాకుమారి సినిమాలు తెరపై చూసిందిలేదు. నాకు తెలిసే సరికే ఇద్దరూ తెరమరుగయ్యారు. తర్వాత ఇంటర్నెట్ అందుబాటు లోకి వచ్చాక ,అప్పటివరకూ విని మాత్రమే ఆనందించిన  పాటల్ని చూసి కూడా ఆనందించే అవకాశం వచ్చింది.

చాలా పాత పాటలవిషయంలో,  చూశాక నిరుత్సాహపడిందే ఎక్కువ. వాటికి చిత్రీకరణ  వల్ల  విలువ హెచ్చిన సందర్భాలు తక్కువ.

ఐతే ఆరతి లోని ఈ పాట చిత్రీకరణ, పాట విన్నప్పుడు కలిగిన ఆనందాన్ని ఏమాత్రం తగ్గించదు.


పాట అర్ధం:

“నీ యవ్వనానికి
ఇప్పుడేమి పోలిక చెప్పగలను?
చంద్రుని కిరణాలు  మనిషిగా మారాయి.

అందమైన వెన్నెల వెలుగు
ముఖము మీద పూతలా ఉంది
తొలి జాము పూదోట లోని మత్తు
నీ కళ్ళలో ఉంది
గులాబి కొమ్మలో  వంపు
నీమెడ లో కనిపిస్తుంది.

నీకురులు విప్పారితే, సాయంత్రపువేళ  గుండెలో పొగలు రేగుతాయి
నీ అడుగు పడితే ,కిందికి దిగిన ఆకాశం తిరిగి లేవలేదు
సాయంత్రపు సూర్యకాంతి
వందసార్లు మెరుస్తూనే ఉంటుంది.

నీ పైట చెంగు
నా ఇంటికి శోభ
పూపొద వంటి తనువు
నాఇంటి దీపం
నా కలల స్వర్గానికి
చిత్రరూపం నువ్వు.”

-ముళ్ళపూడి సుబ్బారావు.


Saturday, April 22, 2017

కహీ దూర్ జబ్ దిన్ ధల్ జాయే, సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే


‘కహీ దూర్ జబ్ దిన్ ధల్ జాయే, సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే’

(ఎంతో దూరం ప్రయాణించాక పగటిని సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది)

ఆనంద్(1971) సినిమాలో ముకేశ్ పాడిన పాట. సలీల్ చౌధురి సంగీతం,యోగేష్ రచన

డాక్టర్ భాస్కర్ తన వృత్తిలో ఎదురయ్యే ద్వంద్వ ప్రమాణాలపట్ల అసహనంతో వున్నాడు.అతను అంతర్ముఖుడు.జీవితానికి అవసరమైన లౌక్యం కూడా అతనిలో లోపించింది. తక్కువ మాట్లాడే అతని జీవితంలోకి సదా మాటాడుతూనే ఉండే ఒక వ్యక్తి తుఫానులా ప్రవేశించాడు.ఆ వ్యక్తి పేరు ఆనంద్.

అతను ఆనందానికి మానవరూపం.సంతోషం పంచటం అతని నైజం. ఇతరుల ఆనందం కోసం ఏదైనా చేసేస్తాడు.
అతని జీవనవ్యవధి 6 నెలలే. అంతవరకూ అతను డాక్టర్ల పర్యవేక్షనలో ఆసుపత్రిలో గడపాలి.ఐతే అతను మిగిలిన జీవితం భాస్కర్ ఇంటిలో గడపాలిచాడు.

గలగల మాట్లాడుతూ జలపాతంలా హోరు చేస్తూ పరిసరాల్ని, చుట్టూ ఉన్న మనుషులమధ్య దూరాలు తగ్గిస్తూ కాలం గడుపుతున్న ఆ ఆనంద్ మనసులో నిజంగా ఏముంది?

అతను పైకి కనపడే మనిసషేనా ? లేక లోన మరొకరున్నారా?

ఇది డాక్టర్ భాస్కర్ అన్వేషణ.నిజమైన ఆనంద్ ఒక్కసారి డాక్టర్ భాస్కర్ కు అనుకోకుండా ఎదురుపడ్డాడు. ద్వంద్వాన్ని భరించలేని డాక్టరు.ద్వంద్వాన్ని అబినయిస్తూ పేషెంటు.వారిద్దరి మధ్యా ఏర్పడ్డ అనుబంధం.

ఇది ‘ఆనంద్’ సినిమా కథ.

ఈ సినిమా చూసాక మరవటం కష్టం. అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, అప్పటికి భావి సూపర్ స్టార్ అమితాబ్ ..వీళ్లిద్దరూ కాదు ,ఆనంద్, భాస్కర్ లు మాత్రమే మనతో ఉంటారు.

సినిమాలో మరువలేని ఒక సంభాషణ “ఖుషీ తొ తుమ్ సబ్ కె సాత్ భాంట్ తే హై .ఆజ్ మేరె సాత్ థోడాసా గమ్ భీ భాంట్ లో “..”నై నై నై..ఏ చీజ్ మై కిసీసే భాంట్ నే వాలా” (డాక్టర్: ఆనందాన్ని నువ్వు అందరికీ పంచుతావు.ఈ రోజు నాతో కొద్దిగా నీ బాధను పంచుకో.    ఆనంద్: లేదు లేదు. దీనిని నేనెవరితోనూ పంచుకునేది లేదు)

కొద్ది సేపు మాత్రమే కనిపించే ‘లోపలి’ ఆనంద్ ఈ పాట పాడుతాడు. అతనిపై మూడు పాటలు సినిమాలో చిత్రీకరించినా అతని పాత్రను పూర్తిగా ఆవిష్కరించేది ఈ పాటే.

ఆ సన్నివేశంలో వచ్చేదే ఈ పాట.

ఎంతో దూరం ప్రయాణించాక పగటిని
సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది
నా తలపుల వాకిటిలో
ఎవరో కలల దీపాలు వెలిగిస్తారు

ఎప్పుడైనా నా శ్వాస బరువైనప్పుడు
ఎప్పుడైనా నా కళ్ళు  నిండివున్నప్పుడు
ఆటపట్టిస్తున్నట్టు, ప్రేమతో కదలాడుతూ
ఎవరో నన్ను స్పృశిస్తారు..కాని కంటికి కనపడరు

కొన్నిసార్లు ఈ హృదయాలు కలవలేకపోతుంటాయి
కొన్నిచోట్ల ఎపుడో,జీవితకాల బంధాలు ఏర్పడతాయి
చిక్కులు ఎంతో చిక్కనివి....నా మనసే నా విరోధి
నాది ఐనప్పటికీ ,వేరే వారి బాధను సహిస్తుంది.


నా మనసుకి నా లోలోపలి రహస్యాలన్నీ తెలుసు
నా పసిడి కలలు ఎలా ఛిద్రమయ్యిందీ తెలుసు
నా ఈ స్వప్నాలు .. ఇవి మాత్రమే నావి
వీటి నీడలు కూడా నానుండి దూరం కావు.

-ముళ్ళపూడి సుబ్బారావు


Thursday, April 20, 2017

హమ్ తెరె షెహర్ మె ఆయే హై ముసాఫిర్ కి తరాహ్


హమ్ తెరె షెహర్ మె ఆయే హై ముసాఫిర్  కి తరాహ్

పనితో పాటు పుట్టిన పాట, పనికి దూరమై  నాజూకుగా మారి రాజాస్థానాలకు జేరిందంటారు. అక్కడ కొత్త రూపాలు సంతరించుకుంది. రూపంతో పాటు విషయాన్నీ మార్చుకుంది.


ఘజల్ అలాంటి ఒక రూపం. ఒకప్పుడు దానిని విని ఆనందించటం ఉన్నత వర్గాల ఉత్తమ అభిరుచికి నిదర్శనం.  అలాంటి ఘజల్ కొద్ది కొద్ది రూపబేధాలతో, అందులోని సారాంశాన్ని మార్చుకుంటు తిరిగి వెనక్కి ప్రయాణంచేసింది.


మెహఫిల్ లో ఆలాపన  అనేది సంపన్న,ఉన్నత వర్గాల సాంస్కృతిక సమావేశం లో పాడేదైతే, స్ట్రీట్ సింగింగ్ (వీధి పాట) సామాన్యులకోసం వాళ్లదగ్గరకు వెళ్లి పాడేది.


అక్కడి పాట రూపసారాంశాలు ఏమిటి? ఇక్కడి పాటవేమిటి?


దీనికి సంబంధించిన నా అనుభవం ఒకటి..


గులామ్ అలి పాడిన ఒక ఘజల్ ‘ హమ్ తెరె షెహర్ మె ఆయే హై ముసాఫిర్  కి తరాహ్ ‘.అతని కచేరీల్లో తప్పనిసరిగా ఉండే ఘజల్ ఇది.


అతని పాటకచేరీ సాధారణం గా చక్కటి ఏ సి హాలుల్లొ జరుగుతుంది.శ్రోతల్లో ఎగువ వర్గానికి చెందినవారే అధికం.


ప్రియురాలు చేతిలో ఒక వ్యక్తి మోసపోయాడు. ఆమెకై ఆమె ఊరికి వచ్చాడు. ఆమెను కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. పాట రూపంలో అతని బాధ వెళ్లగక్కుతున్నాడు.


గులామ్ అలి చేతిలో హారొనియమ్ అతని గొంతుతో కలిసిపోతుంది.
ఆ పాట వింటూ  శ్రోతలు తన్మయులు ఔతుంటారు.

అదే పాటను సుమారు పదిహేనేళ్ళ వయసున్న వీధిగాయకుడు, తన తల్లి వాద్య,గాత్ర సహకారంతో రహదారి పక్కన కూర్చుని పాడుతున్నాడు. అతని చేతిలో డోలక్ ఉంది. అతని గొంతులో ఎత్తుపల్లాలకు అతని డోలక్ శబ్దానికి చిత్రమైన ‘సింక్’ ఉంది.
పాటలో పదాలు అవే. ఐతే అవి అతను ప్రియురాలిని వేడుకుంటున్నట్టు లేవు. ఎవరినో గట్టిగా ప్రశ్నిస్తున్నట్టు గా వున్నాయి.
ప్రత్యేకం గా ‘ మేరా మంజిల్ హై కహా,మేరా ఠికానా హై కహా?’ పదం నిలదీసి అడుగుతున్నట్టు వుంది.
ఆ పాట వినే శ్రోతలు గులామ్ అలి పాట విన్నపుడున్నంత తన్మయంగా ఉండరు.


పాట అర్ధం:

నేను నీ నగరానికి బాటసారి లా వచ్చాను.
ఒకేఒక్కసారి కలవటానికి అవకాశమివ్వు


నా గమ్యం ఎక్కడ ?  నిలువనీడ ఎక్కడ?
ఉదయం నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను?
ఆలోచించుకోవటానికి ఒక రాత్రి కి అవకాశమివ్వు


నా కనుకొలకుల్లో తడిమెరుపును  దాచి ఉంచాను
నా కనురెప్పలను అశృవులతో అలంకరించి ఉంచాను.
నా కళ్ళకు ఒక్కసారి వర్షించటానికి అవకాశమివ్వు


ఈ రాత్రి నా ప్రేమ బాధను విను
కంపించుతున్న పెదవుల ఫిర్యాదు విను
ఈ రోజు నా ఆలొచనలు చెప్పుకోవటానికి అవకాశమివ్వు

మరచిపోయేదే ఐతే  ఒప్పుకున్నది  ఎందుకు?
నమ్మకద్రోహీ! నువ్వు నన్ను ప్రేమించింది ఎందుకు?
కనీసం రెండు మూడు ప్రశ్నలడగటానికి అవకాశమివ్వు

--ముళ్ళపూడి సుబ్బారావు

Tuesday, April 18, 2017

ఎక్ చమేలీ కీ మండ్వే తలే



 ‘ఎక్ చమేలీ కీ మండ్వే తలే’
(ఒక మల్లె పందిరి నీడలో)
గానం మహమ్మద్ రఫీ,ఆశా భోన్స్లే),సినిమా పేరు ‘చ చ చ ‘(1964)  (చ చ చ అనేది ఒక విదేశీ నృత్య శైలి)


‘మల్లె పందిరి నీడలోనా జాబిల్లీ’ అంటూ సాగే తెలుగు పాట ఉంది. హిందీ లో అలాంటి మాటలతో మొదలయ్యే పాటఒకటి ఉంది.ఆ పాట ‘ఎక్ చమేలీ కీ మండ్వే తలే’.

 ’చమేలీ కీ మండ్వా’ పదం విన్నది ఈ పాటతోనే కానీ, అది గుర్తుండటానికి మరో కారణం O వ్యాసంలో  ఆ పదం ఎంఫటిక్ గా కనపడటం.

చమేలీ అంటే మల్లె అని అర్ధం. ‘మండ్వా’ అంటే  మనదగ్గరి  ‘మండువా’ (ఇంటి మధ్య  సూర్యకాంతి పడే ఖాళీ ప్రదేశం)  అనుకోవచ్చేమో!. అలాంటి చోట  మల్లె పెరిగితే అది మల్లె మండువా ఔతుంది. అక్కడొక పందిరిపై మల్లె పాకిస్తే ‘మండువాలో మల్లె పందిరి’  ఔతుంది.  ‘చమేలీ కి మండ్వా’ కు నా ఊహారూపం అది.

ఈ హిందీపాట వివిధ భారతి లో ఎక్కువగా వినపడేది. పాట వినటానికి బాగుండటమే కాదు,దానికి  మరిన్ని ప్రత్యేకతలున్నాయి.

ఈ సినిమా హీరో  ‘చంద్రశేఖర్ ‘. సినిమా దర్శకుడూ నిర్మాతా కూడా ఆయనే.చాలా కొద్ది  సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. తర్వాత కారెక్టర్ నటుడు గా మారి గుర్తుపట్టగలిగే పాత్రలు చాలానే వేశాడు. అతను హైదరాబాదు నుండి హిందీ చిత్ర సీమకు వెళ్లిన కొద్దిమందిలో ఒకరు.

ఈ పాట రాసింది ‘ముఖ్దుమ్ మొహియుద్దీన్’.తెలంగాణా లో ప్రముఖ వామపక్ష నాయకుడు,అభ్యుదయ కవి.హైదరాబాద్ వాసి. బహుశా ఈ ఒక్క సినిమాలోనే ఆయన పాటలు ఉన్నాయనకుంటాను.ఈ పాట ఆయన సినిమా కోసం రాసింది కాదేమోనని కూడ ఆనిపిస్తుంది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు ‘ఇక్బాల్ ఖురేషి’ .ఈయనా హైదరాబాద్ లో పెరిగినవాడే.హిందీ సినిమారంగంలో చానాళ్ళు కొనసాగాడు కాని చిన్న తరహా సినిమాలకే పనిచేశాడు.

పై ముగ్గురూ హైదరాబాదు లో ముందునుండీ సన్నిహితులు, కలసి ఒక సాంస్కృతిక సంస్థలో పనిచేసినవారు.


పాట అర్ధం.
“ఒక మల్లె పందిరి నీడలో
పానశాలకు కొద్ది దూరపు మలుపు దగ్గర
రెండు తనువులు ప్రేమాగ్నిలో దగ్ధమౌతున్నాయి


ప్రేమ వారి స్థిరనమ్మిక,
ప్రేమ వారి దైవం
ప్రేమ వారి చితి

మంచులో తడిసారు
వెన్నెల్లో స్నానంచేసారు
మలిసంధ్యలో పూచిన తాజా పూలలా..

తోటలో వీచే చల్లటి గాలి
ఆగి మౌనందాల్చింది
నల్లనల్లని కురులు వేడి చెక్కిళ్ళపై
ఒక్కక్షణం ఆగాయి.

మేము వాళ్ళను చూశాము,
పగటి వేళా రాత్రి వేళా
వెలుతుర్లో  చీకట్లో
మసీదు మినారుల్లో చూశాము వారిని
మందిర  ద్వారాల్లో చూశాము  వారిని
మధుశాల చుట్టుపక్కల చూశాము వారిని

రెండు తనువులు ప్రేమాగ్నిలో దగ్ధమయ్యాయి.”


-ముళ్ళపూడి సుబ్బారావు.

Saturday, April 15, 2017

ఖోయా ఖోయా చాంద్,ఖులా ఆస్మాన్


“ఖోయా ఖోయా చాంద్,ఖులా ఆస్మాన్”
(“చంద్రుడు మాయమయ్యాడు, ఆకాశం ఖాళీ అయ్యింది)
కాలా బజార్ సినిమాలో రఫీ పాడిన పాట,శంకర్ జైకిషన్ సంగీతం,శైలేంద్ర రచన

ఏలూర్లో చదువుకునే రోజుల్లో (1986) లో కొన్ని రోజులు  రూములో ఒక్కడినేఉన్నాను.ఒక లెక్చరర్ ద్వారా ఒకతను రూమ్ మేట్ అయ్యాడు. అంతకు ముందు అతను హైదరా బాద్ లో ఉండేవాడు. ఒక రోజు పుస్తకంగా వచ్చిన అతని కవితలు చూపించాడు. వాళ్ళ తండ్రి పై రాసిన కవితలవి. నేను ప్రత్యక్షం గా చూసిన తొలి కవి అతను.
మధ్య మధ్యలో అతను పాటలు పాడుతుండేవాడు. ఒక పాటపంక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క సారి  పదే పదే పాడేవాడు. అందులో కొన్ని  “నీదు మనసు నీలో లేదు నాలోన లీనమయే “, “నిదుర రాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి”, “మేలుకున్న స్వప్నము లోన ఏల ఇంక బిడియ పడేవు”.

అడిగినపుడు ఆ పాట మొదలు చెప్పాడు . అది “నిండు చందమామ ..నిగనిగల మామ”అంటూ సాగే జేసుదాసు తొలిరోజుల్లొ పాడిన తెలుగు పాట. సినిమా ‘బంగారు తిమ్మరాజు’.ఆ సినిమా అంతకు మునుపు చూసాను,పాటా విన్నాను. ఐతే పదే పదే అతని నోట వింటుంటే మరింకేదో పాట మనసులో మెదులుతుండేది. హఠాత్తుగా ఒక రోజు స్ట్రైక్ అయ్యింది. ఆ పాట కి , రఫీ పాడిన ‘ఖోయా ఖోయా చాంద్ ‘ పాటకు పోలికలున్నాయి.

తెలుగు పాటకు సంగీత దర్శకులు ‘రాజన్ నాగేంద్ర ‘ ద్వయం. తర్వాతి రోజుల్లో వారి కన్నడ,తెలుగు పాటల వరసలు  కొన్ని హిందీ సినిమా సంగీత దర్శకులూ తీసుకున్నారు.

హిందీ పాట ‘ఖోయా ఖోయా చాంద్ ‘ పాట చంద్రుడు మాయమయ్యాడని చెబుతున్నా వింటున్నప్పుడు వెన్నెల్లో విహరిస్తున్నట్టే ఉంటుంది నాకు..చాలా వరకు పాత పాటల్లో  కొన్నింటికి మాత్రమే దృశ్యం  విలువను పెంచుతుంది. చనచ్చిన  పాటలు చూడకుండా కళ్ళుమూసుకునో,శున్యంలోకి చూస్తూనో వింటున్నప్పుడు మనసు పాటతో తేలిపోతూ ఎక్కడెక్కడో విహరిస్తుంది.

నావరకూ ‘ఖోయా ఖోయా చాంద్’ అలాంటి పాటే.

పాట అర్ధం

“చంద్రుడు మాయమయ్యాడు, ఆకాశం ఖాళీ అయ్యింది
నీకు నిద్ర ఎలా వస్తుంది? చూపులతో  రాత్రంతా  గడచి పోతుంది.

మత్తుతో నిండిన గాలి వీస్తుంది
హృదయపు మొగ్గ వికసిస్తుంది
మనసు దారుల్లో అలజడి రేగింది
ఆమెను పిలవాలంటే

తారలు కదలిపోతున్నాయి. పరిసరాలు కదలిపోతున్నాయి
నాతో పాటు అవన్నీ ప్రయాణమయ్యాయి.
నాలుగు వైపులనుండీ  సైగలు వస్తున్నాయి.
ఎవరి వానివో ఐపొమ్మని

అలాటి రేయి,తడిసిన రేయి
చేతిలో చేయి, ఆమెజతలో హాయి
మనసులో మాట ఆమెకు చెప్పేస్తే
ఇప్పుడు నన్నుబాధించకు

నన్ను నేను ఎవరికోసం వదులుకున్నానో
ఆమె ఏమీ మాటాడక మౌనంగా ఉంది.
నాకంత   పరీక్ష పెట్టద్దని
ఎవరైనా ఆమెతో కొద్దిగా చెప్పండి “

నా ముప్ఫైయేళ్ళ క్రితం స్నేహితుడ్ని ఈ పాట గుర్తు చేస్తూ ఉంటుంది. అతని పేరు నాగళ్ళ దుర్గాప్రసాద్ (తెనాలి)
---ముళ్ళపూడి సుబ్బారావు

Thursday, April 13, 2017

యార్ హమారీ బాత్ సునో




‘లెట్ హిమ్ హు ఈజ్ విత్ అవుట్ సిన్ కేస్ట్ ది ఫస్ట్ స్టోన్’(పాపాలు ఏమీ చేయనివారే మొదటి రాయి విసరాలి).
బైబిల్ లో ప్రసిద్ధ వాక్యం.

‘యార్ హమారీ బాత్ సునో’(నా మాట వినండి మిత్రులారా).
‘రోటి’(1974) సినిమాలో కిశోర్ కుమార్ పాడిన పాట. లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం,ఆనంద్ బక్షీ రచన.

నేరం నాదికాదు! ఆకలిది సినిమా వచ్చింది. అందులో చిన్నప్పటి కథానాయకుడు అమ్మ ఆకలి తీర్చటానికి రొట్టె దొంగతనం చేసాడు. అది తప్పించుకోవటానికి ఓ నేరస్థుడు సాయపడ్డాడు.కథానాయకుడు నేరాలతోనే పెరిగి జైలు శిక్ష అనుభవించి బయటపడ్డాడు. మామూలు జీవితం గడుపుదామనుకుని  మళ్లీ ‘రొట్టె’ కోసమే ఒకతనితో గొడవపడి అతని మరణానికి కారకుడయ్యాడు. కోర్ట్ లో న్యాయమూర్తి తో చెప్పాడు ‘నేరం నాది కాదు మిలార్డ్ ఆకలిది’ అని.


ఈ సినిమా కు అధారం ‘రోటీ ‘ పేరుతో వచ్చిన హిందీ సినిమా .ఇందులో కథానాయకుడు రాజేష్ ఖన్నా. అతనపుడు సూపర్ స్టార్. సినిమా తీసినాయన ‘మన్ మోహన్ దేశాయ్’. తర్వాత తర్వాత ‘పెద్ద’ చిత్రాలు,మల్టి స్టారర్ సినిమాలు తీయటంలో పేరుగాంచాడు.

రామాయణంలో దశరధుడు పాత్ర లో విషాదముంది. ఆ విషాదానికి కారణం అతనికున్న శాపం. ఉద్దేశ రహితంగా శ్రవణ కుమారుని చావుకి కారణమై అంధులైన అతని తల్లి తండ్రుల శాపానికి గురయ్యాడు.

‘దుష్మన్’ పేరుతో అంతకుముందు రాజేష్ ఖన్నాదే ఒక్ సినిమా వచ్చింది. అందులో కథానాయకుడు అనుకోకుండా ఒక మనిషి మరణానికి  కారణమౌతాడు. చనిపోయినతని కుటుంబానికి సేవ చేయాల్సిందిగా కోర్ట్ అతనికి శిక్ష విధిస్తుంది.


రోటి సినిమా కథ ఈ రెండు కథలు కలిపి ఉంటుంది. జైలు నుమ్డి తప్పించుకున్న హీరో  పారిపోతూ రైలులో ఒక వ్యక్తి రైలునుండి నదిలోకి పడిపోవటానికి కారణమయ్యాడు. పారిపోయిన కథానాయకుడు మారుమూల వూరిలో ఒక అంధ దంపతుల దగ్గర చేరాడు. వారెవరో కాదు. హీరో తో నదిలో తోయబడ్డ వ్యక్తి తల్లిదండ్రులే. అతని పేరు శ్రవణ్.

సినిమా కాశ్మీర్ లోనూ హిమాలయాల సానువుల్లోనూ చిత్రీకరింపబడింది. అందమైన లొకేషన్లు, మనోరంజకమైన పాటలతో  సినిమా ఆద్యంత ఆకర్షణియంగా సాగుతుంది.

కథానాయకుడు పారిపోతున్న దారిలో ఒక చోట బస్సు ఆగింది. అకాడ కొందరు ఒక యువతి నడత బాగుండలేదని రాళ్ళతో కొట్టి హింసిస్తున్నారు. అప్పుడు హీరో చేసిన హితబోధ ఈ పాట.

‘లెట్ హిమ్ హు ఈజ్ విత్ అవుట్ సిన్ కేస్ట్ ది ఫస్ట్ స్టోన్’(పాపాలు ఏమీ చేయనివారే మొదటి రాయి విసరాలి) అనేది బైబిల్ ఒక ప్రసిద్ధమైన వాక్యం.
ఆ వాక్యం ఆధారంగా ఈ పాట రాయబడిందని పిస్తుంది. ఐతే ఆ వాక్యానికి కొనసాగింపుగా శిక్షకు గురైన ఆమెతో క్రీస్తు   చెప్పిన మరో మాట ‘ టు గో అండ్ సిన్ నో మోర్’( వెళ్ళు ,తిరిగి తప్పు చేయకు ) పాటలో ప్రస్తావనకు రాదు.

“నా మాట వినండి మిత్రులారా
ఎవరైతే పాపి కారో వానిని
ఎవరైతే పాపంచేయలేదో వానిని
ఒక్క మనిషిని ఎంచుకోండి

కొందరు మహా తెలివిమంతులు
కొందరు మామూలు మనుషులు
కొద్దిగానో కాస్త ఎక్కువగానో
మనలో ప్రతిఒక్కరం పాపులమే
కొందరు ఒప్పుకుంటారు,కొందరు కోపగిస్తారు
కొందరు దొరికిపోయినవారు కొందరు తప్పించుకున్నవారు


మనమంతా కలిసి ఈ పాపికి శిక్ష విధించాలి
కాని ఎవరైతే పాపి కారో వారే తొలి రాయి విసరాలి

మొదట మీ మనసును శుభ్రపరచుకోండి
తర్వాత వేరే వారికి న్యాయం చెప్పండి.

నా మాట వినండి మిత్రులారా
ఒక నిర్దోషిని ఎన్నుకోండి
పాపి కాని వానిని
పాపంచేయని వానిని”


--ముళ్ళపూడి సుబ్బారావు.


Tuesday, April 11, 2017

లాగా చునరీ మే దాగ్, చుపావూ కైసే



‘లాగా చునరీ మే దాగ్, చుపావూ కైసే?’ (ముసుగు పైన మరక అంటింది? దానిని ఎలా దాయగలను?)
దిల్ హీ తో హై(1963)  సినిమాలో మన్నాడే గాన చేసిన పాట.
రాజ్ కపూర్ సొంత సినిమాలలో ఆయనకు అధికభాగం నేపధ్యగానం  ముకేశ్ చేశారు . ఒకవేళ ముకేశ్   పాడక పోతే ఆ స్థానం మన్నాడే దే. సాధారణంగా రాజ్ కపూర్ సినిమాలకు సంగీత దర్శకత్వం శంకర్ జైకిషన్ (లు) వహించేవారు. శైలేంద్ర గీతరచన చేసేవారు.

ఐతే దిల్ హీ తో హై సినిమాలో వేరే కలయిక వచ్చింది. అందులో కొన్ని పాటలు సాహిర్ లూధియాన్వి రాశారు.సంగీతం రోషన్ అందించారు. అందులో ఒక పాట ‘లాగా చునరీ మే దాగ్, చుపావూ కైసే?’.

మన్నాడే నేపధ్య గాయకుడిగా ఎప్పుడూ ‘ఒక’ వెలుగు వెలగలేదు. ఐతే నలభై యేళ్ళపాటు తన ప్రత్యేకత నిలుపుకుంటూనే ఉన్నాడు. శాస్త్రీయ సంగీతం తో కూడిన పాటలు కాని, ఫిలసాఫికల్ టచ్ ఉన్న పాటలు కాని పాడాల్సివచ్చినప్పుడు  అవి మన్నాడే తలుపు తట్టాయి. అలాంటి పాటలో చాలా భాగం ‘నిలిచి’ పోయే పాటలు కావటం విశేషం.

పాటల రచయిత  సాహిర్ లూధియాన్వి ఈ పాటలో ఒక మాజిక్ చేశాడు. అతని పేరులో ‘సాహిర్’ అంటే ‘మాజిక్’ అనే. వినేవారికి పాట ఒక రకంగా అర్ధం ఔతూ  హఠాత్తుగా వేరేది చెబుతుంది.

సంగీతదర్శకుడు ‘రోషన్’ శాస్త్రీయ సంగీత పునాదితో అనేక పాటల్ని అజరామరం చేసిఉన్నాడు. ఈ పాట అతని కిరీటంలో మరో తురాయి. (అతని కుమారులు రాజేష్ రోషన్(సంగీత దర్శకుడు), రాకేష్ రోషన్(నటుడు,దర్శకుడు) మనుమడు హృతిక్ రోషన్(నటుడు)  ఇప్పటికీ చిత్ర రంగంలో ఉన్నారు)

సినిమాలో కథానాయకుడు గాయకుడు. ఒకసారి వృద్ధ సంగీతకారుడుగా మారువేషంలో ఒక ప్రదర్శనలో పాల్గొన్నాడు. సినిమాలో అతని మారువేషం, అతని నటన హాస్యంకోసం పెట్టి ఉండవచ్చేమో కాని పాట అర్ధం ,గానం,సంగీతం పాటను ఏ మాత్రం హాస్యగీతం కాదని చెబుతున్నాయి.

పురుషుని స్వరం తో ఉన్నా, పాట స్త్రీ  తనకి సంబంధించి తన ‘కన్ఫెషన్ ‘ చెబుతున్నట్టు ఉంటుంది.

పాట అర్ధం.
“ముసుగు పైన మరక అంటింది? దానిని ఎలా దాయగలను?
ముసుగు పైన మరక ..దానిని ఎలా దాయగలను? ఇంటికి ఎలా వెళ్ళగలను?

ముసుగు పై మరక అయ్యింది
శుద్ధమైన శరీరంపై శుద్ధమైన  ముసుగు
వెళ్లి తండ్రి కళ్ల్లలోకి ఎలా చూడగలను? ఇంటికి ఎలా వెళ్ల్లగలను?

ఇచ్చిన మాటలు,విధులు  అన్ని మరచాను
అత్తగారి ఇంటికి వచ్చి మైకంలో పడిపోయాను
వెళ్లి తండ్రి కళ్ల్లలోకి ఎలా చూడగలను? ఇంటికి ఎలా వెళ్ల్లగలను?
******
శుద్ధమైన ముసుగు మరేమీ కాదు నా ఆత్మే!
మరక అనేది మాయాజాలమే!
ఆ ప్రపంచం నా తండ్రిగారి ఇల్లు
ఈ ప్రపంచం నా అత్తగారి ఇల్లు
వెళ్లి తండ్రి కళ్ల్లలోకి ఎలా చూడగలను? ఇంటికి ఎలా వెళ్ల్లగలను?”
పాట సగంనుండి మన్నాడే చేసే స్వరాలాపన పాట విలువ మరింత పెంచింది. ఈ పాట ఎప్పటినుందో వింటున్నా క్రమక్రమంగా నన్ను ఆకట్టుకుంది. సుమారు పదేళ్ళక్రితం  ఒక టివీ సంగీతకార్యక్రమం లో నటుడు సచిన్ (హిందీ/మరాఠీ) ఈ పాట స్వరాలాపనతో సహా పాడటం గమనించాక అతనిపట్ల గౌరవం పెరిగింది.
-ముళ్ళపూడి సుబ్బారావు.

Sunday, April 9, 2017

జిహాల్ ఎ ముస్కిన్ ముకుంబ్ అ రంజిష్


‘జిహాల్ ఎ ముస్కిన్  ముకుంబ్ అ రంజిష్...బహాల్ ఎ హిజ్రా బేచారా దిల్ హై’
(ఈ పేదగుండెను కోపంగా చూడకు,అది ఇప్పటికే తనవారికి దూరమై  గాయపడి ఉంది)

గులామీ (1985) సినిమా లో పాట ఇదిగుల్జార్ సాహిత్యం,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం,షబ్బీర్ కుమార్ , లతా మంగేష్కర్ గానం.


. పాట పల్లవి  కొత్త పదాలతో  ఉంది.భాష హిందీ ఐతేకాదు. ఉర్దూ కావచ్చనిపించింది. పల్లవి కాకుండా మిగతా పాట అర్ధమౌతుంది. గీరతకారుడు గుల్జార్.అతని పాటల్లో ఉర్దూ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అనేక పాటల్లో గాలిబ్ ,మీర్ వంటి వారి కవితాపాదాలను కొన్నింటిని వాడి వాటిని కొత్త అర్ధాలతో సినిమాల్లోకి తెచ్చాడు.

ఐతే ఈ పాట కు పల్లవి మాత్రం అతను ‘అమీర్ ఖుస్రో ‘ రాసిన గజల్ నుంచి తీసుకున్నాడట. అలా ‘జిహాల్ ఎ ముస్కిన్ ముకుంబ రంజిష్’ అంటూ మొదలయ్యే పల్లవి   పర్షియన్ బాష నుండి హిందీ పాటలోకి వచ్చింది.

సినిమా రాజస్థానీ గ్రామీణ ప్రాంతానికి  చెందింది. అక్కడి భూస్వామ్య వ్యవస్థ, కులవివక్ష, గదానికి వ్యతిరేకంగా పోరాటం సినిమాకథ. భూస్వామ్యకుటుంబంలో యువకులు,వారి బంధువైన ఒక పోలీసు అధికారి ఒకవైపు, వారి అకృత్యాలకి బలైన వర్గం వైపు ఒక యువకుడు,అతనికి సహకారం అందించిన సైన్యంలో పనిచేసిన యువకుడు మరొకపవైపు...వీరి మధ్య ఘర్షణ తో సినిమా సాగుతుంది.

ఇందులో సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా మిథున్ చక్రవర్తి నటించాడు. అతని ప్రయాణం లో ఒకామెను రక్షించాడు. ఆమె అప్పటికే గాయపడిన మనసుతో ఉంది. వారిద్దరు బస్సు ప్రయాణం చేస్తున్నాఋఉ. బస్సు మధ్యలో ఆగింది. అక్కడ ఉన్న బంజారాలు ఒక పాట ప్రారంభించారు. అందులో వీరూ పాట కలిపారు. బస్సు బయలుదేరింది. బస్సు టాపు మీద కూర్చున్న ఇద్ధరిమధ్యా పాట కొనసాగింది.
(పాట మధ్యలో కథానాయకుడు ఆ సినిమాలో తన్ ఊతపదమైన ‘కోయి షక్ ‘ అంటాడు. పాటలో లీనమైపోయిన ప్రేక్షకులు అది విని ఈలలు వేస్తారు)

పాట అర్ధం:

ఈ పేదగుండెను కోపంగా చూడకు
అది ఇప్పటికే తనవారికి దూరమై  గాయపడి ఉంది


వినవస్తుందిఎవరిదో హృదయ స్పందన
నీ గుండె నుండా?? నా గుండె నుండా?

తను వచ్చి పక్కన కూర్చుంటే
ఈ సాయంత్రం రంగులమయమై పోయింది

కొద్దికొద్దిగా మేను పులకరింపు
కొద్దిగా ఎదోబాధ

చిత్రమైన హృదయవేదన..
అది లేకుంటే జీవించటమే కష్టం

ప్రతిగాయమూ ఒక వజ్రమే
ప్రతి వేదనా ఒక ఆభరణమె.

అప్పుడప్పుడూ సాయంసంధ్య
మేలిముసుగు మెల్లగా తీసినట్టు ఉంటుంది

నీ వంటినుండి వచ్చే ధూపం
నా గుండేలొ తిరుగాడుతుంది

అది సిగ్గా లేక గౌరవమా?
కనులు పైకెత్తగానే వాలిపోతున్నాయి.

నీ కళ్ళనుండి రాలిన చినుకులు
నా కళ్ళలో వచ్చి నిలిచాయి.

  • ముళ్ళపూడి సుబ్బారావు