Friday, June 30, 2017

మై పల్ దో పల్ కా శాయర్ హు

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -100
1.మై పల్ దో పల్ కా శాయర్ హు, 2.మై హర్ ఎక్ పల్ కా శాయర్ హు
( నేను ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని) ( నేనుప్రతిక్షణం నిలిచిఉండే కవిని)
కభీ కబీ సినిమాలో ముకేశ్ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, ఖయ్యామ్ సంగీతం.
ప్యాసా ,కభీ కభీ , రెండు సినిమాలూ సినీ ప్రేమికుల్ని, సినీ సంగీత ప్రేమికుల్నీ అలరించాయి. రెంటికీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ కథానాయకులు కవులు. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ విఫలమయ్యింది. ఇద్దరి జీవితాలలోనూ తర్వాతి రోజుల్లో పాత ప్రేమికలు తారసపడ్డారు. ఐతే తర్వాత వారు సాగిన దారులు వేరు.
రెండు సినిమాలకు సాహిత్యం ‘సాహిర్ లూధియాన్వి’దే.నిజజీవితలో భగ్న మనస్కుడైన ‘సాహిర్ లూధియాన్వి’ కొన్ని పాటల్లో తాను నిజంగానే ప్రవేశిస్తాడు. కథానాయకుడు కూడా తనవంటి కవి ఐనప్పుడు ,పాత్ర మనసిక స్థితిలో కూడా సామాన్యత ఉన్నపుడు ‘సాహిర్ ‘ తనే ఆ పాత్ర ఐపోయాడు. ‘సాహిర్’ అలా పాత్రగా మారి సాహిత్యం అందించిన ఈ రెండు సినిమాలూ రెండు కళాఖండాలు గా నిలిచిపోయాయి.
‘ప్యాసా’ విషాదాంతం అనలేము ,అలాగే ప్రమోదాంతం అనలేము. చివర్లో కథానాయకుడు తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు.
కభీ కభీ లో కథానాయకుడు ప్రేమను పొందలేని చోట ఆగిపోలేదు. అతనిది మరీ ప్రత్యేక ప్రపంచం కాదు. సమాజంతో మరీ ఫిర్యాదు లేదు.వేరే జీవితాన్ని నిర్మించుకున్నాడు. తండ్రి వ్యాపారాన్ని తను చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు.
తన తొలినాళ్ళలో జీవితం పట్ల అతని ఆలోచనల్ని అతను గానంచేసాడు. తన జీవితం తనది మాత్రమే అనుకున్నాడు. తనతో పాటు అది అంతమౌతుందనుకున్నాడు. తనున్న రెండు క్షణాల జీవితం ఎవరికీ పట్టనిదనుకున్నాడు. తనని ‘రిప్లేస్’చేసేవారితో తనకేమీ సంబంధం లేదనుకున్నాడు.
అప్పటి రోజుల్లో అతని గానం:
“రేపు కొత్త మొగ్గలు తొడుగుతాయి.రేపు కొత్త పువ్వులు నవ్వుతాయి
కొత్తనేలమీద,కొత్త పచ్చికపై కొత్త పాదాలు నడయాడుతాయి
అవి నన్ను పట్టించుకోవు.నేనూ వాటిని పట్టించుకోను
వాటి ఉదయ సాయంత్రాలలో ఒక లిప్త కాలమైనా నాదిగా ఎలా చేసుకోగలను?
నేనూ ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని
ఒకటి రెండు క్షణాల సంతోషం నాది,ఒకటి రెండుక్షణాలు ఉండే యవ్వనం నాది
నాకంటే ముందు ఎంతమంది కవులు రాలేదు ? వచ్చి వెళ్లిపోలేదు
కొందరు నిట్టూర్పులు విడిచి వెళ్ళారు కొందరు పాటలు పాడి వెళ్ళారు
వారూ ఒక్క క్షణపు కథలే, నాదీ ఒక్క క్షణపు కథే
ఇప్పుడు మీలో భాగాన్నినేను ,రేపు మీనుండి దూరమౌతాను.
రేపు వికసించే పాటల మొగ్గల్ని ఏరుకునేవారు మరొకరు వస్తారు
నాకంటే ఉన్నతంగాగా చెప్పేవారు, మీకంటే ఉన్నతంగా వినేవారు
రేపెవరో నన్ను గుర్తుచేసుకుంటారు. ఐనా ఎందుకు గుర్తుచేసుకోవాలి?
తీరికలేని ప్రపంచం నాకోసం తన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటుంది?”
సినిమా చివరిలో ఒకతరంలోని వ్యక్తులు తమ తర్వాతతరం వారిలో తమని తాము చూసుకుంటున్నారు. అపుడు
వినిపించే పాట మొదటి పాట వరుసలోనే మరొక అర్ధంతో వినపడుతుంది.
జీవితమంటే ఒకరి జీవితం కాదు. అది రూపాలు మార్ర్చుకుంటూ వేరే వారిని వాహిక చేసుకుని కొనసాగుతుంటుంది అని చెప్పే పాట అది. జీవితానికున్న ‘కొనసాగింపు’ ను తన జీవితానుభవాలద్వారా కథానాయకుడు గమనించగాడని అనిపిస్తుంది.
“ ప్రతిక్షణం నిలిచిఉండే కవిని నేను
కలకాలం నిలిచి ఉండే కథ నాది
ఎల్లవేళలా ఉండే సంతోషం నాది
అనుక్షణం ఉండే యవ్వనం నాది
అనుబంధాల రూపం మారుతూ ఉంటుంది
బంధాల పునాదులు నాశనం కావు
స్వప్నాలు, ఆకాంక్షలు నాశనం కావు.
ఒక పువ్వులో నీ రూపం నిలుస్తుంది
ఒక పువ్వులో నా యవ్వనం ఉంటుంది
ఒక ముఖం లో నీ గుర్తులుఉంటుంది
ఒక ముఖంలో నా గుర్తులుంటాయి
నువ్వు నేను జీవన అమృతాన్ని
ఈ చేతులతో తాగాలి
వీరి గుండె చప్పుడులో నివాసముండాలి
వీరి శ్వాస లో జీవించాలి
నీ సోయగాల్ని ఒకరికివ్వు
నేను నా నమ్మకాన్ని ఒకరికిస్తాను
ని కోసమే చేసిన ఆలోచనలు
అన్నింటినీ దీవెనలు చేస్తాను.”



ముఝే నవ్ లఖా మాంగాదే రే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -99A
‘ముఝే నవ్ లఖా మాంగాదే రే ‘, ‘లోగ్ కెహతే హై మై షరాబీ హు’
(ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.),( ‘లోకులనుకుంటారు నేను తాగుబోతునని’)
...
షరాబి సినిమాలో ఆశా భోన్స్లే, కిశోర్ కుమార్ పాడినపాట.రచయిత అంజాన్,సంగీతం బప్పిలహిరి.
నాకుతెలిసి లిరిక్ గా అతిపెద్ద పాట. రెండు పాటలుగా కూడా చెప్పవచ్చేమో.
పాట మొదటి భాగం ఆశాబోన్స్లే స్వరంతో ఏదో జానపద గీతం ఆధారంగా తయారయ్యిందనిపించేలా ఉంటుంది.
రెండో భాగం కిశోర్ స్వరంతో మనుషులంతా ఏదో ఒక మత్తులోనే ఉంటారని చెబుతూ సాగుతుంది.భానుమతి పాడిన ఒక తెలుగుపాట ‘పిచ్చి పిచ్చి పిచ్చి,రకరకాల పిచ్చి’ ని ఈ పాట గుర్తుచెస్తుంది.

డెబ్భైలలో దర్శక నిర్మాత ‘ప్రకాశ్ మెహ్రా’ కు అమితాబ్ తో అనేక విజయాలందాయి. తొలి ఎనభైలలో కూడా వీరి కాంబినేషన్ ఆర్ధిక విజయాలనిచ్చింది కానీ పాత కీర్తిని పెంచలేదు. ఎనభైల తర్వాతి వాటిలో నాకు నచ్చిన సినిమా ‘షరాబి’. అమితాబ్ ,అమితాబ్ గా కనపడిన అతికొద్ది సినిమాలలో ఇది ఒకటి(పూర్తి స్థాయి కథానాయకుడిగా).
ముకద్దర్ కా సికందర్ లో ‘సలామె ఇష్క మేరీ జాన్’ పాట ఆ సినిమాకు పెద్ద ఆకర్షణ. ఆ సినిమా ప్రకాశ్ మెహ్రాదే. ఆ పాట దారిలో ‘షరాబీ’లో కూడా ఒక పాట పెట్టారు.
సంగీత దర్శకుడు బప్పిలహిరి. బి గ్రేడ్ సినిమాలకు సంగీతమందిస్తూ ఎనభైలలో పెరిగి ప్రధాన సంగీతకారుడయ్యాడు. నమక్ హలాల్, షరాబి వంటి అమితాబ్ సినిమాలకు సంగీతమిచ్చి, అమితాబ్ -ఆర్ డి బర్మన్, అమితాబ్ - లక్ష్మి ప్యారే ల కాంబినేషన్ కన్నా ముందుకెళ్ళాడు.
పాట

తనువెల్లా అలంకరించుకుంటాను
గుండె చప్పుడు లా నా కాలి అందెలు మోగినప్పుడు
ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.
నుదుట బొట్టు(?) చెవులకు జూకాలు
కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులు
నిన్ను చేతుల్లోకి తీసుకుంటాను,నాకు దుస్తులు కుట్టించు
నిన్ను తనువుకు హత్తుకుంటాను,మెరిసే చుక్కలతో చునిరీ
అవి కట్టుకుని వస్తే అందరి చూపులూ నాపైనే
నన్ను అలంకరించు
ఈ అందం ...ఈ వయసు తో
నీకోసం నాట్యం చేస్తున్నాను
సూర్యుడి నడిగి సౌందర్య సామగ్రి తెప్పించు నా కోసం
నీ పెదవులు స్పృశిస్తా ప్రియతమా
జీవితమంతా ఎదురు చూస్తూనే ఉన్నా
ప్రియుని కళ్ళలోని అల్లరి కోసం
నీప్రేమలో కోల్పోయిన
నా జన్మజన్మల కలల్ని అలంకరించుకుని కూర్చున్నా
ఇప్పుడు అర్ధంచేసుకుని ఒప్పుకున్నా
హృదయం అర్పిస్తే ఏమౌతుందో
ప్రపంచం ఏడ్వనీ, లోకులు కోపగించనీ
నేను ప్రియుని ఇంటికి వెళ్ళవలసిందే
పూలదండ నవ్వినట్టు
నువ్వు కళ్ళతో నవ్వినట్టు
కిరణాలను నా పాపిట్లో అలంకరించు
పున్నమి చంద్రుని నా నొసట బొట్టుగా తే
నిన్ను నా నుదుట దిద్దుకుంటాను
మొత్తం మద్యశాలను నీ పాదాలపై చిలకరిస్తాను
**************
“లోకులనుకుంటారు నేను తాగుబోతునని
నువ్వు ,బహుశా అదే అనుకును ఉంటావు
అవును, లోకులనుకుంటారు నేను తాగుబోతునని
కొందరిలో యౌవన సౌందర్యాల నిషా
కొందరిలోప్రేమతరంగాల నిషా
కొందరికి కొందర్ని చూస్తే శ్వాస నుండి ఉబికివస్తుంది నిషా
తాగనప్పటికీ హద్దులుదాటి నడిచే నిషా
నిషా లో లేని వారెవరో కొద్దిగా చెప్పునాకు
తెలివి తో ఉన్నఎవరినైనా నా ముందుకు తీసుకురా
అందరూ నిషాలోనే ఉన్నారు..తేడా వాటి రంగుల్లోనే
వెలుగురేఖల ఉదయానికి తుషారపు నిషా
పవనానికి సుగంధాల నిషా, మేఘానికి వాన చినుకుల నిషా
కొందరికి సుఖమే నిషా, కొందరి కి బాధే నిషా
నిషా అనేది మద్యంలో ఉంటే మద్యపు సీసా నాట్యం చేస్తుంది
మద్యశాల ఊగుతూ ??????
ప్రియతమా! కళ్ళతో మధువు తాగించు కొద్దిగా
ప్రియతమా! నిన్ను నేను , నా శ్వాసలో బస చేయిస్తాను
ప్రియతమా! నీకు (9 లక్షలవిలువైన ) హారం చేయిస్తాను”



బోలే రే పపి, పపిహరా

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-99
బోలే రే పపి, పపిహరా
(‘కోయిల పాడుతూ ఉంది’)
గుడ్డి సినిమాలో వాణి జయరామ్ పాడిన పాట, వసంత్ దేశాయ్ సంగీతం,గుల్జార్ రచన.
...

‘గుడ్డి’ (1971) పేరు వినపడితే రాబోయేది ఈ పాటే అని ఎదురుచూపు ఉండేది.వాణీ జయరామ్ ,వసంత్ దేశాయ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ పాటతో తడవని చిత్ర సంగీత ప్రేమికులు అరుదు.
పాట ప్రారంభంనుండీ..చినుకులుగా కాదు ధారాపాతంగా వాన కురుస్తున్నట్టే ఉంటుంది. పాట నిండా ఆమె కంఠధ్వని పరచుకున్నట్టుంటుంది. వానకు గాలి తోడైతే వాన లయబద్ధంగా మెలికలు తిరుగుతుంది. పాట లో ఆమె స్వరంలో అలాంటివే కనిపిస్తాయి.
‘గుడ్డి’ అన్నా’పపి, పపిహరా అన్నా..నిజానికి పాటలో ఏ పదానికీ అర్ధంతెలియకున్నా ...పాట విన్నాక మనసు ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందేది.

తన కన్నీటి చుక్కను ను కొనిపోయి ప్రియమైన వారున్నచోట వర్షంలా కురవమని మేఘం/వర్షఋతువు కు ఒకామె వేడుకోలు. తిరిగి ఆ ఋతువు తెచ్చిన సందేశం కలిగించిన ఆనందంతో ఆమె అశ్రుకణం , కంటిలో ముత్యమయ్యింది.

పాట చిత్రీకరణ ఒక గుహ(ఎలిఫెంటా కేవ్స్??) లో జరిగింది. బైట వాన,గుహ లోపలి చీకటితో ‘డార్క్’ బాక్ గ్రౌండ్, ప్రకాశవంతమైన ఎరుపు,తెలుపు దుస్తుల్లో నటులు. ప్రతీ ఫ్రేమూ ఒక్కొక్క కలర్ పెయింటింగే.

వాణి జయరాం కు ఈ పాట హిందీ చిత్ర సంగీతసీమలో గొప్ప ప్రారంభానిచ్చింది. ఐతే అంత గొప్ప కొనసాగింపు ఉన్నట్టు కనపడదు. అలాగని ఆమె అక్కడ ‘వన్ డే వండర్’ కూడా కాదు. మదన్ మోహన్, నౌషాద్ ,ఓ.పి.నయ్యర్ వంటి ఉద్దండులతో పనిచేసింది.పండిట్ రవిశంకర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మీరా’ సినిమాలో ఆమె గానం శ్రోతలకు కర్ణామృతమే.
బోలెరే పపి పాట:

‘కోయిల పాడుతూ ఉంది
నిత్యం జడివాన కురుస్తుంది. నిత్యం మనసుదాహంతోనే ఉంది
నిత్యం మనసు దాహంతో వుంది నిత్యం మనసు తపిస్తూనే ఉంది
కనుకొలకుల్లో ఒక చినుకు ను అలంకరించుకు వున్నాను ..
వర్షఋతువూ … తీసుకొని పో
వెళ్ళు .. ప్రియునిదేశంలో దీనిని వర్షించు
వెళ్ళు .. ప్రియునిదేశంలో దీనిని వర్షించు
నిత్యం జడివాన కురుస్తుంది. నిత్యం మనసుదాహంతోనే ఉంది
నిత్యం మనసు దాహంతో వుంది నిత్యం మనసు తపిస్తూనే ఉంది
కోయిల పాడుతూ ఉంది
వర్షర్తువు తెచ్చిన సందేశంతో
నాకళ్ళ లో చినుకు ముత్యమయ్యింది
ఇది దానంగా నా తండ్రిఇంటి నుండి వచ్చింది
నిత్యం మనసు దాహంతో వుంది నిత్యం మనసు తపిస్తూనే ఉంది’




మై జిందగీ క సాత్ నిభాతా చలా హువా

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-98
‘మై జిందగీ క సాత్ నిభాతా చలా హువా’
(నేను జీవితంతో పాటే నడిచాను)
హమ్ దోనో సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. జయ్ దేవ్ సంగీతం, సాహిర్ లూధియాన్వి రచన.
...
నా కవిత్వం ల్లో నేను దొరుకుతాను అంటాడు ‘తిలక్’ ‘అమృతం కురిసిన రాత్రి’ లో. నిజానికి చాలా మంది రచయితల్ని వాళ్ల రచనల్లో దొరకబట్టవచ్చు. ఐతే దేవానంద్, సాహిర్ లూధియాన్వి రాసిన తన సినిమా పాట ఒక దానిలో లో తనున్నానన్నాడు. ‘ఇట్ ఈజ్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్’ అని ఆ పాట నుద్దేశించి అన్నాడు. ఆ పాట ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలా హువా’. సినిమా ‘హమ్ దోనో’.

ఇది దేవానంద్ సోదరుల సినిమా. సాధారణం గా వారి సినిమాలకు అప్పట్లో ఎస్. డి. బర్మన్ సంగీతమిచ్చేవారు. ఈ సినిమాకు మాత్రం బర్మన్ శిష్యుడు ‘జయ్ దేవ్’ సంగీత దర్శకుడు. ఈ సినిమాతోనే అతను తనను ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత సంఖ్యాపరంగా తక్కువైనా నిలిచిపోయే పాటలు చేశాడు.
హమ్ దోనో పాటలు ఇప్పటికీ రేడియో శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాట ‘జయ్ మాలా’ ప్రోగ్రామ్ లో ఎక్కువగా వినపడుతుంది. సినిమా నేపధ్యం మిలటరీ/ యుద్ధం కు చెందినది కావటం ఇందుకు కారణం కావచ్చు.పాట చూడటానికీ బాగుంటుంది.పాట కు తగిన ఆహార్యం అభినయం, కదలికలతో దేవానంద్ నటన పాట అర్ధం, మూడ్ ను తెరపై చూపింది.
సాహిర్ లూధియాన్వి మిగతా పాటలతో పోలిస్తే ఈ పాట తక్కువ, తేలికపాటి పదాలతో సాగింది.కాని చెప్పింది మాత్రం చాలా చిక్కనైనది.
దేవానంద్ పుస్తకం ‘రొమాన్సింగ్ విత్ లైఫ్’ చదివినప్పుడు ఈ పాట గురించి అతను అన్నది నిజమే అనిపించింది.
ఈ సినిమా పట్ల దేవానంద్ కు ప్రత్యేకమైన ఇష్టం ఉంది. దానికి సర్వకాలీనత ఉందనుకున్నాడు. అంచేతే ఆ సినిమా యాభై యేళ్ళ తర్వాత రంగులద్దాడు.
సినిమా కున్న సర్వకాలీనత సంగతి తెలియదుకాని ఈ పాటైకైతే అది ఉంది. పాట నిత్యనూతనమే.

“నేను జీవితంతో పాటే నడిచాను
ప్రతి ఆందోళననూ పొగలా ఊది వదిలాను
శిధిలమైన దానికోసం బాధపడటం వ్యర్ధం మనుకున్నాను
శైధిల్యాన్ని వేడుక చేసుకుంటూ నడిచాను
దేనిని పొందినా అదే అదృష్టమనుకున్నాను
ఏది పోగొట్టుకున్నా దానినీ మరుస్తూ నడిచాను
బాధ సంతోషం రెండూ ఎక్కడ వేరనిపించవో
మనసును అలాంటిచోటుకు తీసుకెళుతున్నాను.”



తుఝె సూరజ్ కహు యా చందా?

  1. నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-97

తుఝె సూరజ్ కహు యా చందా?
(నిన్ను సూర్యుడననా చంద్రుడననా?)
‘ఎక్ ఫూల్ దో మాలి’(1969) లో మన్నడే పాడిన పాట.సంగీతం రవి,ప్రేమ్ ధవన్ రచన
...
పిల్లల్ని లాలిస్తూ మగవారు పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ. ‘కహానియా సునాతి హై పవన్ ఆతీ జాతీ హై’( రాజ్ పూత్), ‘మై గావూ తూ సో జావూ’(బ్రహ్మచారి) ఇలా కొన్ని గుర్తొస్తాయి. తెలుగులోకూడా మరీ ఎక్కువలేవు.’చందురుని మించు’(రక్త సంబంధం), బుజ్జి బుజ్జి పాపాయి(ఆడ బ్రతుకు) , లాలి జో లాలీ జో(ఇంద్రుడు చంద్రుడు) వాటిలో కొన్ని.,
ఆ తరహా పాటల్లో నాకు ఇష్టమైన హిందీ పాట ‘తుఝె సూరజ్ కహు యా చందా?’. ఎక్కువసార్లు వినటంవల్ల ఫెమీలియర్ ఐన పాట. విన్న చాలా కాలానికి పాట చూసాను. చూసిన చాలారోజులతరవాత మనసుకు పట్టింది.
తండ్రీకొడుకుల మధ్యఅనుబంధాలు వాచ్యంగా ప్రకటితమవ్వటం మన సమాజంలో తక్కువనిపిస్తుంది.’చీకటి గదులు’ నవలలో ఈ సంబంధాలు, అనుబంధాలు ‘ఘనీభవించటం’ గురించి చదివినది గుర్తుంది.ప్రేమ వ్యక్తపరచటం,పిల్లల్ని లాలించటం పెద్దరికానికో,గంభీరతకో తగిందికాదని నా చిన్ననాటి సమాజంలో ఒక నమ్మకమేమో.

బలరాజ్ సహానీ నటించిన సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే. నేను చూసిన అతని సినిమాలలో (పదిలోపు ) దేనిలోనూ నిరుత్సాహపరచలేదు. గ్రామీణ భారతీయునికి అచ్చమైన ప్రతిరూపం అనిపిస్తాడు. బంధువర్గంలో మనసుకు నచ్చిన మనిషి లాఉంటాడు. ఈ పాటలో అతను కొడుకు(?) ను ఆడిస్తూ పాడుతున్నాడు.

బలరాజ్ సహనీ కీ నేపధ్య గాయకుడిగా మన్నడే మినహా ఎవరినీ నేనూహించలేను. ఆయె మేరీ ప్యారే వతన్(కాబూలి వాలా),తూ ప్యార్ కా సాగర్ హో(సీమా),యె మేరె జొహర్ జబి తుఝె మాలూమ్ నహి(వక్త్), తుఝే సూరజ్ కహు యా చందా(ఎక్ ఫూల్ దో మాలి), ధర్తి కహే పుకార్ కె (నేపధ్యగీతం,దో భిగా జమిన్ )నాకు తెలిసినవి. ఐదు దశాబ్దాలు పైగా చిత్రరంగంలో ఉండి మన్నాడే పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ కావచ్చుకాని, సక్సెస్ శాతం లెక్కిస్తే చాలా ఎక్కువ. వాటిలో ఫిలసాఫికల్, శాస్త్రీయ , జానపద ఛాయలున్న పాటలు అధికం.
సంగీత దర్శకుడు రవి గురుదత్, బిఽఅర్. చోప్రాలను మినహాయించి పెద్ద బానర్లకు పనిచేసింది తక్కువ. చేసిన వాటిలోజనరంజకమైనవి చాలానే ఉన్నాయి. నాకు గుర్తుండిపోయిన అతని ఆఖరి హిందీ సినిమా ‘నిఖా’(1983). చిత్రంగా మళయాళ చిత్రాలకు సంగీతదర్శకుడై ‘బాంబే రవి’ పేరుతోచాలా సినిమాలకు పనిచేశాడు.
వైశాలి, సరిగమలు పేరుతో తెలుగులో వచ్చిన డబ్బింగు సినిమాలకు అతనే సంగీతదర్శకుడు.’ చౌద్వీ కా చాంద్ హో’ పాట చేసినాయనే ‘స్వర రాగ గంగా ప్రవాహమే’ అని తెలుగు పాట చేశాడని తెలిసినపుడు ‘ఓ’ అనిపించింది.

“నిన్ను సూర్యుడననా చంద్రుడననా?
నిన్ను దీపమననా నక్షత్రమననా?
నా ప్రియమైన బాబు
లోకంలో నా కీర్తిని పెంచుతాడు

నేను ఎప్పటినుండి ఎదురుచూస్తున్నాను
నా వాకిటిలో ఎవరైనా ఆడుకుంటారని
పసినవ్వుల బదులుగా
నా జీవితం మొత్తం తీసుకో
నా చేతులలో లోకమంతా
నీతో పాటు ఊయలూగుతున్నది

నీ వేలుపట్టుకుని ఇప్పుడు
నీకు నడక నేర్పుతాను
నేను పెద్దవాడినైనాక
రేపు నాకు చెయ్యందించు
జీవితానికి నువ్వు వచ్చాక
ఒక కొత్త ఆసరా దొరికింది
ఈ లోకంలో నా తరువాత కూడా
నా పేరు నిలిచి ఉంటుంది
నిన్ను చూసినవారంతా
నా కొడుకువని చెప్పుకుంటారు
నాకు మరోమారు జీవితం
నీ రూపంలో దొరుకుతుంది”




‘దేఖా ఏక్ ఖ్వాబ్ తొ యే సిల్ సిలే హుయే ‘

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-96

‘దేఖా ఏక్ ఖ్వాబ్ తొ యే సిల్ సిలే హుయే ‘
(“ఒక సారి కన్న కల బంధాల పరంపర అయ్యింది)...
సిల్ సిలా సినిమాలో కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట.సంగీతం శివ్-హరి,సాహిత్యం జావేద్ అఖ్తర్
కాం పిటీటివ్ ఎగ్జామ్స్ కు తయారయ్యేక్రమంలో ‘హూ ఇస్ హు’ పుస్తకంచదవటం ఒకభాగం. అందులో కళాకారులు- వాద్యపరికరాలు ఒక చాప్టరు. బిస్మిల్లా ఖాన్- షెహనాయ్,అల్లారఖా- తబ్లా, పండిట్ రవిశంకర్- సితార్, శివ్ కుమార్ శర్మ- సంతూర్, హరిప్రసాద్ చౌరాసియా- ఫ్లూట్ ..ఇలా బట్టి వేయాలి. వాళ్ళ ను చూసిందిలేదు,విన్నది లేదు, ఆ పరికరాలు చాలా వరకూ తెలియనివి. అలా చదివిన చదువు వేరే రకంగా సార్ధకం అయ్యింది.
యశ్ చోప్రా తన సోదరుడు బి. ఆర్ . చోప్రా తో కలిసికొంత కాలం పనిచేసి, డెబ్భైలలో సొంతంగా సినిమాలు నిర్మించటం మొదలు పెట్టాడు. రాజేశ్ ఖన్నా మొదలుపెట్టి తర్వాత అమితాబ్ తో పలు చిత్రాలు నిర్మించాడు. వాటిలో ఎక్కువ చిత్రాలు మ్యూజికల్ హిట్లే.ఆర్.డి. బర్మన్, ఖయ్యాం, రాజేశ్ రోషన్ వంటి వారు ఆ సినిమాలకు స్వర రచన చేశారు. సాహిర్ లూఢియాన్వి ఉన్నంతకాలం (80 వరకు) వారికి పాటలు రాసారు.
ఎనభై నుండి యశ్ చోప్రా సంస్థకు రచయితతో పాటు సంగీత దర్శకులు కూడా మారారు. వారి సిల్ సిలా (1981) కు శివ్ హరి అనేవారు సంగిత దర్శకులు. సలీమ్ జావేద్ లలో ఒకరైన జావెద్ అఖ్తర్ తొలిసారిగా ఇందులో కొన్ని పాటలు రాసారు. అందులో పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి.
యశ్ చోప్రా తర్వాత సినిమాలకూ వారిదే సంగీతం. అందులో ‘చాందిని’, ‘లమ్హే’ సినిమాలు సంగీతపరంగా మంచి స్థాయి కలవి.
‘చాందిని’ సినిమాలో ఒక డ్యూయెట్ ‘తెరె మెరే హోటో పే మీఠే మీఠే గీత్ మిత్వా’ పాట వినటానికి హాయిగొలుపుతుంది. ఆ పాట మధ్యలో వచ్చే సంగీతం ఒక పాత పాట ను గుర్తుకు తెస్తుంది. ఆ పాత పాట ‘ దేఖ్ ఏక్ ఖ్వాబ్ తో యే సిల్ సిలే హుయే’. ఆ రెండు పాటల సంగీతం ‘శివ్ - హరి’ దే.
ఆ మధ్య కాలంలో ‘మ్యూజిక్ టు డె ‘వారివి ఇన్ స్ట్రుమెంటల్ సంగీతం చాలానేవచ్చింది.. అందులో ‘సౌండ్ స్కేప్స్ ’ ఒకటి. ఆ కాసెట్లో ఒకచోట ‘తెరే మెరే హోటో పే’ ని గుర్తుచేసే సంగీతం వినపడింది. ఆసంగీతం విద్వాంసుడు ‘ శివ్ కుమార్ శర్మ’దే . అతని వాయిద్యం ‘సంతూర్’.
వివరాలలోకి వెళ్తే శివ్- హరి అంటే శివకుమార్ శర్మ - హరి ప్రసాద్ చౌరాసియా లు. వారిరువురూ నాకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా అంతకుముందెన్నడో పరిచితులు..

సినిమాలో పాటలో వందలాది ఎకరాల్లో తులిప్స్ పూలతోట. మంచుకొండలు, సెలయేర్లు, మంచుకమ్మిన సెలయేర్లు తొ పాట వర్ణమయం, సౌందర్యమయం. పాట లొకేషన్ మరో పాట ‘భవ్ రే నె ఖిలాయా ఫూల్’ (ప్రేమ్ రోగ్) ను గుర్తు తెస్తుంది.

“ఒక సారి కన్న కల బంధాల పరంపర అయ్యింది
చూపులు సాగినంత దూరం పూలు వికసించి ఉన్నాయి
నీ చూపులపై నాదో ఫిర్యాదు
ఇక్కడి పూలూ మన మధ్య దూరాన్ని పెంచుతున్నాయి
నా శ్వాస లో నీ సుగంధం నిలిచి ఉంది
అది నీ ప్రేమలో ఉన్న మాయాజాలం
నీ గాలుల్లో నీ పిలుపు వినవస్తుంది
గాలికెరటాల్లో ప్రేమ వర్ణాలున్నాయి
గుండె చప్పుడులో నీ గీతాలు కలిసి ఉన్నాయి
ఏమి చెప్పను . సిగ్గుతో పెదవులు తాళం పడి ఉన్నాయి
నీ సంరక్షణలో నా హృదయం ఉంది
రా ! నిన్ను నా చేతుల్లో దాచిఉంచుతాను
నా కంటిలో నీ చిత్తరువు ఉంది
దారుల్లో దూరం వరకూ కాంతి నిండి ఉంది.

రేపు ఈ వెలుగుల తోడు లేకుంటే?
వేయి ప్రేమదీపాలు వెలుగుతూ ఉంటాయి”



Monday, June 19, 2017

మైనె షాయద్ తుమ్హే పెహలీసి కహీ దేఖా థా

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-94‘
మైనె షాయద్ తుమ్హే పెహలీసి కహీ దేఖా థా
(బహుశా మునుపెక్కడో నిన్ను చూశాననుకుంటా)
బర్సాత్ కి రాత్ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, రోషన్ సంగీతం.
...
కథానాయకుడుగా భరత్ భూషణ్ నటజివితం ‘నలుపు తెలుపు’ కాలానిది. అతని సినిమాలలొ సంగీతప్రాధాన్యం ఉన్నవి ఎక్కువ. బైజు బావరా, మీర్జా గాలిబ్,రాణీ రూప్ మతి, జహాన్ అరా సినిమాలు చారిత్రకనేపధ్యం తో వచ్చాయి. బర్సాత్ కి రాత్ సాంఘికం చిత్రం.
తలత్ మహమూద్ ,ముఖేశ్ ,మహమ్మద్ రఫీ లు భరత్ భూషన్ కు పాటలు పాడారు. ఐతే రఫీ పాడిన పాటలు ప్రత్యేకంగా బైజు బావ్రా, బర్సాత్ కి రాత్ సినిమాలలో భరత్ భూషణ్ స్వయంగా పాడుతున్నట్టే ఉంటాయి.
బర్సాత్ కి రాత్ సాంఘిక చిత్రం. సినిమా పాటలమయం. పాటలు సంగీత మయం. ప్రేమగీతాలు( సోలోలు,డ్యూయేట్లు), ఖవ్వాలీలు , అనేకమంది గాయకుల గానం.
అతి సౌమ్యం గా కనిపించే భరత్ భూషన్ పక్కన మూర్తీభవించిన ముగ్ధత్వం లా మధుబాల. వారిపై చిత్రీకరించిన పాటలు ప్రశాంత వాతావరణంలో చూస్తుంటే మంత్రనగరికి ప్రయాణం కడతాం. అందులో ఒకటి ‘మైనే షాయద్ తుమ్హే ‘.
చాలా తక్కువ సంగీత వాద్యాలు, తక్కువ సంగీతం, వెన్నెల్లో ప్రశాంతమైన సరస్సు లో నిశ్శబ్దంగా సాగే హంస విహరింపు లా సాగే రఫీ గానం.

“బహుశా మునుపెక్కడో నిన్ను చూశాననుకుంటా
అపరిచితయే కాని పరాయి అనిపించటం లేదు
ఊహ కన్నా తనే సుకుమారమని నమ్మకంగా అనిపిస్తుంది.
ఔను! పూల వంటి ముఖం, ఒత్తైన శిరోజాలు
నా కవితలకన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావు.
నిన్ను చూసినపుడు ఒక నాటి రాత్రి గుర్తుకొస్తుంది
ఒక మౌన కలయిక గుర్తుకొస్తుంది
మనసులో చలిరేపిన అందం జాడ తెలుస్తుంది.
మంటలురేపిన వర్షం గుర్తుకొస్తుంది
ఎవరి కనురెప్పలు నా కనులపై వాలివుంటాయో
నువు నా ఆ జ్ఞాపకాల దేవకన్యవు కావా?
మునుపటిలా తిరిగి మాయమై పోవుగా?
ఈ ఆనందం ఎప్పటికీ ఉండిపోదా?”


Thursday, June 15, 2017

హమ్ నె దేఖీ హై ఇన్ ఆంఖో మె మెహక్తీ ఖుష్బూ

‘నచ్చిన’ పాట- ‘లోపలి’ మాట-95
‘హమ్ నె దేఖీ హై ఇన్ ఆంఖో మె మెహక్తీ ఖుష్బూ’
(“ఆ కళ్ళలో మెరిసేటి సుగంధాన్ని చూసాను నేను)
ఖామోషీ (1969) సినిమాలో లతామంగేష్కర్ పాడిన పాట. గుల్జార్ రచన హేమంత్ కుమార్ సంగీతం.
...
‘చివరకు మిగిలేది’ సినిమా పేరు తెలుసు. అది బుచ్చిబాబు నవలకు చిత్రరూప మనుకున్నాను. అప్పటికి(ఇప్పటికీ??) చిత్రం ఏ రూపంలోనూ లభ్యతలో లేదు. ‘భరాగో’ మరో నూటపదహార్లు పుస్తకంలో ఈ సినిమాగురించి చదివాను. ఓ బెంగాలీ సినిమాకు అది రీ మేక్. అదే సినిమా పదేళ్ళ తరువాత ‘ఖామోషీ’ (1969) గా హిందీలోవచ్చింది.
చివరకు మిగిలేది సినిమాకు మరొక ప్రత్యేకత ఉంది. ‘మంజీరా’ అనే బానర్ పై ఆ సినిమాను ఉప్పునూతల పుషోత్తమరెడ్డి ఆయన మిత్రులు పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఎమ్.సత్యనారాయణరావు మరికొందరితో కలసి నిర్మించారు. బహుశా పూర్తి స్థాయి తెలంగాణా నిర్మాతలనుండి వచ్చిన మొదటి సినిమా ఇదేనేమో.
ఒక నర్సు మానసిక రోగులను స్వస్థ పరిచే ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆమెకు తన వృత్తిజీవితంలో ఎదురైన అనుభవాలు,వృత్తి జీవితానికి ఆంతరంగిక జీవితానికీ మధ్య గీతలుచెరిగిపోతే కలిగే సంఘర్షణ చుట్టూ కథ నడుస్తుంది. ప్రెమకోసం తపించే రోగిని ఆమె ప్రేమిస్తున్నట్టు నటిస్తూ అ అక్రమంలో అతనిపై ప్రేమపెంచుకుంది. అతను సాధారణస్థితి పొంది తనదారిలో వెళ్లిపోయాడు . తర్వాత మరో మానసిక రోగి తోనూ ఆమె ప్రేమ నటించాల్సివచ్చింది. ఈ సారి రోగి ఈమె పై ప్రేమపెంచుకున్నాడు. ఈ వైరుధ్యాలను ఆమె భరించలేకపోయింది. తను మానసిక రుగ్మతకు లోనయ్యింది.
బెంగాలీ లో సుచిత్రాసేన్, తెలుగులో సావిత్రి, హిందీ లో వహీరెహ్మాన్ లు కథానాయిక (నర్సు) పాత్రను ధరించారు.(సావిత్రికి ఆ పాత్ర ఎంతో నచ్చి తమిళ హక్కులు తీసుకున్నారామె).
కొత్తగా ప్రేమలో పడిన ఒక యువతి రేడియో లో ప్రేమను నిర్వచిస్తూ,దాని లక్షణాలు చెబుతూ రేడియోలో పాట పాడుతుంది. ప్రేమించి ,దానిద్వారా బాధననుభవిస్తున్న ఆమె ఆ పాట వింటుంది. (‘భరాగో’ ‘ చివరకు మిగిలేది నుండి ఎంపికచేసిన పాట కూడా ఇదే సందర్భంలో, ఈ పాట స్థానంలో వచ్చినదే. ఐతే పాట అర్ధం, వరసా రెండూ వేరు)
“ఆ కళ్ళలో మెరిసేటి సుగంధాన్ని చూసాను నేను
చేతులతో స్పృశించి ఈ బంధాలను ఆరోపించకు.
ఇది ఒక భావన . దీనిని మనసు తో అనుభూతి చెందు
ప్రేమని ప్రేమ గానే ఉండనివ్వు, దానికో పేరు పెట్టకు
ప్రేమ ఒక మాట కాదు, ప్రేమ ఒక సడి కాదు
అది ఒక నిశ్శబ్దం, వింటుంది, చెబుతుంది కూడా
అది చల్లారేది కాదు,ఆగేది కాదు,నిలిచేది కాదు
యుగయుగాలుగా కురుస్తున్న వెలుతురు చినుకు అది.
అది ఎపుడైనా చిరునవ్వుతో కళ్ళ లో వెలుగుతుంది
కనురెప్పలు పై వెలుతురులా వాలుతుంది
పెదవులు ఏమీ చెప్పవు, కానీ కంపించే పెదవులపై
చెప్పాల్సిన కథలు మౌనంగా నిలిచివుంటాయి.”



చాంద్ నీ రాత్ మే ఎక్ బార్ తుఝేదేఖా హై

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-93‘
'చాంద్ నీ రాత్ మే ఎక్ బార్ తుఝేదేఖా హై'
(వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను)
దిల్ ఎ నాదాన్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. పాట రచయిత నక్ష్ లైల్ పురి.
...
వయసు పిలిచింది’ (1977) డబ్బింగు సినిమాఐనా తెలుగు సినిమాకు ఒక కుదుపు. అందులో నటులు కమల్ హాసన్, రజనీకాంత్, సంగీత దర్శకుడు ఇళయరాజా అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, ఈ సినిమాతో బలంగా ముద్రవేశారు. అందులో పాటలు ‘ఇలాగే ఇలాగే సరాగమాడితే, మబ్బే మసకేసిందిలే, నువ్వడిగింది ఏనాడైనా, జీవితం మధుశాలా .. అన్నీ హిట్ గీతాలె. కొత్త తరహా సంగీతం, కొత్త నటులు.
ఆ సినిమాను తర్వాత హిందీ లో తీశారు. సినిమా పేరు ‘దిల్ ఎ నాదాన్’(1982) . ఐతే నటులు రాజేశ్ ఖన్నా, శతృఘన్ సిన్హా లు. దశాబ్ద కాలానికి పైగా తెరపై వెలుగుతున్నారు. సంగీతదర్శకుడు ‘ఖయ్యామ్’ క్లాసికల్ సంగీతం అందించటంలో లబ్ద ప్రతిష్టుడు.
అలా తమిళ/తెలుగు సినిమాకు ప్రత్యేకత అనుకున్న కొత్తదనం (నటులు, సంగీత దర్శకుడు) హిందీలో కనపడదు. ఫలితం తెలియదుకాని అద్భుతమైన పాటని సినిమా అందించింది. ఉర్దూ పదాలతో పాటను చిక్కపరుస్తూ సాగే రచన,తనదైన ముద్రను తెలియజేస్తూ గంభీరంగా సాగే ఖయ్యాం సంగీతం పాటను మరచిపోలేనట్టు చేశాయి.
అదేకాలంలో ఖయ్యామ్ సంగీతదర్శకత్వంలో వచ్చిన మరో పాట ఏ-దిల్ ఎ నాదాన్’(రజియా సుల్తాన్) పాట ‘చాంద్ నీ రాత్ మె ‘ పాట లో అంతర్లీనంగా వినిపిస్తుంది.

“నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను
నీలిఅంబరం లో ఊయలలో
వయ్యారపు అతిశయంతో ఊగుతున్న
ఏడు రంగుల అందమైన ఊయలలో
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను

మేలుకున్న సరస్సు ఒడ్డున ఎక్కడో
చేతులలో అందమైన పూలగుత్తి తో
మధురమైన ప్రేమగీతం ఆలపిస్తూ
పూలవాన కురిపిస్తూ..ప్రేమ పొంగిస్తూ
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను
మెరుస్తూఉన్న విప్పారిన కురులు
గాలికి అద్దిన పరిమళం
నా ప్రతి శ్వాసను సుగంధభరితం చేస్తుంది
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను

ముఖంపైకి నీ ముఖాన్ని వంచినపుడు
లజ్జతో,సిగ్గుతో గాభరా పడుతూ
నేను చేతులతో ముఖాన్ని దాచుకున్నాను
పూలవాన కురిపిస్తూ..ప్రేమ పొంగిస్తూ
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను”



Tuesday, June 6, 2017

తు ఇస్ తరాహ్ సె జిందగీ మె షామిల్ హై



నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-92
తు ఇస్ తరాహ్ సె జిందగీ మె షామిల్ హై
(నువ్విలా నా జీవితంలో భాగమైతే)
‘ఆప్ తో ఐసే న థే’ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.రచన ‘ఫజ్ లి’

వివిధ్ భారతిలోనూ, రేడియో సిలోన్ లోనూ ఎనభై లలో మారుమోగిన పాట ఇది.  ఒక పాట సినిమాలొ రెండు వెర్షన్లుగా ఉండటం చాలా సార్లు జరుతుంది. మేల్,ఫిమేల్ వెర్షన్లు, హాపీ,శాడ్  వెర్షన్లు,చిన్నప్పటి పాట పెద్దయ్యాక పాడటం..ఇలా. ఐతే ఈ సినిమాలో ఈ పల్లవితో ప్రారంభమయ్యే పాటలు మూడు వున్నాయి.మహమ్మద్ రఫీ ది ఒకటి , మన్ హర్ ఉధాస్ ది ఒకటి, మరొకటి హేమలత పాడింది. మూడిట్లో ఏది వచ్చినా చివరిదాకా వినేట్లు వుంటాయి.

ఈ పాటకు సంగీతం ఇచ్చింది ‘ఉషా ఖన్నా’. స్త్రీ సంగీత దర్శకులు హిందీ లో ఉండివుండవచ్చు.కాని ఉషా ఖన్నా లా మూడు దశాబ్దాల పాటు సినిమాసంగీత దర్శకుల్లా కొనసాగినవారు లేరు. వందకు తగ్గని సినిమాలకు పనిచేశారు.వాటిలో  ఎక్కువ భాగం చిన్న తరహా సినిమాలు. అందులో పాటలద్వారా మాత్రమే గుర్తింపు పొందిన సినిమాలూవున్నాయి.

ఇప్పటి పాట మహమ్మద్ రఫీ పాడినది. ఇది హుషారుగా సాగే వెర్షన్. రఫీ అభిమానులు ఇష్టంగా వినే పాట.

“నువ్విలా నా జీవితంలో భాగమైతే
ఎక్కడ ఉన్నా నీ సమక్షంలోనే ఉన్నట్టుంటుంది

ఈ ఆకాశం, ఈ మేఘాలు, ఈ దారులు, ఈ గాలులు
ప్రతీది తమ స్థానాల్లోపదిలంగా ఉన్నాయి
చాలా రోజులుగా లోకంలో దేనిపట్లా ఫిర్యాదు లేదు
ఈ జీవితమొక ప్రయాణం, నువ్వు ఆ ప్రయాణపు గమ్యానివి

నువ్వే లేకుంటే లోకంలో ఏదో లోటు ఉండేది
చీకటి దారుల్లో వయసు దారితప్పి తిరుగుతుండేది  
నీ బాహువుల్లోకి వచ్చి మనసు విశ్రమించింది
నేను తప్పిపోయిన అలను,నువ్వు ఒడ్డు వి

నా ప్రపంచం నీ అందంతో కాంతివంతమయ్యింది
నా అన్వేషణ,నీ సౌందర్యం  కలకాలముండాలి
దేవుడు ఈ పిచ్చితనాన్ని కలకాలముంచాలి
నీపైఉంచిన  నమ్మకమే, నా ప్రతీ కోరికను నిజంచేయగలుగుతుంది.”

Sunday, June 4, 2017

‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో, క్యా గమ్ హై జిస్కో చుపా రహే హో’


నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-91

‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో, క్యా గమ్ హై జిస్కో చుపా రహే హో’
(నువ్వు ఇంతగా నవ్వుతూ ఉన్నావు,దాని వెనుక ఏమి బాధను దాచి వుంచావు?)

‘అర్ధ్  ‘(అర్ధం) సినిమాలో జగ్ జిత్ సింగ్ ఆలపించిన గజల్. సంగీతమూ ఆయనదే.
గజల్ రచయిత ‘కైఫి ఆజ్మి’. పాటలో కనిపించే ‘షబానా అజ్మీ’ ఆయన కూతురు.

సినిమా దర్శకుడు మహేశ్ భట్ మిగతా సినిమాలు టచ్ చేయకుండా వదిలేసిన (నగర)జీవిత పార్శ్వాలను స్పృశిస్తాయి. మొహమాటం లేకుండా ఎంచుకున్న కథాంశం పై సెర్చ్ లైట్ వేసినట్టు, ప్రయోగశాలలో ‘డిసెక్షన్ ‘ చేసినట్టు ఉంటాయి.

అర్ధ్ సినిమా అలాంటిదే. వివాహేతర సంబంధాలు,జీవిత భాగస్వాముల అభద్రతలు సినిమా కథ .
దేనితో మనసు ఖాళీ అయ్యిందో దానితోనే  (వివాహబంధం)  ఆ ఖాళీ నిండి తీరాల్సి లేదనే నిర్ణయానికి చివరకు కథానాయిక వస్తుంది.
భర్త  నమ్మకద్రోహంతో గాయపడిన ఆమెకు, మరొకరు స్నేహితుడయ్యాడు. అతనింటికి ఆమె అతిధిగా వెళ్లింది. ఆమె చిరునవ్వు వెనక విషాదాన్ని అతను గమనించాడు. ఆ సందర్భంలో పాటఇది .

ఇందులో ఆఖరి చరణం లో కైఫి ఆజ్మి,  విధి (ముకద్దర్)  గురించి చెప్పినదానిపై  నాకనిపించింది

మనం ఎదుర్కొనే సమస్యలు,సవాళ్ళు ,అనుభవించే వ్యధలు,చింతలు,కష్టాలు ..వీటన్నింటినీ రెంటిగా విడగొట్టొచ్చు. ఒక వర్గం. మనం మన చర్యల, ప్రయత్నాల ద్వారా మార్చుకోగలిగినవి. మరొక వర్గం . ఇవి మనని ప్రభావితం చేస్తుంటాయిగాని వాటిని మార్చగల శక్తి మనకుండదు.
అలాటి వాటిని ఏమిచేయాలి? ‘విధి’ కి వదిలిపెడితే కొంత ఓదార్పు దొరుకుతుందేమో! అదే ఇక్కడ చెబుతున్నాడనిపిస్తుంది.(సర్కిల్ ఆఫ్  ఇన్ఫ్లూయెన్స్,సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లాగా???)


“నువ్వు ఇంతగా నవ్వుతూ ఉన్నావు
దాని వెనుక ఏమి బాధను దాచి వుంచావు?

కళ్ళలో తేమ, పెదవులపై నవ్వు
ఉన్న స్థితి ఏమిటి? పైకి చూపేది ఏమిటి?

కన్నీటిని దిగమింగుకుంటూ ఉంటే
మింగినకన్నీరు   విషమౌతుంది

కాలం మాన్పిన గాయాలను
నువ్వెందుకు తిరిగి రేపుతావు?

విధి అనేది చేతిగీతల ఆట
నువ్వు ఓడింది ఆ గీతల చేతిలోనే!”


Friday, June 2, 2017

“తుమ్ జో మిల్ గయే హో ,తో యే లగతా హై,

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-90
“తుమ్ జో మిల్ గయే హో ,తో యే లగతా హై, కె జహా మిల్ గయా”
(నిన్ను కలవగలిగాను,అప్పటినుండి అనిపిస్తుంది,ప్రపంచాన్ని పొందగలిగానని)
హస్తే జఖ్మ్ (1973)సినిమాలో మహమ్మద్ రఫీ,లతా మంగేష్కర్ పాడిన కైఫీ అజ్మీ గీతం, మదన్ మోహన్ సంగీతం.

హిందీ సినిమాపేర్ల అర్ధం తెలుసుకోవాలనే కుతూహలం ఉందేది.కొన్ని సినిమాల పేర్లు మరీ కష్టపెట్టేవి. అలాంటివాటిలో ‘హస్తే జఖ్మ్ ‘ ఒకటి. చివరిగా అర్ధం చేసుకున్నది ‘హసించే గాయం’ అని. ఆ సినిమాలో ఈ పాట తరచుగా రేడియోలో వినపడేది(పడుతుంది).పాట అర్ధం తెలియకముందు నుండీ ఈ పాట  ఏదో తెలియని మైమరపు లాంటి అనుభూతి కలిగించేది. గానమూ సంగీతమూ కలిసి శబ్దం గా మారి చేసిన మాయ అది. ఆ శబ్దానికి  అర్ధం  తోడైతే?? .. అలా ఇది ఒక  సమ్మోహన గీతమయ్యింది

అలాంటి  పాటల ను సినిమాలు ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోగలితే మరింత  వన్నెకెక్కుతాయి. అలాంటి అవకాశం ఈ పాటకు వచ్చింది.
కథానాయకుడు ధనికుడైన తండ్రి పద్ధతి నచ్చక,  కోరి దరిద్రాన్ని ఎన్నుకున్నాడు. బొంబాయి నగరంలో టాక్సి డ్రైవర్ అయ్యాడు. కథానాయిక తండ్రి శత్రువు వల్ల చిన్నపుడే కిడ్నాప్ చేయబడి ఇష్టం లేకుండా సెక్స్ వర్కర్ గా మారింది.
వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అతను ఆమె పట్ల ప్రేమను పాటరూపంలో చెబుతున్నాడు.

జడివాన, ఉప్పెనలాంటి హోరు, అలలు విరిగిపడే చప్పుళ్ళు, ఉరుములమెరుపుల శబ్దాలు, టాక్సీలో ప్రయాణంతడిసిన నగరపు రహదారులు, సముద్రపు ఒడ్డు, విద్యుత్కాంతుల దృశ్యాలు..వీటి మధ్య పాట.


“నిన్ను కలవగలిగాను
అప్పటినుండి అనిపిస్తుంది
ప్రపంచాన్ని పొందగలిగానని

దారి తప్పిన బాటసారికి
తిరిగి తోటి ప్రయాణికులగుంపు దొరకింది

నాకు దూరంగా కూర్చోకు
కోపంగా చూడకు
అదృష్టంకొద్దీ దొరికావు
కలసి దూరమైపోకు

నా తప్పేమిటి???
కొన్నిసార్లు కావచ్చు
భూమి తో ఎప్పుడైనా
ఆకాశం కలవవచ్చు

నువ్వేమిటో నీకేం తెలుసు?
ఒక సుమధుర గానానివి
తడిసిన చల్లని  రాత్రులలో ఆనందానివి
మంటలురేగే పగళ్ళలో చల్లని నీడవు

ఇప్పుడు నువ్వొచ్చావు
తిరిగి పోనీయను

ఒక అందమైన
దయాహృదయి దొరికింది

నువ్వూ ఏదో పోగొట్టుకున్నావు
నేనూ కళతప్పి  ఉన్నాను

ప్రపంచమొకప్పుడు కొత్తగా ఉండేది
నాకెవరూ అప్పుడు లేరు

హృదయానికి దొరికింది
నీ ఆసరా
ఒక కొత్త ప్రపంచపు
ఆనవాలు దొరికింది “



కహా తక్ యే మన్ కో అంధేరే ఛలేంగే

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-89
“కహా తక్ యే మన్ కో అంధేరే ఛలేంగే”
(ఈ మనసులో చీకటి ఎప్పటివరకు)
బాతో బాతో మే సినిమాలో కిశోర్ కుమార్ ఆలపించిన పాట.సంగీతం రాజేశ్ రోషన్, రచన యోగేశ్.
తెలుగు సినిమా అప్పటికి (80ల నాటికి) అర్బనైజ్ (నగరీకరణ) కాలేదు. చాలా సినిమాల మూలాలు పల్లేలోనే ఉండేవి. నగరవాసులు అప్పటికి విలన్లే. ఐతే హిందీ సినిమాలు చాలారోజులకుముందే సిటీకి వచ్చేసాయి. నగరజీవిత నేపధ్యంలో సినిమాలు చాలానే ఉన్నాయి. 79లో వచ్చిన ‘బాతో బాతోమే’ అలాంటి ఒక నగర సినిమా.
అమితాబ్ ఒక రకమైన సినిమాల్లో సూపర్ స్టార్ ఐతే ,కథానాయకుడు అమోల్ పాలేకర్ మరో తరహా సినిమాల్లో సూపర్ స్టార్. అప్పుడు మధ్యతరగతి,ఉద్యోగాల్లో ఉన్న నగర యువతకు అతనో మోడల్.

బొంభాయిలో ఉద్యోగస్తుల జీవితం, ఆలోచనలు,కలలు వీటిని రియలిస్టిక్ అనిపించేలా తీసిన సినిమా ఇది. రైలులో ఉద్యోగానికి పోయిరావటం ,అందులో పరిచయాలు, ప్రేమలు, అర్ధాలు, అపార్ధాలు, పెద్దమనిషి మధ్యవర్తిత్వం వీటితో కథ సాగుతుంది. కథానాయిక తల్లి ఆశలవల్ల ప్రేమికులమధ్య దూరం పెరిగింది. ఆ దూరం కథానాయకుని బాధించింది. ఆ సందర్భంలో వెచ్చే పాట.

“ఈ మనసులో చీకటి ఎప్పటివరకు
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
కొద్దిసేపు సుఖం, కొద్దిసేపు దుఃఖం ,ఇదే జీవితం
ఈ శిశిర ఋతువు ఒకటి రెండు ఘడియలపాటే
కొత్త పుష్పాలు దారిలో తిరిగి వికసిస్తాయి
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ప్రచండ వేగంతో వీస్తుంది గాలి
నా మనసులో నువ్వు నమ్మకాన్ని నిలిపావు
ప్రయాణంలో విడిపోయిన నిన్ను తిరిగి కలుస్తాను.
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ఎవరేమి చెప్పినా నిజమిదే
ప్రేమకెరటాలు ఎక్కడ మొదలైనా
వాటికి ఏదో ఒకరోజు ఒడ్డు దొరుకుతుంది
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?”