Showing posts with label dimple kapadiya. Show all posts
Showing posts with label dimple kapadiya. Show all posts

Wednesday, March 29, 2017

సునియో జీ అరజ్ మారియో


‘సునియో జీ అరజ్ మారియో ' 14 March at 20:21
(నా మొర వినిపించుకో ..ఓ ..నాన్నా)
‘లేకిన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన పాట.సంగీతం హృదయనాధ్ మంగేశ్కర్,సాహిత్యం గుల్జార్.
...
'రచన ' మాస పత్రిక వచ్చిన కొత్తలో ,ఒక నెల లో నండూరి పార్థసారథి 'లేకిన్ ' సినిమా పాటలనుసమీక్షించారు.ఆ సమీక్ష నన్ను చాలా ఆకట్టుకుంది.ఆపాటలున్న కేసెట్టు దొరకబట్టాను. దానికి రెండోవైపు 'రుడాలి ' సినిమా పాటలు.డబల్ ధమాకా అంటే అదేనేమో. కాసెట్టును అరిగిపోయేదాకా విన్నాను. రెండు సినిమాల సంగీతదర్శకులు నాకు కొత్తవారే. లేకిన్ సినిమాకు లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకుడు. రెండోదానికి 'భూపేన్ హజారికా 'సంగీత దర్శకుడు.ఒకరి పూర్వికులు మాండవీ నది పరిసరాలకి చెందినవారు.మరొకరు 'బ్రహ్మపుత్ర ' నది పరిసరాలకు చెందినవారు. రెండు సినిమాల నేపధ్యం రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతం. రెంటిలోను కథానాయిక 'డింపుల్ కపాడియా'నే. రెండు సినిమాలలోనూ గీతకారుడు 'గుల్జార్ ' కలం బలిమి ఉంది.
రెండిటి కథాబలానికి కారణం ఉంది.లేకిన్ సినిమాకు రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఒక కథ ఆధారం.రుడాలి సినిమా కు మహాశ్వేతాదేవి నవల ఆధారం.
లేకిన్ సంగీతం వింటుంటే పొద్దుజారే సమయంలో ఎడారిలో నిలుచున్నట్టుంటే , రుడాలి పాటలు వింటుంటే మధ్యహ్నవేళ ప్రచండమైన ఎడారి గాలులకు ఎదురు నిలిచినట్టనిపిస్తుంది.
లేకిన్ సినిమా 'ఫాంటసీ ' కథలా ఉంటూంది. ఒక సంస్థానానికి చెందిన వస్తువులు స్వాధీనం చేసుకోవటానికి ఒక ప్రభుత్వోద్యోగి వస్తాడు. అతనికి మాత్రమే కనిపిస్తూ ఒక స్త్రీ అప్పటికథను అతనికి 'చూపెడుతూ ' ఉంటుంది. సంఘటన జరిగేనాటికి ఉన్న వయసులోనే ఆమె ఆగిపోయింది. ఆమె కు సంబంధించినంతవరకూ కాలం ఆగిపోయింది. సంగీతం పాడటానికి వచ్చిన యువతిని,ఆమె చెల్లెల్ని ఆ సంస్థానాధీసుడు వాంఛించాడు.అక్క తప్పించుకోగగింది.దొరికిపోయిన చెల్లెల్ని ఆమె సంగీతగురువును సంస్థానాధీసుడు ఎనిమిదేళ్ళపాటు బందించాడు.ఆ ఎనిమిదేళ్ళు చెరలో పక్క గదిలో ఉన్న సంగీతగురువు నుండి సంగీతం నేర్చుకుంది.
ఆ బందిఖానా నుండి ఇంటికి తీసుకెళ్ళమని ఆమె ఎక్కడో ఉన్న తండ్రిని ప్రార్ధిస్తుంది.
ఆ సందర్భంలో పాట
“నా మొర వినిపించుకో ..ఓ ..నాన్నా!
వానా కాలం వచ్చింది..నన్ను ఇంటికి తీసుకొనిపో.. ఓ.. నాన్నా!
వానకు తడిసిన మన వాకిలి గురుతొస్తే
తడి ఆరి ఉన్న కళ్ళలో వడగాల్పు వీస్తుంది.
ఒంటరిగా శూన్యంగా ఉన్న కళ్ళ నుండి
నీళ్లు నదిలా ప్రవహిస్తున్నాయి.
ఎందుకు నీదగ్గరనుండి నన్ను పరదేశం పంపేశావు?
నాన్నా! నన్ను నీ దగ్గరకు పల్లకీ తెచ్చి తీసుకుపో
పంపు తండ్రీ...
మోయటానికి నలుగురినిచ్చి పల్లకీ పంపు తండ్రీ.”
-ముళ్ళపూడి సుబ్బారావు