Showing posts with label Dharti kahe pukar ke. Show all posts
Showing posts with label Dharti kahe pukar ke. Show all posts

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-37’
ధరతి కహె పుకార్ కే  10 February

(ధరణి పిలిచి చెబుతుంది)
(దో బిఘా జమీన్ (1953) సినిమాలో పాట, సంగీతం సలీల్ చౌధురి,రచన శైలేంద్ర,గానం లతా మంగేష్కర్,మన్నాడే)
...
ఉన్న చోటగడవని స్థితి కొందర్ని, వేరేచోట మరిన్ని అవకాశాలు కొందర్ని ఉన్నచోటునుండి వేరే చోటుకు కదులుస్తాయి. కదలిక పట్ల 'ఇనెర్షియా' సహజం.దాన్ని అధిగమించి కదలటానికి కారణాలు ఒకటి అవసరం మరొకటి అవకాశం.
మొదటిదానివల్ల కదిలేమనిషిపట్ల సానుభూతి ఎక్కువ కలుగుతుంది.
ఈ చిత్ర దర్శకుడు బిమల్ రాయ్. ఇటాలియన్ సినిమా బైసికిల్ థీవ్స్ స్పూర్తి తో ఈ సినిమా తీసాడంటారు. సినిమా చూస్తే పూర్తి భారతీయత ప్రతిబింబించే కళాఖండమనిపిస్తుంది. కథానాయకుడు బలరాజ్ సాహ్ని నటన అత్యంత సహజంగా ఉండి మనకెంతో పరిచయమైన,ఇంటిలోని మనిషిని చూసినట్టే ఉంటుంది.
రెండు బిఘాల భూమి అంటే ఎనభై సెంట్ల భూమి.ఎకరం కంటే తక్కువ.అదే అతని ఆస్తి...అతని అభిమానం.ఆధారం..జీవనాధారం. దాన్నుండి పండింది పండించుకోవటమే కాదు , దాన్ని రక్షించుకోవటమూ పెద్దపనే. మామూలు వడ్డీతో కూడిన అప్పునే కష్టంతో భరించగలిగినప్పుడు అది దొంగ వడ్డిలతో లెక్కిస్తే సన్నకారు రైతు ఏమౌతాడు? ఆ అప్పు తీర్చటానికి పొలంసాగు కన్నా ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగే పనిని వెతుక్కుంటూ పోతాడు.
వడ్డి పెరుగుదలకూ, అతని ఆదాయపు పెరుగుదలకూ పరుగు పందెం.
విజయం ఎవరిది?అతను ఎక్కడ బయలు దేరాడు?ఎక్కడ తేలాడు?
1953 లో ఈసినిమా వచ్చింది.రైతుల స్థితి ఇప్పటికీ మారలేదనిపిస్తుంది.
'ధర్తి కహే పుకార్ కే పాట సందర్భం’:
అప్పులపాలైన రెండు బిఘాల రైతు ఆ అప్పు తీర్చి తన భూమిని కాపాడుకోవటానికి కలకత్తా బయలుదేరాడు.అతన్ని సాగనంపుతున్నట్టు వివిధ పనుల్లో మునిగివున్నకష్టజీవులు..దూరం నుండి బిందెలతో నీరు మోసుకునేవారు,భూమిని పెళ్ళగించేవారు(దున్నటానికి బదులుగా?), కుప్పలువేసేవారు, లోతైన బావుల్లో నీరు చేదుకునేవారు...తమభాషలో అతన్ని ఊరడిస్తున్నారు.
“గంగా యమునలు ఎలా సాగిపోతున్నాయో చూడు.
ఎప్పుడోఒకప్పుడు అందరూ సాగిపోయేవారే
ధరణి పిలిచి చెబుతుంది
ప్రేమ గీతం పాడమని
కాలం గడచిపోతుంది...
నీ కథను విడిచివెళ్ళు
నీ గుర్తులు కొన్ని విడిచెవెళ్ళు
నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.
కాలం గడచిపోతుంది...
నువు తిరిగొచ్చే దారిలో మొగ్గలు కన్నులు విప్పార్చి ఉంచాయి
కొమ్మకొమ్మల్లో కోయల్లు నీపాట పాడుతున్నాయి
నీలాకాశం నవ్వుతూనే వుంది
చేలన్నీ గీతాలు ఆలపిస్తున్నాయి.
మరి నీమనసెందుకు దిగులుగా ఉంది
మనసనే వేణువును పలికించు
ఏవో రాగాలు పలికించు
నువ్వూ నవ్వుతు ఉండు.”
"ఒక నదిలో నువ్వు రెండుసార్లు అడుగు పెట్టలేవు" అంటాడు తత్వవేత్త హెరాక్లిటస్.
ఒక వృత్తిలోనుంచి మరో వృత్తి లోకి మారి తిరిగి పాత వృత్తిలోకి మారటం కష్టమైన దే.అది కూడా నదీప్రవాహంలా వెనక ప్రయాణం ఉండనిదేనేమో. 'కౌన్ కహె ఇస్ ఓర్ తు ఫిర్ ఆయే న ఆయే' (నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.)పదం లో నాకు అదే కనిపిస్తుంది. కథలో జరగబోయేది కూడా అదే. దాని సూచన కూడా కావచ్చు.
-ముళ్ళపూడి సుబ్బారావు