Showing posts with label mannade. Show all posts
Showing posts with label mannade. Show all posts

Friday, June 30, 2017

తుఝె సూరజ్ కహు యా చందా?

  1. నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-97

తుఝె సూరజ్ కహు యా చందా?
(నిన్ను సూర్యుడననా చంద్రుడననా?)
‘ఎక్ ఫూల్ దో మాలి’(1969) లో మన్నడే పాడిన పాట.సంగీతం రవి,ప్రేమ్ ధవన్ రచన
...
పిల్లల్ని లాలిస్తూ మగవారు పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ. ‘కహానియా సునాతి హై పవన్ ఆతీ జాతీ హై’( రాజ్ పూత్), ‘మై గావూ తూ సో జావూ’(బ్రహ్మచారి) ఇలా కొన్ని గుర్తొస్తాయి. తెలుగులోకూడా మరీ ఎక్కువలేవు.’చందురుని మించు’(రక్త సంబంధం), బుజ్జి బుజ్జి పాపాయి(ఆడ బ్రతుకు) , లాలి జో లాలీ జో(ఇంద్రుడు చంద్రుడు) వాటిలో కొన్ని.,
ఆ తరహా పాటల్లో నాకు ఇష్టమైన హిందీ పాట ‘తుఝె సూరజ్ కహు యా చందా?’. ఎక్కువసార్లు వినటంవల్ల ఫెమీలియర్ ఐన పాట. విన్న చాలా కాలానికి పాట చూసాను. చూసిన చాలారోజులతరవాత మనసుకు పట్టింది.
తండ్రీకొడుకుల మధ్యఅనుబంధాలు వాచ్యంగా ప్రకటితమవ్వటం మన సమాజంలో తక్కువనిపిస్తుంది.’చీకటి గదులు’ నవలలో ఈ సంబంధాలు, అనుబంధాలు ‘ఘనీభవించటం’ గురించి చదివినది గుర్తుంది.ప్రేమ వ్యక్తపరచటం,పిల్లల్ని లాలించటం పెద్దరికానికో,గంభీరతకో తగిందికాదని నా చిన్ననాటి సమాజంలో ఒక నమ్మకమేమో.

బలరాజ్ సహానీ నటించిన సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే. నేను చూసిన అతని సినిమాలలో (పదిలోపు ) దేనిలోనూ నిరుత్సాహపరచలేదు. గ్రామీణ భారతీయునికి అచ్చమైన ప్రతిరూపం అనిపిస్తాడు. బంధువర్గంలో మనసుకు నచ్చిన మనిషి లాఉంటాడు. ఈ పాటలో అతను కొడుకు(?) ను ఆడిస్తూ పాడుతున్నాడు.

బలరాజ్ సహనీ కీ నేపధ్య గాయకుడిగా మన్నడే మినహా ఎవరినీ నేనూహించలేను. ఆయె మేరీ ప్యారే వతన్(కాబూలి వాలా),తూ ప్యార్ కా సాగర్ హో(సీమా),యె మేరె జొహర్ జబి తుఝె మాలూమ్ నహి(వక్త్), తుఝే సూరజ్ కహు యా చందా(ఎక్ ఫూల్ దో మాలి), ధర్తి కహే పుకార్ కె (నేపధ్యగీతం,దో భిగా జమిన్ )నాకు తెలిసినవి. ఐదు దశాబ్దాలు పైగా చిత్రరంగంలో ఉండి మన్నాడే పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ కావచ్చుకాని, సక్సెస్ శాతం లెక్కిస్తే చాలా ఎక్కువ. వాటిలో ఫిలసాఫికల్, శాస్త్రీయ , జానపద ఛాయలున్న పాటలు అధికం.
సంగీత దర్శకుడు రవి గురుదత్, బిఽఅర్. చోప్రాలను మినహాయించి పెద్ద బానర్లకు పనిచేసింది తక్కువ. చేసిన వాటిలోజనరంజకమైనవి చాలానే ఉన్నాయి. నాకు గుర్తుండిపోయిన అతని ఆఖరి హిందీ సినిమా ‘నిఖా’(1983). చిత్రంగా మళయాళ చిత్రాలకు సంగీతదర్శకుడై ‘బాంబే రవి’ పేరుతోచాలా సినిమాలకు పనిచేశాడు.
వైశాలి, సరిగమలు పేరుతో తెలుగులో వచ్చిన డబ్బింగు సినిమాలకు అతనే సంగీతదర్శకుడు.’ చౌద్వీ కా చాంద్ హో’ పాట చేసినాయనే ‘స్వర రాగ గంగా ప్రవాహమే’ అని తెలుగు పాట చేశాడని తెలిసినపుడు ‘ఓ’ అనిపించింది.

“నిన్ను సూర్యుడననా చంద్రుడననా?
నిన్ను దీపమననా నక్షత్రమననా?
నా ప్రియమైన బాబు
లోకంలో నా కీర్తిని పెంచుతాడు

నేను ఎప్పటినుండి ఎదురుచూస్తున్నాను
నా వాకిటిలో ఎవరైనా ఆడుకుంటారని
పసినవ్వుల బదులుగా
నా జీవితం మొత్తం తీసుకో
నా చేతులలో లోకమంతా
నీతో పాటు ఊయలూగుతున్నది

నీ వేలుపట్టుకుని ఇప్పుడు
నీకు నడక నేర్పుతాను
నేను పెద్దవాడినైనాక
రేపు నాకు చెయ్యందించు
జీవితానికి నువ్వు వచ్చాక
ఒక కొత్త ఆసరా దొరికింది
ఈ లోకంలో నా తరువాత కూడా
నా పేరు నిలిచి ఉంటుంది
నిన్ను చూసినవారంతా
నా కొడుకువని చెప్పుకుంటారు
నాకు మరోమారు జీవితం
నీ రూపంలో దొరుకుతుంది”




Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-37’
ధరతి కహె పుకార్ కే  10 February

(ధరణి పిలిచి చెబుతుంది)
(దో బిఘా జమీన్ (1953) సినిమాలో పాట, సంగీతం సలీల్ చౌధురి,రచన శైలేంద్ర,గానం లతా మంగేష్కర్,మన్నాడే)
...
ఉన్న చోటగడవని స్థితి కొందర్ని, వేరేచోట మరిన్ని అవకాశాలు కొందర్ని ఉన్నచోటునుండి వేరే చోటుకు కదులుస్తాయి. కదలిక పట్ల 'ఇనెర్షియా' సహజం.దాన్ని అధిగమించి కదలటానికి కారణాలు ఒకటి అవసరం మరొకటి అవకాశం.
మొదటిదానివల్ల కదిలేమనిషిపట్ల సానుభూతి ఎక్కువ కలుగుతుంది.
ఈ చిత్ర దర్శకుడు బిమల్ రాయ్. ఇటాలియన్ సినిమా బైసికిల్ థీవ్స్ స్పూర్తి తో ఈ సినిమా తీసాడంటారు. సినిమా చూస్తే పూర్తి భారతీయత ప్రతిబింబించే కళాఖండమనిపిస్తుంది. కథానాయకుడు బలరాజ్ సాహ్ని నటన అత్యంత సహజంగా ఉండి మనకెంతో పరిచయమైన,ఇంటిలోని మనిషిని చూసినట్టే ఉంటుంది.
రెండు బిఘాల భూమి అంటే ఎనభై సెంట్ల భూమి.ఎకరం కంటే తక్కువ.అదే అతని ఆస్తి...అతని అభిమానం.ఆధారం..జీవనాధారం. దాన్నుండి పండింది పండించుకోవటమే కాదు , దాన్ని రక్షించుకోవటమూ పెద్దపనే. మామూలు వడ్డీతో కూడిన అప్పునే కష్టంతో భరించగలిగినప్పుడు అది దొంగ వడ్డిలతో లెక్కిస్తే సన్నకారు రైతు ఏమౌతాడు? ఆ అప్పు తీర్చటానికి పొలంసాగు కన్నా ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగే పనిని వెతుక్కుంటూ పోతాడు.
వడ్డి పెరుగుదలకూ, అతని ఆదాయపు పెరుగుదలకూ పరుగు పందెం.
విజయం ఎవరిది?అతను ఎక్కడ బయలు దేరాడు?ఎక్కడ తేలాడు?
1953 లో ఈసినిమా వచ్చింది.రైతుల స్థితి ఇప్పటికీ మారలేదనిపిస్తుంది.
'ధర్తి కహే పుకార్ కే పాట సందర్భం’:
అప్పులపాలైన రెండు బిఘాల రైతు ఆ అప్పు తీర్చి తన భూమిని కాపాడుకోవటానికి కలకత్తా బయలుదేరాడు.అతన్ని సాగనంపుతున్నట్టు వివిధ పనుల్లో మునిగివున్నకష్టజీవులు..దూరం నుండి బిందెలతో నీరు మోసుకునేవారు,భూమిని పెళ్ళగించేవారు(దున్నటానికి బదులుగా?), కుప్పలువేసేవారు, లోతైన బావుల్లో నీరు చేదుకునేవారు...తమభాషలో అతన్ని ఊరడిస్తున్నారు.
“గంగా యమునలు ఎలా సాగిపోతున్నాయో చూడు.
ఎప్పుడోఒకప్పుడు అందరూ సాగిపోయేవారే
ధరణి పిలిచి చెబుతుంది
ప్రేమ గీతం పాడమని
కాలం గడచిపోతుంది...
నీ కథను విడిచివెళ్ళు
నీ గుర్తులు కొన్ని విడిచెవెళ్ళు
నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.
కాలం గడచిపోతుంది...
నువు తిరిగొచ్చే దారిలో మొగ్గలు కన్నులు విప్పార్చి ఉంచాయి
కొమ్మకొమ్మల్లో కోయల్లు నీపాట పాడుతున్నాయి
నీలాకాశం నవ్వుతూనే వుంది
చేలన్నీ గీతాలు ఆలపిస్తున్నాయి.
మరి నీమనసెందుకు దిగులుగా ఉంది
మనసనే వేణువును పలికించు
ఏవో రాగాలు పలికించు
నువ్వూ నవ్వుతు ఉండు.”
"ఒక నదిలో నువ్వు రెండుసార్లు అడుగు పెట్టలేవు" అంటాడు తత్వవేత్త హెరాక్లిటస్.
ఒక వృత్తిలోనుంచి మరో వృత్తి లోకి మారి తిరిగి పాత వృత్తిలోకి మారటం కష్టమైన దే.అది కూడా నదీప్రవాహంలా వెనక ప్రయాణం ఉండనిదేనేమో. 'కౌన్ కహె ఇస్ ఓర్ తు ఫిర్ ఆయే న ఆయే' (నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.)పదం లో నాకు అదే కనిపిస్తుంది. కథలో జరగబోయేది కూడా అదే. దాని సూచన కూడా కావచ్చు.
-ముళ్ళపూడి సుబ్బారావు

Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-5  ‘చలత్ ముసాఫిర్ మోహ్ లియారే ‘

Subbarao Mullapudi 
ి చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకోవడం,అప్పుడప్పుడు పాటలు పాడుకోవడం, పడుకుని,గడ్డి మేస్తూనో, నెమరేసుకుంటునో ఉన్న ఎడ్ల మెడలో గంటల సడి వాళ్ళ పాటలకి వాద్యసహకారం కావటం...ఇవన్నీ నాకున్న బాల్య స్మృతుల్లో భాగం.
అలాగేఒకమాదిరి పల్లె లో పెరగటంవల్ల పొలాల్లో పనిచేసుకునేవారు పాడుకునే పాటలు, గుడుల్లో భజన పాటలు నాకు బాగా పరిచయమే. రేడియోలో జానపదగీతాలు వినప డేవి.వివిధ్ భారతిలో మ ధ్యాహ్నం ‘లోక్ సంగీత్ ‘ పేరుతో వివిధ ప్రాంతాలల్లోని జానపద గీతాలు ప్రసారమయ్యేయి.
ఈ వివరాలకీ,కింది పాటకూ సంబంధం వుంది...
సినిమాల్లోనూ,సాహిత్యంలోనూ మనకు పరిచయమున్న వాతావరణమో,పాత్రలో కనిపిస్తే వెంటనే కనెక్టవుతాము.
తీస్రీకసం సినిమాలో ‘చలత్ ముసాఫిర్ మోహ్ లియారే ‘ పాట చాలా హుషారు గా సాగే జానపద గీతం.తక్కువ వాయిద్య ఉపకరణాలు,ప్రముఖంగా వినిపించేవి నాకు తెలిసిన హార్మోనియం,దోలక్..శైలేంద్ర సాహిత్యం..గానం మన్నాడె.
అచ్చమైన జానపదుల్లా,ఎవరినో మెప్పించడానికి కాకుండా తమ కోసం తాము పాడుకుంటున్నట్టుగా సాగే పాట. తక్కువ భాగం అర్ధమయ్యింది కానీ ఆకర్షణ ఉంది.
తర్వాత ఆ పాటను సినిమాలో చూశాను. ఆ పాటకి పెదవి కదిల్చింది కథానాయకుడు కాదు.పాడిందీ కథానాయకుడికి మిగతా పాటలు పాడిన ముకేష్ కాదు.
సన్నివేశం..... పల్లె ప్రాంతం,ప్రయాణికుల మజిలీ,చలిమంట,వాళ్ళంతా కలిసి పాడుకునే జానప దం.భాష హిందీ కాదు భోజ్ పురి.
“సంచారం లో ఉన్న ప్రయాణికుడు పంజరంలో ఉన్న మైనా(పక్షి) మీద మనసు పడ్డాడు(మోహించాడు)..
పక్షి ఎగిరెగిరి మిఠాయి దుకాణంలో దూరింది
బర్ఫిలో ఉన్న రసం మొత్తాన్ని తాగేసింది...
ఎగిరెగిరి బట్టల అంగడిలో వాలింది
బట్టల రంగు మొత్తాన్ని పులుముకుంది...
ఎగిరెగిరి ఒక పాన్ దుకాణంలో చేరింది
బీడా (కిళ్ళీ) లో ఉన్న రసాన్ని కొనిపోయింది.. “
పాటకు లోపలి అర్ధం వేరే వుండ వచ్చు.
పంజరంలో మైనా అంటే ఇంట్లో బంధింపబడ్డ స్త్రీ గా, మిఠాయి, బట్టలు,పాన్ లను, రుచికరమైనఆహారం, సొగసైన దుస్తులు, అలంకరణ లేదా సౌందర్య పోషణ సౌకర్యం.. ఇలా చూడొచ్చా?
పక్షి ప్రలోభాలవైపు పోతుందని హెచ్చరింపా?
పాట పిక్చరైజేషన్లో పాట పాడేవ్యక్తి ని,పక్కన వాయిద్యాలు వాయించేవారిని,కోరస్ అందుకునే వాళ్ళని , చిన్న తప్పెట వాయిస్తూ ఉప పాత్రధారిలా కనిపించే రాజ్ కపూర్ లను చూస్తే జీవన మాధుర్యాన్ని ఆ క్షణంలో ఎంతపొందుతున్నారొ అనిపిస్తుంది.అసూయతో కూడిన ఆనందం కలుగుతుంది.