Showing posts with label jesudas. Show all posts
Showing posts with label jesudas. Show all posts

Saturday, October 21, 2017

యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -101
‘యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే’
కలతచెందిన నా హృదయమా,దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
మాన్ -అభిమాన్(1980) సినిమాలో జేసుదాస్ పాడిన పాట రవీంద్రజైన్ సంగీతం,సాహిత్యం అందించారు.
ఏ మనిషీ వేరే వారికి పూర్తిగా అర్ధంకారు.ఎవరికి వారైనా అర్ధమైతే కనీసం తమతో తామైనా మాటాడుకోవచ్చు. అలాంటి ఏకాంతం లో లోపలి సంభాషణతో కొంత సమాధానపడవచ్చు.
వేరేవారి సంగతి అటుంచి కొన్నిసార్లు ఎవరికి వారే పూర్తిగా అర్ధంకారు.అప్పుడు ఒంటరితనమే. అది మరింత వేదనాభరితం.
పై రెండు స్థితులూ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురైయ్యే ఉంటాయి. చుట్టు ఉన్న పరిస్థితులతో ఇమడలేని సందర్భాలు,ఎవరికీ మనసు మాట చెప్పలేని చెప్పటానికిరాని ,ఏదోలా చెప్పినా దానిని విన్నవారు సంపూర్ణంగా అర్ధంచేసుకోలేని స్థితి.
అప్పుడు మనమే మనకి తోడు. మన మనసే మన మిత్రుడు. మనసు కలత చెందితే మనం దానిని ఓదారుస్తాం. కొన్నిసార్లు మనపట్ల మనసును సానుభూతి చూపమంటాం.
మనం విని ఉన్న పాట ఉంటుంది. చాలాసార్లే వినిఉంటాం. ఎప్పుడో ఓ సారి ఆ పాట మనసుకు బాగా దగ్గరైపోతుంది. అంటే ఆ పాటకు అవసరమైన మానసిక స్థితిలో మనమపుడు ఉండి ఉంటాం.
’ పాట అలా దగ్గరైన పాటల్లో ఒకటి.
‘ఉధాస్ ‘ హిందీ పదానికి ‘ఉదాసీనత ‘ తెలుగు పదం దగ్గరదేమోననుకుంటాను. మనసు ఉదాసీనంగా ఉన్నపుడు , జగమంతా పరాయిదైనట్టనిపించినపుడు మనదైన ప్రపంచం ఇదికాదు అది ఎక్కడో ఉన్నట్టనిపిస్తుంది.
జేసుదాసు తన గానంతో పాటకు ,భావానికీ మరింత సాంద్రత పెంచాడు.
“కలతచెందిన నా హృదయమా
దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
నా ప్రాణమా ! నీ గమ్యం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఈ తోటలో ప్రతి పువ్వూ ముళ్ళతో గుచ్చుతుంది
స్వప్నాలు ధూ ళి గా మారుతుంటే ,వాటిగురించి చెప్పేదేముంది
నా మిత్రమా! నీ ప్రపంచం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఎవరూ మరువలేపోతున్న నా తప్పు ఏమిటి ?
పశ్చాత్తాపంతో కళ్ళు, నిండా ఆశృవులు నింపి రోదిస్తున్నాయి!
ఓ వెర్రివాడా! నీ సొంతం అనుకోగలిగింది
ఇది కాదు ..ఇది కాదు . వేరేదేదో ఉంది.
రాయి కూడా ఒకనాటికి కరుగుతుంది
గడ్డకట్టిన నీరు జలపాతం గా మారుతుంది
నీ క్లేశం అలా కరిగేదా
కాదు కాదు అది వేరే ఉంది.”


Saturday, April 29, 2017

ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా ఖుషీ ఆజ్ తక్ నహీ మిలీ

నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-73’
ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా ఖుషీ ఆజ్ తక్ నహీ మిలీ’
(నేటికంటే ఎక్కువ ఆనందం ఇదివరకెన్నడూ కలగలేదు)
చిత్ చోర్ సినిమాలో జేసుదాస్ పాట. రచన, సంగీతం రవీంద్ర జైన్.

రాజశ్రీ ఫిల్మ్స్ వారి సినిమాలు  పాటల కు పెట్టింది పేరు. మంచి కథతో ,చిన్న బడ్జెట్ తో, మరీ పాపులర్ కాని నటులతో, మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలు తీసేవారు.70 లలోనూ,80ల తొలినాళ్ళలోను వారి ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి
. ఐతే తర్వాత వారు తమ పంథా మార్చారు.పెద్ద బడ్జెట్, ఎక్కుమంది తారాగణం తో వైభవోపేతమైన ఎగువతరగతికి కుటుంబ జీవితాన్ని చూపించే సినిమాలు తీయటం మొదలు పెట్టారు.
వారి అప్పటి ,తర్వాతి సినిమాలు చూస్తే  కొన్నిపాత సినిమా కథలనే లనే  మళ్లీ తీసారని అర్ధమయ్యింది. కథ ,పాత్రలు అవే. వారి నేపధ్యం మధ్యతరగతి నుండి  ఎగువతరగతికి మారింది. సాదాసీదా జీవనశైలి నుండి పైపైకి ఎగబాకింది.ఆలోచనలు అవే,సమస్యలు అవే,ఆశలు అవే. కాని చూపించే వాతావరణంవేరు.
1976 లో చిత్ చోర్  సినిమా వారి సంస్థ నుండి వచ్చింది. స్కూల్ టీచర్ రెండొ అమ్మాయి పెళ్లి కి సంబంధించిన కథ. పెద్దమ్మాయి పట్నంలో ఉంది. ఆ పల్లెకి రాబోతున్న ఒక ఇంజనీర్ అమ్మాయికి తగినవాడని, ప్రయత్నించమని ఇంటికి ఉత్తరం రాసింది.
అలా పల్లెకి వచ్చిన ఉద్యోగి ని ఆ కుటుంబం దగ్గర చేసుకుంది. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతలో తెలిసిన విషయం ఆ ఉద్యోగి ,వాళ్ళ పెద్దమ్మాయి చెప్పిన ఇంజనీర్ కాదు,అతనికింద పనిచేసే ఉద్యోగి అని. ఆ ఇంజనీర్ ఇప్పుడు వస్తున్నాడు.
ఇలా సాగిన కథ నెమ్మదిగా కంచికి వెళుతుంది.
2003 లో వారి రాజశ్రీ సంస్థ నుండే వచ్చిన సినిమా ‘మై ప్రేమ్ కి దీవాని హూ’. టౌన్ లో చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి అక్క అమెరికా నుండి ఇంటికి ఫోన్ చేసి చెప్పింది ‘ఒక అబ్బాయి ఇండియా వస్తున్నాడు ,చెల్లి కి వరుడుగా ప్రయత్నించమని’.
వచ్చిన వ్యక్తి అతను కాదు. మళ్లీ అదేకథ.

చిత్ చోర్ సినిమాలో పాటలు ‘గోరి తెరా గావ్ బడా ప్యారా’,’తుజో మేరే సుర్ మే’,’జబ్ దీప్ జలే ఆనా’,’ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా’ ఇలా అన్నీ కర్ణపేయాలే.
‘ఆజ్ సె పెహ్లే ‘ పాట పట్ల నా ఇష్టానికి కారణం అది రోడ్ సాంగ్ కావటం.
అసలైన ఇంజనీర్ పల్లెకు వచ్చాడు. అతను, అతనికింది ఉద్యోగి , అమ్మాయి, అమ్మాయి పొరుగింటి పిల్లాడు కలిసి జీప్ లో ప్రయాణిస్తున్నారు. ఇది ఆ సందర్భంలో  పాట. సాగిపోతున్న చక్కటి అటవీ నేపధ్యం,  శ్రావ్యమైన జేసుదాస్ గానం,చక్కని సంగీతం, మధ్యలో ఈలపాట తో ఇది నిలబడిపోయే పాట అయ్యింది.

“నేటికంటే ఎక్కువ ఆనందం
ఇదివరకెన్నడూ కలగలేదు
ఇంత ఆహ్లాదకరమైన ,ఇంతకంటే తీయని
ఘడియలు నేటివరకూ దొరకలేదు

దీనిని యాదృచ్చికమనాలా? విధి అనాలా?
మనసుకిష్టమైన వారిని కలిసిన మనందరి ముఖాలు
ఎలా వికసించాయో చూడండి.
విధి కలిపిన ఈ జత
ఇలాంటి కలయిక  నేటివరకూ దొరకలేదు.

మనమంతా కన్న కల సఫలమౌతుంది
ఇది నా మనసు కోరుతుంది.
గడుస్తున్న ఈ క్షణాలు కలిగించే మైమరపుతో
నా మనసు పాడటం మొదలుపెట్టింది
ఇలాంటి సంతోషం కోసం వెతుకుతున్నాను
అది ఈ రోజువరకు దొరకలేదు.”

-ముళ్ళపూడి సుబ్బారావు.