Showing posts with label ravinder jain. Show all posts
Showing posts with label ravinder jain. Show all posts

Saturday, October 21, 2017

యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -101
‘యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే’
కలతచెందిన నా హృదయమా,దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
మాన్ -అభిమాన్(1980) సినిమాలో జేసుదాస్ పాడిన పాట రవీంద్రజైన్ సంగీతం,సాహిత్యం అందించారు.
ఏ మనిషీ వేరే వారికి పూర్తిగా అర్ధంకారు.ఎవరికి వారైనా అర్ధమైతే కనీసం తమతో తామైనా మాటాడుకోవచ్చు. అలాంటి ఏకాంతం లో లోపలి సంభాషణతో కొంత సమాధానపడవచ్చు.
వేరేవారి సంగతి అటుంచి కొన్నిసార్లు ఎవరికి వారే పూర్తిగా అర్ధంకారు.అప్పుడు ఒంటరితనమే. అది మరింత వేదనాభరితం.
పై రెండు స్థితులూ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురైయ్యే ఉంటాయి. చుట్టు ఉన్న పరిస్థితులతో ఇమడలేని సందర్భాలు,ఎవరికీ మనసు మాట చెప్పలేని చెప్పటానికిరాని ,ఏదోలా చెప్పినా దానిని విన్నవారు సంపూర్ణంగా అర్ధంచేసుకోలేని స్థితి.
అప్పుడు మనమే మనకి తోడు. మన మనసే మన మిత్రుడు. మనసు కలత చెందితే మనం దానిని ఓదారుస్తాం. కొన్నిసార్లు మనపట్ల మనసును సానుభూతి చూపమంటాం.
మనం విని ఉన్న పాట ఉంటుంది. చాలాసార్లే వినిఉంటాం. ఎప్పుడో ఓ సారి ఆ పాట మనసుకు బాగా దగ్గరైపోతుంది. అంటే ఆ పాటకు అవసరమైన మానసిక స్థితిలో మనమపుడు ఉండి ఉంటాం.
’ పాట అలా దగ్గరైన పాటల్లో ఒకటి.
‘ఉధాస్ ‘ హిందీ పదానికి ‘ఉదాసీనత ‘ తెలుగు పదం దగ్గరదేమోననుకుంటాను. మనసు ఉదాసీనంగా ఉన్నపుడు , జగమంతా పరాయిదైనట్టనిపించినపుడు మనదైన ప్రపంచం ఇదికాదు అది ఎక్కడో ఉన్నట్టనిపిస్తుంది.
జేసుదాసు తన గానంతో పాటకు ,భావానికీ మరింత సాంద్రత పెంచాడు.
“కలతచెందిన నా హృదయమా
దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
నా ప్రాణమా ! నీ గమ్యం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఈ తోటలో ప్రతి పువ్వూ ముళ్ళతో గుచ్చుతుంది
స్వప్నాలు ధూ ళి గా మారుతుంటే ,వాటిగురించి చెప్పేదేముంది
నా మిత్రమా! నీ ప్రపంచం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఎవరూ మరువలేపోతున్న నా తప్పు ఏమిటి ?
పశ్చాత్తాపంతో కళ్ళు, నిండా ఆశృవులు నింపి రోదిస్తున్నాయి!
ఓ వెర్రివాడా! నీ సొంతం అనుకోగలిగింది
ఇది కాదు ..ఇది కాదు . వేరేదేదో ఉంది.
రాయి కూడా ఒకనాటికి కరుగుతుంది
గడ్డకట్టిన నీరు జలపాతం గా మారుతుంది
నీ క్లేశం అలా కరిగేదా
కాదు కాదు అది వేరే ఉంది.”


Tuesday, May 23, 2017

సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-85
‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’. (బంగారంలా మెరుపులు …)
పహేలి (1977) సినిమాలో సురేష్ వాడ్కర్,హేమలత పాడినపాటగాయకుడు సురేష్ వాడ్కర్ కు ఇది తొలిపాట.


శబ్దాలకూ భాష ఉంటుందనుకుంటా. వర్షించే చినుకులు తెలుగులో ‘చిటపట’ మంటాయి(‘చిట పట చినుకులు పడుతూ ఉంటే’),. హిందీలో ‘టిప్ టిప్’ అంటాయి (‘ టిప్ టిప్ బరసా పానీ’). అదే బెంగాలీ లో ఐతే ‘టాపుర్ టూపుర్ ‘ అంటాయట.(‘బ్రిష్టి పడో టాపుర్ టూపుర్’).

వర్షం మీద వచ్చినపాటలు కోకొల్లలు. హిందీ వర్షపు పాటల్లో నాకిష్టమైన పాట ఒకటి . ‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’.

95/96 లలోతీవ్రమైన వేసవి కాలం.కొత్త కాలనీలోపచ్చదనం పెరగలేదు. నీటి ఎద్దడి.సరఫరాఐన మంచినీరు తాగలేనట్టు ఉండేది.కాలనీ పక్కనున్నవాగులో చెలమలు ఎండిపోయాయి. పళ్ళబిగువున కాలం నడుస్తుంది. హఠాత్తుగా వాన వచ్చింది. వేలాది కూలర్లు ఒకేసారి మొదలైనట్టు చల్లదనం, గుట్టలకి మైదానాలకీ మబ్బులు గొడుగు పట్టేశాయి. కుంభ వృష్టి మొదలయ్యింది.ఇంట్లో టీ వీ లో ‘ఎ టి ఎన్’ చానెల్లో బైట వాతావరణాన్ని చూపుతూ ఈ పాట. ..’సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’.  ఆ పాట పట్ల  ఇష్టం అప్పుడు మొదలయ్యింది . అప్పటికే అది పాత పాట.

పాట రచయిత ,సంగీత దర్శకుడు ‘రవీంద్ర జైన్’. ఆయనకు దృష్టి లోపం ఉంది. సృష్టి ని అసలు చూడకుండానే ఉన్నాడా? కొంత కాలం చూసి చూపు కోల్పోయాడా అన్నది నాకు తెలియదు. అతను రాసిన పాటల్లో ప్రకృతి వర్ణన వింటుంటే అసలు చూడకుండా అలా రాయటం సాధ్యమా అనిపిస్తుంది.

‘బ్రిష్టి పరే టాపుర్ టుపుర్’ పదం బెంగాలీ లో ప్రసిద్ధమట. రవీంద్రనాథ్ టాగోర్ కవితాపంక్తి కూడా.కలకత్తా లో కొంతకాలం గడపిన రవీంద్ర జైన్ పై ‘రవీంద్ర సంగీత్ ‘ ప్రభావం ఉంది. అలాగే అక్కడికవిత్వం ప్రభావం కూడా. అలా ఈ బెంగాలి కవితాపంక్తి హిందీ పాటలో కి వచ్చిచేరింది.

పాట చిత్రీకరణలో  వర్షం ,పచ్చని ప్రదేశాలు, వాగులు, వంకలు, వ్యవసాయపు పనులవారు, పూర్తిగా వదలని నటీనటుల పసిదనం  పాటను మరింత ఆకర్షణీయం చేసాయి.

పాట లో ఒక చరణం లో పదం ‘ మేఘం ఘర్జన కు పర్వతంబెదిరింది.పిట్ట అల్లుకున్న గూడు చెదరకుండా ఉంది’ అని వస్తుంది. భలే ఉంది అనిపిస్తుంది.


పాట అర్ధం నేను అర్ధం చేసుకున్నంత వరకు

“  బంగారంలా మెరుపులు ,వెండిలా వికసించే నవ్వులు
చిట పటలతో కురిసే వాన

కాగితపు చిన్న పడవ ..నీటి అలల్ని పట్టుకుని సాగుతుంది
ఈ పడవలో సవారీ చేసి , నది దాటి వెళదాం పద
అక్కడి నేరేళ్ళు మధురం, తీయ తీయగా.. మధురం,మధురం

మేఘం ఘర్జించేసరికి  పర్వతం గుండె కంపించింది
కానీ గిజిగాడు  చాలా తెలివితో ఉన్నాడు
తన గూడు ఇటు అటు చెదరకుండా కట్టాడు.

ఎరుపు,గులాబి,నీలం,పచ్చదనం
ఇవన్నీ ఇంద్రధనుస్సు ను అలంకరించాయి.
చూడు గగనంలో వర్షాగమనం
రంగులమ్మే అంగడిలా ఉంది
గినియా పువ్వు చినుకుల్ని  చూస్తుంది, చినుకులే ఒక ఆట.’


Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-6 'బడే బడాయీ న కరే '
Subbarao Mullapudi 
‘రవీంద్ర జైన్’ పేరు మొదటవిన్నది ‘చిత్ చోర్’ సినిమలో 'గోరి తెరా గావ్ బడా ప్యారా' పాటతో.ఆ పాటకి సంగీత కారుడూ,గీత కారుడు ఆయనే. పాట విని అతని సంగీతం గుర్తుపట్టేంత భిన్నత్వం అతని సంగీతంలో ఉండేది. ‘గీత్ ఔర్ సంగీత్.. రవీంద్ర జైన్’ అని రేడియోలో పాటముందువినపడుతుండేది.
అతని సంగీతం చాలా శ్రావ్యంగా,లలితంగా,మనసును శీతల పరుస్తున్నట్టు ఉంటుంది. ఆయన స్వరరచనలో కబీర్,రహీం,తులసీదాస్ ల దోహాల కొన్నింటిని ఒక సినిమా పాటగా కూర్చారు.
సినిమా పేరు అఖియోం కి ఝరోఖా. గానం జస్పాల్ సింగ్, హేమలత
కాలేజీ లో పాట ల పోటీ.ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫైనల్స్ వచ్చారు. వారిమధ్య తగాదాలతో కూడిన ప్రేమ లాంటిది అప్పటికే ఉంది. పాట మొదలయ్యింది. ఇదీ సందర్భం. పాటలో పల్లవి,చరణాలు ఒక్కొక్కటీ ఒక్కోక్క దోహ.
అర్ధం రమారమీ ఇలా:
అమ్మాయి :“గొప్పవాళ్ళెన్నడు బడాయి పోరు,గొప్పలు చెప్పరు
వజ్రం తన విలువ లక్ష టాకాలని ఎప్పుడు చెప్పింది?”( రహీం దాస్ దోహా)
అబ్బాయి “ గొప్పవారిని తక్కువ చేసిచూస్తే వారికి పోయేది లేదు
గోవర్ధన గిరిధారిని,కేవలం మురళీధరుడు గానే చూసినా అతను బాధ పడడు.” ( రహీం దాస్ దోహా)
అమ్మాయి : “జ్ఞాని తో కబీర్ చెబుతున్నాడు మూర్ఖులకు బోధించకు
గుడ్డివారి ముందు నాట్య కళ చూపి ఉపయోగమేమి?”(కబీర్ దోహా)
అబ్బాయి :“అలాంటి భాష, మాటలు చెప్పు,హృదయ పూర్వకంగా
ఎదుటివారిని చల్ల బరచేవి, నిన్ను చల్లగా వుంచేవి” (కబీర్ దోహా)
అమ్మాయి : “అందరూ తమకళ్ళతో ప్రేమను చూడలేరు
మేఘాలు ప్రేమను వర్షించినా గమనించలేరు” (తులసీ దాస్ దోహా)
అబ్బాయి :“చెడ్డవానిని చూడాలని వెళ్ళాను..చెడ్డవాడు కానరాలేదు
మనసులోకి చూసుకుంటేనా అంత చెడ్డవాడు లేదనిపించింది” (కబీర్ దోహా)
అమ్మాయి : “చెడ్డ మాటలాడకు, లక్ష సార్లు ప్రయత్నించినా మాటల్నివాపసు తీసుకోలేవు
చెడిపోయిన పాలనుండి వెన్న తీయలేము” ( రహీం దాస్ దోహా)
అబ్బాయి :“ప్రేమ బంధాలు తెంచెయ్యకు
తెగిపోతే అతకవు,అతికినా ముడులు తెలుస్తూనే వుంటాయి” ( రహీం దాస్ దోహా)
వేరు వేరు దోహాలతో ఒక అర్ధవంతమైన,సందర్భానికి అవసరమైన పాట రూపొందించడం కొత్తగా అనిపించింది.పాట ఇప్పుడువిన్నా చల్లగాలి తనువెల్లా స్పృశించి వెళ్ళినట్టనిపిస్తుంది.
(కాట్రగడ్డ మురారి సినిమాలో ఒక పాట 'ఇరువురి భామలో కౌగిలిలో' లో ‘ఇంటిలోన పోరంటె ఇంతింత కాదయ’(వేమన),’పరమేశా గంగ విడుము’(శ్రీనాథ),’నా తరమా భవసాగరమీదను’(రామదాసు) ఇలా కొన్ని పద్య/పదపంక్తులు పాటలో భాగమయ్యాయి.)