Showing posts with label ik rasta hai zindagi. Show all posts
Showing posts with label ik rasta hai zindagi. Show all posts

Monday, May 29, 2017

ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-86
“ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ”
(జీవితమొక రహదారి,ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు). కాలా పత్తర్ సినిమాలో కిశోర్ కుమార్,లతా మంగేష్కర్ పాడిన పాట.
బొగ్గు గనుల పారిశ్రామిక ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఈశాన్యప్రాంతం నుండి దక్షిణాదివరకూ కూడా దూరాలతో నిమిత్తం లేకుండా చాల సిమిలారిటీలు కోల్ బెల్ట్ లోకనిపిస్తాయి. లక్షలాది మంది పనిచేస్తున్న ఈ పరిశ్రమనేపధ్యంలో వచ్చిన సినిమాలు తక్కువే.వచ్చిన సినిమాల్లోకూడా మిగితా సాంఘిక సినిమాల్లోచూపేజీవితానికీ,నిజజీవితానికి ఉన్నంత దూరం ఉంది.
దీవార్ సినిమా లో నౌకాశ్రయంలో అమితాబ్ ను కోపధారియువకునిగా చూపి విజయం సాధించిన యాశ్ చోప్రా, ఈ సినిమాలో అమితాబ్ ను బొగ్గుగనుల నేపధ్యంలో ‘యాంగ్రీ యంగ్ మాన్’ గా చూపదలచాడు.
అమితాబ్,శత్రుఘన్ సిన్హా, శశి కపూర్, సంజీవ్ కుమార్ వంటి ‘స్టార్లు’, ముగ్గురు హీరోయిన్లు, సలీమ్ - జావెద్ రచన.. ఇవన్నీ సినిమా బలం.
కోల్ ఇండస్ట్రీ కి సంబంధించి మరువలేని ఒక చేదు జ్ఞాపకం ‘చస్నాల మైన్ డిజాస్టర్’ ఈ సినిమాకు క్లైమాక్స్.
సినిమాలో పాత్రలమధ్య సంఘర్షణ తారాస్థాయిలో ఉంటుంది.మూడు ముఖ్యపాత్రలూ భిన్న కారణాలతో పారిశ్రామిక ప్రాంతానికి వచ్చారు. అమితాబ్ గతంలో నౌకలో అధికారిగా పనిచేసి ఆపత్కాలంలో తన పిరికి చర్య కారణంగా అవమానాలకు గురయ్యాడు. అపరాధ భావన వెంటాడుతుంటే కోల్ మైన్స్ లో షెల్టర్ తీసుకున్నాడు. మరో పాత్ర శత్రుఘన్ సిన్హా చట్టంనుండి దాకోవటానికి అక్కడికి వచ్చి గనిలో పనికి కుదురుకున్నాడు. శశి కపూర్ మైనింగ్ ఇంజనీరుగా మంచి ఉద్దేశాలతో అక్కడికి పనిచేయటానికి వచ్చాడు.
తొలి సంఘర్షణ అమితాబ్ కి తనతో తనకే.దానిని ఎదుర్కోవటానికి స్వయం హననానికి పాల్పడేటంత తీవ్రమైనది. దానికో ఉదాహరణ గాయానికి ఆపరేషన్ చేసే సమయంలో అనస్థీషియా కు నిరాకరించటం. దానికి అతను చెప్పే సమాధానం ‘నొప్పి భరించడం అతని విధి’.
అతని తర్వాత సంఘర్షణ శత్రుఘన్ సిన్హాతో. మౌనం గా సీరియస్ గా ఉన్న అమితాబ్ లోపలి అగ్నిని అతడు కనిపెట్టి ,దానిని ఎక్స్ పోజ్ చెయ్యటానికి యత్నిస్తున్నట్టున్నాడు. అందుకోసం అమితాబ్ ను రెచ్చగొడుతుంటాడు.
వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ, సంభాషణలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.
వీరిమధ్య సయోధ్య పెంచి ,అందరి ఉమ్మడి శత్రువుతో వాళ్ళు తలపడేట్టు చేసే పాత్ర శశి కపూర్ ది. అలాగే మరో శత్రువైన ఉపద్రవం(మైన్ అక్సిడెంట్) తో వారు ఉమ్మడి పోరు చేశారు.
సినిమాలో పాటలకు ‘రాజేశ్ రోషన్’ సంగీతమిచ్చారు.పాటల రచయిత సాహిర్ లూధియాన్వి.
ఈ పాట శశికపూర్ మైనింగ్ ప్రాంతానికి తొలిసారి మోటార్ సైకిల్ పై వెళుతున్న సందర్భంలోనిది.
రహదారి మీద పాట. రహదారిని జీవితంతో పోలుస్తూ సాగే పాట.పాడేఅతను ప్రయాణం ఆపి అక్కడి స్త్రీలు పాడేది వింటాడు. దానికి తనధోరణిలో సమాధానం చెబుతాడు.
కిశోర్: జీవితమొక రహదారి
ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు
ఈ అడుగు ఎక్కడ
ఆగినా ఏమీ మిగలదు.
లత: ఓ సాగిపోయే యాత్రికుడా!
నా చేతిని, ఈ దారిని
విడవవద్దు.తిరిగిరా!
కిశోర్: అందపు సెగలైనా
ప్రేమ పిలుపులైనా
స్వతంత్రంగా ఎగిరే పక్షుల్ని ఏమిఆపగలవు.
వచ్చేదారులు పోయేదారులు
యాత్రికులతో నిండిఉంటాయి
మనం లేకున్నా ఏం కాదు.
లత: అలాంటి బాధ పెట్టకు
ప్రియా! పరదేశం పోకు
నన్ను కూడా వెంటతీసుకునిపో
కిశోర్: సాగిపోయే బాటసారికి
నీడలతో బంధాలెందుకు?
క్షణకాలపు యాత్రికునికి
మనసుపెనవేతలెందుకు?
వచ్చేవారి,పోయేవారి అడుగులతో
రహదారులన్నీ నిండి ఉంటాయి
మనం లేకున్నా పోయేదేంలేదు.
-ముళ్ళపూడి సుబ్బారావు