Showing posts with label rajesh roshan. Show all posts
Showing posts with label rajesh roshan. Show all posts

Saturday, October 21, 2017

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-119
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే,జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
(“కాలం విషమించినపుడు,కష్టాలు చుట్టుముట్టినపుడు)
జుర్మ్ (1990) సినిమాలో కుమార్ సాను పాడిన పాట. రాజేశ్ రోషన్ సంగీతం.ఇందీవర్ రచన.
అనుకరిస్తున్నారని తెలిస్తే అభిమానించటం కష్టమే. అలాంటివారినుంది కొన్ని మంచిపాటలు వచ్చినా.
88-89ప్రాంతంలో హిందీ పాటల్లో మెలొడి తిరిగి ప్రవేశించింది. కొత్తసంగీతదర్శకులతో పాటు కొత్త ‘రఫీ’లు ,కొత్త ‘కిశోర్ కుమార్’లు కూడావచ్చారు.
అలాంటివారిలో ఒక ‘కిశోర్ కుమార్’ ‘కుమార్ సాను’. అతను కిశోర్ పాటల్ని తిరిగి పాడాడు.అవి బానే మార్కెట్ అయ్యాయి. సినిమాలలో సొంతపాటలు కిశోర్ ను అనుకరిస్తూ పాడి సక్సెస్ అయ్యాడు. అతని పాటలు వినపడితే విన్నాను కాని వెతుక్కుని వినలేదు.
అలాంటి కుమార్ సాను గురించి ఒక మిత్రునిద్వారా విన్నమాట. నా మిత్రుని మిత్రుడొకరు హిందీపాటల అభిమాని. అతను కుమార్ సాను అభిమాని. ఎంత అభిమానమంటే చనిపోయేటపుడు కుమార్ సాను పాటలు వింటూండాలనేంత.
ఇదినాకు ఊహకు రాని విషయం.లోకోభిన్నరుచి.
నావరకు ‘కుమార సాను’ పాటల్లో నచ్చిందడిగితే నేను చెప్పేది ‘జుర్మ్’ సినిమాలో ఈ పాట.
సంగీతదర్శకుడు రాజేశ్ రోషన్ తన తండ్రి ‘రోషన్’ అడుగుజాడల్లో నడిచాడు. అప్పటికి పదిహేనేళ్ళుగా మెలొడీ తో నిండిన సంగీతం అందిస్తూ కొత్త సంగీతదర్శకులపోటీని తట్టుకున్నాడు.ఇప్పటికీ తన సోదరుడు రాకేశ్ రోషన్ సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే ఉన్నాడు.
గీతరచయిత ఇందీవర్ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు.
వారికలయికలో వచ్చిన ఒక మధురగీతమిది.
“కాలం విషమించినపుడు
కష్టాలు చుట్టుముట్టినపుడు
నువ్వునాకు తోడు నివ్వు, ప్రియతమా!
లోకంలో నువ్వు మినహా
ఇంతకుముందు ,ఇప్పుడూ ఎవరూలేరు.
రాత్రి లో వెన్నెల ఉన్నంత సేపూ
ప్రతీఒక్కరూ తోడుంటారు
చిక్కని చీకటిలో,నువ్వన్నా
నాచేయి ని విడువకు.
విధేయత చూపమనే నియమాలను
పాటిస్తాను నీ తోడుగా
నా చేతిలో ఉన్న
చివరి శ్వాస వరకు
నా మనసు నమ్ముతుంది
ఇదివరకెక్కటిదో కలయిక ఇది
ఈ బంధం తరతరాలది
ఈ నాటి మాట కాదిది.”

ఆయినా ముఝ్ కో మేరీ పెహ్లి సూరత్ మాంగి

‘ నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-103
“ఆయినా ముఝ్ కో మేరీ పెహ్లి సూరత్ మాంగి”
(దర్పణం నా తొలినాటి ముఖాన్ని కో రుతుంది)
-డాడి సినిమాలో తలత్ అజీజ్ పాడిన పాట(గజల్),రచన సూరజ్ సనిన్, సంగీతం ‘రాజేశ్ రోషన్’.
నా స్నేహితుడు ఒకాయన ‘ అద్దం అబద్ధం చెప్పదు’ పదాన్ని పదే పదే వాడేవాడు. అద్దంలో ముఖాన్ని యధాతధంగా చూసుకోవటానికి ధైర్యం కావాలి. వయసు తెచ్చేమార్పులే కాదు మనసు తెచ్చే మార్పులూ అద్దంచూపిస్తుంది.భౌతిక రూపాన్నే కాదు ,ఆంతరంగిక రూపాన్నీ చూపుతుంది.
ఆస్కార్ వైల్డ్ తన నవల ‘పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ లో దీనినే మరోలా చెబుతాడు. అందులో కథానాయకుడు సుందర రూపుడు. అతన్ని అభిమానించే ఒక కళాకారుడు అతని చిత్రాన్ని గీసాడు. ఐతే ఆ చిత్రం కథానాయకుని మానసిక మార్పులకు అద్దంపట్టేలా మార్పుచెందుతూ వస్తుంది. చివరికి ఆ చిత్రపు వికృతత్వాన్ని అతను భరించలేని స్థితికి అతను చేరుకుంటాడు.
వీటిగురించి ఆలోచనౌ రేపే పాట అప్పుడపుడు గుర్తుకొస్తుంది. పాట మరీ ప్రాచుర్యమయ్యింది కాదు. దర్శకుడు మహేశ్ భట్ తన కుమార్తె ‘పూజా భట్’ తో ‘డాడీ’ (1989) పేరుతో సినిమా తీశాడు.ఇది కొంతవరకూ అతని ఆత్మకథ అంటారు.
సినిమాలో నాయకుడు ఘజల్ గాయకుడు. ధనవంతుల ఇంటి పిల్ల ను ఆమె తండ్రి ఇష్టానికి వ్యతిరేకం గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. పొరపొచ్చాలు పెద్దల ఇష్టముంటే సర్దుబాటౌతాయి , లేకుంటే పెద్దవౌతాయి. వివాహం విఫలమయ్యింది. అతను మద్యానికి బానిసై సంగీతానికి దూరమయ్యాడు.
పెద్దదైన కూతుర్ని కలిసాక అతను తిరిగి నిలబడే ప్రయత్నం చేసాడు. ఆ సందర్భం లో అతను పాడిన పాట ఇది.
“అద్దం నా తొలినాటి ముఖాన్ని కో రుతుంది
నా వాళ్ళు నన్ను తనవాడిననటానికి గుర్తులడిగారు
దుఃఖభరిత వనాల్లో తిరుగాడుతుంటే
కాలం నా ముఖంపైన లెక్క రాస్తూ ఉంది.
నా కీర్తి నా వెర్రితనానికి ????
నా పాటలపుస్తకాన్ని మద్యపుసీసా తాగేసింది
ఇప్పుడు తిరిగి వచ్చాక నవ్వటమే మరిచాను
ఈ నగరం నన్ను మరచింది ..నేనూ దీనిని మరచిపోయాను
నా వాళ్ళు నన్ను పోల్చటానికి గుర్తులడిగారు
అద్దం నా తొలినాటి ముఖాన్ని కోరుతుంది
నా కళ నన్ను తిరిగి రంగం మీదికి తెచ్చింది
ఇక్కడ ప్రేమ ,నమ్మకం అమ్మకమౌతాయి
తండ్రి అమ్ముడౌతాడు..ప్రియతములు అమ్ముడౌతారు
గర్భం అమ్మబడుతుంది. మనసు అమ్మబడుతుంది ..తల అమ్మబడుతుంది
ఈ మారుతుండే ప్రపంచం దేనిపైనా నమ్మకముంచదు
ఇక్కడరోజూ చౌకగా దేవుణ్ణి అమ్మేస్తారు
ప్రతీ ఖరీదుదారునికీ బజారులో ఖరీదు చేయబడతాడు
నేను పొందగలిగిందేమిటి ? వేరేవారు ఇక్కడ పొందిందేమిటి?
నా భావనా! నా పూజా!! వేరేచోటు కు పద"

Monday, May 29, 2017

ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-86
“ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ”
(జీవితమొక రహదారి,ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు). కాలా పత్తర్ సినిమాలో కిశోర్ కుమార్,లతా మంగేష్కర్ పాడిన పాట.
బొగ్గు గనుల పారిశ్రామిక ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఈశాన్యప్రాంతం నుండి దక్షిణాదివరకూ కూడా దూరాలతో నిమిత్తం లేకుండా చాల సిమిలారిటీలు కోల్ బెల్ట్ లోకనిపిస్తాయి. లక్షలాది మంది పనిచేస్తున్న ఈ పరిశ్రమనేపధ్యంలో వచ్చిన సినిమాలు తక్కువే.వచ్చిన సినిమాల్లోకూడా మిగితా సాంఘిక సినిమాల్లోచూపేజీవితానికీ,నిజజీవితానికి ఉన్నంత దూరం ఉంది.
దీవార్ సినిమా లో నౌకాశ్రయంలో అమితాబ్ ను కోపధారియువకునిగా చూపి విజయం సాధించిన యాశ్ చోప్రా, ఈ సినిమాలో అమితాబ్ ను బొగ్గుగనుల నేపధ్యంలో ‘యాంగ్రీ యంగ్ మాన్’ గా చూపదలచాడు.
అమితాబ్,శత్రుఘన్ సిన్హా, శశి కపూర్, సంజీవ్ కుమార్ వంటి ‘స్టార్లు’, ముగ్గురు హీరోయిన్లు, సలీమ్ - జావెద్ రచన.. ఇవన్నీ సినిమా బలం.
కోల్ ఇండస్ట్రీ కి సంబంధించి మరువలేని ఒక చేదు జ్ఞాపకం ‘చస్నాల మైన్ డిజాస్టర్’ ఈ సినిమాకు క్లైమాక్స్.
సినిమాలో పాత్రలమధ్య సంఘర్షణ తారాస్థాయిలో ఉంటుంది.మూడు ముఖ్యపాత్రలూ భిన్న కారణాలతో పారిశ్రామిక ప్రాంతానికి వచ్చారు. అమితాబ్ గతంలో నౌకలో అధికారిగా పనిచేసి ఆపత్కాలంలో తన పిరికి చర్య కారణంగా అవమానాలకు గురయ్యాడు. అపరాధ భావన వెంటాడుతుంటే కోల్ మైన్స్ లో షెల్టర్ తీసుకున్నాడు. మరో పాత్ర శత్రుఘన్ సిన్హా చట్టంనుండి దాకోవటానికి అక్కడికి వచ్చి గనిలో పనికి కుదురుకున్నాడు. శశి కపూర్ మైనింగ్ ఇంజనీరుగా మంచి ఉద్దేశాలతో అక్కడికి పనిచేయటానికి వచ్చాడు.
తొలి సంఘర్షణ అమితాబ్ కి తనతో తనకే.దానిని ఎదుర్కోవటానికి స్వయం హననానికి పాల్పడేటంత తీవ్రమైనది. దానికో ఉదాహరణ గాయానికి ఆపరేషన్ చేసే సమయంలో అనస్థీషియా కు నిరాకరించటం. దానికి అతను చెప్పే సమాధానం ‘నొప్పి భరించడం అతని విధి’.
అతని తర్వాత సంఘర్షణ శత్రుఘన్ సిన్హాతో. మౌనం గా సీరియస్ గా ఉన్న అమితాబ్ లోపలి అగ్నిని అతడు కనిపెట్టి ,దానిని ఎక్స్ పోజ్ చెయ్యటానికి యత్నిస్తున్నట్టున్నాడు. అందుకోసం అమితాబ్ ను రెచ్చగొడుతుంటాడు.
వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ, సంభాషణలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.
వీరిమధ్య సయోధ్య పెంచి ,అందరి ఉమ్మడి శత్రువుతో వాళ్ళు తలపడేట్టు చేసే పాత్ర శశి కపూర్ ది. అలాగే మరో శత్రువైన ఉపద్రవం(మైన్ అక్సిడెంట్) తో వారు ఉమ్మడి పోరు చేశారు.
సినిమాలో పాటలకు ‘రాజేశ్ రోషన్’ సంగీతమిచ్చారు.పాటల రచయిత సాహిర్ లూధియాన్వి.
ఈ పాట శశికపూర్ మైనింగ్ ప్రాంతానికి తొలిసారి మోటార్ సైకిల్ పై వెళుతున్న సందర్భంలోనిది.
రహదారి మీద పాట. రహదారిని జీవితంతో పోలుస్తూ సాగే పాట.పాడేఅతను ప్రయాణం ఆపి అక్కడి స్త్రీలు పాడేది వింటాడు. దానికి తనధోరణిలో సమాధానం చెబుతాడు.
కిశోర్: జీవితమొక రహదారి
ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు
ఈ అడుగు ఎక్కడ
ఆగినా ఏమీ మిగలదు.
లత: ఓ సాగిపోయే యాత్రికుడా!
నా చేతిని, ఈ దారిని
విడవవద్దు.తిరిగిరా!
కిశోర్: అందపు సెగలైనా
ప్రేమ పిలుపులైనా
స్వతంత్రంగా ఎగిరే పక్షుల్ని ఏమిఆపగలవు.
వచ్చేదారులు పోయేదారులు
యాత్రికులతో నిండిఉంటాయి
మనం లేకున్నా ఏం కాదు.
లత: అలాంటి బాధ పెట్టకు
ప్రియా! పరదేశం పోకు
నన్ను కూడా వెంటతీసుకునిపో
కిశోర్: సాగిపోయే బాటసారికి
నీడలతో బంధాలెందుకు?
క్షణకాలపు యాత్రికునికి
మనసుపెనవేతలెందుకు?
వచ్చేవారి,పోయేవారి అడుగులతో
రహదారులన్నీ నిండి ఉంటాయి
మనం లేకున్నా పోయేదేంలేదు.
-ముళ్ళపూడి సుబ్బారావు

Sunday, May 21, 2017

యే రాతే ..నయీ పురానీ..ఆతే .ఆతే జాతే

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-83
“యే రాతే ..నయీ పురానీ..ఆతే .ఆతే జాతే ..కెహతా హై కోయి కహాని”
(“ ఈ రాత్రులు...కొత్తవి పాతవి ..ఏవో కథలు చెబుతాయి).లతా మంగేష్కర్ గానం, ఆనంద్ బక్షి రచన,రాజేష్ రోషన్ సంగీతం.

హైస్కూల్లో ఉన్నపుడు స్వతంత్రంగా 79 నాటికి స్నేహితులతో కలిసి ఏలూరెళ్లి సినిమాలు చూసే ధైర్యం వచ్చింది. సెలవురోజుల్లో ఐదారు రూపాయిలు దొరకబట్టుకోగలిగితే ఉదయం బస్సో లారీయో ఎక్కి మార్నింగు షో టైముకు ఏలూరు చేరేవాళ్ళం.కనీసం రెండు సినిమాలు చూద్దామని. చూడదలుచుకున్న కొత్తసినిమాలు మార్నింగు షో లు ఉండేవి కావు. పాత హిందీ/ఇంగ్లీష్ సినిమాలో,డబ్బింగు సినిమాలో ఉదయపుఆటలు ‘ఆడేవి’.ఇష్టమై కాకపోయినా అలా కొన్ని సినిమాలు చూడాల్సివచ్చేది.

అలా చూసిన ఒక సినిమా ‘జూలీ’. హిందీ సినిమాల్లో ఆశించే పెద్దనటులూ, ఫైటింగులూ ఏమీ లేవు. పాటలు మాత్రం అన్నీ విన్నవే. సినిమా అప్పుడు ఏమాత్రం ఆకట్టుకోలేదు.

తర్వాత రోజుల్లో టివీ లో చూసేంతవరకూ పాటలతో సినిమా టచ్ లోనే ఉంది.
సినిమా వచ్చిన కాలం నాటికి(1975) ఇది ధైర్యవంతమైన సినిమానే. సినిమా నడిచే స్థలం రైల్వే ఉద్యోగులు నివసించే కాలనీ. రైల్వేలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కావటం వల్లకావచ్చు భిన్న భాషలు, మతాలకు చెందినవారక్కడ వున్నారు. కథానాయిక కుటుంబానిది ఆంగ్లో ఇండియన్స్ నేపధ్యం. బెంగాలుకు చెందిన హిందువుల అమ్మాయితో ఆమెకు స్నేహం. చదువు నుండి సెలవలకు వచ్చిన స్నేహితురాలి తమ్ముడుతో ప్రేమలో పడిందామె.

కాలనీక్లబ్బులో ఫంక్షన్ (న్యూ ఇయర్ పార్టీ??) జరుగుతుంది. కథానాయిక స్నేహితురాలు ఈ పాట పాడుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మరింత ముందుకు పోవటానికి ఈ ఫంక్షన్ దోహదపడింది.

సినిమాతో సంబంధం లేకుండా ఈ పాట ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేకంగా రాత్రుల్లో వింటుంటే మనసు వూగుతుంది, జోగుతుంది.అప్రమేయంగా ‘వక్త్’ సినిమాలో ‘ఆగే భీ జానే న తూ..పీచే భీ జానే న తూ ‘ పాట గుర్తుకు వస్తుంది.

“ ఈ రాత్రులు...కొత్తవి పాతవి
వస్తుంటాయి ,వచ్చి పోతుంతాయి.
ఏవో కథలు చెబుతాయి

చూడు ఎవరో వస్తున్నారు.
చూడు ఎవరో వెళుతున్నారు.
అందరి హృదయాలు మెలకువతోనే ఉన్నాయి.
అందరి కళ్ళు అర్ధ నిద్రలో ఉన్నాయి
నిశ్శబ్దం మాత్రమే మాటలాడుతూ ఉంది.

ఎలాటి తీయని సమయమిది?
కనురెప్పల వీదుల్లో
తిరుగాడే నిదురలాంటి
సుందర స్వప్నాల బృందాల్లాంటి
పూలనుండి వీచే సుగంధం.

ఏ వైపునుండి గాలులు
ఎప్పుడు వీస్తాయో ఎవరికి తెలుసు?
ఏడాది వరకైనా గుర్తుంచుకో
ఏమాత్రం మరవవద్దు
ఈ కలయిక రాత్రిని.”


Sunday, March 26, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-8  ‘కా కరు సజని ఆయేన బాలం ‘ 
Subbarao Mullapudi 
అప్పట్లో ఏదైనా నచ్చిన పాట వినటం తటస్తిస్తే ఒక ఇంద్ర ధనుస్సు ను చూసినట్టే. ఇంద్రధనుస్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడలేము.వాన వుండాలి,ఎండవుండాలి,ఏటవాలు కిరణాలుండాలి. ‘కా కరు సజని ఆయేన బాలం ‘ పాటను బహుశా 79/80 లలొ విని వుంటాను. ఈ పాట నాకు హరివిల్లు లాంటిదే.
ఎందుకు నచ్చింది,గుర్తుంది అంటే....కొన్ని విన్నవెంటనేనచ్చుతాయి.కారణాలు నెమ్మదిగా వెతికి తెలుసుకోవాలి.పాటలో ఒక పెయిన్ ఉంది.యేసుదాస్ పలికిస్తున్నాడు.బాధకు కారణాలు తెలియాలంటే పాట అర్ధం పూర్తిగా తెలియాలి.
కొద్ది కాలం తర్వాత అర్ధం తెలిసింది. పాటలో వ్యక్తమయ్యే బాధకు కారణం విరహం.విరహపుబాధ ను హితురాలితో చెపుతుంది విరహిణి. దీనిపట్ల సహానుభూతీ చెందగలం.
తర్వాత దృశ్యపరంగా పాటను చూసినపుడు అందులో పాట పాడేవారూ,వినేవారు వేదనతో లేరు.పాటలోని వేదననంతా అనుభవిస్తున్న స్త్రీ వేరే ఆమె.
వేదన కు కారణమైన విరహం పైన చెప్పిన ప్రేయసిదేనా? మరి మనవంటి విని స్పందించేవారిసంగతి?
శ్రీ శ్రీ ‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాటలో చెలి ఎవరంటే ఏమి చెప్పాడు???
పాట అర్ధం ఇలా ఉంది.
‘ఏమి చేయను చెలి ..ప్రియాగమనం లేదు
పరదేశి ప్రియునికై కనులు రెప్పలార్పకుండా వేచాయి
ఏ అడుగుల సవ్వడి ఐనా, అతనే అని హృదయం పరుగిడుతుంది
ప్రేమబంధాలు తెగనీకు
ప్రేమ దాచాలన్న దాగట్లేదు
శ్రావణమే నువ్వు,నేను మేఘాన్ని
సూర్యుడస్తమించాడు,సంధ్య వచ్చింది,కాలం వళ్ళు విరుచుకుంది
లోకమంతా నిదురలో సోలింది,నాకు నిదుర లేదు
అతడు వస్తాడొ రాడోనని గాభరా,భయం
రాధ పిలుస్తుంది ..కృష్ణా నీవెక్కడ?”
తర్వాత తెలిసిన వివరాలు.చాలా ప్రాచుర్యంలో ఉన్న ‘ఆయేన బాలం ‘ థుమ్రీ అధారంగా అమిత్ ఖన్నా రాయగా రాజేష్ రోషన్ స్వరపరిచారు.
ఈ థుమ్రీని మహా విద్వాంసులైన బడే గులాం అలి ఖాన్ ,గులాం అలి వంటివారు ఆలపించారు.వారి పాటను విని ఆనందించటానికి యేసుదాస్ పాడిన ఈ పాటేనాకు పునాది.
--ముళ్ళపూడి సుబ్బారావు