Showing posts with label javed akhtar. Show all posts
Showing posts with label javed akhtar. Show all posts

Wednesday, February 7, 2018

సందేశే ఆతే హై హమే తడపాతే హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-126
`సందేశే ఆతే హై హమే తడపాతే హై`
(సందేశం వస్తుంది నన్ను బాధిస్తుంది)
బోర్డర్ సినిమాలో సోనూ నిగమ్,రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట. జావెద్ అఖ్తర్ రచన, అను మాలిక్ సంగీతం.
హకీకత్ సినిమా ను `యుద్ధ చిత్రాలకు తల్లి` (మదర్ ఆఫ్ వార్ మూవీస్) అంటారు. ఆ తల్లికి తగిన తనయ 1997లో వచ్చిన `బోర్డర్` సినిమా.
దర్శకుడు జె పి దత్తా సినిమాలు గులామి మొదలు ఉమ్రావ్ జాన్ (కొత్తది) వరకూ అన్నీ విభిన్నమైన అభిరుచి తో తీసినట్టుంటాయి. నావరకూ వాటిపట్ల ఆకర్షణ ఉంది.
పాకిస్తాన్ తో భారత్ కు జరిగిన `బాటిల్ ఆఫ్ లాంగెవాల్` (1971)నేపధ్యంతో వచ్చిన పీరిడ్ ఫిల్మ్ ఇది. సినిమా లో యుద్ధం అనివార్యత చెబుతాడు .అది ఎందుకు నివారించబడాలో చెబుతాడు. సందిగ్ధత చివరకీ మిగిలేవుంటుంది.
సినిమాలో ఈ పాట భరతఖండంలోనే కాదు భారతీయులున్న ఖండ ఖండాలలోనూ మారుమోగింది. ఇప్పటికీ ప్రతిధ్వనులు వినిపిస్తునే ఉన్నాయి.
హకీకత్ సినిమాలో `హోకె మజ్ బూర్ ముఝె ఉస్ నె భులాయా హోగా` మరపురాని పాట.ఆ పాటలో కదన రంగంలో సైనికులు విపత్కర పరిస్థితుల్లో ఇంటిని గుర్తుతెచ్చుకుని పాడే పాట.
`నామ్` సినిమాలో `చిట్టీ ఆయీ హై` పాట దూర సీమల్లో,తీరాల్లో ఉన్నవానినుద్దేశించి ఇంటి దగ్గర తండ్రి పాడేపాట.
పై రెండు పాటల కలయిక ` సందేశే ఆతే హై ` పాటలో కనిపిస్తుంది. పదినిముషాలవరకూ సాగే ఈ పాట క్రమక్రమంగా గాఢమౌతూ మనసుల్ని తడుతుంది.దృశ్యపరంగానూ,శ్రవణ పరంగానూ,అర్ధ పరంగానూ ఉన్నతమైన పాట.
యుద్ధంలో ఉన్న వారికి వదిలివచ్చిన వాటిని తిరిగి కలిసే /చూసే అవకాశాలు అనుమానమే. పాట చివరలో `మై వాపస్ ఆ ఊంగా ` పదం విన్నాక ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది.
``సందేశం వచ్చింది
నన్ను బాధించింది
వచ్చిన ఉత్తరం
నన్ను అడుగుతుంది
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే ఈ ఇల్లు శూన్యంగా ఉంది
మనసైన, మోహనమైన అమ్మాయి
నాకు ఉత్తరం రాసింది
నన్ను అడుగుతుంది
తన శ్వాస,తన హృదయ స్పందన
తన గాజులు,తన కడియం
తన జడ, తన జడలో పూలు
పరిమళించే ఉదయాలు, మత్తెక్కించే సాయంత్రాలు
ఒంటరి రాత్రులు, ముగియని మాటలు
తపించే బాహువులు
తపించే చూపులు అడుగుతున్నాయని..
ఎప్పుడు ఇంటికి వస్తావు
ఎప్పుడొస్తావో రాయి.
నీవు లేకుంటే హృదయం శూన్యంగా ఉంది
నన్ను ప్రేమించే వారు,నా స్నేహితులు
నాకు రాసారు. నన్ను అడిగారు
మా ఊరు, మామిడిచెట్టు నీడ
పాత రావి చెట్టు,వర్షించే మేఘాలు
గోధుమ పంట పొలాలు, పచ్చని మైదానాలు
బంతి పూలు, ఊగే రెమ్మలు
ఊగుతున్న ఉయ్యాల, తలలూపే పూవులు
విచ్చుకునే మొగ్గలు
ఇంకా ఊరి వీధులు అడుగుతున్నాయని.
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే ఈ ఊరు శూన్యంగా ఉంది
ఒక మమత తో
గంగ అంత ప్రేమతో
వచ్చిన ఉత్తరం
వస్తూ తెస్తుంది
నా బాల్యపు రోజులు
వాకిటిలో ఆటలు
అమ్మ పైటచెంగు నీడ
ఆమె చిక్కని కాటుక
ఆ జోలపాటల రాత్రులు, ఆమె మెత్తని చేతులు
ఆ కళ్ళల్లో ప్రేమ, మాటలలో చింత
పైకి చూపే కోపం,లోపల ప్రేమ
చూపే అమ్మ
ప్రతీ జాబులో లో అమ్మ అడుగుతుంది
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే వాకిలి శూన్యంగా ఉంది
తిరుగాడే గాలీ ! చెప్పు
నాకో చిన్న పని చేస్తావా?
మా ఊరు వెళ్ళు, నా స్నేహితులను అడిగానని చెప్పు
మా ఊరిలో ఉన్న ఓ వీధిలో
నా హృదయేశ్వరి ఉంటుంది
ఆమెతో ప్రేమ మాట చెప్పు
అక్కడికి కొద్ది దూరంలో మా ఇల్లు ఉంటుంది
మా ఇంటిలో మా అమ్మ ఉంటుంది
మా అమ్మ పాదాలు స్పృశించి
ఆమె కు ఆమె కొడుకు పేరు చెప్పు
ఓ తిరుగాడే గాలీ! కొద్దిగా
నా స్నేహితులకు,ప్రేయసికి
మా అమ్మకు నా వార్త చెప్పు
అక్కడికి వెళ్ళి ఈ వార్త చెప్పు
నేను తిరిగి వస్తాను
తిరిగి నా ఊరికి
ఊరి నీడలోకి
అమ్మ పైటచెంగు కు
ఊరి రావి చెట్టుకు
ఆమె కాటుకకు
ఇచ్చిన మాటను నిలుపుకుంటాను
నేనొక రోజు వస్తాను
-ముళ్ళపూడి సుబ్బారావు

Saturday, October 21, 2017

ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-115
ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా
(ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే)
1994 లో వచ్చిన ‘1942 ఎ లవ్ స్టొరీ’ సినిమాలో పాట. కుమార్ సాను పాడిన పాట.
1942 కాలానికి చెందిన ( పీరీడ్) ఫిల్మ్ గా వచ్చిన ఆ సినిమాకి ఇప్పటి చిత్ర ప్రముఖులు విధు వినోద్ చోప్రా, సంజయ్ లీలా బన్సాలి పని చేసారు. ఆర్ డి బర్మన్ సంగీతదర్శకుడు. జావెద్ అఖ్తర్ గీత రచయిత.
అప్పటికి ఆర్ డి బర్మన్ సంగీత దర్శకుడిగా తన పునర్వైభవం పొందటానికి చాలానే కృషి చేస్తున్నాడు. ఆ కృషి ‘1942- ఎ- లవ్ స్టొరీ’ లో కనిపిస్తుంది. ఆ సినిమా సంగీతం అతనికి స్వయంగా నచ్చింది. అదే మాట తన పాత మిత్రులతో పంచుకున్నాడు. ఐతే అదే సినిమా అతని ‘హంస గీత’ మై పోయింది. సినిమా విడుదలై సంగీతం శ్రోతలకు చేరువయ్యేసరికి అతను మరణించాడు.
‘ఉపమ కాఌదాసస్య ‘ అంటారు. ఉపమాలంకారాన్ని వినియోగించటంలో అంతవారులేరని అర్ధమనుకుంటాను. కాఌదాసు ఉలిక్కిపడేట్టు జావెద్ అఖ్తర్ ఈ పాట రాసాడు. పాటలో చరణం తప్ప మిగతావన్నీ ఉపమానాలే. ఇరవై పైనే ‘ఎలా అనిపించింది’ అన్నదానికి సమాధానాలు. ఇన్ని ఉపమానాలు కాఌదాసు ఒకేచోట ఎప్పుడూ రాసిఉందక పోవచ్చు.
పాట పాడిన గాయకుడు ‘కుమార్ సాను’ ఎనభైల చివరి సంవత్సరాలలో ప్రముఖగాయకుడిగా గుర్తింపుపొందాడు. కిశోర్ కుమార్ అనుకరిస్తూ పాడిన అనేక గాయకుల్లో విజయవంతమైన గాయకుడు. కిశోర్ కుమార్ ను ఉన్నతశిఖరాల్లో నిలిపిన ఆర్ డి బర్మన్ ఎందువల్లో ‘కుమార్ సాను’ తో ఈ సినిమా వరకూ పాడించలేదు.
“ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
వికసించే గులాబీలా
కవి కన్న కలలా
వెలుతురు కిరణంలా
వనంలో హరిణిలా
వెన్నెల రాత్రిలా
చల్లని మాటలా
గుడిలో వెలుగుతున్న ఒక దీపంలా.
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
అందమైన ఉదయంలా
శీతాకాలపు నీరెండలా
వీణానాదంలా
రంగుల రాణిలా
అల్లుకున్న తీగలా
కెరటాల ఖేఌలా
పరిమళాలతో వీచే చల్లని గాలిలా
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
నాట్యంచేసే నెమలిలా
పట్టుదారంలా
దేవరాగంలా
చందనపు చిరుమంటలా
పదహారు రకాల అలంకరణలా
తెలిమంచులా
నెమ్మదిగా పెరుగుతున్న నిషాలా”


హమ్ న సంఝే థే బాత్ ఇత్నిసీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-113
‘హమ్ న సంఝే థే బాత్ ఇత్నిసీ’
(ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు)
‘గర్దిష్ ‘ (1993) సినిమాలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
ప్రభుత్వం, ఉద్యోగం ఇచ్చేముందు, అంటే అధికార వ్యవస్థ లోనికి రానిచ్చేముందు సదరు వ్యక్తి పై పోలీస్ ఎంక్వైరీ జరుపుతుంది. అతనిపై పోలీసు కేసులు, నేరపూరిత నేపధ్యం వగైరాలు లేవని తెలిసాక మాత్రమే ఉద్యోగం ఇస్తుంది. అదీ పోలీసు ఉద్యోగమైతే , మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 
నిజాయితీ పరుడైన చిన్న స్థాయి పోలీసు ఉద్యోగికి తన కొడుకును పోలీసు ఇన్సపెక్టర్ గా చూడాలనికోరిక. కొడుకుకు చిన్నప్పటినుండి అందుకు తర్ఫీదు ఇస్తున్నాడు. అతని కల సాకారమౌతుందనుకున్న తరుణం లో పరిస్థితుల ప్రభావంవల్ల కొడుకు చట్టందృష్టిలో నేరమైన పని చేసాడు. తద్వారా పోలీసు ఉద్యోగి కావటానికి అనర్హుడయ్యాడు.
దర్శకుడు ‘ప్రియదర్శన్ ‘ అనేక మళయాళీ సినిమాలను 90 ల తర్వాత హిందీ లో తన ప్రత్యేకముద్రతో తీశాడు. అందులో ‘గర్దిష్’ సినిమా ఒకటి. అతడు నటుడు అమ్రిష్ పురి ని తన సినిమాలలో గొప్పగా వినియోగించు కున్నాడు. ఈ సినిమాలో పోలీసు కానిస్టేబుల్ గా అమ్రిష్ పురి ,అతని కొడుకుగా ‘జాకీ ష్రోఫ్’ నటించారు.
తండ్రీకొడుకులు క్రమంగా దూరం కావటం ఈ పాటలో కనపడుతుంది. ఆర్. డి. బర్మన్ చివరి సినిమాలలో ‘1942 ఎ లవ్ స్టోరీ’ బర్మన్ కు సంతృప్తి నిచ్చిందట. ‘గర్దిష్ ‘ సినిమా లో ఈ పాటా ఆయన అభిమానుల్ని అలరించింది.
ఎనభైల తర్వాత కథలు మాని పాటలు రాయటం మొదలుపెట్టిన ‘జావేద్ అఖ్తర్’ రచన ఇది.
“ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
స్వప్నం అద్ద మైతే
లోకం రాయిలాంటిదని.
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
నేను కోరినది పొందినపుడు
వెలుతురు తనతో చీకటిని తెస్తుందని
చీకటి చిక్కనైనది
వెలుతురు పలుచనిది
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
కేవలం విధ్వంసం, ఒంటరితనం
జీవితం నన్ను ఎక్కడికి తెచ్చింది.
గమ్యానికెళ్ళే దారులు తప్పాను
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
ఒకరు అమ్మగలిగేదేమిటి? ఒకరు పంచగలిగేదేమిటి?
బజారులో పూల దుకాణాలు ఉన్నాయి”
నా దోసిట్లో కేవలం ముళ్ళు మాత్రమే ఉన్నాయి"