Showing posts with label bhupender. Show all posts
Showing posts with label bhupender. Show all posts

Thursday, February 8, 2018

కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-144
‘కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి’
(గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది)
...
కొన్ని పాటల్లోని సంగీతం మనసు ను తేలికపరుస్తుంది, అర్ధం మనసును బరువెక్కిస్తుంది. అలాంటి పాటల్లో ఇది ఒకటి.
మాటల రచయిత ‘సాగర్ సర్హది’ బాల్యంలో దేశ విభజనతో పాకిస్తాన్ నుండి కాందిశికుడిలా ఢిల్లీ కివచ్చాడు. అక్కడినుండి బొంబాయికి. రచయితగా యశ్ చోప్రా తో కలిసి విజయవంతమైన సినిమాలకు పనిచేసాడు. అందులో కభీ కభీ, సిల్ సిలా ,చాందిని వంటివి ఉన్నాయి. అమితాబ్ బచన్ తో ‘మీరు బరువైన గుండె తో రాస్తారు’ అనిపించుకున్నాడు.
‘బజార్’ సినిమాతో దర్శకుడయ్యాడు. ‘బజార్’ సినిమా కన్యాశుల్కం వంటి కథకు మరో రూపంలో హైదరాబాద్ నేపధ్యంగా నడుస్తుంది. (హిందీ సినిమాల్లో అప్పట్లో నాకు హైదరాబాద్ కొత్తగా కనిపించేది. అంతకు ముందటి ‘మెహబూబ్ కి మెహంది’, తర్వాతి ‘నిఖా’ సినిమాల్లో).
సినిమాలో సంగీతం, పాటలు మరపురానివి. పాటలు సినిమాకోసం రాసినవి కాకుండా సాహిత్యం నుండి అవసరం మేరకు ఎంచుకున్నవి. మీర్ తకి మీర్ (దిఖాయి దియె) , మఖ్దూమ్ మొహియుద్దిన్( ఫిర్ చిడీ రాత్ బాత్ ఫూలోన్ కి) కవితలు/గజల్లు అలాంటివే.
‘కరోగి యాద్’ పాట బషర్ నవాజ్ రచన. ఖయ్యాం సంగీతం, భుపెందర్ స్వరం ..వీటి విలువను మరింతపెంచిన నటినటుల నటన, చిత్రీకరణ ...వీటన్నింటితో పాట ఓ గొప్పానుభూతినిస్తుంది.


“గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది
కదిలిపోయే కాలపు, ప్రతి కెరటం ఆగిపోతుంది
ఈ చంద్రుడు కరగిపోయిన కాలానికి అద్దం ఔతాడు
కదలాడుతున్న మబ్బుల్లో ఏదో ముఖం రూపుకట్టింది
బరువెక్కిన దారులు ఏదో కథ వినిపిస్తుంది
వర్షంతో చెమ్మగిల్లిన ఋతువు పొగ గా మారుతుంది
కరగిపోతున్న కొవ్వొత్తి నిచూసి మనసు గర్విస్తుంది
అరచేతిలోని గోరింట ఏవో జ్ఞాపకాలు రేపుతుంది
వీధి మలుపులో ఒక గుమ్మం శూన్యంగా ఉంది
తపించే కళ్ళతో ఎవరిరాకకో ఎదురుచూస్తుంది
చూపులు దూరంవరకూ వెళ్ళి తిరిగి వస్తున్నాయి “




Saturday, October 21, 2017

ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-109
“ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే”
(ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
‘ఘరోండా’(1977) సినిమాలో భుపేందర్ పాడిన పాటగుల్జార్ రచన జైదేవ్ సంగీతం.
‘ఇల్లు కొందరికి ఉండటానికి గూడు కొందరికి సంపాందిచవలసిన ఆస్తి’. అని ‘రావి శాస్త్రి’ తన ‘ఇల్లు ‘ నవలలో చెబుతారు.
ఈ సినిమాపేరు ‘గూడు’. బొంభాయి నగరం లో ఆవాసం దొరకటం కష్టం. ఇద్దరు మధ్యతరగతి ఉద్యోగులు తమకో గూడు ఏర్పాటు చేసుకుని వివాహంచేసుకుందామనుకున్నారు. తమ అన్ని వనరులూ కట్టబోయే అపార్ట్మెంట్ పై పెట్టారు. దానిపై కలలు కన్నారు. ఆశలల్లుకున్నారు. ఐతే బిల్డర్ మోసంచేశాడు. ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. వారి తిరిగి మొదటికొచ్చారు. దాని కారణం గా వారు దూరమయ్యారు.
అవసరాలు,పరిస్థితులు మనుషులకు పరీక్ష పెడతాయి. అవి కొందర్ని దిగజారుస్తాయి., అడ్డదారులవైపు అడుగులు వేయిస్తాయి. కొందరు మాత్రం పరీక్షకు నిలబడగలుగుతారు.
అప్పటివరకూ కలిసున్న మనుషుల్ని అలాంటి పరీక్షాసమయాలు ఎవరిదారి వాళ్ళు చూసుకొనేట్లు చేస్తాయి.
1977 లో వచ్చిన ఈ సినిమా అప్పటి నగర ,మధ్యతరగతి జీవితాలని ప్రతిబింబిస్తుంది.
“ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
అన్నపానాలు వెతుకుతున్నాడు ,ఆశ్రయం వెతుకుతున్నాడు
పగలు ఖాళీ పాత్ర లా ఉంది, రాత్రి చీకటి నుయ్యిలా ఉంది
ఈ శూన్యమైన చీకటి కళ్ళలో , కన్నీటికి బదులు పొగ వస్తుంది
జీవితం సాగించటానికి కారణం కనపడదు. మరణించటానికి సాకు వెతుకుతున్నాడు
వయసుకన్నా దీర్ఘమైన దారుల్లో , గమ్యం చేరిక కానరాదు
పరుగిడుతూనే ఉన్నాడు, అతను ఆగటం చూడనే లేదు
ఈ అపరిచిత నగరంలో తెలిసినవారికోసం వెతుకుతున్నాడు”

“కిసీ నజర్ కో తేరా ఇంతిజార్ ఆజ్ భి హై”

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-106
“కిసీ నజర్ కో తేరా ఇంతిజార్ ఆజ్ భి హై”
(“నీచూపు కోసం ,ఎదురు చూపు ఇప్పటికీ ఉంది)
ఐత్ బార్ (1985) సినిమాలో పాట. హసన్ కమాల్ రచన, భూపెందర్, ఆశాభోన్స్లే గానం.బప్పీలహిరి సంగీతం.
డెబ్భైలకు ముందు సినిమాలలో అనేక గజళ్ళు వున్నాయికానీ వాటి గాయకులూ మిగతా సినిమాపాటల గాయకులూ ఒక్కరే కావటంతో ప్రత్యేకంగా తెలిసేవికావు.
తర్వాత రోజుల్లో సినిమా గజళ్ళు జగ్ జిత్ సింగ్, పంకజ్ ఉధాస్ వంటి గజల్ గాయకులు పాడటం మొదలై ఆ ప్రక్రియ వేరుగా కనపడటం మొదలయ్యింది. గజళ్ళు ఉండే సినిమాలు కూడా ప్రత్యేక జానర్ గా ఉండేవి.
‘కిసీ నజర్ కో తేరా ‘ పాట వింటుంటే అలాంటి డిఫరెంట్ సినిమా చెందిన పాట అనిపిస్తుంది. పాట చిత్రీకరణకూడా అలానే అనిపిస్తుంది.
ఐతే ‘ఐత్ బార్ ‘ సినిమా ‘హత్య - రహస్యం’ చుట్టూ తిరిగే సినిమా. సస్పెన్స్ తో పాటు రెండు ‘సర్ప్రైజ్’ లు సినిమాలో ఉన్నాయి.
ఒకటి- క్రైమ్ సినిమాలో మనసుని ఆకట్టుకొనే లలితమైన గజల్లు (భూపేందర్ గానంతో)
రెండు- హోరెత్తించే సంగీతానికి మారుపేరైన బప్పీలహిరి వాటికి సంగీతమివ్వటం.
మొదటి రోజుల్లో రేడియో లోనూ , తర్వాత కాలంలో టీ.వీ. లోనూ బహుళ ప్రాచుర్యంలో ఉన్నపాట(గజల్).
“నీచూపు కోసం ,ఎదురు చూపు ఇప్పటికీ ఉంది
నువ్వెక్కడున్నవో నని ఈ మనసు ఆరాటం ఇప్పటికీ ఉంది
మనం కలిసితిరిగిన స్థలాలు, పరిసరాలో
నా నమ్మకపు జ్ఞాపక చిహ్నం ఇప్పటికీ ఉంది
నా మనసు ఇప్పటికీ తన అధీనంలోనే ఉందని
తనని చూసినపుడు ఎందుకు అనిపిస్తుందో తెలియదు
ఏప్రేమకోసం నేను నమ్మకపు దారుల్లో
ప్రపంచాన్ని వదులుకున్నానో ఆ ప్రేమ ఇప్పటికీ ఉంది
ఖచ్చిమనలేను కానీ ఇప్పటికీ అనిపిస్తుంది
నా అన్వేషణ లో తిరిగి వసంతం దొరుకుతుందని
ప్రేమలో ఎంత గాయపడ్డానని అడగవద్దు
ఆ తలపుతో మనసు బాధపడటం ఇప్పటికీ ఉంది “

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-35
'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి '.6 February
(హృదయం తిరిగి వెతుకుతుంది.)
('మౌసం సినిమా లో భుపేందర్ ,లతా పాడిన పాట,రచన గుల్జార్,సంగీతం మదన్ మోహన్ )
...
దిలీప్ కుమార్,దేవానంద్,షమ్మి కపూర్,రాజేంద్రకుమార్ తర్వాతితరం కథానాయకుల సినిమాలు ఒకవెల్లువలా వచ్చిన సంవత్సరాలు మిడ్ సెవంటీస్.ప్రత్యేకంగా 1975 లో కభీ కబీ,ఆంధీ,మౌసం, షోలే,దీవార్,చుప్కే చుప్కే,అమానుష్,ధర్మాత్మ,ఖుష్బూ వంటి పెద్ద హీరోలసినిమాలు, జూలీ,ఖేల్ ఖేల్ మే, గీత్ గాతా చల్ వంటి చిన్న హీరోలసినిమాలు వచ్చాయి.చాలాభాగం విజయవంతం అయ్యాయి. వీటన్నింటిలోనూ డజన్లకొద్దీ పాటలు జనం నోళ్ళలో నానుతూండేవి.
ఆ సంవత్సరం సంగీతదర్శకుడు మదన్ మోహన్ పాటలవరకు సంగీతమిచ్చిన సినిమా 'మౌసం ' (తెలుగులో ఋతువు అనాలా కాలం అనాలా? హిందీలో సంవత్సరానికి 4 మౌసం లు.
తెలుగులో 6 ఋతువులు,మూడు కాలాలు).
కిశొర్ కుమార్ అప్రతిహతంగా వెలుగుతున్న కాలం లో అతని పాట లేకుండా వచ్చిన సినిమా మౌసం. తనచేతనే గాయకుడిగా పరిచయం చేయబడ్డ 'భుపేందర్ ' తో రెండు పాటలు మదన్ మోహన్ ఇందులో పాడించాడు. రఫీ,లతా లు మిగతా గాయకులు.
సంగీతం,సాహిత్యం, గానంసరైన మేళవింపు జరిగితే అమర(ఇమ్మోర్టల్) గానం ఆవిష్కృతమౌతుంది. 'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి ' పాట అలాంటిదే.
సినిమా పేరు 'మౌసం '.అవి సంవత్సరానికి నాలుగు (ఏక్ బరస్ కే మౌసం చార్ ..ఒక పాటకూడా వేరే సినిమాలో ఉంది). నాలిగింటిలో మూడు 'మౌసం ' ల ప్రసక్తి ఈ పాటలో ఉంది.ఆ ఋతువుల్ని(?)వాటితో పాటు ప్రేమను అనుభూతిస్తూ చెప్పిన పాట.
నాలుగో 'మౌసం 'రికార్డు చేయబడింది కాని సినిమాలోకి రాలేదని చదివాను.
“విశ్రాంతంగా కూర్చుని ప్రేమించినవాని తలపుల్లో మునిగిన నాటి
రేబవళ్ళ కోసం హృదయం తిరిగి వెతుకుతుంది.
శరత్కాలపు నీరెండలో నీ చెంగు లో కళ్ళు దాచుకుని
ఇంటి వాకిట్లో పడుకుని
ఒక్కోసారి తలదించుతూ, వేరే వైపు వత్తిగిలుతూ...
హృదయం తిరిగి వెతుకుతుంది.
లేకుంటే, వెచ్చనైన వేసవి రాత్రుల్లో,తూర్పుగాలి వీచినపుడు
మేడమీదచల్లటి తెల్లటి చద్దర్లపై పడుకుని
పొద్దుపోయే వరకు మేలుకుని తారల్ని చూసినప్పుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.
మంచుకురిసే శీతవేళల్లో ఏదైనా కొండమీద
లోయల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దాలను వింటూ
కళ్ళపై తెలిమంచుతెరలు కప్పుతున్నపుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.”
ఈ పాట రఫీ తో ఎందుకు పాడించలేదా అని రఫీ అభిమానిగా ఇదివరకు అనుకున్న క్షణాలున్నాయి. ఐతే ఆ కోరిక వేరే రకంగా తీరింది.
పాటలో ఒక పాదం "తసవ్వుర్-ఎ-జానా కియె హుఎ " కొత్తగా అనిపించేది. వెతికితే తెలిసిన విషయం ఈ పాట పల్లవి గాలిబ్ ఘజల్ "ముద్దత్ హుఈ హై యార్ కో మెహ్మాన్ కియే హుఏ " లో ఆఖరి స్టాంజా లలో ఒకటి. ఆ ఘజల్ ను మహమ్మద్ రఫీ 'మీర్జా గాలిబ్ ' సినిమాలో పాడాడు. అలా నాకోరిక తీరింది.
-ముళ్ళపూడి సుబ్బారావు