Showing posts with label Khayyam. Show all posts
Showing posts with label Khayyam. Show all posts

Thursday, February 8, 2018

కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-144
‘కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి’
(గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది)
...
కొన్ని పాటల్లోని సంగీతం మనసు ను తేలికపరుస్తుంది, అర్ధం మనసును బరువెక్కిస్తుంది. అలాంటి పాటల్లో ఇది ఒకటి.
మాటల రచయిత ‘సాగర్ సర్హది’ బాల్యంలో దేశ విభజనతో పాకిస్తాన్ నుండి కాందిశికుడిలా ఢిల్లీ కివచ్చాడు. అక్కడినుండి బొంబాయికి. రచయితగా యశ్ చోప్రా తో కలిసి విజయవంతమైన సినిమాలకు పనిచేసాడు. అందులో కభీ కభీ, సిల్ సిలా ,చాందిని వంటివి ఉన్నాయి. అమితాబ్ బచన్ తో ‘మీరు బరువైన గుండె తో రాస్తారు’ అనిపించుకున్నాడు.
‘బజార్’ సినిమాతో దర్శకుడయ్యాడు. ‘బజార్’ సినిమా కన్యాశుల్కం వంటి కథకు మరో రూపంలో హైదరాబాద్ నేపధ్యంగా నడుస్తుంది. (హిందీ సినిమాల్లో అప్పట్లో నాకు హైదరాబాద్ కొత్తగా కనిపించేది. అంతకు ముందటి ‘మెహబూబ్ కి మెహంది’, తర్వాతి ‘నిఖా’ సినిమాల్లో).
సినిమాలో సంగీతం, పాటలు మరపురానివి. పాటలు సినిమాకోసం రాసినవి కాకుండా సాహిత్యం నుండి అవసరం మేరకు ఎంచుకున్నవి. మీర్ తకి మీర్ (దిఖాయి దియె) , మఖ్దూమ్ మొహియుద్దిన్( ఫిర్ చిడీ రాత్ బాత్ ఫూలోన్ కి) కవితలు/గజల్లు అలాంటివే.
‘కరోగి యాద్’ పాట బషర్ నవాజ్ రచన. ఖయ్యాం సంగీతం, భుపెందర్ స్వరం ..వీటి విలువను మరింతపెంచిన నటినటుల నటన, చిత్రీకరణ ...వీటన్నింటితో పాట ఓ గొప్పానుభూతినిస్తుంది.


“గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది
కదిలిపోయే కాలపు, ప్రతి కెరటం ఆగిపోతుంది
ఈ చంద్రుడు కరగిపోయిన కాలానికి అద్దం ఔతాడు
కదలాడుతున్న మబ్బుల్లో ఏదో ముఖం రూపుకట్టింది
బరువెక్కిన దారులు ఏదో కథ వినిపిస్తుంది
వర్షంతో చెమ్మగిల్లిన ఋతువు పొగ గా మారుతుంది
కరగిపోతున్న కొవ్వొత్తి నిచూసి మనసు గర్విస్తుంది
అరచేతిలోని గోరింట ఏవో జ్ఞాపకాలు రేపుతుంది
వీధి మలుపులో ఒక గుమ్మం శూన్యంగా ఉంది
తపించే కళ్ళతో ఎవరిరాకకో ఎదురుచూస్తుంది
చూపులు దూరంవరకూ వెళ్ళి తిరిగి వస్తున్నాయి “




కహీ ఎక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-142
‘కహీ ఎక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి’
(ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.)
‘శంకర్ హుస్సేన్’(1977) సినిమాలో పాట. కమల్ అమ్రోహి రచన,ఖయ్యాం సంగీతం,మహమ్మద్ రఫీ గానం
‘శంకర్ హుస్సేన్’ సినిమా తెలుగునాట ప్రదర్శితమయ్యిందోలేదో తెలియనంత అనామకంగా సినిమా వచ్చివెఌంది. కాని అందులోని రెండుపాటలు సినిమా పేరును మరులేనట్టు చేసాయి. అందులో ఒకటి ‘బహుత్ ఖూబ్ సూరత్ ...కహీ ఏక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి’. (మరొకటి ‘ఆప్ యూ ఫాసిలోం సె గుజర్ తే రహే’ లతామంగేష్కర్ గానం)
చాలా తక్కువ సంగీత ఉపకరణాలు, హెచ్చు తగ్గులు లేకుండా ఒకే స్థాయిలో సాగే గానం, విభిన్నతతో కూడిన గీతరచనలతో సాగే పాట మనసుకు హాయిగొలుపుతుంది.
‘పాకిజా’ ‘రజియా సుల్తాన్’ వంటి పెద్దసినిమాలమధ్య దర్శక, నిర్మాత, రచయిత ఐన ‘కమల అమ్రోహి’ తీసిన చిన్నసినిమా ‘శంకర్ హుస్సేన్’.ఆయన పరిమితమైన సంఖ్యలో రాసినపాటల్లో ఇది ఒకటి.
చిన్నసినిమాలో పెద్దపాట. కాలవ్యవధిలోనూ, నాణ్యతలోనూ పెద్దదే.



“ఎంతో అందం
ఎంతో అందం...కొద్దిగా ఛాయతక్కువకానీ..
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
తన కలలో నన్ను చేతుల్లోకి తీసుకుని
ఎప్పుడో నిద్రలో నవ్వుతూ ఉందేమో
నిదురలో అటూ ఇటూ దొర్లుతూ ఉందేమో
తల కింది దిండును జార్చుకుని ఉందేమో
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
పగటికలలు మనసు వాకిలిలోకి వచ్చి
ఆమెను లోలోపల సమ్మోహనపరుస్తుండవచ్చు
నిశ్చలంగా ఉన్న ఆమె గుండెలోని నిశ్శబ్దాన్ని
నాజ్ఞాపకాలసడి భంగపరచి ఉండవచ్చు
అసంకల్పితంగా నెమ్మదైన స్వరంతో
నాపాటలో తనూ గొంతుకలుపుతూ ఉండవచ్చు.
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
లేఖ రాయాలని తనకు అనిపించిందేమో
కాని వేళ్ళు కంపిస్తున్నాయేమో
చేతినుండి కలం జారిపోతుండవచ్చు
కోరిక తిరిగి చేతితో కలాన్ని పట్టించి వుండవచ్చు
నాపేరు తన పుస్తకంలో రాసి
పళ్ళమధ్య వేలు పెట్టి వుండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి
ఎప్పుడో నిట్టూర్చి ఉండవచ్చు
తనువు కొంచెం కొంచెం జ్వలిస్తూవుండవచ్చు
తన అడుగులు తడబడుతుండవచ్చును
ఆమె దుపట్టా వేలాడుతూ నేలకు ఆనివుండవచ్చును
ఎప్పుడో ఉదయాన్ని సాయంత్రమనుకునివుండవచ్చు
ఎప్పుడో రాత్రిని పగలు గా అనుకుని వుండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి
చేతులనుండి అన్నీ జారిపోతూవుండవచ్చు
పనులన్నీ అన్యమనస్కంగా చేస్తుండవచ్చు
పళ్ళేలు జారి పగిలిపోతూండవచ్చు
అప్పుడు పొయ్యిమీది పాలు పొంగిపోతుండవచ్చు
చివరగా, తన పసితనపు అమాయకత్వంతో
ఆ నాజూకు తనువు సిగ్గుపడుతూ ఉండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.”


Friday, June 30, 2017

మై పల్ దో పల్ కా శాయర్ హు

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -100
1.మై పల్ దో పల్ కా శాయర్ హు, 2.మై హర్ ఎక్ పల్ కా శాయర్ హు
( నేను ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని) ( నేనుప్రతిక్షణం నిలిచిఉండే కవిని)
కభీ కబీ సినిమాలో ముకేశ్ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, ఖయ్యామ్ సంగీతం.
ప్యాసా ,కభీ కభీ , రెండు సినిమాలూ సినీ ప్రేమికుల్ని, సినీ సంగీత ప్రేమికుల్నీ అలరించాయి. రెంటికీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ కథానాయకులు కవులు. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ విఫలమయ్యింది. ఇద్దరి జీవితాలలోనూ తర్వాతి రోజుల్లో పాత ప్రేమికలు తారసపడ్డారు. ఐతే తర్వాత వారు సాగిన దారులు వేరు.
రెండు సినిమాలకు సాహిత్యం ‘సాహిర్ లూధియాన్వి’దే.నిజజీవితలో భగ్న మనస్కుడైన ‘సాహిర్ లూధియాన్వి’ కొన్ని పాటల్లో తాను నిజంగానే ప్రవేశిస్తాడు. కథానాయకుడు కూడా తనవంటి కవి ఐనప్పుడు ,పాత్ర మనసిక స్థితిలో కూడా సామాన్యత ఉన్నపుడు ‘సాహిర్ ‘ తనే ఆ పాత్ర ఐపోయాడు. ‘సాహిర్’ అలా పాత్రగా మారి సాహిత్యం అందించిన ఈ రెండు సినిమాలూ రెండు కళాఖండాలు గా నిలిచిపోయాయి.
‘ప్యాసా’ విషాదాంతం అనలేము ,అలాగే ప్రమోదాంతం అనలేము. చివర్లో కథానాయకుడు తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు.
కభీ కభీ లో కథానాయకుడు ప్రేమను పొందలేని చోట ఆగిపోలేదు. అతనిది మరీ ప్రత్యేక ప్రపంచం కాదు. సమాజంతో మరీ ఫిర్యాదు లేదు.వేరే జీవితాన్ని నిర్మించుకున్నాడు. తండ్రి వ్యాపారాన్ని తను చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు.
తన తొలినాళ్ళలో జీవితం పట్ల అతని ఆలోచనల్ని అతను గానంచేసాడు. తన జీవితం తనది మాత్రమే అనుకున్నాడు. తనతో పాటు అది అంతమౌతుందనుకున్నాడు. తనున్న రెండు క్షణాల జీవితం ఎవరికీ పట్టనిదనుకున్నాడు. తనని ‘రిప్లేస్’చేసేవారితో తనకేమీ సంబంధం లేదనుకున్నాడు.
అప్పటి రోజుల్లో అతని గానం:
“రేపు కొత్త మొగ్గలు తొడుగుతాయి.రేపు కొత్త పువ్వులు నవ్వుతాయి
కొత్తనేలమీద,కొత్త పచ్చికపై కొత్త పాదాలు నడయాడుతాయి
అవి నన్ను పట్టించుకోవు.నేనూ వాటిని పట్టించుకోను
వాటి ఉదయ సాయంత్రాలలో ఒక లిప్త కాలమైనా నాదిగా ఎలా చేసుకోగలను?
నేనూ ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని
ఒకటి రెండు క్షణాల సంతోషం నాది,ఒకటి రెండుక్షణాలు ఉండే యవ్వనం నాది
నాకంటే ముందు ఎంతమంది కవులు రాలేదు ? వచ్చి వెళ్లిపోలేదు
కొందరు నిట్టూర్పులు విడిచి వెళ్ళారు కొందరు పాటలు పాడి వెళ్ళారు
వారూ ఒక్క క్షణపు కథలే, నాదీ ఒక్క క్షణపు కథే
ఇప్పుడు మీలో భాగాన్నినేను ,రేపు మీనుండి దూరమౌతాను.
రేపు వికసించే పాటల మొగ్గల్ని ఏరుకునేవారు మరొకరు వస్తారు
నాకంటే ఉన్నతంగాగా చెప్పేవారు, మీకంటే ఉన్నతంగా వినేవారు
రేపెవరో నన్ను గుర్తుచేసుకుంటారు. ఐనా ఎందుకు గుర్తుచేసుకోవాలి?
తీరికలేని ప్రపంచం నాకోసం తన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటుంది?”
సినిమా చివరిలో ఒకతరంలోని వ్యక్తులు తమ తర్వాతతరం వారిలో తమని తాము చూసుకుంటున్నారు. అపుడు
వినిపించే పాట మొదటి పాట వరుసలోనే మరొక అర్ధంతో వినపడుతుంది.
జీవితమంటే ఒకరి జీవితం కాదు. అది రూపాలు మార్ర్చుకుంటూ వేరే వారిని వాహిక చేసుకుని కొనసాగుతుంటుంది అని చెప్పే పాట అది. జీవితానికున్న ‘కొనసాగింపు’ ను తన జీవితానుభవాలద్వారా కథానాయకుడు గమనించగాడని అనిపిస్తుంది.
“ ప్రతిక్షణం నిలిచిఉండే కవిని నేను
కలకాలం నిలిచి ఉండే కథ నాది
ఎల్లవేళలా ఉండే సంతోషం నాది
అనుక్షణం ఉండే యవ్వనం నాది
అనుబంధాల రూపం మారుతూ ఉంటుంది
బంధాల పునాదులు నాశనం కావు
స్వప్నాలు, ఆకాంక్షలు నాశనం కావు.
ఒక పువ్వులో నీ రూపం నిలుస్తుంది
ఒక పువ్వులో నా యవ్వనం ఉంటుంది
ఒక ముఖం లో నీ గుర్తులుఉంటుంది
ఒక ముఖంలో నా గుర్తులుంటాయి
నువ్వు నేను జీవన అమృతాన్ని
ఈ చేతులతో తాగాలి
వీరి గుండె చప్పుడులో నివాసముండాలి
వీరి శ్వాస లో జీవించాలి
నీ సోయగాల్ని ఒకరికివ్వు
నేను నా నమ్మకాన్ని ఒకరికిస్తాను
ని కోసమే చేసిన ఆలోచనలు
అన్నింటినీ దీవెనలు చేస్తాను.”