Showing posts with label gulzar. Show all posts
Showing posts with label gulzar. Show all posts

Thursday, February 8, 2018

`యే జిందగీ గలె లగాలే`

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-148
`యే జిందగీ గలె లగాలే`
(జీవితమా! నన్ను కౌగిలించుకో)
`తదియ నాటి చంద్రుడు` అని అర్ధమొచ్చే తమిళ సినిమా తెలుగులో `వసంతకోకిల` గా డబ్ అయ్యింది.సినిమా చూసినా రెండు భాషల సినిమా పేర్లు సినిమాకు అన్వయం చేసుకోలేకపోయాను. అదే సినిమా హిందీ లో `సద్మా` గా వచ్చింది. ఆ పేరు సినిమా కథకు సరైనదే అనిపించింది.
ఒక సెలబ్రిటి , అతన ఉనికిని దాచి మారుమూల ప్రాంతంలో కథానాయకునితో కాలంగడపటం,తర్వాత అతనికి దూరమై చివరికి దగ్గరవ్వటం ..ఇలాంటి కథనంతో అనేక సినిమాలు వివిధభాషల్లోవచ్చాయి. ఆకథకు `మరపు` ను కలిపి దుఃఖాంతం చేసిన కథ తో ఈ సినిమా వచ్చింది.
నటీనటులకు మంచి అవకాశమిచ్చిన సినిమా.దానిని కథానాయికా నాయకులు సద్వినియోగం చేసుకున్నారు.
వస్తుతః ఛాయాగ్రాహకుడైన దర్శకుడు బాలూ మహేంద్ర సినిమాను దృశ్యకావ్యం చేశాడు. దానికి ఇళయరాజా సంగీతం ,గుల్జార్ రచన మరింత జీవం పోసాయి.
సురేష్ వాడ్కర్ పాడిన పాటల్లో అమితంగానన్ను ఆకుట్టుకున్నవాటిలో ఇది ఒకటి.పాట మధ్యలో వచ్చే వయొలీన్ల వాదనం మనోహరం.
``జీవితమా! నన్ను కౌగిలించుకో
నేనూ నీవిచ్చే ప్రతిబాధనూ
కౌగిలించుకున్నాను. ఔనా,ఔనా!
నేను ఒక సాకుతో ,లోకానికి చాటుగా
కనురెప్పల తెరలకింద కనుల ఇంటిని నింపుకున్నాను
జీవితమా! నాకు నీ ఆసరా దొరికింది.
చిన్న మేఘం(నీడ?) కంటిలో ప్రవేశించింది
నేను రెండు చుక్కలతో మనసును నింపుకున్నాను
జీవితమా!నాకు తీరం దొరికింది``
https://www.youtube.com/watch?v=0BXqAnZWqdQ

జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-139
‘ జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్..పావ్ కె నీచే జన్నత్ హోగి ‘
(“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో,వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది)
దిల్ సె సినిమాలో సుఖ్విందర్ సింగ్ ,సప్నా అవస్థి పాడిన పాట. ఏ ఆర్ రెహ్మన్ సంగీతం. గుల్జార్ రచన
రైలు ప్రయాణపు చప్పుళ్ళు, సైరన్ (సీటీ) మోత (రైలు కూత) పాట సంగీతంలో కలిసిపోవటం చాలాపాటల్లో వుంది. అందులో చాలా పాటలు పాపులర్ అయ్యాయి.
రైలు లోపలి పాటలు (రుఖ్ సే జరా నకాబ్, పల్ దో పల్ కా, యే గోటేదార్ ), కథానాయిక రైలులో ఉంటే హీరో రోడ్ ప్రయాణం పాటలు ( మేరే సపనో కి రానీ) ఆతర్వాత రైలు పైన ప్రయాణిస్తూ పాడే పాటలు వచ్చాయి.
రైలు పైన గుర్తొచ్చే పాటలు ‘హమ్ దోనో దో ప్రేమీ’ (అజ్ నబీ), హోగా తుమ్సే ప్యారా కౌన్ (జమానే కో దిఖానా హై), ‘జిస్కె సర్ హొ ఇష్క్ కి ఛావ్’ (దిల్ సె 1997).
‘హమ్ దోనో దో ప్రేమీ ‘ పాట ,పాట అనటంకంటే సంభాషణల్ని ఆర్ డీ బర్మన్ తన సంగీతంలో ఇమిడ్చేసి మాయచేసాడనవచ్చు. అర్ధం బహు సామాన్యం. వినటానికీ చూడటానికీ ఆనందకరం. ‘హోగా తుమ్సే ప్యారాకౌన్ ‘పాట స్టూడియో తీసారు.చూడటానికి ఇబ్బందికరం.
‘జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్ ‘ పాట అన్నిరకాలుగా ఆనందకరం.
అందమైన నీలగిరి కొండలు,మెలికలుతిరిగేరైలు మార్గం, తెరనిండా రంగులు,నటులు,ఆకర్షణియమైన నృత్యం, అంబరాన్నందుకునే సుఖ్వీందర్ స్వరం, చక్కని బీటు తోపాటు ‘ జిస్కి జుబా ఉర్దూ కి తరాహ్ ‘ ‘ తావీజ్ బనాకె పెహనూ ఉసే’ వంటి చిత్ర పద బంధాలతో సాగే రచన.


“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో
వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది
ఆ నీడన నడు ….
ప్రేమ నీడన నడు ...నడు
స్వర్గం పై కాలిడి నడు ..నడు
ఆ సహచరి సుగంధం లాంటిది
ఆమె నోటిమాట ‘ఉరుదూ’ లాంటిది
నా సాయంత్రాలు రాత్రులు,నా లోకం
నా సహచరి,ప్రియురాలు.
పూలలో దాగుతుంది, అత్తరులా
పరిమఌంచి ఎక్కడుందో తెలుపుతుంది
అద్భుతంలా ఎక్కడైన దొరికితే
తావీదు లా తనను ధరిస్తాను
నా సహచరి నా ప్రార్ధన లాంటివి
నా పాటా ఆమే..నా విశ్వాసప్రకటనా ఆమే
ఆ సహచరి పోలిక కదిలే మంచుబిందువు
ఆమె పాదాలకింద స్వర్గం కదలాడుతుంది
కొన్నిసార్లు కొమ్మలలో ...కొన్నిసార్లు ఆకులలో...
గాలిలో ఆమెజాడను వెతుకుతాను నేను
వెలుగునీడలమధ్య దోబూచులాడే
తన అన్ని రూపాలసారాన్నినేను
తను చిలిపిదనంతో రంగులు మారుస్తుంది
నేను రూపురంగుల అన్వేషిని”


Wednesday, November 8, 2017

చోఢ్ ఆయే హమ్ వో గలియా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-124
చోఢ్ ఆయే హమ్ వో గలియా!
(‘ఆ వీధులు వదిలివచ్చాము’)
మాచిస్ (1996)సినిమాలో పాట. హరిహరన్,సురేశ్ వాడ్కర్,వినోద్ సెహగల్,కే కే పాడిన పాట. విశాల్ భరద్వాజ్ సంగీతం.
ఐదు దశాబ్దాలుగా చిత్రసీమలో తన ప్రాభవాన్ని నిలుపుకుంటూనే ఉన్న గీత రచయిత ‘గుల్జార్’. సినిమాలలు గీతాలే కాదు, మాటలూ రాసాడు. దర్శకుడుగా నిలిచిఉండే సినిమాలూ తీసాడు.తీసిన సినిమాలు వివిధ తరహాలకు చెందినవి. దర్శకుడిగా మొదటి యత్నం (1971) నగర యువతలో రేగిన అశాంతి ని చూపాడు(మేరే అప్నే). పాతికేళ్ళతర్వాత మాచిస్ (1996)సినిమాలో లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పంజాబ్ యువత ఉగ్రవాదంవైపు కదలికను చూపాడు.
గుల్జార్ పాకిస్థాన్ లో పుట్టాడు. దేశవిభజన క్లేశాలు అనుభవించాడు. రాసిన అనేకపాటల్లో ఏదో ఖాళీతనాన్ని వ్యధతో భర్తీ చేస్తున్నట్టు చూపుతాడు. అమీర్ ఖుశ్రో, గాలిబ్ లను తిరిగి పరిచయం చేస్తుంటాడు. కాలపు దారుల్లో దారి తప్పకుండా నడిచినట్టుంటాడు.నడిచిన దూరమెంతో తెలియనీయడు.
మాచిస్ లో ఈ పాటలో మొదటిచరణంలో వదిలివచ్చినవాటిపట్ల బెంగ,రెండవదానిలో అక్కడి స్థితి పట్ల విచారం ,మూడవదానిలో తన స్థితి పట్ల నిర్వేదం కనిపిస్తాయి.
“ఆ వీధులు వదిలివచ్చాము…..
నీ కమలాలవంటి కాళ్ళు ఎక్కడ జారిపడేవో
నీ నవ్విన బుగ్గలు సుడిగుండాల్లా సొట్టలు పడేవో
నీ నడుమువంపులు నదులు తీసుకునేవో
నీ నవ్వు విని పంటలు పక్వానికొచ్చేవో…
అలాంటి వీధులు వదిలివచ్చాము.
ఎక్కడ నీ పాదధూఌ రేగుతుండేదో
విన్నాను .. ఆ గుమ్మంలో సాయంసంజ అలుముకుందని
నీ కేశపాశాల్లో చిక్కుకున్న ఆ రాత్రి ని
తలగడపై అప్పుడప్పుడూ తిరిగి కలుస్తుంటాను
హృదయమొక బాధాశకలం, రాతి పెళ్ళ
ఒకచీకటి నుయ్యి, ఒక మూసి ఉన్నవీధి
గడవని ఒక చిరు క్షణం...
ఎంతో మండిస్తున్నాను ,ఐనా భస్మంకాదు”

Saturday, October 21, 2017

ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-109
“ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే”
(ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
‘ఘరోండా’(1977) సినిమాలో భుపేందర్ పాడిన పాటగుల్జార్ రచన జైదేవ్ సంగీతం.
‘ఇల్లు కొందరికి ఉండటానికి గూడు కొందరికి సంపాందిచవలసిన ఆస్తి’. అని ‘రావి శాస్త్రి’ తన ‘ఇల్లు ‘ నవలలో చెబుతారు.
ఈ సినిమాపేరు ‘గూడు’. బొంభాయి నగరం లో ఆవాసం దొరకటం కష్టం. ఇద్దరు మధ్యతరగతి ఉద్యోగులు తమకో గూడు ఏర్పాటు చేసుకుని వివాహంచేసుకుందామనుకున్నారు. తమ అన్ని వనరులూ కట్టబోయే అపార్ట్మెంట్ పై పెట్టారు. దానిపై కలలు కన్నారు. ఆశలల్లుకున్నారు. ఐతే బిల్డర్ మోసంచేశాడు. ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. వారి తిరిగి మొదటికొచ్చారు. దాని కారణం గా వారు దూరమయ్యారు.
అవసరాలు,పరిస్థితులు మనుషులకు పరీక్ష పెడతాయి. అవి కొందర్ని దిగజారుస్తాయి., అడ్డదారులవైపు అడుగులు వేయిస్తాయి. కొందరు మాత్రం పరీక్షకు నిలబడగలుగుతారు.
అప్పటివరకూ కలిసున్న మనుషుల్ని అలాంటి పరీక్షాసమయాలు ఎవరిదారి వాళ్ళు చూసుకొనేట్లు చేస్తాయి.
1977 లో వచ్చిన ఈ సినిమా అప్పటి నగర ,మధ్యతరగతి జీవితాలని ప్రతిబింబిస్తుంది.
“ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
అన్నపానాలు వెతుకుతున్నాడు ,ఆశ్రయం వెతుకుతున్నాడు
పగలు ఖాళీ పాత్ర లా ఉంది, రాత్రి చీకటి నుయ్యిలా ఉంది
ఈ శూన్యమైన చీకటి కళ్ళలో , కన్నీటికి బదులు పొగ వస్తుంది
జీవితం సాగించటానికి కారణం కనపడదు. మరణించటానికి సాకు వెతుకుతున్నాడు
వయసుకన్నా దీర్ఘమైన దారుల్లో , గమ్యం చేరిక కానరాదు
పరుగిడుతూనే ఉన్నాడు, అతను ఆగటం చూడనే లేదు
ఈ అపరిచిత నగరంలో తెలిసినవారికోసం వెతుకుతున్నాడు”

Thursday, June 15, 2017

హమ్ నె దేఖీ హై ఇన్ ఆంఖో మె మెహక్తీ ఖుష్బూ

‘నచ్చిన’ పాట- ‘లోపలి’ మాట-95
‘హమ్ నె దేఖీ హై ఇన్ ఆంఖో మె మెహక్తీ ఖుష్బూ’
(“ఆ కళ్ళలో మెరిసేటి సుగంధాన్ని చూసాను నేను)
ఖామోషీ (1969) సినిమాలో లతామంగేష్కర్ పాడిన పాట. గుల్జార్ రచన హేమంత్ కుమార్ సంగీతం.
...
‘చివరకు మిగిలేది’ సినిమా పేరు తెలుసు. అది బుచ్చిబాబు నవలకు చిత్రరూప మనుకున్నాను. అప్పటికి(ఇప్పటికీ??) చిత్రం ఏ రూపంలోనూ లభ్యతలో లేదు. ‘భరాగో’ మరో నూటపదహార్లు పుస్తకంలో ఈ సినిమాగురించి చదివాను. ఓ బెంగాలీ సినిమాకు అది రీ మేక్. అదే సినిమా పదేళ్ళ తరువాత ‘ఖామోషీ’ (1969) గా హిందీలోవచ్చింది.
చివరకు మిగిలేది సినిమాకు మరొక ప్రత్యేకత ఉంది. ‘మంజీరా’ అనే బానర్ పై ఆ సినిమాను ఉప్పునూతల పుషోత్తమరెడ్డి ఆయన మిత్రులు పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఎమ్.సత్యనారాయణరావు మరికొందరితో కలసి నిర్మించారు. బహుశా పూర్తి స్థాయి తెలంగాణా నిర్మాతలనుండి వచ్చిన మొదటి సినిమా ఇదేనేమో.
ఒక నర్సు మానసిక రోగులను స్వస్థ పరిచే ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆమెకు తన వృత్తిజీవితంలో ఎదురైన అనుభవాలు,వృత్తి జీవితానికి ఆంతరంగిక జీవితానికీ మధ్య గీతలుచెరిగిపోతే కలిగే సంఘర్షణ చుట్టూ కథ నడుస్తుంది. ప్రెమకోసం తపించే రోగిని ఆమె ప్రేమిస్తున్నట్టు నటిస్తూ అ అక్రమంలో అతనిపై ప్రేమపెంచుకుంది. అతను సాధారణస్థితి పొంది తనదారిలో వెళ్లిపోయాడు . తర్వాత మరో మానసిక రోగి తోనూ ఆమె ప్రేమ నటించాల్సివచ్చింది. ఈ సారి రోగి ఈమె పై ప్రేమపెంచుకున్నాడు. ఈ వైరుధ్యాలను ఆమె భరించలేకపోయింది. తను మానసిక రుగ్మతకు లోనయ్యింది.
బెంగాలీ లో సుచిత్రాసేన్, తెలుగులో సావిత్రి, హిందీ లో వహీరెహ్మాన్ లు కథానాయిక (నర్సు) పాత్రను ధరించారు.(సావిత్రికి ఆ పాత్ర ఎంతో నచ్చి తమిళ హక్కులు తీసుకున్నారామె).
కొత్తగా ప్రేమలో పడిన ఒక యువతి రేడియో లో ప్రేమను నిర్వచిస్తూ,దాని లక్షణాలు చెబుతూ రేడియోలో పాట పాడుతుంది. ప్రేమించి ,దానిద్వారా బాధననుభవిస్తున్న ఆమె ఆ పాట వింటుంది. (‘భరాగో’ ‘ చివరకు మిగిలేది నుండి ఎంపికచేసిన పాట కూడా ఇదే సందర్భంలో, ఈ పాట స్థానంలో వచ్చినదే. ఐతే పాట అర్ధం, వరసా రెండూ వేరు)
“ఆ కళ్ళలో మెరిసేటి సుగంధాన్ని చూసాను నేను
చేతులతో స్పృశించి ఈ బంధాలను ఆరోపించకు.
ఇది ఒక భావన . దీనిని మనసు తో అనుభూతి చెందు
ప్రేమని ప్రేమ గానే ఉండనివ్వు, దానికో పేరు పెట్టకు
ప్రేమ ఒక మాట కాదు, ప్రేమ ఒక సడి కాదు
అది ఒక నిశ్శబ్దం, వింటుంది, చెబుతుంది కూడా
అది చల్లారేది కాదు,ఆగేది కాదు,నిలిచేది కాదు
యుగయుగాలుగా కురుస్తున్న వెలుతురు చినుకు అది.
అది ఎపుడైనా చిరునవ్వుతో కళ్ళ లో వెలుగుతుంది
కనురెప్పలు పై వెలుతురులా వాలుతుంది
పెదవులు ఏమీ చెప్పవు, కానీ కంపించే పెదవులపై
చెప్పాల్సిన కథలు మౌనంగా నిలిచివుంటాయి.”



Thursday, April 27, 2017

'కోయీ హోతా జిస్కో అప్నా '


'కోయీ హోతా జిస్కో అప్నా '
నావాళ్ళు అనుకునేవాళ్ళు ,ఎవరైనా ఉంటే బాగుండును
(మేరే అప్నే సినిమాలో పాట గుల్జార్ రచన, సలీల్ చౌధరి సంగీతం)

కొన్ని అభిమానాలు అనుకోకుంకుండానో,యాదృచ్చికంగానో కలుగుతాయనిస్తుంది. వెతికితే వాటికి కారణాలు కనిపిస్తాయేమో.


నాకు పదిహేనేళ్ళ వయసపుడు వినోద్ ఖన్నా సినిమాలు చూడటం మొదలు పెట్టాను. నేనతని అభిమానినా అంటే అప్పుడు ఔననే చెప్పాలి.


కనీసం పది సంవత్సరాలు (80- 90) అతనివి పాతవి కొత్తవి అనేక సినిమాలు చూసి ఆనందించాను. ఇప్పటి వరకూ అతనికి సంబంధించిన న్యూస్ ను ఫాలో ఔతూనే వున్నాను.
అతని నటజీవితానికి,వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి సంబంధం వుండే వుంటుంది. నావరకు వినోద్ ఖన్నా అంటే డెబ్భైల మొదలుకుని 90 వరకూ సాగిన అతని తెర జీవితమే. అది నాకు ఆనందాన్ని ఇచ్చింది. మేరె అప్నే,కచ్చే ధాగే, ఇంతిహాన్,అమర్ అక్బర్ ఆంథొని,కుర్బాని సినిమాలలో అతని పాత్రలతో ఎక్కడో ఐడెంటిఫై ఔతానని పిస్తుంది.


అతని నట జీవితాన్ని చూస్తే రెండు ఫేజ్ లు కనిపిస్తాయి.
సపోర్టింగ్ ఆర్టిస్ట్ గామొదలై,విలన్ గా  నటించి ,హీరోగా మారి హఠాత్తుగా నటనను విరమించుకున్నంతవరకూ ఉన్నకాలం, ఐదేళ్ళ విరామమ్ తర్వాత తిరిగి నటించిన కాలం.


70 కి అటూ ఇటుగా సినిమాలలోకి వచ్చి  కమర్షియల్ సినిమాల్లో రాణిస్తూనే మేరే అప్నే,అచానక్,మీరా వంటి ఆఫ్ బీట్ సినిమాల్లో నటించి దర్శకుల నటుడనిపించుకున్నాడు.


మల్టిస్టారర్ సినిమాలలో సునీల్ దత్,ధర్మేంద్ర,రాజేశ్ ఖన్నా,జితేంద్ర,అమితాబ్ బచన్ వంటి నటులతో తెర పంచుకున్నాడు.


సునీల్ దత్ తన సొంత సినిమా రేశ్మా ఔర్ షేరా సినిమాలో సపోర్టింగ్ కారక్టర్ ఇచ్చి వినోద్ ఖన్నా ను ప్రోత్సహించాడు.తరువాత వారిద్దరు నెహ్లే పె డెహ్లా, డాకూ ఔర్ జవాన్ వంటి సినిమాల్లో నటించారు.


ధర్మేంద్ర తో నటించిన సినిమాలలో మొదట్లో విలన్ గాను తరువాత సమానమైన పాత్రలలోనూ నటించాడు. వారు నటించిన సినిమాలలో ఎమోషనల్  కంటెంట్ ఎక్కువ వుండేది. మొదటగా వారు కలిసి నటించిన మేరా గావ్ మేరా దేశ్ సినిమా ఒక మైలు రాయి లా నిలిచింది. వినోద్ ఖన్నా పునఃప్రవేశం తర్వాతకూడా వారుబట్వారా, క్షత్రియ    వంటి  ఆక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపించారు.


కబీర్ బేడి తో అతను కలసి నటించిన ‘కచ్చే ధాగే ‘ సినిమాకు కొందరు వీరాభిమానులున్నారు.


డెభై ఐదు -డెబ్భై ఎనిమిది మధ్య అమితాబ్ తో కలిసి వినోద్ ఖన్నా ఎనిమిది సినిమాల్లో నటించాడు. జమీర్,పర్వరిష్, అమర్ అక్బర్ ఆంథనీ ,ఖూన్ పసీనా, ముకద్దర్ కా సికందర్ ఇలాంటి సినిమాలు అన్నీ విజయంసాధించాయి.


86/87 లో తిరిగి చిత్రరంగ ప్రవేశం చేసి మరో పదేళ్ళు కథానాయక పాత్రలు ధరించాడు.అప్పుడు వచ్చిన సినిమాలలో ఇన్సాఫ్,సత్యమేవ జయతే వంటి హిట్లు ఉన్నాయి.కమల్ హసన్ ‘నాయకన్’ సినిమాను వినోద్ ఖన్నా తో అతని మిత్రుడు ఫిరోజ్ ఖాన్ నిర్మించాడు. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా హిట్ అయ్యింది. మరో చెప్పుకోదగ్గ సినిమా ‘ యాష్ చోప్రా నిర్మించిన చాందిని’. అదే కాలంలో వచ్చిన మహేష్ భట్ సినిమా ‘జుర్మ్ ‘ కూడా మంచి గుర్తింపు పొందింది.


70 లలో వినోద్ ఖన్నా తో తన తరహా సినిమాలు తీసిన ‘గుల్జార్’  90లలో కూడా డైరెక్టర్ మూవీ అనదగ్గ ‘లేకిన్’ సినిమా తీశాడు.


తర్వాత రోజుల్లో వినోద్ ఖన్న చాలా సినిమాల్లో నటించినా అతనిదైన మార్క్ వాటిల్లో కనపడదు. తండ్రి తరహా పాత్రలలోకి మళ్లి కొన్ని సినిమాల్లోనూ,టివీ సీరియళ్లలోనూ కనిపించాడు.ఐతే అవేవీ నావంటి అభిమానుల్ని అలరించేవికావు.


ఈ రోజు (27/04/2017) తన డెబ్భైఒకటో సంవత్సరంలో అతను చనిపోయాడు.


1971 లో గుల్జార్ దర్శకత్వం లో వచ్చిన ‘మేరే అప్నే’ సినిమా అతనికి మంచి గుర్తింపు నిచ్చింది. అప్పటి నగరజీవితం,యువత ఆలోచనలు,నిరుద్యోగం, నేరప్రపంచం వైపు యువత చూపు వంటి విశయాలను చర్చించిందా సినిమా. అందులో పాట ఇది.


“నావాళ్ళు అనుకునేవాళ్ళు
ఎవరైనా ఉంటే బాగుండును
దగ్గరగా కాకున్నా దూరంగానైనా
ఎవరో నావాళ్ళు


కళ్ళకు నిద్రలేదు
అది కన్నీటిలో ఈదులాడుతుంది
రాత్రంతా కలల్లో మెలకువగా ఉంటాను
ఎవరో బాధ పంచుకొనేవారు
ఎవరో వెంట నడిచేవారు


మరచిపోయిన కొన్ని వాగ్దానాలు..  
గడచిపోయిన కొన్ని జ్ఞాపకాలు..
ఒంటరితనం రాత్రంతా వాటిని తిరిగి చెబుతుంది
ఏదో ఓదార్పు దొరికితే

ఎవరో నావారు దొరికితే”


Sunday, April 9, 2017

జిహాల్ ఎ ముస్కిన్ ముకుంబ్ అ రంజిష్


‘జిహాల్ ఎ ముస్కిన్  ముకుంబ్ అ రంజిష్...బహాల్ ఎ హిజ్రా బేచారా దిల్ హై’
(ఈ పేదగుండెను కోపంగా చూడకు,అది ఇప్పటికే తనవారికి దూరమై  గాయపడి ఉంది)

గులామీ (1985) సినిమా లో పాట ఇదిగుల్జార్ సాహిత్యం,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం,షబ్బీర్ కుమార్ , లతా మంగేష్కర్ గానం.


. పాట పల్లవి  కొత్త పదాలతో  ఉంది.భాష హిందీ ఐతేకాదు. ఉర్దూ కావచ్చనిపించింది. పల్లవి కాకుండా మిగతా పాట అర్ధమౌతుంది. గీరతకారుడు గుల్జార్.అతని పాటల్లో ఉర్దూ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అనేక పాటల్లో గాలిబ్ ,మీర్ వంటి వారి కవితాపాదాలను కొన్నింటిని వాడి వాటిని కొత్త అర్ధాలతో సినిమాల్లోకి తెచ్చాడు.

ఐతే ఈ పాట కు పల్లవి మాత్రం అతను ‘అమీర్ ఖుస్రో ‘ రాసిన గజల్ నుంచి తీసుకున్నాడట. అలా ‘జిహాల్ ఎ ముస్కిన్ ముకుంబ రంజిష్’ అంటూ మొదలయ్యే పల్లవి   పర్షియన్ బాష నుండి హిందీ పాటలోకి వచ్చింది.

సినిమా రాజస్థానీ గ్రామీణ ప్రాంతానికి  చెందింది. అక్కడి భూస్వామ్య వ్యవస్థ, కులవివక్ష, గదానికి వ్యతిరేకంగా పోరాటం సినిమాకథ. భూస్వామ్యకుటుంబంలో యువకులు,వారి బంధువైన ఒక పోలీసు అధికారి ఒకవైపు, వారి అకృత్యాలకి బలైన వర్గం వైపు ఒక యువకుడు,అతనికి సహకారం అందించిన సైన్యంలో పనిచేసిన యువకుడు మరొకపవైపు...వీరి మధ్య ఘర్షణ తో సినిమా సాగుతుంది.

ఇందులో సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా మిథున్ చక్రవర్తి నటించాడు. అతని ప్రయాణం లో ఒకామెను రక్షించాడు. ఆమె అప్పటికే గాయపడిన మనసుతో ఉంది. వారిద్దరు బస్సు ప్రయాణం చేస్తున్నాఋఉ. బస్సు మధ్యలో ఆగింది. అక్కడ ఉన్న బంజారాలు ఒక పాట ప్రారంభించారు. అందులో వీరూ పాట కలిపారు. బస్సు బయలుదేరింది. బస్సు టాపు మీద కూర్చున్న ఇద్ధరిమధ్యా పాట కొనసాగింది.
(పాట మధ్యలో కథానాయకుడు ఆ సినిమాలో తన్ ఊతపదమైన ‘కోయి షక్ ‘ అంటాడు. పాటలో లీనమైపోయిన ప్రేక్షకులు అది విని ఈలలు వేస్తారు)

పాట అర్ధం:

ఈ పేదగుండెను కోపంగా చూడకు
అది ఇప్పటికే తనవారికి దూరమై  గాయపడి ఉంది


వినవస్తుందిఎవరిదో హృదయ స్పందన
నీ గుండె నుండా?? నా గుండె నుండా?

తను వచ్చి పక్కన కూర్చుంటే
ఈ సాయంత్రం రంగులమయమై పోయింది

కొద్దికొద్దిగా మేను పులకరింపు
కొద్దిగా ఎదోబాధ

చిత్రమైన హృదయవేదన..
అది లేకుంటే జీవించటమే కష్టం

ప్రతిగాయమూ ఒక వజ్రమే
ప్రతి వేదనా ఒక ఆభరణమె.

అప్పుడప్పుడూ సాయంసంధ్య
మేలిముసుగు మెల్లగా తీసినట్టు ఉంటుంది

నీ వంటినుండి వచ్చే ధూపం
నా గుండేలొ తిరుగాడుతుంది

అది సిగ్గా లేక గౌరవమా?
కనులు పైకెత్తగానే వాలిపోతున్నాయి.

నీ కళ్ళనుండి రాలిన చినుకులు
నా కళ్ళలో వచ్చి నిలిచాయి.

  • ముళ్ళపూడి సుబ్బారావు


Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-35
'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి '.6 February
(హృదయం తిరిగి వెతుకుతుంది.)
('మౌసం సినిమా లో భుపేందర్ ,లతా పాడిన పాట,రచన గుల్జార్,సంగీతం మదన్ మోహన్ )
...
దిలీప్ కుమార్,దేవానంద్,షమ్మి కపూర్,రాజేంద్రకుమార్ తర్వాతితరం కథానాయకుల సినిమాలు ఒకవెల్లువలా వచ్చిన సంవత్సరాలు మిడ్ సెవంటీస్.ప్రత్యేకంగా 1975 లో కభీ కబీ,ఆంధీ,మౌసం, షోలే,దీవార్,చుప్కే చుప్కే,అమానుష్,ధర్మాత్మ,ఖుష్బూ వంటి పెద్ద హీరోలసినిమాలు, జూలీ,ఖేల్ ఖేల్ మే, గీత్ గాతా చల్ వంటి చిన్న హీరోలసినిమాలు వచ్చాయి.చాలాభాగం విజయవంతం అయ్యాయి. వీటన్నింటిలోనూ డజన్లకొద్దీ పాటలు జనం నోళ్ళలో నానుతూండేవి.
ఆ సంవత్సరం సంగీతదర్శకుడు మదన్ మోహన్ పాటలవరకు సంగీతమిచ్చిన సినిమా 'మౌసం ' (తెలుగులో ఋతువు అనాలా కాలం అనాలా? హిందీలో సంవత్సరానికి 4 మౌసం లు.
తెలుగులో 6 ఋతువులు,మూడు కాలాలు).
కిశొర్ కుమార్ అప్రతిహతంగా వెలుగుతున్న కాలం లో అతని పాట లేకుండా వచ్చిన సినిమా మౌసం. తనచేతనే గాయకుడిగా పరిచయం చేయబడ్డ 'భుపేందర్ ' తో రెండు పాటలు మదన్ మోహన్ ఇందులో పాడించాడు. రఫీ,లతా లు మిగతా గాయకులు.
సంగీతం,సాహిత్యం, గానంసరైన మేళవింపు జరిగితే అమర(ఇమ్మోర్టల్) గానం ఆవిష్కృతమౌతుంది. 'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి ' పాట అలాంటిదే.
సినిమా పేరు 'మౌసం '.అవి సంవత్సరానికి నాలుగు (ఏక్ బరస్ కే మౌసం చార్ ..ఒక పాటకూడా వేరే సినిమాలో ఉంది). నాలిగింటిలో మూడు 'మౌసం ' ల ప్రసక్తి ఈ పాటలో ఉంది.ఆ ఋతువుల్ని(?)వాటితో పాటు ప్రేమను అనుభూతిస్తూ చెప్పిన పాట.
నాలుగో 'మౌసం 'రికార్డు చేయబడింది కాని సినిమాలోకి రాలేదని చదివాను.
“విశ్రాంతంగా కూర్చుని ప్రేమించినవాని తలపుల్లో మునిగిన నాటి
రేబవళ్ళ కోసం హృదయం తిరిగి వెతుకుతుంది.
శరత్కాలపు నీరెండలో నీ చెంగు లో కళ్ళు దాచుకుని
ఇంటి వాకిట్లో పడుకుని
ఒక్కోసారి తలదించుతూ, వేరే వైపు వత్తిగిలుతూ...
హృదయం తిరిగి వెతుకుతుంది.
లేకుంటే, వెచ్చనైన వేసవి రాత్రుల్లో,తూర్పుగాలి వీచినపుడు
మేడమీదచల్లటి తెల్లటి చద్దర్లపై పడుకుని
పొద్దుపోయే వరకు మేలుకుని తారల్ని చూసినప్పుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.
మంచుకురిసే శీతవేళల్లో ఏదైనా కొండమీద
లోయల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దాలను వింటూ
కళ్ళపై తెలిమంచుతెరలు కప్పుతున్నపుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.”
ఈ పాట రఫీ తో ఎందుకు పాడించలేదా అని రఫీ అభిమానిగా ఇదివరకు అనుకున్న క్షణాలున్నాయి. ఐతే ఆ కోరిక వేరే రకంగా తీరింది.
పాటలో ఒక పాదం "తసవ్వుర్-ఎ-జానా కియె హుఎ " కొత్తగా అనిపించేది. వెతికితే తెలిసిన విషయం ఈ పాట పల్లవి గాలిబ్ ఘజల్ "ముద్దత్ హుఈ హై యార్ కో మెహ్మాన్ కియే హుఏ " లో ఆఖరి స్టాంజా లలో ఒకటి. ఆ ఘజల్ ను మహమ్మద్ రఫీ 'మీర్జా గాలిబ్ ' సినిమాలో పాడాడు. అలా నాకోరిక తీరింది.
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-18:
"నామ్ గుమ్ జాయేగా చెహరా యే బదల్ జాయేగా"....
“పేరు మారవచ్చు,రూపు మారిపోవచ్చు,జ్ఞాపకం ఉంచుకుంటే ,నా స్వరం తో నన్ను గురుపట్టగలరు..”
ఈ పాటతో నాప్రయాణం ఇలా....
...
మాండు ఫోర్ట్ కట్టడాలు,శిధిలాలు ను 'మాధవ్ సత్వాలేకర్ 'పెయింటింగులుగా వేసినవి చూశాను.. పెయింటింగుల్లో ఉన్న భవనాల్లో ఏదో ఆకర్షణ ఉంది. ఆర్కిటెక్చర్ వల్ల కావచ్చు.
‘మాండు ‘రాజ్యం 10వశతాబ్దంలో హిందూ రాజులతో మొదలై,ముస్లింల వశమై చివరకు ఆక్బర్ కాలంలోమొఘల్ సామ్రాజ్యంలో కలిసింది.ఆరాజ్యానికి సంబంధించి ఒక ప్రేమకథ ప్రాచుర్యంలో ఉంది. ఆ ప్రేమ, రాజు బాజ్ బహాదుర్,ప శు /గొర్రెల కాపరి రూప్ మతిల మధ్య.
రాణీరూప్ మతి అని ఒక హిందీసినిమా ముకేశ్,లతా పాటలతో ఉనికిలో ఉంది. ( ఆ లౌట్ కే ఆజా.. మెరే ప్రీత్ బులాతీ హై..అందులో హిట్ గీతం).మాండు కట్టడాలు,పరిసరాలు ఆ సినిమాలో దొరకొచ్చేమోనని చూస్తే ఆ సినిమా మొత్తం స్టూడియోల్లో తీసినట్టేఉంది.
'నా మ్ గు మ్ జాయేగా,చెహరా యే బదల్ జాయేగా' పాట అనేకసార్లు విన్నదే.అనుకోకుండా ఆ పాటను చూసి నప్పుడు ఆ పాట మాండు కట్టడాలమధ్య చిత్రీకరించారని అర్ధమయ్యింది.సినిమావాళ్ళు వాళ్ళ అవసరాలరీత్యా పనిచేసినా,కొన్ని మేళ్ళు జరిగిపోతుంటాయి. వాటిలో ఒకటి చారిత్రక ప్రదేశాలను అజరామరం చేయటం. (దేవానంద్ బయోగ్రఫీ ..రొమాన్సింగ్ విత్ లైఫ్ లో ఒక చోట అంటారు...దే హేవ్ ఇమ్మోర్టలైజ్డ్ చితోడ్ ఘర్ విత్ 'ఆజ్ ఫిర్ జీనే కి 'సాంగ్ ). అలా మాండు కట్టడాలు ఆ సినిమా తిసేనాటీకి(77/78) ఎలా ఉండేవో దృశ్యమానం అయ్యింది.
'నా మ్ గు మ్ జాయేగా ‘పాట 'కినారా' సినిమాలోది. ఆ సినిమాలో కథానాయకుడు అర్కిటెక్ట్ . అతను 'మాండు 'అర్కిటెక్చర్ చూడటానికివచ్చి అక్కడ కథానాయికను కలుస్తాడు. అప్పటికే కథానాయిక తన ప్రియుడ్ని పోగొట్టుకుని అతని జ్ఞాపకాలు అతను పనిచేసినచోట వెతుక్కుంటుంది. పాట ఆసందర్భంలోనిదే. భూపేందర్, లతా లు పాడారు. గుల్జార్ రచన,ఆర్ డీ బర్మన్ సంగీతం.
పాట అర్ధం స్థూలంగా
“పేరు మారవచ్చు,రూపు మారిపోవచ్చు
జ్ఞాపకం ఉంచుకుంటే ,నా స్వరం తో నన్ను గురుపట్టగలరు..
కాలం చేసిన గాయం తక్కువ అందమైనదేమీ కాదు
ఈ రోజు ఇక్కడున్నాము, రేపు ఎక్కడా ఉండకపోవచ్చు.
కాలానికి ఆవల ఎక్కడైనా కలవవచ్చు
జరిగిపోయిందంతా గతానికి చెందింది
ఏ ఒక్క రాత్రితోనో మొత్తం జీవితమైపోదు.
ఆ రాత్రే తిరిగి ఎదురైతే?”
కథలో గడిచినదానిని, జరగబోయే దానిని స్పృశిస్తూ పాట సాగుతుంది. ఒక చరణంలో భాగం 'వక్త్ కే సితమ్ కమ్ హసీ నహీ ',బాధే సౌఖ్యమనే భావన (దేవదాసు) ని గుర్తుకుతెస్తుంది.
 ---ముళ్ళపూడి సుబ్బారావు

Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-3 'గంగా అయే కహాసే? గంగా జాయే కహారే' 
Subbarao Mullapudi

‘కాబూలీవాలా’ రవీంద్రనాథ్ టాగోర్ రాసిన చిన్న కథ.దాన్ని మొదట బెంగాలీ లో తర్వాత హిందీ లో సినిమా గా తీసారు. కలకత్తా కు ఎండు పండ్లు,వెచ్చని దుస్తులు అమ్ముకోవటం కోసం వచ్చిన వర్తకుడు ‘రహ్మత్’. కూతురు ఆరోగ్యం కోసం చేసిన్ అప్పులు అతన్ని అఫ్గన్ దేశపు పొలం గట్లనుండి కలకత్తా వరకూ తీసుకొచ్చాయి. తన కూతురు జ్ఞాపకాన్ని ఒక పాత వార్తాపత్రిక మీద ఆ పిల్ల చేతి ముద్రగా తనతో తెచ్చుకున్నాడు.
కలకత్తా వీధుల్లో అతన్ని,అతని చేతిలో సంచిని పిల్లల్ని భయపెట్టటానికి తల్లులు వాడుకుంటున్నారు. ఆతను సంచిలో పిల్లల్ని ఎత్తుకుపోతాడని. నిజానికి ఆ సంచి కాదు, అతని హృదయం ఖాళీ గా ఉంది, అతని కూతురు వంటి చిన్న పిల్ల మున్నీ కోసం. ఆ పిల్ల లో తన కూతుర్ని చూసుకుంటున్నాడు రహమత్ .
కాబూల్ కి తిరిగి వెళ్ళాల్సిన సమయానికి అనూహ్య సంఘటనతో పధ్నాలుగేళ్ళు జైలు శిక్ష అనిభవించవలసి వస్తుంది. పర దేశం, ఒంటరి తనం, తన వూరిలో తల్లి లేని కూతురు పట్ల బెంగ,సమాచారం తెలుపలేని స్థితి. ఇంతకన్నా వేదన ఎక్కడ?
 ఈ సినిమా ఎందుకు నన్నింత ఆకర్షించింది? రవీంద్రుని కథా? బిమల్ రాయ్ దర్శక ప్రతిభా? పఠాన్ పాత్రలో ఒదిగిపోయిన బలరాజ్ సాహ్నీ నటనా? సలీల్ చౌధురి సంగీతమా? మన్నాడే,హేమంత్ ల గాత్రమా?..గుల్జార్,ప్రేమ ధవన్ల గీతాలా? ... కాదు.. వీటన్నిటి కలగలుపు.
ఇందులో పాట 'గంగా అయే కహాసే? గంగా జాయే కహారే' చాలా ఆలస్యం గా వినగలిగాను.తొలిసారి విన్నప్పుడు పెన్నిధి దొరికినట్లే అనిపించింది.అంతకుముందు హేమంత్ కుమార్ ను గాయకుడుగా పట్టించుకోలేదు.(ఆయన మంచి సంగీత దర్శకుడు). ఈ పాట అతని పాటలలో నా ప్రధమ ఎంపిక.
 గంగ ఎక్కడినుంది వస్తుంది? ఎక్కడికి పోతుంది? అనే ప్రశ్న తో మొదలై అనేక సత్యాలు చెబుతుంది.
“రాత్రి చీకటి ,పగటి వెలుతురు సంధ్యలో తేడాలు పోగొట్టుకుంటాయి”.
“విలువైన గాజు పాత్ర, మట్టి పాత్రల తేడాలు దప్పిక గొన్నప్పుడు సమసిపోతాయి.”
“అనేక పేర్లు, అనేక భాషలు, లక్షలాది రూపాలు,ముఖాలు...ప్రేమ నేత్రాలు తెరిచి చూస్తే అన్నిటా నేనే అన్నిటా నువ్వే.”
ఈ సినిమా వచ్చాక బెంగాలు పల్లెలలో, కోల్ మైన్స్ ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కాబూలీ వాలాల పట్ల ప్రజల ధృక్పథం మారిందని ఒకచోట చదివాను.కళల అవసరానికి అంతకంటె రుజువేముంటుంది?