Showing posts with label laxmikanth pyarelal. Show all posts
Showing posts with label laxmikanth pyarelal. Show all posts

Saturday, October 21, 2017

జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-111
జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై
(జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే)
Meri జంగ్ (1985) లో లతా మంగేష్కర్, నితిన్ ముకేశ్ పాడిన పాట. ఆనంద్ బక్షి రచన, లక్ష్మీకామ్త్ ప్యారే లాల్ స్వర రచన.
మన్మోహన్ దేశాయి, ప్రకాశ్ మెహ్రా లవంటి దర్శక నిర్మాతల కోవలో ఎనభైల నాటికి సుభాష్ ఘయ్ చేరాడు. అతను డెబ్భైల మధ్యలో దర్శక ప్రస్థానం ప్రారంభించినా ప్రేక్షకులనాడి ఎనభైల మధ్యనాటికి దొరికింది. భారీతారాగణం, భావోద్వేగాలకు, కమర్శియల్ ఎలిమెంట్స్ కి ,సంగీతానికి ప్రాధాన్యమిస్తూ చిత్ర నిర్మాణం చేశాడు. అనిల్ కపూర్ స్టార్ గా ఎదిగే దశలో ఉన్నపుడు అతనితో చాలా సినిమాలు తీశాడు. అందులో ఒకటి మేరీ జంగ్.
ఈ పాట సినిమాలో పలుమార్లు రిపీట్ ఔతుంది. భిన్న గాయకులు పాడారు. సినిమా మొదట్లో వచ్చే పాట ఇది.
‘నాసిర్ హుస్సేన్’ అనేక సినిమాల్లో చిన్నప్పటి పాట పెద్దయ్యాక రిపీట్ అయ్యి మనుషుల్ని కలపటమో, పాత ఉద్వేగాల్ని తిరిగి కలించటమో చేస్తుంది.
అదీ అలాంటి కుటుంబగీతమే (ఫామిలీ సాంగ్). ఐతే పాట సారాంశం హీరోని మోటివేట్ అయ్యేందుకు దోహదపడేట్టు ఉంది.
“మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే
మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
నువ్వే నా పెదవులకు ఈ గీతాన్ని అలంకరించావు
నీ ప్రేమ జీవనాన్ని సంగీతమయం చేసింది
ప్రియతమా!నాదైన ప్రతీదీ నీవిచ్చినదే
నేనొక చిత్రాన్ని ..దాని రూపూ రంగూ నువ్వే
ధైర్యాన్ని వదలవద్దు ప్రపంచాన్ని ఎదుర్కో
చూడు ఆకాశం రంగు మారుతుంది
పరాజయాన్ని కాదు అది విజయాన్ని తెలిపే రంగు
సూర్యనికోసం చంద్రునికోసం చుక్కల కోసం రోజూ ఎక్కడ వెతుకుతావు?
కాగడా తో చీకటిని వెలుతురుమయం చేద్దాం.
ఆశయంతో ఉన్నంతవరకూ బాధనేది లేదు”


లంబీ జుదాయీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-104
లంబీ జుదాయీ (దీర్ఘమైన ఎడబాటు)
హీరో సినిమాలో ‘రేష్మా ‘పాడిన పాట. ఆనంద్ బక్షి రచన లక్ష్మికాంత్ ప్యారేలాల్ స్వర రచన.
‘వాగ్దానం ‘ సినిమాలో హరికథలో ఒక పద్యం …’ఫెళ్ళు మనె విల్లు, గంటలు ఘల్లు మనె, గిభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనె జానకీ దేహము’ ఘంటసాల పాడుతారు.
అలాంటి స్థితి ‘రేష్మా ‘ పాట ప్రారంభంలో నాకు అనుభవానికి వస్తుంది.
జానపద గాయని ‘రేష్మా’ బికనేర్ (రాజస్థాన్) లో దేశ విభజన కాలంలోపుట్టింది. కుటుంబంతో పాకిస్తాన్ కు తరలింది. 1982 లో తొలిసారి(?) భారత్ కు వచ్చింది. హీరో సినిమాలో తొలిసారిగా తన గొంతు హిందీ సినీ సంగీత ప్రేమికులకు వినిపించింది.
ఆమె స్వరమైతే అప్పుడువిన్నారు కాని ఆమె సంగీత పవనాలు అప్పటికే తెరలు తెరలుగా భారత దేశంలోవ్యాపించి ఉన్నాయి.
అప్పటికి ఒక దశాబ్దంక్రితం ‘రాజ్ కపూర్’ తన ‘బాబీ’ సినిమాలో ఆమె పాటను ‘లతా మంగేష్కర్ ‘ స్వరంతో వినిపించాడు. ఆ పాట ‘అఖియోం కొ రెహనేదో ‘. ఆ సినిమా కు సంగీత దర్శకులు ‘లక్ష్మి కాంత్ ప్యారేలాల్’.
మరి కొన్నాళ్ళకు ‘లక్ష్మికాంత్ ప్యారేలాల్’’ మరోపాటతో రేష్మా ను గుర్తు తెచ్చారు. ఆ పాట బాలచందర్ హిందీ సినిమా ‘ఏక్ దూజే కేలియే’ లో అనూప్ జలోటా స్వరంతో ప్రారంభమయ్యే ‘కోశిష్ కర్ కే దేఖ్ లే దరియా సారే ,నదియా సారీ’ పాట.
ఆ తర్వాత ‘ లక్షి -ప్యారే’ లే ‘రేష్మా’ స్వరాన్ని ‘హీరో’ సినిమా ద్వారా వినిపించారు. ఆ పాట ‘లంబీ జుదాయీ’.
“మనం దూరమయ్యింది నిన్నా మొన్ననే
జీవించి ఎలాఉండను ఇలా సంవత్సరాల పాటు?
మృత్యువు రాదుకానీ నీ తలపులెందుకు వస్తున్నాయి?
దీర్ఘమైన ఎడబాటు...
నాలుగు రోజుల ప్రేమ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు..
నా ప్రాణం ప్రార్ధన రూపంలో పెదవులు మీదకు వస్తుంది
దీర్ఘమైన ఎడబాటు…..
నాలుగు రోజుల ప్రేమ ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు…..
మొదటిది ప్రియుడు నా చెంతలేడు
రెండోది కలుస్తాడన్న ఆశా లేదు
దానికి తోడు వర్షఋతువు వచ్చింది
వచ్చి నిప్పులు కురిపిస్తుంది
దీర్ఘమైన ఎడబాటు….
నీ చేతులతో నా ప్రపంచాన్ని ధ్వంసం చేసావు
నీ మనసు తో నా మనసు అద్దాన్ని పగలుగొట్టావు.
యుగాలను మించి ఎత్తైన గోడలు కట్టావు
దీర్ఘ మైన ఎడబాటు…...
పూయటానికి ముందే తోట నాశనమైపోయింది
కలవటానికి ముందే పక్షులు దూరమైపోయాయి
కోయిల కూత వేదన రేపుతుంది “

Sunday, May 21, 2017

షీషా హో యా దిల్ .. ఆఖిర్ టూట్ జాతా హై

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-82
షీషా హో యా దిల్ .. ఆఖిర్ టూట్ జాతా హై
(అద్దమైనా, హృదయమైనా ,చివరికి ముక్కలైపోతుంది.)

1980 ఒక సూపర్ హిట్ గీతం ఇది.అప్పుడే కాదు ఇప్పటికీ శ్రోతలు ఈ పాటను కోరుతూనే ఉంటారు.దృశ్యపరంగా గొప్పగా ఉండదు.

సినిమా పేరు ‘ఆశా’. పాట లో నిరాశ ఉందా? నిర్వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందా? ఉన్నదాంతో సర్దుకుపొమ్మంటుందా?

సినిమాలో హీరోయిన్ వృత్తి గాయకురాలు. లారీ డ్రైవర్ ఐన హీరో ఆమె కు ఒకసారి సాయపడి స్నేహితుడయ్యాడు. అప్పటికే అతనికి భార్య ఉంది. భార్యతో గాయకురాలి ప్రదర్శన కు వెళ్ళాడు. అప్పటి పాట ఇది. పాటలో ప్రతిఫలించేటంత నిరాశ అప్పటికి ఆమె జీవితంలో కనపడదు. ‘ఫోర్ షాడోయింగ్’ ద్వారా జరగబోయేది చెబుతున్నారా? ‘యధ్బావం తద్భవతి’ అంటారు. ఆమె ఆలోచనలను బట్టి ఆమె ఆశ ఫలించదని చెలియజెబుతున్నారా?

పాట రచయిత ‘ఆనంద్ బక్షి’. 70ల తర్వాత పాటల రచయితగా ఎక్కువగా వినపడిన పేరు. అతని పాటలు తేలికైన చిన్న చిన్న పదాలతో సాగుతూ ఒక మాదిరి హిందీ తెలిసిన వాళ్ళకుకూడా అర్ధమయ్యేట్టు ఉంటాయి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వర కల్పన.లతామంగేష్కర్ గానం.

(ఈ సినిమా తెలుగు రూపం ‘అనురాగదేవత’లో ఈ పాటకు వేటూరి రాసిన పల్లవి “చూసుకో పదిలంగా, హృదయాన్ని అద్దంలా,పగిలేది ఖాయం ఏదైనా! రగిలేను నీలో వేదనా!”)

హిందీ పాట అర్ధం:

అద్దమైనా, హృదయమైనా
చివరికి ముక్కలైపోతుంది.

చేతినుండి పెదవులకు అందేలోపే
సముద్రం వెనక్కి వెళ్లిపోతుంది

కోరికలు ఉండగానే సరిపోదు
కలయిక అంత తేలిక కాదు
లోకం అసహాయుల్ని చేస్తుంది
విధిరాత రాసి ఉండాలి
కోరికలకు ఒకదానితో ఒకటి పోటీ
వాటికి రాజీ ఎలా?
ఒక దానిని కోరితే
రెండవది కోపగిస్తుంది.

గట్టున కూర్చుని
అలల్ని గమనిస్తూ
నేను తుఫానులతో ఆడుకుంటున్నాను
హృదయపు కోరికలతో ఆడుకుంటున్నాను

నాకు అప్పుడు తెలియదు
ఎవరూ తోడు రారని
నావికుడు వదిలి వెళ్లిపోతాడని
ఒడ్డు దూరమైపోతుందని
******
ప్రపంచం ఒక నాటకం
ఆశ నిరాశలమయం
కొద్దిగా పూలు ఉన్నాయి,ముళ్ళు ఉన్నాయి
విధి వారికి పంచుతుంది
ఎవరి బాకీ ఎంతో అంత
ఎవరి కథ ఎంతో అంత
కొందరు దోచుకోబడతారు
కొందరు దోచుకుంటారు.

Tuesday, April 4, 2017

రుక్ జానా నహీ తూ కహి హార్ కే


' రుక్ జానా నహీ తూ కహి హార్ కే '(ఓడిపోయి ఎప్పుడూ ఆగిపోవద్దు)
('ఇంతిహాన్ ' (1974)సినిమా మజ్రూహ్ సుల్తాన్ పురి రచన ,కిశోర్ కుమార గానం,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం)

80లో ఖుర్బాని సినిమా చూసాక నా అభిమాన నటుల్లో మరొకరు కలిసారు. అతను వినోద్ ఖన్నా. అతన్ని అభిమానించడం మొదలెట్టె సరికే అతను సినిమాల్లోంచి విరమించుకున్నాడని తెలిసింది.కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నపుడే అతన్ని అధ్యాత్మికత పిలిచినట్టుంది.అతను ఆచార్య రజనీష్ వెంటనడిచాడు.

ఐతే అతని కొత్తసినిమాలు అప్పటికి నిర్మాణంలో ఉన్నవి కొన్నివచ్చాయి.అవేకాక నా అభిమాన ధియేటర్ వేదరాజ్ (ఏలూరు) లో అతని పాత సినిమాలు వచ్చినవల్లా చూసాను.

అందులో ఒకటి 'ఇంతిహాన్ '(పరీక్ష).కాలేజి విధ్యార్ధి గా ఉన్న నాకు ఆ సినిమా బాగా నచ్చింది.అందుకు నాకర్ధమైన కొన్ని కారణాలు సినిమా పూర్తిగా కాలేజి నేపధ్యంలో సాగటం,సినిమాలోసంఘటనలు నమ్మగలిగేలా ఉండటం..ఇంకా ముఖ్యంగా కథానాయకుడు  ఒక నమ్మదగిన,ఆధారపడదగిన, రక్షణనివ్వగలిగే వాడిలా కనపడటం
.
సినిమాలో కథానాయకుడు మంచి ఆదర్శాలతో ఉన్నాడు.ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెసర్ ఉద్యోగానికి ఒక కాలేజీ వచ్చాడు.అస్తవ్యస్తంగా ఉన్న కాలేజిని సంస్కరించే ప్రయత్నాలు చేశాడు.విద్యార్దుల్లో అల్లరిమూకకు శత్రువయ్యాడు.డిప్రెషన్ లోఉన్న ప్రిన్సిపల్ కూతురును మామూలు స్థితికి రావటానికి సహకరించాడు.విద్యార్ధుల్లో చాలామందిని ప్రభావితం చేయగలిగాడు.ఐతే అల్లరి మూకలోని ఒక విదార్ధిని హీరో తనపై అత్యాచారం చేశాడని నిందమోపింది.

ఆ నిందనుండి అతను బయటపడటమే అతనికి పరీక్ష. పరీక్ష పెట్టాల్సిన అధ్యాపకుడే పరీక్ష కునిలవాల్సి రావటం,,అందులో అతను నెగ్గటం సినిమా.

తనపై పడ్డ అపవాదును సకల శక్తులుఒడ్డి చెరుపుకున్నాడు.ఆ క్రమంలో తనని ద్వేషించినవారిలో మార్పు తేగలిగాడు. తన నిర్దోషిత్వం ఋజువయ్యాక అక్కడినుండి దూరంగా పోదలిచి బయలుదేరాడు.

అప్పటి పాట' రుక్ జానా నహీ తూ కహి హార్ కే '.

ఇదిఒక స్పూర్తి ని నింపే పాట,ధైర్యాన్నిచ్చేపాట,అర్ధంచేసుకునేవారు లేక ఒంటరిగా నిలబడ్డప్పుడు నిలబడ్డ నేలను గట్టిపరచే పాట.(ఈ సినిమా చూసి అధ్యాపకుణ్ణి య్యాను,విన్నప్పుడు ఎంతో ఓదార్పు పొందుతాను..ఇలాంటి అనేక కామెంట్లు యుట్యూబ్ లో చూసాక నాలాంటివారెందరో ఉన్నారని ధైర్యంతో ఈ మాట చెబుతున్నా)


“ఓడిపోయి ఎప్పుడూ ఆగిపోవద్దు
ముళ్ళపైనడిచే వర్షఋతు నీడకు చేరగలవు

ఓ పథికుడా...

సూర్యుడు చూడు ఆగిఉన్నాడు,నీముందు వంగి ఉన్నాడు
ఎపుడైనా ఇలాంటి ధీరుడు
తన ఇష్టాలతో నడిచినపుడు
పగటి ఎదురుచూపు,సాయంత్రపు సంతోషమౌతుంది,
ఓ పథికుడా...
.

వెంట ఎవరూ లేరు,ఇది పరీక్షాకాలం
కానీ గుండె తోడుగా నడుస్తూనే ఉండు
గమ్యం నిన్ను పిలుస్తూనే వుంటుంది
పిలిచి నిన్ను ఆపేవారు లేకుండా చూసుకో
ఓ పథికుడా…

కంటఒలికే కన్నీళ్ళు,దారిచూపే దివ్వెలు
లోకానికి వారికివ్వాల్సింది ఇచ్చేసి,నీ కలలు మాత్రం తీసుకునినడు
ఎవరూ లేకపోయినా నీవైన ప్రేమ స్వప్నాలు ఉన్నాయి
ఓ పథికుడా..”


--ముళ్ళపూడి సుబ్బారావు