Showing posts with label anand bakshi. Show all posts
Showing posts with label anand bakshi. Show all posts

Saturday, October 21, 2017

జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-111
జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై
(జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే)
Meri జంగ్ (1985) లో లతా మంగేష్కర్, నితిన్ ముకేశ్ పాడిన పాట. ఆనంద్ బక్షి రచన, లక్ష్మీకామ్త్ ప్యారే లాల్ స్వర రచన.
మన్మోహన్ దేశాయి, ప్రకాశ్ మెహ్రా లవంటి దర్శక నిర్మాతల కోవలో ఎనభైల నాటికి సుభాష్ ఘయ్ చేరాడు. అతను డెబ్భైల మధ్యలో దర్శక ప్రస్థానం ప్రారంభించినా ప్రేక్షకులనాడి ఎనభైల మధ్యనాటికి దొరికింది. భారీతారాగణం, భావోద్వేగాలకు, కమర్శియల్ ఎలిమెంట్స్ కి ,సంగీతానికి ప్రాధాన్యమిస్తూ చిత్ర నిర్మాణం చేశాడు. అనిల్ కపూర్ స్టార్ గా ఎదిగే దశలో ఉన్నపుడు అతనితో చాలా సినిమాలు తీశాడు. అందులో ఒకటి మేరీ జంగ్.
ఈ పాట సినిమాలో పలుమార్లు రిపీట్ ఔతుంది. భిన్న గాయకులు పాడారు. సినిమా మొదట్లో వచ్చే పాట ఇది.
‘నాసిర్ హుస్సేన్’ అనేక సినిమాల్లో చిన్నప్పటి పాట పెద్దయ్యాక రిపీట్ అయ్యి మనుషుల్ని కలపటమో, పాత ఉద్వేగాల్ని తిరిగి కలించటమో చేస్తుంది.
అదీ అలాంటి కుటుంబగీతమే (ఫామిలీ సాంగ్). ఐతే పాట సారాంశం హీరోని మోటివేట్ అయ్యేందుకు దోహదపడేట్టు ఉంది.
“మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే
మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
నువ్వే నా పెదవులకు ఈ గీతాన్ని అలంకరించావు
నీ ప్రేమ జీవనాన్ని సంగీతమయం చేసింది
ప్రియతమా!నాదైన ప్రతీదీ నీవిచ్చినదే
నేనొక చిత్రాన్ని ..దాని రూపూ రంగూ నువ్వే
ధైర్యాన్ని వదలవద్దు ప్రపంచాన్ని ఎదుర్కో
చూడు ఆకాశం రంగు మారుతుంది
పరాజయాన్ని కాదు అది విజయాన్ని తెలిపే రంగు
సూర్యనికోసం చంద్రునికోసం చుక్కల కోసం రోజూ ఎక్కడ వెతుకుతావు?
కాగడా తో చీకటిని వెలుతురుమయం చేద్దాం.
ఆశయంతో ఉన్నంతవరకూ బాధనేది లేదు”


కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-108
కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!
( కొన్ని సార్లు అసహాయత చంపుతుంది,కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది)
అలగ్ -అలగ్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. ఆనంద్ బక్షి రచన,ఆర్ డి బర్మ సంగీతం
ఎనభైలో ‘రఫీ’ మరణంతో హిందీ సినిమా సంగీతం ఏకధృవ ప్రపంచమైపోయిందనుకున్నారు. ఆ ధృవం కిశోర్ కుమార్. ఐతే ఎనభై తరువాత వచ్చిన కిశోర్ కుమార్ పాటల్లో అతని స్థాయిని పెంచినవి బహు తక్కువ, నిలబెట్టినవీ కొద్దిగానే. అనూహ్యంగా అతనితో ఏమాత్రం సరితూగని గాయకులతో అతను పోటీపడాల్సి వచ్చింది. కిశోర్ కుమార్ ను డెబ్భైలలో ఆకాశంలో నిలిపిన ఆర్ డి. బర్మన్ సైతం ఎనభైలలో కిశోర్ తో కాకుండా షబ్బీర్ కుమార్ వంటి కొత్త గాయకులతో పాటలు పాడించాడు. షబ్బీర్ కుమార్ ‘మహమ్మద్ రఫీ’ ని అనుకరించే గాయకుడు (క్లోన్) కావటం ఒక వైచిత్రి.
నటుడు రాజేశ్ ఖన్నా కిశోర్ కుమార్, ఆర్ డి.బర్మన్ బృందం ఎన్నో విజయాలను చవిచూసింది. వారి కాంబినేషన్ ను కూర్చిన దర్శకుడు శక్తి సామంతా. (1969లో)
పదహారేళ్ళతర్వాత (1985 లో) రాజేశ్ ఖన్నా నిర్మాతగా మారి పై కాంబినేషన్ ను మరోసారి ప్రయత్నించాడు. ఆ సినిమా ‘అలగ్ -అలగ్’. ఫలితం మాత్రం మరో ‘ఆరాధన’ గా రాలేదు. ఐతే కిశోర్ కుమార్ ద్వారా ఒక ఉత్తమ గీతాన్ని అందుకోగలిగాం.
“ఇది గజల్ కాదు గీతమూ కాదు
ఇది నా బాధల గాధ
నా గుండెలో కేవలం అగ్ని ఉంది
నా కళ్ళలో కేవలం నీరు ఉంది
కొన్ని సార్లు అసహాయత చంపుతుంది
కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
విధి ని అనేందుకు లేదు
మారనిదల్లా కాలమే
అప్పుడప్పుడూ దురదృష్టం
కొన్నిసార్లు నా లేనితనం
వేటి పేర్లు చెప్పను?
నన్ను అన్నీ చంపాయి.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
నరక ప్రాయపు,అపనమ్మకపు లోకమిది
ఇదే లోకమైతే ఇదేమిలోకం?
స్నేహితులకు కొదవలేదు
శత్రువులకు కొరత లేదు
కొన్నిసార్లు శత్రుత్వం దోచింది
కొన్నిసార్లు స్నేహం చంపింది.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
వెలుతురు పట్ల విముఖత వచ్చింది
చీకటి అలవాటైపోయింది
చీకటి ఉన్నంత వరకూ
కాలం బాగానే గడచింది
నన్ను వెన్నెల దోచింది
వెలుతురు నన్ను చంపింది"

లంబీ జుదాయీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-104
లంబీ జుదాయీ (దీర్ఘమైన ఎడబాటు)
హీరో సినిమాలో ‘రేష్మా ‘పాడిన పాట. ఆనంద్ బక్షి రచన లక్ష్మికాంత్ ప్యారేలాల్ స్వర రచన.
‘వాగ్దానం ‘ సినిమాలో హరికథలో ఒక పద్యం …’ఫెళ్ళు మనె విల్లు, గంటలు ఘల్లు మనె, గిభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనె జానకీ దేహము’ ఘంటసాల పాడుతారు.
అలాంటి స్థితి ‘రేష్మా ‘ పాట ప్రారంభంలో నాకు అనుభవానికి వస్తుంది.
జానపద గాయని ‘రేష్మా’ బికనేర్ (రాజస్థాన్) లో దేశ విభజన కాలంలోపుట్టింది. కుటుంబంతో పాకిస్తాన్ కు తరలింది. 1982 లో తొలిసారి(?) భారత్ కు వచ్చింది. హీరో సినిమాలో తొలిసారిగా తన గొంతు హిందీ సినీ సంగీత ప్రేమికులకు వినిపించింది.
ఆమె స్వరమైతే అప్పుడువిన్నారు కాని ఆమె సంగీత పవనాలు అప్పటికే తెరలు తెరలుగా భారత దేశంలోవ్యాపించి ఉన్నాయి.
అప్పటికి ఒక దశాబ్దంక్రితం ‘రాజ్ కపూర్’ తన ‘బాబీ’ సినిమాలో ఆమె పాటను ‘లతా మంగేష్కర్ ‘ స్వరంతో వినిపించాడు. ఆ పాట ‘అఖియోం కొ రెహనేదో ‘. ఆ సినిమా కు సంగీత దర్శకులు ‘లక్ష్మి కాంత్ ప్యారేలాల్’.
మరి కొన్నాళ్ళకు ‘లక్ష్మికాంత్ ప్యారేలాల్’’ మరోపాటతో రేష్మా ను గుర్తు తెచ్చారు. ఆ పాట బాలచందర్ హిందీ సినిమా ‘ఏక్ దూజే కేలియే’ లో అనూప్ జలోటా స్వరంతో ప్రారంభమయ్యే ‘కోశిష్ కర్ కే దేఖ్ లే దరియా సారే ,నదియా సారీ’ పాట.
ఆ తర్వాత ‘ లక్షి -ప్యారే’ లే ‘రేష్మా’ స్వరాన్ని ‘హీరో’ సినిమా ద్వారా వినిపించారు. ఆ పాట ‘లంబీ జుదాయీ’.
“మనం దూరమయ్యింది నిన్నా మొన్ననే
జీవించి ఎలాఉండను ఇలా సంవత్సరాల పాటు?
మృత్యువు రాదుకానీ నీ తలపులెందుకు వస్తున్నాయి?
దీర్ఘమైన ఎడబాటు...
నాలుగు రోజుల ప్రేమ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు..
నా ప్రాణం ప్రార్ధన రూపంలో పెదవులు మీదకు వస్తుంది
దీర్ఘమైన ఎడబాటు…..
నాలుగు రోజుల ప్రేమ ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు…..
మొదటిది ప్రియుడు నా చెంతలేడు
రెండోది కలుస్తాడన్న ఆశా లేదు
దానికి తోడు వర్షఋతువు వచ్చింది
వచ్చి నిప్పులు కురిపిస్తుంది
దీర్ఘమైన ఎడబాటు….
నీ చేతులతో నా ప్రపంచాన్ని ధ్వంసం చేసావు
నీ మనసు తో నా మనసు అద్దాన్ని పగలుగొట్టావు.
యుగాలను మించి ఎత్తైన గోడలు కట్టావు
దీర్ఘ మైన ఎడబాటు…...
పూయటానికి ముందే తోట నాశనమైపోయింది
కలవటానికి ముందే పక్షులు దూరమైపోయాయి
కోయిల కూత వేదన రేపుతుంది “