Wednesday, November 8, 2017

చోఢ్ ఆయే హమ్ వో గలియా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-124
చోఢ్ ఆయే హమ్ వో గలియా!
(‘ఆ వీధులు వదిలివచ్చాము’)
మాచిస్ (1996)సినిమాలో పాట. హరిహరన్,సురేశ్ వాడ్కర్,వినోద్ సెహగల్,కే కే పాడిన పాట. విశాల్ భరద్వాజ్ సంగీతం.
ఐదు దశాబ్దాలుగా చిత్రసీమలో తన ప్రాభవాన్ని నిలుపుకుంటూనే ఉన్న గీత రచయిత ‘గుల్జార్’. సినిమాలలు గీతాలే కాదు, మాటలూ రాసాడు. దర్శకుడుగా నిలిచిఉండే సినిమాలూ తీసాడు.తీసిన సినిమాలు వివిధ తరహాలకు చెందినవి. దర్శకుడిగా మొదటి యత్నం (1971) నగర యువతలో రేగిన అశాంతి ని చూపాడు(మేరే అప్నే). పాతికేళ్ళతర్వాత మాచిస్ (1996)సినిమాలో లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పంజాబ్ యువత ఉగ్రవాదంవైపు కదలికను చూపాడు.
గుల్జార్ పాకిస్థాన్ లో పుట్టాడు. దేశవిభజన క్లేశాలు అనుభవించాడు. రాసిన అనేకపాటల్లో ఏదో ఖాళీతనాన్ని వ్యధతో భర్తీ చేస్తున్నట్టు చూపుతాడు. అమీర్ ఖుశ్రో, గాలిబ్ లను తిరిగి పరిచయం చేస్తుంటాడు. కాలపు దారుల్లో దారి తప్పకుండా నడిచినట్టుంటాడు.నడిచిన దూరమెంతో తెలియనీయడు.
మాచిస్ లో ఈ పాటలో మొదటిచరణంలో వదిలివచ్చినవాటిపట్ల బెంగ,రెండవదానిలో అక్కడి స్థితి పట్ల విచారం ,మూడవదానిలో తన స్థితి పట్ల నిర్వేదం కనిపిస్తాయి.
“ఆ వీధులు వదిలివచ్చాము…..
నీ కమలాలవంటి కాళ్ళు ఎక్కడ జారిపడేవో
నీ నవ్విన బుగ్గలు సుడిగుండాల్లా సొట్టలు పడేవో
నీ నడుమువంపులు నదులు తీసుకునేవో
నీ నవ్వు విని పంటలు పక్వానికొచ్చేవో…
అలాంటి వీధులు వదిలివచ్చాము.
ఎక్కడ నీ పాదధూఌ రేగుతుండేదో
విన్నాను .. ఆ గుమ్మంలో సాయంసంజ అలుముకుందని
నీ కేశపాశాల్లో చిక్కుకున్న ఆ రాత్రి ని
తలగడపై అప్పుడప్పుడూ తిరిగి కలుస్తుంటాను
హృదయమొక బాధాశకలం, రాతి పెళ్ళ
ఒకచీకటి నుయ్యి, ఒక మూసి ఉన్నవీధి
గడవని ఒక చిరు క్షణం...
ఎంతో మండిస్తున్నాను ,ఐనా భస్మంకాదు”

Saturday, October 21, 2017

పర్ దేశీ !పర్ దేశీ ! జానా నహీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-122
పర్ దేశీ !పర్ దేశీ ! జానా నహీ
(పరదేశీ ...వెళ్ళిపోవద్దు)
రాజా హిందుస్తానీ (1996) లో ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్,సప్నా అవస్తీ పాడినపాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం.సమీర్ రచన.
పరదేశి పదం ‘కాలరీస్ ‘ప్రాంతాలలో వాడుకలో ఉన్నపదం. పరభాష లేదా పరరాష్టాలకు(ఎక్కువగా ఉత్తరభారతదేశానికి) చెంది, ఇక్కడ స్థిరపడ్డవారిని అనేమాటది. పరదేశి /శ్ హిందీ సినిమాపాటల్లో విరివిగా ఉపయోగించారు. దూరవాసులు, ప్రయాణికులు,పరప్రాంతాలకు చెందినవారు,ఇక్కడ స్థిరంగా ఉండనివారు...ఇలాంటి వారినుద్దేశించి
‘పరదేశియోం సె అఖియా మిలానా’ పాట ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’(1965) సినిమాలోది. సినిమాలో కథానాయకుడు టూరిస్ట్ ప్లేస్ ఐన కాశ్మీర్ లోని ‘డాల్’ లో పడవ నడుపుకుంటున్నాడు.టూరిస్ట్ గా వచ్చిన ఓ ధనిక యువతి తో కళ్ళుకలిపాడు.కథ మలుపులు తిరిగి సుఖాంతమయ్యింది.
గోదావరిలో ఒక యువకుడు టూరిస్టులకోసం పడవ నడుపుతూ బ్రతుకుతున్నాడు. ఒక ‘రాణమ్మ ‘ ను చూసి ఆరాధించాడు. ఆ కథా సుఖాంతమయ్యింది. ఆ సినిమా ‘మా పల్లెలో గోపాలుడు.
అదే సినిమా హిందీలో ‘కత్ తక్ చుప్ రహూంగి’ పేరుతో వచ్చింది. ‘మిత్వా భూల న జానా’ పాటతో గుర్తుంది.
రాజా హిందుస్తానీ (సినిమా పేరూ ,హీరో పేరూ అదే) ఒక హిల్ స్టేషన్లో టాక్సీ నడుపుతున్నాడు. పెద్ద ఇంటి యువతి తన తల్లి గడిపిన ఆ ప్రాంతానికి వచ్చింది.టాక్సి డ్రైవర్ తో అనుబంధంపెంచుకుంది. అదే సమయానికి తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. తిరుగు ప్రయాణం లో ఒక డాభా దగ్గర ఆగారు.
అక్కడ ఒక సంచారిణి ,మనసు లో ఉన్న ఖాళీని మద్యంతో నింపుకుంటుంది. పాట మొదలుబెట్టింది.గొంతు కలిపిన కథానాయకుడ్ని విని పాటమధ్యలో ఈ మాటలు చెప్పింది.
“నీ గొంతులో ఎంత వ్యధ వుంది?
అంటారు…. గుండె పగిలినపుడు
పలికేది గొంతుకాదని.
కాని అది పగిలినపుడు
ప్రళయం వస్తుంది
తుఫాను వస్తుంది,భూకంపం వస్తుంది
నీ గొంతులో అలాంటి బాధ ఉంది
నీగొంతులో అలాంటి ప్రేమ ఉంది
కాని విను
నీ బాధ,ప్రేమ కు ఈ లోకులు
ఏమి న్యాయం చేస్తారు
నువ్వు తపిస్తూనే ఉంటావు
వాళ్ళు చూస్తూనే ఉంటారు
విను
నువ్వు ఇపడు పాడు
చాలాకాలం తర్వాత ఈ పిచ్చిది
మనసు విప్పి నాట్యం చేస్తుంది.”
ఈ పాట వింటుంటే పాడిన ఉదిత్ నారాయణ్ పాటకు తగిన న్యాయంచేసాడనిపిస్తుంది.
పాట :
“ప్రేమించవద్దని నేను చెప్పట్లేదు
కాని యాత్రికులపట్ల మాత్రం నమ్మకం పెంచుకోకు
పరదేశీ ...వెళ్ళిపోవద్దు
నన్నువదిలి.నన్ను వదిలి
పరదేశీ ..నా ప్రియతమా! ఇచ్చినమాట నిలుపుకో
నన్ను గుర్తుంచుకో ! ఎప్పుదూ మరువవద్దు
నేను నిన్ను కోరాను,నిన్ను ప్రేమించాను
నీకోసం అన్నీ వదులుకున్నాను
యోగినినయ్యానుప్రేమయోగం తీసుకున్నాను
ఏమీ ఆలోచించక మనోవ్యధ తెచ్చుకున్నాను
పరదేశి! నా ప్రియతమా! తిరిగి రా!
మరువకు,మరువకు, మరువకు
ప్రతిక్షణం నా తలపులు నిన్ను బాధిస్తాయి
నేను మేలుకుని ఉంటా! నీకూ నిదురరాదు
నన్ను ఇలా వదిలివెళ్ళితే
నిజం చెబుతున్నా! చాలా పశ్చాత్తాపపడతావు
పరదేశీ ! నా ప్రియా! నన్ను ఏడిపించకు”


ప్యార్ కియాతో డర్నా క్యా?

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-123
ప్యార్ కియాతో డర్నా క్యా?
(ప్రేమిస్తే భయపడేది దేనికి?)
‘మొఘల్ ఎ ఆజమ్’ సినిమా లో లతా మంగేష్కర్ పాడినపాట.షకీల్ బదాయుని రచన ,నౌషాద్ సంగీతం.
రసపుత్ర వనిత జోధాబాయిని ముసల్మాను ఐన అక్బర్ పాదుషా వివాహమాడాడు. తద్వారా శత్రువుల్ని తగ్గించుకున్నాడు.రాజ్య విస్తరణనూ చేయగలిగాడు. ఐతే సంతానంకోసం పరితపించాడు. అందుకోసం ఎడారిలో మండుటెండలో పాదరక్షలు లేకుండా నడిచి దర్గాను దర్శించి ప్రార్ధించాడు. భావి మొఘల్ సామ్రాట్ ను పొంది సఫలమనస్కుడయ్యాడు.
అలాంటి యువరాజు అస్థానంలో ని నర్తకితో ప్రేమలో పడ్డాడు. నర్తకిగా ఆమె ను అక్బర్ పాదుషా కూడా ప్రసంసించాడు. కాని ఆమెnu  భావి సామ్రాజ్ఞి గా అంగీకరించలేకపోయాడు. ఇప్పుడు తన ఎదుట నర్తిస్తూ గానంచేస్తున్న ఆమె తనపట్ల చూపిన నిరశన, ధిక్కారంలో తన సమస్త శత్రువుల్నీ చూసాడు. తనని ముప్పుతిప్పలు పెడుతున్న రాణా ప్రతాప్ ను అనార్కలి ని పక్కపక్కన ఉంచితే తన ప్రధాన శత్రువుగా అనార్కలీ నే ఎంచుకునేవాడేమో.
ఈ పాటలో అనార్కలి స్వరం, శరీర భాష ధిక్కారానికి పరాకాష్ట గా అనిపిస్తుంది. అదే అనార్కలి ,అదే ప్రేక్షకులు (అక్బర్,జోధా బాయి,సలీమ్) సమక్షంలో అంతకుమునుపు ఒక ప్రదర్శన ఇచ్చింది. (మొహే పన్ ఘట్ మే నంద్ లాల్ ఛేడ్ గయోరే ) అందులో అనార్కలి (దానిమ్మ మొగ్గ) సిగ్గులమొగ్గ గా కనిపిస్తుంది.ప్రేమయుద్ధంలో మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్ తో తలపడ్డాక ఆమె స్వరం మారింది.ఆమె అగ్నికీల గా మారింది.
“మనిషన్నవారు లోకంలో ఒక్కసారే ప్రేమిస్తారు
ఆ బాధను తోడ్కొని జీవిస్తారు. ఆ బాధతోనే మరణిస్తారు
ప్రేమిస్తే భయపడేది దేనికి?
ప్రేమించానంతే! దొంగతనమేమీ చేయలేదు
చాటుగా నిట్టుర్చాల్సిందేముంది ?
నేడు చెబుతాను హృదయపుగాధ
లోకం కావాలంటే ప్రాణాలు తీసుకోనీ
లోకం చూసేదే మరణమనుకుంటే
వెక్కివెక్కి పడుతూ చనిపోయేదెందుకు
తనపై కోరిక మనసులో ఉంటుంది
దీపమ్ ఈ సభలో వెలుగుతూ ఉంటుంది
ప్రెమలోనే జీవించాలి,ప్రేమలోనే మరణించాలి
వేరిక చేసేదేముంది నాకు?
నా ప్రేమను దాచలేను
నలువైపులా అది కనపడుతూనే ఉంది
దేవుని ముందు ముసుగులేవీ ఉండనపుడు
మనుషులముందు ఈ ముసుగులెందుకు?”

కార్వా గుజర్ గయా ,,గుబార్ దేఖ్ తీ రహే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-121
కార్వా గుజర్ గయా ,,గుబార్ దేఖ్ తీ రహే
(బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.)
నయీ ఉమర్ కి నయి ఫసల్ ( కొత్త కాలపు కొత్త పంట) 1966 సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. రోషన్ సంగీతం. నీరజ్ రచన.
కవిత తోనో పాటతోనో స్పూర్తి పొంది సినిమా తీయటం అరుదుగా జరుగుతుంది. అలాజరిగిందంటే ఆ కవిత చాలా శక్తివంతమైనదైయ్యుండాలి. అప్పటికాలానికి , అప్పటి ప్రజల ఆశలకో ,ఆశా భంగాలకో అద్దం పట్టినదయ్యుండాలి.
ఆలిఘర్ ముస్లిమ్ యూనివర్సిటీ లో అధ్యాపకుడైన ‘నీరజ్’’ (కలంపేరు) ఆహ్వానం మేరకే చిత్రపరిశ్రమకు వచ్చాడు. అప్పటికే కవిగా లబ్దప్రతిష్టుడు.సినిమాల్లో రాసిన పాటలు సంఖ్య తక్కువే గానీ ఎక్కువభాగం సక్సెస్ అయ్యాయి.
ఆయన రాసిన ఈ పాట అధారంగా ‘నయీ ఉమర్ కి నయి ఫసల్’ సినిమా తెరకెక్కింది. సినిమా వచ్చివెళ్ళిపోయింది కానీ పాటలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ పాట.
పాటలోని ప్రతీప్రస్తావనను, పాట చిత్రీకరణలో చూడగలం.
“కలలు పువ్వుల్లా రాలాయి
మిత్రులు శూలంతో guచ్చారు
అలంకరణలన్నీ చెదిరిపోయాయి
తుమ్మ తోపుల్లో నిలిచి
నేను వసంతం కోసం ఎదురుచూస్తున్నాను
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.
జీవితం కన్ను తెరచేలోపే రోజు గడచిపోయింది
కాలుమోపే లోపే జీవితం జారిపోయింది
ఒక్కో ఆకూ రాలిపోయింది , ఒక్కో కొమ్మా కాలిపోయింది
ఆశలు మాత్రం మిగిలాయి కాలం గడచిపోయింది
గీతాలు అశృవులైనాయి కలలు సమాధి అయ్యాయి
తోడుండే దీపాలు కొడిగట్టాయి
నేను మాత్రం వంగిపోయి , మలుపు లో నిలిచి ఉన్నాను
కాలపు ఉత్థానంలో పతనాన్ని చూస్తూ ఉన్నాను
ఎలాంటి యవ్వన కాలమది , ప్రేమిస్తూ ప్రతిపువ్వూ వికసించింది.
ఏమి అద్భుతమది అద్దమే ఉత్తేజం కలిగించింది
ఈ వైపు భూమి ఆ వైపు ఆకాశం పొంగాయి
దానితో మనసు ,కలిసిన చూపు ఉప్పొంగింది..
ఒకప్పుడు ఇక్కడ అలాంటి గాలి వీచేది
మొగ్గలన్నీ నలిగిపోయాయి వీధులన్నీ ఉక్కిరి బిక్కిరయ్యాయి
నేను అన్ని కోల్పోయి , కాలాన్ని శోషిస్తూ
చూస్తూనే ఉన్నాను
ఇంకా దిగని సంగీతపు మైకాన్ని చూస్తూ ఉన్నాను.
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.
చేతులు ఉండుంటే కలిసే వెండి కురుల్ని సవరించేవాడిని
పెదవులు ఉండుంటే ప్రతి వసంతాన్ని పిలిచేవాడిని
బాధ ఉండుంటే దాని కారకుణ్ణి ప్రేమించే వాడిని
శ్వాస ఉంటే భూమికి స్వర్గాన్ని దింపేవాడిని
ఏదీ జరగట్లేదు .ఉదయమే సాయంత్రమైపోయింది,
లేచిన అలలు నా ఇసుక కోటను ముంచేశాయి
నేను భయం భయంగా కళ్ళనీరు నింపుకున్నాను
ముసుగు తీసి నాసమాధిని దర్శించాను
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.
పాపిడి నింపుతూ కొత్త కిరణం వచ్చినపుడు
ఆ లయబద్దపు ఢంకా మోతకు కాళ్ళు నర్తించాయి
నవ వధువు రాకడ సందడి తెలిపింది
గ్రామం కళ్ళలో కొత్త ఆశలు కదలాడాయి
అప్పుడే విషపుజల్లుతో పిడుగుపాటు
సిందూరం చెరిగిపోయింది,మేలి ముసుగు చిరిగిపోయింది
బోయీలు పల్లకీ మోసుకు పోతుంటే
దూరపు ఇంటినుండి నేను చూస్తూ ఉన్నాను
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.

మోరినీ బాగామా బోలే ఆధీ రాత్ మా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-120
మోరినీ బాగామా బోలే ఆధీ రాత్ మా
(తోటలో నెమలి అర్ధరాత్రి పాడసాగింది)
లమ్హే (1991) సినిమాలో పాట
ఎడారిలో ఏదో ఆకర్షణ ఉంది. అది దూరంనుండి చూస్తేనే ఉంటుందా? అక్కడే బ్రతికేవారికి ఎలాఉంటుంది.
డిగ్రీ లో ‘కమర్షియల్ జాగ్రఫీ’ అని సబ్జెక్ట్ ఉండేది. అందులో ఎడారుల గురించి ఒక మాట బాగా గుర్తుండిపోయింది. “ఎడారుల్లో ఉండేవారికి చూచినమ్తమేరా ఇసుకే ఉండటంవల్ల తాత్విక చింతన పెరుగుతుంది”. ఇదేఅని చెప్పలేను కాని ఇలాంటి అర్ధం వచ్చే మాటే.అందులో నిజమెంతో తెలియదు కానీ ఎడారి ఒక కొత్తప్రపంచానికి తీసుకెళుతుంది.మౡ ‘ఏదో ప్రాచీనత గోచరిస్తుంది’ అన్న కవి మాట గుర్తుకు తెస్తుంది.
రాజస్థాన్ ,ప్రత్యేకంగా ఎడారి నేపధ్యంతో సినిమాలు, పాటలూ చాలా వచ్చాయి. అందులో చాలావరకూ ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.
ఈ పాట జానపద గీతమనిపిస్తుంది .ఇలా అరుణ్ పాడేది రాజస్థానీ భాష అనుకుంటాను. లతామంగేష్కర్ పాడింది హిందీలోనే. అది ఆనంద్ బక్షి రాసారు.
ఇలా అరుణ్ స్వరానికి లతామంగేష్కర్ స్వరానికీ ఉన్నంత కాంట్రాస్ట్ ఇలా అరుణ్ కు శ్రీదేవి కి మధ్య ఉంది.
యశ్ చోప్రా తన సినిమాల్లో సంగీతానికి పెద్దపీట వేస్తాడు. కభీ కభీ సినిమా తర్వాత చాలా కాలం తనసినిమాలకు ‘ఖయ్యాం’ తో సంగీతం ఉపయోగించున్నాడు.తర్వాత ‘శివ్ -హరి’ తో పదేళ్ళపాటు జట్టుకట్టాడు. ఆ దశలో వచ్చిన ఒక పాట ఇది.
“మా రాజస్థాన్ లో
ఆవాల పంటపొలాలు లేవు
ఐనా బంగారంలా మెరుస్తుంది
మా ఎడారి ఇసుక
నా గుండెలో కత్తి దిగినట్టుంది
నెమలి పాట అర్ధరాత్రి వేళ మొదయ్యింది
నా గుండెలో కత్తి దిగినట్టుంది
తోటలో నెమలి అర్ధరాత్రి పాడసాగింది
గలగల గాజులు
చప్పుడు చేస్తున్నాయి చూడు
చేతికి ఉన్న గాజులు చప్పుడు చేస్తున్నాయి
నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను,నీరైపోతున్నాను
నా ప్రేమకథ అంతా విన్నారు
మాటల్లోనే మాట జారిపోయింది. మాటల్లోనే
గలగల గాజులు
చప్పుడు చేస్తున్నాయి చూడు
చేతికి ఉన్న గాజులు చప్పుడు చేస్తున్నాయి
ప్రియుడు వెఌపోయాడు
ముసుగు నుండి చూస్తుంటే
నా కళ్ళు వర్షించాయి
ఏ ఘడియలో ప్రియుడు ఇంటినుండి వెళ్ళాడో
అప్పుడు ముసుగులోనే కాలిపోయాను,ఎంత వాన కురిసినా
వర్షంలోనూ నా దాహం తీరనే లేదు
ఖాళీ పడకమీద రాత్రంతా మేలుకునే ఉన్నాను
నీ వెనుకనే నా నిదుర పరుగెత్తింది
నా మనశ్శాంతి నీతో పాటే వెఌపోయింది
సహచరుడా!
నా కళ్ళు రోదిస్తున్నాయి..నా మనసు దుఃఖపడుతుంది..సహచరుడా!
పోవద్దు
పోవద్దు”

సమయ్ ఓ ధీరే చలో -

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-118
సమయ్ ఓ ధీరే చలో -
(కాలమా! నెమ్మదిగా కదులు)
రుడాలి సినిమాలో ఆశా భోన్స్లే పాడినపాట. గుల్జార్ గీతరచన, భుపేన్ హజారికా స్వర రచన.
రుడాలి(1993) పేరుతోనే వచ్చిన మహాశ్వేతాదేవి కథకు చిత్ర రూపం ఈ సినిమా. కల్పనాలాజ్మి దర్శకత్వం. 
కథానేపధ్యం ‘రాజస్థాన్’ లోని ఎడారి ప్రాంతం. కథ రాసిన కాలంసుమారు 1979. అదే కథాకాలమనుకోవచ్చు. సినిమాలో కథానాయిక వృత్తి పెద్దకుటుంబాలలో ‘చావు’లకు కుటుంబ సభ్యులబదులుగా ఏడ్చి పెట్టటం. ఇప్పటి మాటల్లో ‘ఔట్ సోర్సింగ్’ అనుకోవచ్చేమో.ఇతరులకోసం ఏడ్చి సొంతదుఃఖానికి ఏడుపు మిగుల్చుకోలేకపోవటం చిత్రమైన విషయం.
చిత్రంలో కథానాయిక గా డింపుల్ కపాడియా నటించింది. ఇరవై సంవత్సరాలక్రితం (1973లో)’బాబీ’ గా నటించి, రాజేష్ ఖన్నాను వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది.అతన్నించి విడివడి సినిమాలపై దృష్టి సారించింది.'సాగర్’ (1985) సినిమాతోఆమె పునరాగమనంపై ఒక వర్గపుప్రేక్షకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఆశలు సంగతేమోకాని ,ఒక గొప్పనటి మాత్రం తెరకు దొరికింది. ఆమె కు దొరకిన ఓ గొప్పపాత్ర ‘రుడాలి’.
రుడాలి సినిమా కళాత్మకం. శోకరసానికి కళాత్మక చిత్రరూపం. చిత్రీకరణకు, వడగాల్పు, సుడిగాలి వంటి హజారికా సంగీతం, దానికి గుల్జార్ సాహిత్యం తోడైనాయి. అవి వదలని పాటలైనాయి.
ఆశా భోన్స్లే, లతామంగేష్కర్, భూపెన్ హజారికా పాడిన మూడు వెర్షన్లు ఈ పాటకున్నాయి. ఇది ఆశా భోన్స్లే వెర్షన్.
“కాలమా! నెమ్మదిగా కదులు
దారులలో నీడలు కదిలిపోయాయి
ప్రియుని గ్రామం బహుదూరం
నెమ్మదిగా కదులు,నెమ్మదిగా కదులు
మనసును మభ్యపెట్టుకున్నాను
నువ్వు ఆశ నిరాశల ఆట ఆడావు
నాలుగునాళ్ళ బ్రతుకూ బ్రతుకేనా?
విషమనే శ్వాస ను తాగారా లేదా?
ఈ గాలి ,సమస్తాన్నిపట్టుకుపోయింది
యాత్రికుల జాడల్నీ తీసుకుపోయింది
వీచేగాలి వంటి వారిని కలిసేదెక్కడ?
ఎవరైనా చెప్పండి నా ప్రియుని జాడ”


జబ్ కోయి బాత్ బిగడ్ జాయే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-119
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే,జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
(“కాలం విషమించినపుడు,కష్టాలు చుట్టుముట్టినపుడు)
జుర్మ్ (1990) సినిమాలో కుమార్ సాను పాడిన పాట. రాజేశ్ రోషన్ సంగీతం.ఇందీవర్ రచన.
అనుకరిస్తున్నారని తెలిస్తే అభిమానించటం కష్టమే. అలాంటివారినుంది కొన్ని మంచిపాటలు వచ్చినా.
88-89ప్రాంతంలో హిందీ పాటల్లో మెలొడి తిరిగి ప్రవేశించింది. కొత్తసంగీతదర్శకులతో పాటు కొత్త ‘రఫీ’లు ,కొత్త ‘కిశోర్ కుమార్’లు కూడావచ్చారు.
అలాంటివారిలో ఒక ‘కిశోర్ కుమార్’ ‘కుమార్ సాను’. అతను కిశోర్ పాటల్ని తిరిగి పాడాడు.అవి బానే మార్కెట్ అయ్యాయి. సినిమాలలో సొంతపాటలు కిశోర్ ను అనుకరిస్తూ పాడి సక్సెస్ అయ్యాడు. అతని పాటలు వినపడితే విన్నాను కాని వెతుక్కుని వినలేదు.
అలాంటి కుమార్ సాను గురించి ఒక మిత్రునిద్వారా విన్నమాట. నా మిత్రుని మిత్రుడొకరు హిందీపాటల అభిమాని. అతను కుమార్ సాను అభిమాని. ఎంత అభిమానమంటే చనిపోయేటపుడు కుమార్ సాను పాటలు వింటూండాలనేంత.
ఇదినాకు ఊహకు రాని విషయం.లోకోభిన్నరుచి.
నావరకు ‘కుమార సాను’ పాటల్లో నచ్చిందడిగితే నేను చెప్పేది ‘జుర్మ్’ సినిమాలో ఈ పాట.
సంగీతదర్శకుడు రాజేశ్ రోషన్ తన తండ్రి ‘రోషన్’ అడుగుజాడల్లో నడిచాడు. అప్పటికి పదిహేనేళ్ళుగా మెలొడీ తో నిండిన సంగీతం అందిస్తూ కొత్త సంగీతదర్శకులపోటీని తట్టుకున్నాడు.ఇప్పటికీ తన సోదరుడు రాకేశ్ రోషన్ సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే ఉన్నాడు.
గీతరచయిత ఇందీవర్ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు.
వారికలయికలో వచ్చిన ఒక మధురగీతమిది.
“కాలం విషమించినపుడు
కష్టాలు చుట్టుముట్టినపుడు
నువ్వునాకు తోడు నివ్వు, ప్రియతమా!
లోకంలో నువ్వు మినహా
ఇంతకుముందు ,ఇప్పుడూ ఎవరూలేరు.
రాత్రి లో వెన్నెల ఉన్నంత సేపూ
ప్రతీఒక్కరూ తోడుంటారు
చిక్కని చీకటిలో,నువ్వన్నా
నాచేయి ని విడువకు.
విధేయత చూపమనే నియమాలను
పాటిస్తాను నీ తోడుగా
నా చేతిలో ఉన్న
చివరి శ్వాస వరకు
నా మనసు నమ్ముతుంది
ఇదివరకెక్కటిదో కలయిక ఇది
ఈ బంధం తరతరాలది
ఈ నాటి మాట కాదిది.”