Showing posts with label mukesh. Show all posts
Showing posts with label mukesh. Show all posts

Saturday, October 21, 2017

ఒహ్ రే తాల్ మిలే నదీకే జల్ మే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-110
‘ఒహ్ రే తాల్ మిలే నదీకే జల్ మే ,నదీ మిలే సాగర్ మే’
(“వాగుల నీరు నదిలో కలుస్తుంది,నది నీరు సాగరంలో కలుస్తుంది)
అనోఖీ రాత్ (1968) సినిమాలో ముకేశ్ పాడిన పాట. ఇందీవర్ రచన, రోషన్ సంగీతం.
‘సర్ గమ్ ‘ (1980) హిందీ సినిమాకు మాతృక తెలుగు లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’. సిరిసిరి మువ్వ సినిమాలో ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎవరు?’ పాట బదులుగా సర్ గమ్ లో ‘హమ్ తొ చలే’ పర్ దేశ్, పర్ దేశీ హోగయే ‘ పాట వస్తుంది.
రెండు పాటల్లోనూ సంగీతం, సాహిత్యం, గానం, చిత్రీకరణ గొప్పగా ఉంటాయి. తాత్వికతతో సాగే అనేక పాటల చిత్రీకరణ పడవల్లోనో, ఎద్దుల బండీలోనో, రైళ్ళలోనో, బస్సులలోనో సాగుతుంది. బహుశా జీవితానికీ ప్రయాణానికీ దగ్గర పోలిక ఉన్నట్టుంది. జీవితమ్ చలనశీలనమని చెబుతున్నారేమో.
తెలుగు పాట లిరిక్ ఇలా సాగుతుంది
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?
ఏ దారెటూ పోతుందో ఎవరినీ అడగక?
వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కాని ఆ కడలి కలిసేది ఎందులో?
ఒక హిందీ పాట ‘ఒహ్ రే తాల్ మిలే నదీ కె జల్ మే ‘ పాటవింటున్నప్పుడు పై తెలుగు పాట లిరిక్ గుర్తుకు వస్తుంది. దగ్గరగా గమనిస్తే హిందీ పాట ప్రభావం తోనే తెలుగు పాట రాసారని నమ్మకంగా అనిపిస్తుంది. ఐతే హిందీ పాట తర్వాత చరణాలలో మరింత లోతుగా ఉంటుంది.
హిందీ పాట అనువాదం:
“వాగుల నీరు నదిలో కలుస్తుంది
నది నీరు సాగరంలో కలుస్తుంది
సాగరం ఎందులో కలిస్తుందో
ఎవరికి ఎరుక?
సూర్యునికోసం ధరణి , ధరణి కోసం చంద్రుడు తపిస్తాయి.
నీటిలో ముత్యపుచిప్పలా ప్రతీ ఆత్మా దాహంతోనే ఉంటుంది
ఒ జతగాడా!
నీటిచుక్క ఏ మబ్బులోలో దాగిందో
ఎవరికి ఎరుక?
పరిచయంలేని పెదవులపై పరిచయమున్న పాటలు
నిన్నటివరకూ పరాయివారు,నేడు జన్మ జన్మల మిత్రులు
ఏ క్షణంలో ఏమౌతుందో
ఎవరికి ఎరుక?”

Friday, June 30, 2017

మై పల్ దో పల్ కా శాయర్ హు

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -100
1.మై పల్ దో పల్ కా శాయర్ హు, 2.మై హర్ ఎక్ పల్ కా శాయర్ హు
( నేను ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని) ( నేనుప్రతిక్షణం నిలిచిఉండే కవిని)
కభీ కబీ సినిమాలో ముకేశ్ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, ఖయ్యామ్ సంగీతం.
ప్యాసా ,కభీ కభీ , రెండు సినిమాలూ సినీ ప్రేమికుల్ని, సినీ సంగీత ప్రేమికుల్నీ అలరించాయి. రెంటికీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ కథానాయకులు కవులు. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ విఫలమయ్యింది. ఇద్దరి జీవితాలలోనూ తర్వాతి రోజుల్లో పాత ప్రేమికలు తారసపడ్డారు. ఐతే తర్వాత వారు సాగిన దారులు వేరు.
రెండు సినిమాలకు సాహిత్యం ‘సాహిర్ లూధియాన్వి’దే.నిజజీవితలో భగ్న మనస్కుడైన ‘సాహిర్ లూధియాన్వి’ కొన్ని పాటల్లో తాను నిజంగానే ప్రవేశిస్తాడు. కథానాయకుడు కూడా తనవంటి కవి ఐనప్పుడు ,పాత్ర మనసిక స్థితిలో కూడా సామాన్యత ఉన్నపుడు ‘సాహిర్ ‘ తనే ఆ పాత్ర ఐపోయాడు. ‘సాహిర్’ అలా పాత్రగా మారి సాహిత్యం అందించిన ఈ రెండు సినిమాలూ రెండు కళాఖండాలు గా నిలిచిపోయాయి.
‘ప్యాసా’ విషాదాంతం అనలేము ,అలాగే ప్రమోదాంతం అనలేము. చివర్లో కథానాయకుడు తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు.
కభీ కభీ లో కథానాయకుడు ప్రేమను పొందలేని చోట ఆగిపోలేదు. అతనిది మరీ ప్రత్యేక ప్రపంచం కాదు. సమాజంతో మరీ ఫిర్యాదు లేదు.వేరే జీవితాన్ని నిర్మించుకున్నాడు. తండ్రి వ్యాపారాన్ని తను చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు.
తన తొలినాళ్ళలో జీవితం పట్ల అతని ఆలోచనల్ని అతను గానంచేసాడు. తన జీవితం తనది మాత్రమే అనుకున్నాడు. తనతో పాటు అది అంతమౌతుందనుకున్నాడు. తనున్న రెండు క్షణాల జీవితం ఎవరికీ పట్టనిదనుకున్నాడు. తనని ‘రిప్లేస్’చేసేవారితో తనకేమీ సంబంధం లేదనుకున్నాడు.
అప్పటి రోజుల్లో అతని గానం:
“రేపు కొత్త మొగ్గలు తొడుగుతాయి.రేపు కొత్త పువ్వులు నవ్వుతాయి
కొత్తనేలమీద,కొత్త పచ్చికపై కొత్త పాదాలు నడయాడుతాయి
అవి నన్ను పట్టించుకోవు.నేనూ వాటిని పట్టించుకోను
వాటి ఉదయ సాయంత్రాలలో ఒక లిప్త కాలమైనా నాదిగా ఎలా చేసుకోగలను?
నేనూ ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని
ఒకటి రెండు క్షణాల సంతోషం నాది,ఒకటి రెండుక్షణాలు ఉండే యవ్వనం నాది
నాకంటే ముందు ఎంతమంది కవులు రాలేదు ? వచ్చి వెళ్లిపోలేదు
కొందరు నిట్టూర్పులు విడిచి వెళ్ళారు కొందరు పాటలు పాడి వెళ్ళారు
వారూ ఒక్క క్షణపు కథలే, నాదీ ఒక్క క్షణపు కథే
ఇప్పుడు మీలో భాగాన్నినేను ,రేపు మీనుండి దూరమౌతాను.
రేపు వికసించే పాటల మొగ్గల్ని ఏరుకునేవారు మరొకరు వస్తారు
నాకంటే ఉన్నతంగాగా చెప్పేవారు, మీకంటే ఉన్నతంగా వినేవారు
రేపెవరో నన్ను గుర్తుచేసుకుంటారు. ఐనా ఎందుకు గుర్తుచేసుకోవాలి?
తీరికలేని ప్రపంచం నాకోసం తన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటుంది?”
సినిమా చివరిలో ఒకతరంలోని వ్యక్తులు తమ తర్వాతతరం వారిలో తమని తాము చూసుకుంటున్నారు. అపుడు
వినిపించే పాట మొదటి పాట వరుసలోనే మరొక అర్ధంతో వినపడుతుంది.
జీవితమంటే ఒకరి జీవితం కాదు. అది రూపాలు మార్ర్చుకుంటూ వేరే వారిని వాహిక చేసుకుని కొనసాగుతుంటుంది అని చెప్పే పాట అది. జీవితానికున్న ‘కొనసాగింపు’ ను తన జీవితానుభవాలద్వారా కథానాయకుడు గమనించగాడని అనిపిస్తుంది.
“ ప్రతిక్షణం నిలిచిఉండే కవిని నేను
కలకాలం నిలిచి ఉండే కథ నాది
ఎల్లవేళలా ఉండే సంతోషం నాది
అనుక్షణం ఉండే యవ్వనం నాది
అనుబంధాల రూపం మారుతూ ఉంటుంది
బంధాల పునాదులు నాశనం కావు
స్వప్నాలు, ఆకాంక్షలు నాశనం కావు.
ఒక పువ్వులో నీ రూపం నిలుస్తుంది
ఒక పువ్వులో నా యవ్వనం ఉంటుంది
ఒక ముఖం లో నీ గుర్తులుఉంటుంది
ఒక ముఖంలో నా గుర్తులుంటాయి
నువ్వు నేను జీవన అమృతాన్ని
ఈ చేతులతో తాగాలి
వీరి గుండె చప్పుడులో నివాసముండాలి
వీరి శ్వాస లో జీవించాలి
నీ సోయగాల్ని ఒకరికివ్వు
నేను నా నమ్మకాన్ని ఒకరికిస్తాను
ని కోసమే చేసిన ఆలోచనలు
అన్నింటినీ దీవెనలు చేస్తాను.”



Friday, May 5, 2017

జానే కహా వో దిన్

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-76’

“జానే కహా వో దిన్ “(ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?)
మేరా నామ్ జోకర్ లో పాట ,గానం ముఖేష్, సంగీతం శంకర్ జైకిషన్, సాహిత్యం హస్రత్ జైపురి

‘మేరా నామ్ జోకర్’   సినిమా ఫలితం  రాజ్ కపూర్ కు నిరాశ కలిగించిందంటారు. ఐతే రోజులు గడిచాక సినిమా ఒక క్లాసిక్ గా మారింది.
రిపీట్ రన్ లో సినిమా చూసాను. . పేజీ లోపు ఉన్న ‘జాన్ కీట్స్’  కవిత  ‘హ్యూమన్ సీజన్స్ ‘ కు మూడు గంటల చిత్రరూపమనిపించింది. వ్యక్తి పూర్తి జీవితాన్ని అంటే బాల్యం నుంది వృద్దాప్యం వరకూ చూపే సాంఘిక చిత్రాలు అరుదు. ఈ సినిమా లో అది చూస్తాము.

కథానాయకుని జీవితంలో వివిధ దశల్లో అనుభవాలు (బాల్యంలో,యవ్వనంలో, మాన్ హుడ్(?) లో), ఆ దశల్లో ఎదురైన స్త్రీలు, వారితో ఏర్పడ్డ/ తెగిన బంధాలు, చివరిలో ఆ అనుభవాల నెమరువేత ,ఆంతరంగికశోధన ..వీటిని చెబుతూ కథానాయకునిఅనుభవాలతో ప్రేక్షకుల సహానుభూతుల్ని చేస్తుందీ సినిమా.

బాల్యంలో అతను తన తండ్రి లానే జోకర్ కావాలనుకుంటాడు. జీవిత భాగస్వామి జోకర్ జీవితాన్నిచూసి ఉన్న అతని తల్లి అదివద్దని వారించింది. తల్లి  అనుభవం అతనికి అక్కరకు రాలేదు.సర్కస్ లో జోకర్ గా అతని చేష్టలు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటే, అతనికి జరగబోయే ఆపదల్ని తలుచుకుని తల్లి తల్లడిల్లుతుంది. తల్లి మరణం కారణంగా  అతను  కార్చే కన్నీరు కూడా ప్రేక్షకుల్ని ఆనందపరుస్తుంది.

బాల్యంలో తననభిమానించే టిచర్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆమెకు దూరమై బాధపడ్డాడు. యువకుడైనాక ఒక యువతి కి సాయపడి ఆమెకు దగ్గరయ్యాననుకున్నాడు. ఆమె తారగా ఎదిగి దూరమయ్యింది. మరోదశలో సర్కస్ లో జోకర్ గా ఉన్నపుడు, ఓ రష్యన్ యువతి ఇతనిపట్ల ఇష్టాన్ని చూపింది. ఆ కథా సఫలంకాలేదు.

జీవితపు మలి సంధ్యలో సర్కస్ లో అతని పెర్ఫార్మెన్స్ చూడటానికి వీరంతా వచ్చారు.ఆ సందర్భం లో ఈ పాట .చూస్తున్న వారికి  గతం కళ్ళముందు కదలాడింది. వారి మనసూ కదులుతుంది.

“ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?
చెబుతుండేవారు
నా దారిలో చూపులు పరచి వుంచుతామని

నువ్వు ఎక్కడ ఉన్నా
నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే వుంటాను
నున్ను మరువలేను

నా పాద ముద్రలు పడిన చోటల్లా
నా మిత్రులు వంగి ఆ నేలను ముద్దాడేవారు.
వెళ్లిపోయే వసంతం
నన్ను ఎంతగానో రోదింపజేస్తుంది

నిన్నాఈరోజూ ,నా కళ్ళకు
పగళ్ళు కూడా చీకటి రాత్రులే
నా నీడ మాత్రమే నా సహచరి”

మరో పాట ‘జీనా యహా మర్నా యహా ‘ కు కొనసాగింపు పై పాట తర్వాత వస్తుంది.

రేపటి ఆటలో నేనున్నా లేకున్నా
ఆకాశంలో తారలు ఎప్పటికీ ఉంటాయి
నువ్వు మరుస్తావు..వారు మరుస్తారు
కాని నేను ఎప్పటికీ మీవాడినే
నా గుర్తులు ఇక్కడ ఉంటాయి
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?


నువ్వు కోరినపుడు నన్ను పిలువు
నేనిదివరకెక్కడున్నానో ఇప్పుడూ అక్కడే ఉన్నాను
నా రెండు లోకాలు ఇక్కడే.
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?

-ముళ్ళపూడి సుబ్బారావు


Saturday, April 22, 2017

కహీ దూర్ జబ్ దిన్ ధల్ జాయే, సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే


‘కహీ దూర్ జబ్ దిన్ ధల్ జాయే, సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే’

(ఎంతో దూరం ప్రయాణించాక పగటిని సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది)

ఆనంద్(1971) సినిమాలో ముకేశ్ పాడిన పాట. సలీల్ చౌధురి సంగీతం,యోగేష్ రచన

డాక్టర్ భాస్కర్ తన వృత్తిలో ఎదురయ్యే ద్వంద్వ ప్రమాణాలపట్ల అసహనంతో వున్నాడు.అతను అంతర్ముఖుడు.జీవితానికి అవసరమైన లౌక్యం కూడా అతనిలో లోపించింది. తక్కువ మాట్లాడే అతని జీవితంలోకి సదా మాటాడుతూనే ఉండే ఒక వ్యక్తి తుఫానులా ప్రవేశించాడు.ఆ వ్యక్తి పేరు ఆనంద్.

అతను ఆనందానికి మానవరూపం.సంతోషం పంచటం అతని నైజం. ఇతరుల ఆనందం కోసం ఏదైనా చేసేస్తాడు.
అతని జీవనవ్యవధి 6 నెలలే. అంతవరకూ అతను డాక్టర్ల పర్యవేక్షనలో ఆసుపత్రిలో గడపాలి.ఐతే అతను మిగిలిన జీవితం భాస్కర్ ఇంటిలో గడపాలిచాడు.

గలగల మాట్లాడుతూ జలపాతంలా హోరు చేస్తూ పరిసరాల్ని, చుట్టూ ఉన్న మనుషులమధ్య దూరాలు తగ్గిస్తూ కాలం గడుపుతున్న ఆ ఆనంద్ మనసులో నిజంగా ఏముంది?

అతను పైకి కనపడే మనిసషేనా ? లేక లోన మరొకరున్నారా?

ఇది డాక్టర్ భాస్కర్ అన్వేషణ.నిజమైన ఆనంద్ ఒక్కసారి డాక్టర్ భాస్కర్ కు అనుకోకుండా ఎదురుపడ్డాడు. ద్వంద్వాన్ని భరించలేని డాక్టరు.ద్వంద్వాన్ని అబినయిస్తూ పేషెంటు.వారిద్దరి మధ్యా ఏర్పడ్డ అనుబంధం.

ఇది ‘ఆనంద్’ సినిమా కథ.

ఈ సినిమా చూసాక మరవటం కష్టం. అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, అప్పటికి భావి సూపర్ స్టార్ అమితాబ్ ..వీళ్లిద్దరూ కాదు ,ఆనంద్, భాస్కర్ లు మాత్రమే మనతో ఉంటారు.

సినిమాలో మరువలేని ఒక సంభాషణ “ఖుషీ తొ తుమ్ సబ్ కె సాత్ భాంట్ తే హై .ఆజ్ మేరె సాత్ థోడాసా గమ్ భీ భాంట్ లో “..”నై నై నై..ఏ చీజ్ మై కిసీసే భాంట్ నే వాలా” (డాక్టర్: ఆనందాన్ని నువ్వు అందరికీ పంచుతావు.ఈ రోజు నాతో కొద్దిగా నీ బాధను పంచుకో.    ఆనంద్: లేదు లేదు. దీనిని నేనెవరితోనూ పంచుకునేది లేదు)

కొద్ది సేపు మాత్రమే కనిపించే ‘లోపలి’ ఆనంద్ ఈ పాట పాడుతాడు. అతనిపై మూడు పాటలు సినిమాలో చిత్రీకరించినా అతని పాత్రను పూర్తిగా ఆవిష్కరించేది ఈ పాటే.

ఆ సన్నివేశంలో వచ్చేదే ఈ పాట.

ఎంతో దూరం ప్రయాణించాక పగటిని
సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది
నా తలపుల వాకిటిలో
ఎవరో కలల దీపాలు వెలిగిస్తారు

ఎప్పుడైనా నా శ్వాస బరువైనప్పుడు
ఎప్పుడైనా నా కళ్ళు  నిండివున్నప్పుడు
ఆటపట్టిస్తున్నట్టు, ప్రేమతో కదలాడుతూ
ఎవరో నన్ను స్పృశిస్తారు..కాని కంటికి కనపడరు

కొన్నిసార్లు ఈ హృదయాలు కలవలేకపోతుంటాయి
కొన్నిచోట్ల ఎపుడో,జీవితకాల బంధాలు ఏర్పడతాయి
చిక్కులు ఎంతో చిక్కనివి....నా మనసే నా విరోధి
నాది ఐనప్పటికీ ,వేరే వారి బాధను సహిస్తుంది.


నా మనసుకి నా లోలోపలి రహస్యాలన్నీ తెలుసు
నా పసిడి కలలు ఎలా ఛిద్రమయ్యిందీ తెలుసు
నా ఈ స్వప్నాలు .. ఇవి మాత్రమే నావి
వీటి నీడలు కూడా నానుండి దూరం కావు.

-ముళ్ళపూడి సుబ్బారావు


Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-26
“పానీరే పానీ తేరా రంగ్ కైసా?జిసమే మిలాదో లగె ఉస్ జైసా” 19 January

(“నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?దేనిలో కలుస్తావో అదే నీ రంగు.)
...
వాన మొదలయ్యింది.యవ్వనంలోఉన్న పడతి పైపడ్డ చినుకు కోర్కెలు రేపింది .కప్పుకు చిల్లులున్న ఇల్లుగలాయనకు భయం కలిగించింది.ఆరుబయల్లో పడుకున్న పిల్లాడికి చలికలిగించింది.జరుగుబాటు ఉన్న కుటుంబానికి వినోదంకలిగించింది. హోటల్లో పెనంపై పడ్డ చినుకులు ఆవిరయ్యాయి.కార్మికుల కోర్కెల సాధనకు దీక్షలో ఉన్న వ్యక్తి కి ప్రశ్నలు రేకెత్తించింది.గ్లాసుల్లో ఉన్న రంగుల పానీయాల్తో కలిసి అదే రంగు తనదిగా చేసుకుంది.పిల్లవాడు వదిలిన కాగితపు పడవను ముంచేసింది.అక్కడ ఉన్న ప్రతీ వ్యక్తికి విభిన్నమైన అనుభూతులు కలగజేసింది.
దేశభక్తి ని ప్రేరేపించే సినిమాలు తీసి మిస్టర్ భరత్ గా పిలవబడే మనోజ్ కుమార్ 'షోర్ ' సినిమా తీసాడు. కుటుంబసభ్యులు, ప్రత్యేకంగా తండ్రీకొడుకులమధ్య సెంటిమెంటుతో సాగే సినిమా అది. ఆ సినిమాలోనూ సోషలిస్ట్ ధోరణిలో సాగే ఒక పాట ఉంచాడు. ఐతే ఆపాటలోనూ తన సౌందర్య(?)దృష్టి వదులుకోలేదు.
ఆ పాట (సంతోష్ ఆనంద్ రచన,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం,ముకేష్ ,లతామంగేష్కర్ గానం.)
“నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?
దేనిలో కలుస్తావో అదే నీ రంగు.
ఈ లోకంలో ఉండే కొందరు ఇలాకూడా బ్రతుకుతారు.
ఎండిన రొట్టె తిని చల్లని నీరు తాగుతారు
ఓ గుక్కెడు నీరు తాగితే స్వర్గసమానమైన సుఖం దొరుకుతుంది
నీరూ..ఓ నీరూ నీ రంగు ఎలాఉంటుంది?
కడుపు మాడిన వాని ఆకలిదప్పిక లా ఉంటుంది
నీరూ ..ఓ నీరూ..
గంగతో కలిసినపుడు గంగాజలమై పవిత్రమౌతావు.
మేఘంతో కలిసినపుడు చిటపట కురిసే వానవౌతావు
వర్ష రుతువు వచ్చింది..
వర్షరుతువొచ్చింది..చిటపట చినుకులు రాలుతున్నాయి
అగ్గిసెగ తగిలిన మంచులాకరిగింది నా వయసు..
ఎటుచూసినా ఇంటికప్పునుండి నీరుకారుతూనే వుంది ..జీవించడం కష్టమౌతుంది
నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?
లోకాన్ని సృష్టించిన భగవంతునిలా ఉంటుంది.
నీరూ..ఓ నీరూ..
నువ్వు ఏరంగుతో కలిసినప్పటికీ నీ మెరుపు తెలుస్తూనే ఉంటుంది
ఆశలపై నీళ్ళు చల్లినప్పుడు మాత్రం నీరంగేదో అంతుపట్టదు.
మొగ్గ విచ్చినప్పుడే ఆకురాలుకాలపు సందేశం వచ్చినట్టుంది
నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?
నూరేళ్ళు బతకాలనే ఆశ లా ఉంటుంది”
ఈ పాటలో ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు మనసును తడతాయి.
“భూఖె కి భూఖ్ ఔర్ ప్యాస్ జైసా”
“దునియా బనానే వాలే రబ్ జైసా”
“జబ్ తు ఫిరె ఉమ్మీదో పర్ తెరా రంగ్ సమఝ్ న ఆయే”
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-16:‘చల్ అకేలా చల్ అకేలా’  30 December 2016

'దూరాకాశ వీధుల్లో తారాదీపాలు ‘ అనేపాట రేడియోలోబాగావినపడేది.సినిమా పేరు 'మాయావి '. అలాగే'ఓ బంగరు రంగుల చిలకా'అనే తోట రాముడు లో పాటకూడా. ఆ పాటలు తప్ప సినిమాలకు ఏరకమైన గుర్తింపులేదు. అలా పాట ద్వారామాత్రమే గుర్తున్నఒక హిందీ సినిమా' సంబంధ్ '.
అకేలా అనే పదంతో మొదలయ్యే హిందీ సినిమా పాటలు కొన్ని డజన్లైనా ఉంటాయి. అందులో ఒకటి సంబంధ్ సినిమాలో 'చల్ అకేలా చల్ అకేలా'.
“ఒంటరిగానే నడువు. ...
నీ బంధుగణం నీ వెనకే ఆగిపోయింది. యాత్రీకుడా..ఒంటరిగానే నడువు

వేల మైళ్ళరహదారులు నిన్ను పిలుస్తున్నాయి
అక్కడి దుఃఖాన్నిచవిచూడమని పిలుస్తున్నాయి.
లోకంలో ఏమనిషైనా ఇక్కడి దుఃఖంతో జ్వలించకుండా ఉన్నాడా?
ఎవరూ తోడురాకున్నా నీకు నువ్వే తోడువవ్వు
భూమిని నీ పడక గా మార్చుకో ఆకాశాన్ని నీ దుప్పటి చేసుకో..
ఇంకా జీవనఖేలను నువ్వు పూర్తిగా ఆడిందెక్కడ?”
ఈ పాటలో నాకు బాగాపట్టిన అంశం..ఇందులోనికోరస్. పాట గుర్తొస్తే కోరస్ మనసులో మెదులుతుంది. ముకేశ్ మరుపురానిపాటల్లో ఇదొకటి. ఓ.పి.నయ్యర్ సంగీతం ప్రత్యేకంగా చరణాలమధ్య వచ్చే సంగీతం గొప్పగా ఉంటుంది.
ఒకింత సీరియస్ గా హీరో,జీపు ప్రయాణం,మెలితిరిగిన రహదారులు,లాండ్ స్కేపుల్ని చూపే ఫొటొగ్రఫీ,మధ్యలో క్లోజ్ అప్ లో కనిపించే పిల్లలూ , డార్జీలింగ్ పరిసరాలు,టాయ్ ట్రెయిన్ (జబ్ ప్యార్ కిసిసే హొతా హై,ఆరాధన పాటలు గుర్తున్నాయా?)...వీటితో పాటచిత్రీకరణ ఆకర్షణీయం. దిగంతాలను పలకరించేట్టు ముకేశ్ స్వరం,దానితో సాగే కోరస్,లాంగ్ షాట్ దృశ్యాలూ..పాట వినటం,చూడటం రెండూ మంచి అనుభూతి.
అకేలా అంటు సాగే రెండుపాటలు .. ‘చల్ అకేలా చల్ అకేలా’ ,‘ఫకీరా చల్ చలా చల్ ‘ పైన రవీంద్రుని ప్రసిద్ధగీతం ‘ఏక్లా చలొ ‘ ప్రభావం ఉనంట్టు అనిపిస్తుంది.
రవీంద్రుని గీతం లో తొలి చరణం అర్థం “నువ్వు పిలిచినప్పుడు బదులు పలికేవారు లేనప్పుడూ..ఒంటరిగనే నడువు” పై రెండు పాటలూ ఈ తొలిచరణాన్ని మాత్రమే ఊతంగా తీసుకున్నాయి. ఎంచేతనొ తర్వాతి చరణాలు సినిమా పాటల్లొ కి రాలేదు.
ఆ చరణాలు..
“ఎవరూ నీ తో మాట్లడనప్పుడు,మొహంతిప్పుకున్నపుడు కూడా నీ మాట నువ్వు చెబుతూనే ఉండు..గుండె ను దిటవు చేసుకో,మనసును బయటపెట్టు,నువ్వు చెప్పేది చెబుతూనే ఉండు”.
“నల్లమబ్బులు కమ్మినప్పుడు,నిజంచుట్టూ చీకటిముసిరినప్పుడు,లోకం మొత్తం భయం ముందు తలవంచి వున్నపుడు.. ఒక జ్వాలగా మారు.నువ్వు జ్వలిస్తూ లోకంలో చీకటి పారదోలు. ఒంటరిగానే జ్వలించు.

 --ముళ్ళపూడి సుబ్బారావు