Showing posts with label rajesh khanna. Show all posts
Showing posts with label rajesh khanna. Show all posts

Saturday, October 21, 2017

కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-108
కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!
( కొన్ని సార్లు అసహాయత చంపుతుంది,కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది)
అలగ్ -అలగ్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. ఆనంద్ బక్షి రచన,ఆర్ డి బర్మ సంగీతం
ఎనభైలో ‘రఫీ’ మరణంతో హిందీ సినిమా సంగీతం ఏకధృవ ప్రపంచమైపోయిందనుకున్నారు. ఆ ధృవం కిశోర్ కుమార్. ఐతే ఎనభై తరువాత వచ్చిన కిశోర్ కుమార్ పాటల్లో అతని స్థాయిని పెంచినవి బహు తక్కువ, నిలబెట్టినవీ కొద్దిగానే. అనూహ్యంగా అతనితో ఏమాత్రం సరితూగని గాయకులతో అతను పోటీపడాల్సి వచ్చింది. కిశోర్ కుమార్ ను డెబ్భైలలో ఆకాశంలో నిలిపిన ఆర్ డి. బర్మన్ సైతం ఎనభైలలో కిశోర్ తో కాకుండా షబ్బీర్ కుమార్ వంటి కొత్త గాయకులతో పాటలు పాడించాడు. షబ్బీర్ కుమార్ ‘మహమ్మద్ రఫీ’ ని అనుకరించే గాయకుడు (క్లోన్) కావటం ఒక వైచిత్రి.
నటుడు రాజేశ్ ఖన్నా కిశోర్ కుమార్, ఆర్ డి.బర్మన్ బృందం ఎన్నో విజయాలను చవిచూసింది. వారి కాంబినేషన్ ను కూర్చిన దర్శకుడు శక్తి సామంతా. (1969లో)
పదహారేళ్ళతర్వాత (1985 లో) రాజేశ్ ఖన్నా నిర్మాతగా మారి పై కాంబినేషన్ ను మరోసారి ప్రయత్నించాడు. ఆ సినిమా ‘అలగ్ -అలగ్’. ఫలితం మాత్రం మరో ‘ఆరాధన’ గా రాలేదు. ఐతే కిశోర్ కుమార్ ద్వారా ఒక ఉత్తమ గీతాన్ని అందుకోగలిగాం.
“ఇది గజల్ కాదు గీతమూ కాదు
ఇది నా బాధల గాధ
నా గుండెలో కేవలం అగ్ని ఉంది
నా కళ్ళలో కేవలం నీరు ఉంది
కొన్ని సార్లు అసహాయత చంపుతుంది
కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
విధి ని అనేందుకు లేదు
మారనిదల్లా కాలమే
అప్పుడప్పుడూ దురదృష్టం
కొన్నిసార్లు నా లేనితనం
వేటి పేర్లు చెప్పను?
నన్ను అన్నీ చంపాయి.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
నరక ప్రాయపు,అపనమ్మకపు లోకమిది
ఇదే లోకమైతే ఇదేమిలోకం?
స్నేహితులకు కొదవలేదు
శత్రువులకు కొరత లేదు
కొన్నిసార్లు శత్రుత్వం దోచింది
కొన్నిసార్లు స్నేహం చంపింది.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
వెలుతురు పట్ల విముఖత వచ్చింది
చీకటి అలవాటైపోయింది
చీకటి ఉన్నంత వరకూ
కాలం బాగానే గడచింది
నన్ను వెన్నెల దోచింది
వెలుతురు నన్ను చంపింది"

Saturday, April 22, 2017

కహీ దూర్ జబ్ దిన్ ధల్ జాయే, సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే


‘కహీ దూర్ జబ్ దిన్ ధల్ జాయే, సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే’

(ఎంతో దూరం ప్రయాణించాక పగటిని సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది)

ఆనంద్(1971) సినిమాలో ముకేశ్ పాడిన పాట. సలీల్ చౌధురి సంగీతం,యోగేష్ రచన

డాక్టర్ భాస్కర్ తన వృత్తిలో ఎదురయ్యే ద్వంద్వ ప్రమాణాలపట్ల అసహనంతో వున్నాడు.అతను అంతర్ముఖుడు.జీవితానికి అవసరమైన లౌక్యం కూడా అతనిలో లోపించింది. తక్కువ మాట్లాడే అతని జీవితంలోకి సదా మాటాడుతూనే ఉండే ఒక వ్యక్తి తుఫానులా ప్రవేశించాడు.ఆ వ్యక్తి పేరు ఆనంద్.

అతను ఆనందానికి మానవరూపం.సంతోషం పంచటం అతని నైజం. ఇతరుల ఆనందం కోసం ఏదైనా చేసేస్తాడు.
అతని జీవనవ్యవధి 6 నెలలే. అంతవరకూ అతను డాక్టర్ల పర్యవేక్షనలో ఆసుపత్రిలో గడపాలి.ఐతే అతను మిగిలిన జీవితం భాస్కర్ ఇంటిలో గడపాలిచాడు.

గలగల మాట్లాడుతూ జలపాతంలా హోరు చేస్తూ పరిసరాల్ని, చుట్టూ ఉన్న మనుషులమధ్య దూరాలు తగ్గిస్తూ కాలం గడుపుతున్న ఆ ఆనంద్ మనసులో నిజంగా ఏముంది?

అతను పైకి కనపడే మనిసషేనా ? లేక లోన మరొకరున్నారా?

ఇది డాక్టర్ భాస్కర్ అన్వేషణ.నిజమైన ఆనంద్ ఒక్కసారి డాక్టర్ భాస్కర్ కు అనుకోకుండా ఎదురుపడ్డాడు. ద్వంద్వాన్ని భరించలేని డాక్టరు.ద్వంద్వాన్ని అబినయిస్తూ పేషెంటు.వారిద్దరి మధ్యా ఏర్పడ్డ అనుబంధం.

ఇది ‘ఆనంద్’ సినిమా కథ.

ఈ సినిమా చూసాక మరవటం కష్టం. అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, అప్పటికి భావి సూపర్ స్టార్ అమితాబ్ ..వీళ్లిద్దరూ కాదు ,ఆనంద్, భాస్కర్ లు మాత్రమే మనతో ఉంటారు.

సినిమాలో మరువలేని ఒక సంభాషణ “ఖుషీ తొ తుమ్ సబ్ కె సాత్ భాంట్ తే హై .ఆజ్ మేరె సాత్ థోడాసా గమ్ భీ భాంట్ లో “..”నై నై నై..ఏ చీజ్ మై కిసీసే భాంట్ నే వాలా” (డాక్టర్: ఆనందాన్ని నువ్వు అందరికీ పంచుతావు.ఈ రోజు నాతో కొద్దిగా నీ బాధను పంచుకో.    ఆనంద్: లేదు లేదు. దీనిని నేనెవరితోనూ పంచుకునేది లేదు)

కొద్ది సేపు మాత్రమే కనిపించే ‘లోపలి’ ఆనంద్ ఈ పాట పాడుతాడు. అతనిపై మూడు పాటలు సినిమాలో చిత్రీకరించినా అతని పాత్రను పూర్తిగా ఆవిష్కరించేది ఈ పాటే.

ఆ సన్నివేశంలో వచ్చేదే ఈ పాట.

ఎంతో దూరం ప్రయాణించాక పగటిని
సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది
నా తలపుల వాకిటిలో
ఎవరో కలల దీపాలు వెలిగిస్తారు

ఎప్పుడైనా నా శ్వాస బరువైనప్పుడు
ఎప్పుడైనా నా కళ్ళు  నిండివున్నప్పుడు
ఆటపట్టిస్తున్నట్టు, ప్రేమతో కదలాడుతూ
ఎవరో నన్ను స్పృశిస్తారు..కాని కంటికి కనపడరు

కొన్నిసార్లు ఈ హృదయాలు కలవలేకపోతుంటాయి
కొన్నిచోట్ల ఎపుడో,జీవితకాల బంధాలు ఏర్పడతాయి
చిక్కులు ఎంతో చిక్కనివి....నా మనసే నా విరోధి
నాది ఐనప్పటికీ ,వేరే వారి బాధను సహిస్తుంది.


నా మనసుకి నా లోలోపలి రహస్యాలన్నీ తెలుసు
నా పసిడి కలలు ఎలా ఛిద్రమయ్యిందీ తెలుసు
నా ఈ స్వప్నాలు .. ఇవి మాత్రమే నావి
వీటి నీడలు కూడా నానుండి దూరం కావు.

-ముళ్ళపూడి సుబ్బారావు