Showing posts with label parveen sultaana. Show all posts
Showing posts with label parveen sultaana. Show all posts

Sunday, May 7, 2017

పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-77
“పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే”
(నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను)
‘దో బూంద్ పానీ’ సినిమాలో పర్వీన్ సుల్తానా ,మినూ పురుషోత్తమ్ పాడిన పాట.

రచయిత గా కె.ఎ. అబ్బాస్ , రాజ్ కపూర్ తో చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. ఐతే కె.ఎ. అబ్బాస్ స్వంయంగా దర్శకుడు. అలా డజన్ పైగా సినిమాలు తీసాడుకానీ ఏవీ కమర్శియల్ గా సక్సెస్ కాలేదు. ఐతే వాటిలో ప్రతి సినిమా విలువైనదే.  వాటిలో ఒక సినిమా ‘దో బూంద్ పాని’. సాధారణ సినీ ప్రేక్షకులకు పేరు పరిచయం కూడా అనుమానమే. 80 లలో దూరదర్శన్ లో ప్రదర్శితమయ్యింది.
రాజస్థాన్ ఎడారి ప్రాంతాల నీటికొరతసమస్యను రియలిస్టిక్ గా చూపిన సినిమా.

ఈ పాట కు రచయిత ‘కైఫి ఆజ్మి’.‘జయదేవ్’ సంగీత దర్శకుడు. వీరిద్దరు ఇంచుమించు  అదేకాలం లో , రాజస్థానీ ఎడారుల నేపధ్యంతో ‘రేష్మా ఔర్ షేరా’ సినిమాకు పనిచేశారు.

జయదేవ్ తక్కువ సినిమాలకుపనిచేసాడు. ఎక్కువ గుర్తుండే పాటలు ఇచ్చాడు. జానపద తరహాలో సాగే  పాటవరస ,సాంప్రదాయ సంగీత వాద్యాలు ఈ పాటను ఒక్కసారి వింటే మరచిపోలేనట్టు చేసాయి.
గాయని పర్వీన్ సుల్తానా పాడిన బహుకొద్ది సినిమాపాటల్లో ఇది ఒకటి.

అపజయం తనతో పాటు తనతో ఉన్న అనేక మంచి విషయాలనూ చీకట్లోకి తీసుకుపోతుంది. చిత్ర అపజయంతో ఈ పాటా మరుగున పడిపోయింది.

నీటికోసం కొందరు యువతులు కడవలు పట్టుకుని పోతున్నారు. వారిలో ఒకరి దగ్గరే ఇత్తడి బిందె వుంది. పోయేటప్పుడు శ్రమను మరిచేంత ఆనందంలో ఉండి ఉత్సాహవంతమైన పాట పాడుకుంటున్నారు.

“నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను(??)
కాళ్ళకు గజ్జలు కట్టుకుని , నీళ్ళు నింపుకోవటానికి వచ్చాను

మువ్వలు చప్పుడుతో నడక మారింది..యవ్వనపు నడక మారింది
చెంగు అటు ఇటు జారుతుంటే ..చూడు సిగ్గులేనివాడు
ఊరిలో నింద పడాలి ..
చెంగు చెప్పేదానికి  నువ్వే సాక్ష్యం

బిందె నీటిలో మునుగుతుందంటే   గుండె చప్పుడౌతుంది
నా ముఖం కొత్తగా కనపడుతుంది
నీళ్ళలో చూసుకుంటుంటే
బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి ..
ఈ మంట రేపిందెవరు?”

ఒకామె బావిలోకి తాడు వేస్తూనే వుంది.బొక్కెన నీటికి తగులుతుందని చూస్తున్న వారికి బొక్కెన రాతికి తగిలిన చప్పుడు వినిపించింది.వారి నీటి ఆశ నీటి పాలయ్యింది. నిరాశ తో వెనుతిరిగారు. వెళ్ళేటప్పటి ఉత్సాహం ఆవిరయ్యింది.పాట సాగుతుంది.

“అలాంటి రోజులుండేవి..వూరిలో నీరుండేది.
చుక్కల నీడలో బిందెనిండా నీరు తెచ్చేవారం.
ఇప్పుడు ఎక్కడనుండి నీరు తేవాలి? దాహం ఎలా తీర్చాలి?
ఎండలో మాడిపోతూ ?????”
 -ముళ్ళపూడి సుబ్బారావు.


Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-25
'హమె తుమ్సె ప్యార్ కిత్నా'17 January

 (నిన్నెంత నేను ప్రేమిస్తున్నానో నాకు తెలీదు )
...
'నిజం సమాధి కాదు ' అనేదానికి , 'స్కెలిటన్ ఇన్ ది కప్ బోర్డ్' అనే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ కు చిత్రరూపం 'కుద్రత్ ' సినిమా.రాజేష్ ఖన్నా,హేమమాలిని,వినోద్ ఖన్నా,రాజ్ కుమార్ వంటి పెద్ద తారాసందోహం,విడుదలకు రెండేళ్ళ ముందునుండే ప్రచారకర్తల్లా పనిచేస్తున్న సూపర్ హిట్ గీతాలు చిత్రాన్ని జనానికి చేరువచేశాయి.సినిమా కథ అంతకుముందు రాజేష్ ఖన్నా,హేమమాలిని తోనే వచ్చిన మెహబూబా తరహాలోనే పూర్వజన్మ జ్ఞాపకాలతోనే సాగుతుంది.
తండ్రి గతంలో చేసిన నేరం తాలూకూ సాక్ష్యాన్ని కాల్చేసి దానితోపాటు తనూ దగ్ధమైపోయిన పాత్రలో ప్రియ రాజ్ వంశ్, కోర్ట్ లో తనపై వేసిన కేసు వాపసు తీసుకున్నా, సాక్ష్యాలు లేకపోయినా 'ఈ కోర్ట్ ను మించిన కోర్ట్ పైన ఒకటుందని దానినుండి తప్పించుకోలేమని ' చెప్పి శిక్ష అనుభవించిన పాత్రలో విలన్లాంటి పాత్ర లో రాజ్ కుమార్, ..ఈ రెం డు పాత్రలూ సినిమాలో గుర్తుండిపోయాయి.
'మెహబూబా' చిత్రంలో 'మేరే నైనా సావన్ బాధో' పాట రెండు వెర్షన్లు వున్నట్టే కుద్రత్ లో 'హమె తుమ్సె ప్యార్ కిత్నా' కూడా రెండు వెర్షన్లు వుంది. రెండు సినిమాలకూ ఆర్ డి బర్మన్ సంగీత దర్శకుడు.
ఐతే కుద్రత్ సినిమాలో ఫిమేల్ వెర్షన్ పాట పూర్తి క్లాసికల్ తరహాలో ఉంటుంది. గాయని ప్రముఖ శాస్త్రీయ కళాకారిణి పర్వీన్ సుల్తానా. పాట అర్ధం దగ్గర దగ్గర ఒకటైనా ఈ వెర్షన్లో పదాలు వేరుగా ఉంటాయి.
ఒక కచేరీలో మధ్యవయస్కురాలు పాటపాడుతూ ఉంది.. క్రితంజన్మలో ఆ మె కు సంబంధం ఉన్న ఇద్దరు అక్కడ పాట వింటున్నారు. గతజన్మ స్మృతులు వారిలో ఒకరికి తెలుస్తున్నాయి. ఆ పాటా గత కాలానికి చెందినదే.
శ్రావ్యమైన పర్వీన్ గాత్రంతో వచ్చిన ఈ పాట ఆ సినిమాకొక ప్రత్యేకతనిచ్చింది. అస్సాం కళాకేంద్రమైన నగావ్ లో ఇరాని, అఫ్గని మూలాలున్న తల్లితండ్రులకు జన్మించిన పర్వీన్ సుల్తానా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది.బహు బిరుదాంకితురాలు.పరిమిత సంఖ్యలో సినిమా పాటలు పాడింది.అందులోఒక మణిపూస ఈ పాట.
“నిన్నెంత నేను ప్రేమిస్తున్నానో నాకు తెలీదు
కాని నువ్వు లేకుండా మాత్రం జీవించలేను
నేను సదా నీపట్ల పిచ్చిదానే
ప్రియా, నువ్వు అప్పటి ప్రేమను మరచిపోయావు
నా విలువ నువ్వు తెలిసుకొనట్లేదు
ప్రియా,ఎవరి చూపునీపై పడిన
నేను చూడలేకపోతున్నా
నా మనసు రగిలిపోతుంది”
-ముళ్ళపూడి సుబ్బారావు