Sunday, May 7, 2017

పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-77
“పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే”
(నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను)
‘దో బూంద్ పానీ’ సినిమాలో పర్వీన్ సుల్తానా ,మినూ పురుషోత్తమ్ పాడిన పాట.

రచయిత గా కె.ఎ. అబ్బాస్ , రాజ్ కపూర్ తో చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. ఐతే కె.ఎ. అబ్బాస్ స్వంయంగా దర్శకుడు. అలా డజన్ పైగా సినిమాలు తీసాడుకానీ ఏవీ కమర్శియల్ గా సక్సెస్ కాలేదు. ఐతే వాటిలో ప్రతి సినిమా విలువైనదే.  వాటిలో ఒక సినిమా ‘దో బూంద్ పాని’. సాధారణ సినీ ప్రేక్షకులకు పేరు పరిచయం కూడా అనుమానమే. 80 లలో దూరదర్శన్ లో ప్రదర్శితమయ్యింది.
రాజస్థాన్ ఎడారి ప్రాంతాల నీటికొరతసమస్యను రియలిస్టిక్ గా చూపిన సినిమా.

ఈ పాట కు రచయిత ‘కైఫి ఆజ్మి’.‘జయదేవ్’ సంగీత దర్శకుడు. వీరిద్దరు ఇంచుమించు  అదేకాలం లో , రాజస్థానీ ఎడారుల నేపధ్యంతో ‘రేష్మా ఔర్ షేరా’ సినిమాకు పనిచేశారు.

జయదేవ్ తక్కువ సినిమాలకుపనిచేసాడు. ఎక్కువ గుర్తుండే పాటలు ఇచ్చాడు. జానపద తరహాలో సాగే  పాటవరస ,సాంప్రదాయ సంగీత వాద్యాలు ఈ పాటను ఒక్కసారి వింటే మరచిపోలేనట్టు చేసాయి.
గాయని పర్వీన్ సుల్తానా పాడిన బహుకొద్ది సినిమాపాటల్లో ఇది ఒకటి.

అపజయం తనతో పాటు తనతో ఉన్న అనేక మంచి విషయాలనూ చీకట్లోకి తీసుకుపోతుంది. చిత్ర అపజయంతో ఈ పాటా మరుగున పడిపోయింది.

నీటికోసం కొందరు యువతులు కడవలు పట్టుకుని పోతున్నారు. వారిలో ఒకరి దగ్గరే ఇత్తడి బిందె వుంది. పోయేటప్పుడు శ్రమను మరిచేంత ఆనందంలో ఉండి ఉత్సాహవంతమైన పాట పాడుకుంటున్నారు.

“నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను(??)
కాళ్ళకు గజ్జలు కట్టుకుని , నీళ్ళు నింపుకోవటానికి వచ్చాను

మువ్వలు చప్పుడుతో నడక మారింది..యవ్వనపు నడక మారింది
చెంగు అటు ఇటు జారుతుంటే ..చూడు సిగ్గులేనివాడు
ఊరిలో నింద పడాలి ..
చెంగు చెప్పేదానికి  నువ్వే సాక్ష్యం

బిందె నీటిలో మునుగుతుందంటే   గుండె చప్పుడౌతుంది
నా ముఖం కొత్తగా కనపడుతుంది
నీళ్ళలో చూసుకుంటుంటే
బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి ..
ఈ మంట రేపిందెవరు?”

ఒకామె బావిలోకి తాడు వేస్తూనే వుంది.బొక్కెన నీటికి తగులుతుందని చూస్తున్న వారికి బొక్కెన రాతికి తగిలిన చప్పుడు వినిపించింది.వారి నీటి ఆశ నీటి పాలయ్యింది. నిరాశ తో వెనుతిరిగారు. వెళ్ళేటప్పటి ఉత్సాహం ఆవిరయ్యింది.పాట సాగుతుంది.

“అలాంటి రోజులుండేవి..వూరిలో నీరుండేది.
చుక్కల నీడలో బిందెనిండా నీరు తెచ్చేవారం.
ఇప్పుడు ఎక్కడనుండి నీరు తేవాలి? దాహం ఎలా తీర్చాలి?
ఎండలో మాడిపోతూ ?????”
 -ముళ్ళపూడి సుబ్బారావు.


No comments:

Post a Comment