Thursday, February 8, 2018

ఖుదా అప్నె వాలియోంసె హోత హై రాజీ

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-137
‘ఖుదా అప్నె వాలియోంసె హోత హై రాజీ’
(భగవంతుడు తనను అనుసరించేవారిని అనుగ్రహిస్తాడు)
ఫిజా (2000) సినిమాలొ బృందగీతం.బృందంలో ఎ. ఆర్. రెహ్మాన్ ఉన్నాడు. సంగీతం ఎ ఆర్ రెహమాన్. రచన షౌకత్ అలి ఖాన్....
కళా విమర్శకుడు కళాకారుడిగా మారినపుడు అతని కళాసృష్టి ఎలాఉందో అని ఎందరో ఎదురుచూస్తారు. ప్రత్యెకంగా అతని విమర్శకు అప్పటిదాకా లోనైనవారైతే మరింత ఉత్సుకతతో చూస్తారు.
ఖాలిద్ మొహమ్మద్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు. ఫిల్మ్ ఫేర్ మాగజైన్ లో పనిచేసారు.అనేక సినిమాలపై విమర్శ రాశాడు.అతను దర్శకత్వానికి పూనుకున్నాడు. ‘ఫిజా’ సినిమా తీసాడు.సినిమాకథ కు కాలం ,నేపధ్యం 1993 మతసంఘర్షణ తర్వాత ముంబై నగరం.
ఘర్షణల తర్వాత ఒక ముస్లిమ్ కుటుంబంలో యువకుడు కనపడకుండాపోయాడు. అతనికి తల్లీ చెల్లీ ఉన్నారు. స్నేహితురాలు ఉంది. అందరూ అతనికోసం ఎదురుచూస్తున్నారు. అతనొస్తాడని తల్లికి అపారనమ్మకం. అతనికోసం ప్రార్ధనలు చేస్తుంది. అందుకు హజి దర్గాకు వచ్చింది. ఆ సందర్భంలో పాట.
ముంబై నగరంలో భాగమ్గా అరేబియాసముద్రంలో హజి అలి దర్గా ఉంది.సయెద్ పీర్ హజి అలి షా బుఖారి పెరుపై ఉన్న దర్గా అది.


“భగవంతుడు తనను అనుసరించేవారిని అనుగ్రహిస్తాడు
ఈ ద్వారం తల ఎత్తుకు బ్రతికేట్టు చేస్తుంది
ఇక్కడ మనసు తో కోరుకో ..ఇది హాజి అలి స్థలం
ఆయన ఖుదా కు స్నేహితుడు
సముద్రాలకు రాజా! హైదర్ కుమారుడా!
సముద్రాలకు రారాజా! ఒక్క చూపు
ప్రియ హాజి అలీ
నువ్వు సముద్రమంత ధనికునివి
బాబా హాజి అలీ ,బాబా హాజి అలీ
నీ ద్వారం పవిత్రమైనది స్వచ్చమైనది ఎంతో గొప్పది
ఓ తేజోమయా
నిర్మలచిత్తుడా
అందరికీ ఇంత నీడనివ్వు
ఇక్కడ హిందు ముస్లిమ్ శిఖ్ఖు క్రిస్టియన్లు అందరూ సఫలులౌతారు
ఈ సముద్రం నీ ద్వారానికి పహారా కాస్తుంది
నీ ముఖమెపుడూ వెలుగుతో నిండి ఉంటుంది
ప్రియ హాజి అలీ, ప్రియ హాజి అలీ
మొహమ్మద్ ముస్తఫా పేరుపై దానం చేయండి
ఆయన పేరుపై దానం చేయండి
నీ ద్వారంనుండి నిరాశ తో ఎవరూ వెఌంది లేదు
బాబా! వెనక్కివెఌంది లేదు
ఎవరి మనసులో ఏమి దాచారో అంతా నీకు తెలుసు
నీ దాతృత్వం దాక్షిణ్యం ఆకాశంలోనూ పొగడబడుతుంది
బాబా! హజి అలీ
ఈ పేదవారి ప్రార్ధనలు విను దయచూపు
ప్రియ హాజి అలీ, ప్రియ హాజి అలీ
లోకానికి నీవు గర్వకారణం
దురదృష్టవంతులు నీ ద్వారంలో అదృష్టవంతులౌతారు
అదృష్టవంతులౌతారు
నా కోరిక తీరేవరకు
జీవితాంతం నా కన్నీరు నీ ద్వారంపై ప్రవహిస్తుంది
బాబా! హజి అలీ
నీవారైన వారికి నువ్వు ఇవ్వనిదేమిటి?
బాబా! హజి అలీ”

హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-136
`హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్`
(గాలుల పేరుమీద ...గాలుల పై వ్రాస్తాను)
దో దూని చార్ -1968 (రెండు రెళ్ళు నాలుగు) సినిమా లో కిశోర్ కుమార్ పాడిన పాట. గీత రచన గుల్జార్. స్వర రచన హేమంత్ కుమార్.
పురవాయీ /పురవయ్యా( తూరుపు గాలి) పదం హిందీ సినీ సాహిత్యంలో బాగా వినిపిస్తుంది. ...
తూరుపుగాలి ఒక దశలోహిందీపాటల్లో కూడా బాగా తోలింది. పంకజ్ మలిక్,ఎస్ డి బర్మన్, సలీల్ చౌధురి,హేమంత్ కుమార్ వంటి సంగీతదర్శకులు వంగ ప్రాంతపు సంగీతాన్ని, రవీంద్ర సంగీతాన్నిహిందీ పాటలద్వారా దేశం మొత్తానికి పంచి ఇచ్చారు. ప్రత్యేకంగా అరవైలవరకూ బెంగాలీ ముద్ర వారిపాటల్లో కనిపిస్తుంది.
ఆ కాలంలో వచ్చిన పాట ఇది.ప్రకృతిని వర్ణించేది. కిశోర్ కుమార్ తనకోసం తానే పాడుకున్నాడు. పంచె కట్టు, బెంగాలీ లాల్చీ తో అచ్చమైన బెంగాలీ బాబులా కనిపిస్తాడు. పాటలో కనిపించే బాలనటి తర్వాత హీరోయిన్ గా ఎదిగిన నీతూసింగ్. ‘దో దూనీ చార్ ‘ (2010)పేరుతోనే వచ్చిన సినిమాలో గృహిణి గా నటించింది .
ఈ ‘కిశోర’ ’హేమంత’ సమీరం వింటున్నపుడు అది శరీరాన్ని తాకుతున్నట్టే కాదు మనసునూ స్పృశిస్తున్నట్టనిపిస్తుంది. 

“గాలుల పేరుమీద గాలుల పై వ్రాస్తాను
ఈ అపరిచిత పరదేశి ప్రణామం.

ఓ పక్షీ ! నీ ఈ రాగయుక్తమైన ఈ ప్రణామం
ఎవరిపేరుమీద ఎవరికోసమో చెప్పు

తరుశాఖలపై వెలుగుకిరణం వచ్చి
చేయి సాచినపుడు
చీకటి నెమ్మదిగా కిందికి దిగి
నవ్వుతూ చెప్పింది
ఇక్కడ ఉదయ సాయంత్రాలు ఆటలాడుతూఉంటాయని

ఆకతాయి నీరు తన దారిన ప్రవహించటం మరచి
అద్దంలా మారి పూలపైకి ప్రతిఫలిస్తుంది
ఈ అమాయకపు పసి ముఖాలను.”


బేసన్ కి సోన్ధి రోటి పర్ ఖట్టి చట్ని జైసి మా

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-135
బేసన్ కి సోన్ధి రోటి పర్ ఖట్టి చట్ని జైసి మా
(చక్కని శనగ రొట్టె పై, పుల్లనైన పచ్చడిలా అమ్మ)
తొంభైల మధ్యలో మొదలైన ప్రవేటు టి వీ చానెళ్ళ అవసరాలకోసమనుకుంటా , ఎన్నో వీడియో ఆల్బమ్ లు వచ్చాయి. అందులో ఒకటి `అమన్`. పంకజ్ ఉధాస్ పాడిన గజళ్ళతో వచ్చిందది. ఆ ఆల్బమ్ లో ఒక పాట ఇది. దీనిని రాసినవారు నిదా ఫజ్లి. ...
పంకజ్ పాడటమే కాదు అందులో నటించాడుకూడా. ప్రత్యేకంగా క్లోజ్అప్ లలో పాటకు తగినట్టు కనిపించాడతను. తల్లి గా కనపడే ఆమె నటి `బీనా`. తల్లి పాత్రల్లో చాలా చిత్రాల్లో నటించింది.
పాటలో ఉన్న చాలా పదాలకు నేను అర్ధం చేసుకున్నది కరెక్టో కాదో తెలియదు. పాట వింటున్నా ,చూస్తున్నా అర్ధం అవసరం పడలేదు.
ఇల్లు అనే సామ్రాజ్యానికి కోట గోడలు పెద్ద బలమైనవి కావు. అలాంటి ఇంటికి ఎలుకనుండి దొంగ వరకూ ఎందరో శత్రువులు. అమ్మ ఇంటికి కాపలాదారు. అమ్మ ఎపుడూ మేలుకునే ఉంటుంది.పొయ్యిలా మండిపోతుంటుంది. గిలక లా తిరుగుతుంటుంది. ఆమె గాజుల శబ్దంలోనూ మనకి ధైర్యాన్నిచ్చే `మార్చింగ్` సాంగు వినగలం. తన సౌందర్యాన్ని ,వయసుని కళ్ళలో వెలుగునూ పిల్లలకూ కుటుంబానికి పంచేసింది.అందరిలోనూ కొద్ది కొద్దిగా కనపడుతుంది.
పాటలు కొన్ని మనని గతంలోకి తీసుకెళతాయి. అప్పటిని ,ఇప్పటి కళ్ళతోనో మనసుతోనో చూసేలా చేస్తాయి. దానితో కొన్ని ఆనందాలు కొన్ని పశ్చాత్తాపాలు కలుగుతాయి. కొన్ని సార్లు చేయాల్సిని పనులను గుర్తుచేసి కార్యోన్ముఖులను చేస్తాయి. అలాంటి పాట ఇది.

``చక్కని శనగ రొట్టె పై
పుల్లనైన పచ్చడిలా అమ్మ
గుర్తొస్తున్నాయి వెదురు మంచం
పొయ్యి ,పటకారు, బావి గిలక ….
నులక మంచం పైనుండే
ప్రతీ అలికిడి పైనా చెవివొగ్గుతుంది
సగం నిద్ర, సగం మెలకువతో
అలసిన మధ్యాహ్నం లా అమ్మ
ఆమె గాజుల శబ్దంలో
కొన్నిసార్లు అన్నపేరు,కొన్నిసార్లు నాపేరు వినవస్తాయి
కోడికూతతోనే తెరుచుకునే
ఇంటి వాకిలి ముగ్గులా లా అమ్మ
భార్య, కూతురు, సోదరి, పక్కఇంటి ఆమె
అందరిలో కొద్ది కొద్దిగా...
రోజంతా తాడుపై
నడుస్తున్నఆమెలా అమ్మ
తన వదనాన్ని ,నుదుటిని,కళ్ళను
పంచేసి తను ఎక్కడికెఌందో
చిరిగిపోతున్న పాత ఆల్బమ్ లో
చలాకీ పిల్లలాఉన్న అమ్మ``

కల్ కీ దౌలత్ ఆజ్ కీ ఖుషియా

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-134
“కల్ కీ దౌలత్ ఆజ్ కీ ఖుషియా”
(నిన్న సంపద, నేడు ఆనందం)
అస్లీ -నక్లీ (1962) సినిమాలో మహమ్మద్ రఫీ పాడినపాట. శైలేంద్ర రచన, శంకర్ జై కిషన్ సంగీతం.
...
కథానాయకుడు సంపదలో పుట్టి పెరిగాడు. ఆ సంపద అతను సృష్టించింది కాదు. నచ్చని ఆమె ను పెల్లి చేసుకోవటం ఇష్టం లేక సంపదకు దూరమయ్యాడు. వేరే జీవితాన్ని చూస్తున్నాడు. తనుచూసిన పాత ప్రపంచం , చూడబోయిన ..చూస్తున్న కొత్తప్రపంచం...వీటిలో ఏది అసలు ఏది నకిలీ అన్నది అతని ప్రశ్న.
పనిలో ఇష్టం ,నైపుణ్యం ఉండి ,శక్తి మేరకు మాత్రమే పని చేస్తూ , పనికి సరిపడా ప్రతిఫలం పొందుతున్న వారు పనిచేసేటపుడు చేస్తుంటే కళాసృష్టి ని చూస్తున్నట్టే ఉంటుంది.
ఈ పాట చిత్రీకరణ లో అనేక వృత్తులవారు శ్రమ చేస్తూ కనపడతారు.శ్రమ సౌందర్యం కనపడుతుంది. చిత్రీకరించే కెమేరా కథానాయకుని కళ్ళద్వారా చూస్తుంది. అతనికి కలిగిన ఆలోచనల్ని మనకి చూపుతుంది. అతనికి కొత్తప్రపంచంలో ఆనందం కనపడుతుంది.అక్కడ అందరూ ఆనందం తో ఉన్నారనీ నమ్ముతున్నాడు. అక్కడి మనుషుల్లో మంచి కనపడుతుంది. అది అసలా నకిలీనా అన్నదో ప్రశ్న.

నిన్నటి సంపద ... నేటి ఆనందం
వారి దర్బారులు ,...మన వీధులు
అసలు ఏది ? నకిలీ ఏది ? నా మనసు నడుగు
అబద్ధపు సంబంధాలు వదులుకుని మనసున్నవారిలోకి వచ్చాను
నిజం చెబుతాను సంపద కూడబెట్టేవాళ్ళలో దొంగలు అధికం
ఆ ప్రపంచంలో పలకరించేవాడేలేడు. ఈ ప్రపంచం ప్రేమ ఇచ్చింది
మనసనే రాజమందిరంలో కూర్చుండబెట్టి కలలప్రపంచాన్ని ఇచ్చింది
ఆకాశంలో బ్రతికేవారూ ..నేలను గుర్తుపట్టండి
నమ్మూ నమ్మకపో !పువ్వులు ఈ మట్టిలోనే పరిమఌస్తాయి

మై యహా తూ వహా ,జిందగి హై కహా

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-133
‘మై యహా తూ వహా ,జిందగి హై కహా’
(నేనిక్కడ, నీవు అక్కడ ,జీవితం ఉన్నదెక్కడ?
బాఘ్ బన్ (2002) సినిమాలో అమితాబ్ బచన్,అల్కా యాగ్నిక్ పాడిన పాట.
సమీర్ రచన ,ఆదేష్ srivatsava,ఉత్తమ్ సింగ్ .
...
బాఘ్ బన్ (తోటమాలి) తోట కు తానే యజమానిననుకుంటే ఏమౌతుంది.
వయసుమీరిన తల్లిదండ్రులకు పిల్లలవలన బాధ కలిగేది వాళ్ళు తమ బాగోగులు చూడకపోవటం వల్ల లేదా పట్టించుకోకపోవటం వల్లనేనా? తల్లితండ్రులకు తినటానికి ,ఉండటానికి ఏర్పాటుచేస్తే వారిని పట్టించుకున్నట్టేనా? వాళ్ళపట్ల బాధ్యతతో ప్రవర్తించితేచాలా? పెద్దవాళ్ళను బానే చూసుకుంటున్నాం అని చెప్పటంలోని `బానే` గురించి ఎవరి నిర్వచనాలు వారివి.
ప్రాధమిక అవసరాలకోసం ఏర్పాటు తర్వాత కూడా రెండు తరాలు దూరంతనాన్ని అనుభవించటానికి కారణాలు ఎన్నోవింటుంటాం.దూరం అయ్యాం అని పెద్దవాళ్ళు అనుకోవటానికి నాకు తెలిసీ తెలియనట్టుండి, అమూర్తంగాఉన్న ఆలోచనకు ఒకమాటలో తెలియజెప్పింది `బాఘ్ బన్` సినిమాలో ఒకమాట.
తండ్రి కొడుకుల్ని పెద్దవాళ్ళనుచేసాడు.పెఌళ్ళు చేసాడు. వాళ్ళ ఇళ్ళు తన స్వంత ఇళ్ళే అనుకున్నాడు. కాని అతని అనుభవాలు తాను వారికి దూరమౌతున్నాని చెబుతున్నాయి.
అలాంటి స్థితి లో కొడుకు తండ్రితో అన్నమాట సుమారు అర్ధం `` అతిధిలా వచ్చినవారు అతిధిలా ఉండండి``.
దూరమవ్వటమంటే స్వంతమనుషులనుకున్నవారికి అతిధి కావటం.
ఎందుకు స్వంతమనుకున్న మనుషులు ఒకరినొకరు దూరం చేసుకుంటారు? పెద్దప్రశ్న. వందలాది సమాధానాలు.
`బాఘ్ బన్` సినిమా మూలకథ ఎనభైయేళ్ళనాటిది. భారతీయభాషల్లోనే సుమారు ఐదు సార్లు సినిమాగా వచ్చింది. అందులో `బడి పంతులు` సినిమా ఒకటి. ఐతే `బాఘ్ బన్ `సినిమాలో వివరాలు మరింత లోతుగా డీల్ చేయబడ్డాయి.
"నేనిక్కడ నీవక్కడ , జీవితం ఉన్నదెక్కడ?
నేనెక్కడ చూసినా నువ్వే నువ్వే
నిదుర రాదు, జ్ఞాపకం పోదు
నీవేలేకుంటే ప్రాణముండదు
చూచిన చోటల్లా తెలియని ఉదాసీనత తో కాలం ఆగిపోయింది.
గుబులుతో తనువు ఒంటరిదయ్యింది,కాలం దప్పికతో ఉంది
నా కళ్ళనుండి నీ వదనం ఒక్క క్షణమూ దూరమెందుకు కాదు?
రాత్రులు పగళ్ళు గడుస్తాయి కాని ఒంటిదైనకాలం గడవదెందుకు?
చెప్పాలనిఉన్నా నీతో ఏమీ చెప్పలేకున్నాను
బాధనెలా చెప్పగలను
ఏ అలికిడైనా నువ్వు వచ్చావని అనిపిస్తుంది
సుగంధపవనంలా నా ఊపిరీపరిమఌస్తుంది
మనం సదా కలిసున్న కాలముండేది
ఇప్పుడు ఎన్నో దూరాలు
ఒంటరిగాఉన్నపుడు గతకాలపు మాటలు గుర్తుకొస్తాయి
నిశ్శబ్దం మాట్లాడుతుంది, చాటుగా రోదిస్తాను
నవ్వి సంవత్సరకాలమైంది
కన్నీళ్ళు కథలను నింపుకున్నాయి"
https://m.youtube.com/watch?v=1lPAE9yq41s

అభీ అల్విదా మత్ కహో దోస్ తో!

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-132
అభీ అల్విదా మత్ కహో దోస్ తో!
(ఇప్పుడే వీడుకోలు చెప్పకండి మిత్రులారా)
...
నికాహ్ (1982) సినిమా లో మహేంద్ర కపూర్ పాడిన పాట. రవి సంగీతం, హసన్ కమాల్ రచన.

ప్రయాణ సాధనాలు, ప్రసార, సమాచార సాధనాలు
ఇప్పట్లా లేని రోజుల్లో వీడుకోలు సందర్భాలు ఉద్వేగభరితంగా ఉండేవి. అప్పటిదాకా విలువ తెలియని,విలువ కట్టని బంధాల విలువ తెలుస్తుందప్పుడు. హైస్కూళ్ళలో ,కాలేజీలలో ఆఖరి పని(?) దినంలో విద్యార్ధులు ఎమోషనల్ ఐపోయేవారు. ఆటో గ్రాఫ్ పుస్తకాలో సంతకాలతోపాటు కవిత్వమూ దొర్లేది.
నికాహ్ సినిమాలో ఈ పాట అలాంటి వీడుకోలు (అల్విదా) సందర్భంలోనిదే.
అల్విదా అనగానే కిశోర్ కుమార్ ‘కభి అల్విద న కెహనా’ అంటాడు. ‘అభీ అల్విదా మత్ కహో దోస్ తో ‘ అంటూ మహేంద్ర కపూర్ వస్తాడు. సంధ్యా సమస్య లో ఎంపిక రెండవదే. కారణం సినిమా లో ఆ పాటకున్న ప్రాధాన్యత, సినిమాలో ఇమిడిన విధానం.
బి ఆర్ చోప్రా (దర్శక నిర్మాత) చిరకాల మిత్రులు రవి, మహేంద్ర కపూర్ లు కొద్ది విరామం తర్వాత ఈ సినిమాతో జత కట్టారు. లోటల్లా ఆ బృందంలో ‘సాహిర్ లూధియాన్వి’ లేకపోవటమే.( ఆయన 80 లొ కాలం చేసారు).
‘యాదోం కి చిరాగోం కొ జలాయె హుయె రఖనా, లంబా హై సఫర్ ఇస్ మె కహీ రాత్ తో హోగీ’ పాదం వింటుంటే సాహిర్ లోటును హసన్ కమాల్ కలం భర్తీ చేసిందనిపిస్తుంది.
పాటలో చరణాలమధ్య సంగీతం వింటుంటే పరిమళాన్ని మోసుకొచ్చే చల్లగాలి శరీరాన్ని స్పృశించినట్టు అనిపిస్తుంది.

“ఇప్పుడే వీడుకోలు చెప్పకండి మిత్రులారా
ఎవరికితెలుసు.. తిరిగి కలయిక ఉంటుందేమో
గడచిన క్షణాల తీయని బాధ వెంట వస్తూనే ఉంటుంది
కోరితే కలలలోనైనా కలయిక ఉంటుంది

ప్రేమలో మునిగిన వర్ణ మయ స్థలాలు
ఈ వదనాలు, ఈ దృక్కులు, ఈ యవ్వనభరితఋతువు, ఈ పవనాలు
ఎక్కడికి వెఌనా వీటి సుగంధం వెంట వస్తూనే ఉంటుంది

పూలలా మనసులో నిలిపే ఉంచండి
జ్ఞాపకాల దీపాలను వెలిగించే ఉంచండి
బహుదూరపు ప్రయాణం ..దీనిలో ఎప్పుడైనా రాత్రి కావచ్చు

మీతో కలిసి నడిచే ఈ క్షణాల సంపద
అనుభూతుల సంపద,భావనల సంపద
ఏది వెంటనున్నా లేకున్నా ఉండే అరుదైన సంపద”

ధీరేసే ఆజా రి అఖియన్ మే

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-131
ధీరేసే ఆజా రి అఖియన్ మే
కన్నులపైకి నెమ్మదిగా రా
అల్బెలా(1951) సినిమాలో లతామంగేష్కర్,సి రామచంద్ర పాడిన పాటరాజేందర్
ర్ కిషన్ రచన. సి రామచంద్ర సంగీతం....
ఈ పాట ఉత్తరాన `లోరీ` అనబడే మన దగ్గరి జోల పాట. మనసుకి లోకపు మంచిచెడులు తెలియని పసిపిల్లలు జోలపాడితే తేలిగ్గా నిదురలోకి జారుకుంటారు. కలతచెంది ఉన్న పెద్దవాళ్ళను నిద్రపుచ్చటం అంత తేలికకాదు. ఆ జోలపాట బరువైనదై ఉండాలి.
కథానాయకునికి కళాకారుడవ్వాలని కలలున్నాయి. అవి తీర్చుకునేందుకు అనేక యత్నాలు చేస్తున్నాడు. అలా అలసిన అతను చెల్లెలు పాడిన జోలపాటలో సేద తీరాడు. రెండో చరణం వచ్చేసరికి కలలు నిజంచేసుకున్న అతను సంతృప్తితో ప్రేయసిని నిద్రపుచ్చటానికి పాడుతున్నాడు. చివరి చరణం బాధల్లొ ఉన్న చెల్లెలు అదే పాట పాడి తండ్రిని ఓదారుస్తుంది.
చితల్కర్ గా కూడా పిలవబడే సంగీత దర్శకుడు సి. రామచంద్ర ఒక తెలుగు సినిమాకు సంగీతమందించారు. ఐతే ఆ పాటలన్నీ కొత్తబాణీలే. కానీ అంతకుమునుపే అతని హిందీ బాణీల ఆధారంగా తెలుగులోవచ్చిన పాటలు వినిఉన్నాం. వాటిలో ఒక పాట ` నీలాల కన్నుల్లో మెల మెల్లగా`.నాటకాలరాయుడు సినిమాలోది.
ఆ సినిమా కు ఆధారం `అల్ బెలా` హిందీ చిత్రం ,పాటకు ఆధారం అదే సినిమాలోని ` ధీరె సే ఆజారే `

``కన్నులపైకి నెమ్మదిగా రా
నిదురా ! రా ! నెమ్మదిగా రా
చాటుగా కన్నుల తోటలోకి
నిదురా ! రా ! నెమ్మదిగా రా
సుందరస్వప్నాల మొగ్గలుతీసుకుని
వచ్చి కనుపాపల్లో బస చేయి
కనుపాపల చిరువీధుల్లో
నిదురా ! రా ! నెమ్మదిగా రా
చుక్కల నుండి చాటుగా , చుక్కలనుండి దొంగిలించి
ఈ రాత్రి చంద్రునికి జోల పాడు
చంద్రుడూ నిదురలో నవ్వుకుంటున్నాడు
కనులు మెలకువతో ఉంటాయి అదృష్టం నిద్రిస్తూఉంటుంది
అదృష్టం పేదవానికి విరోధి
ఒక క్షణం పేదవాని కుటిరానికి
నిదురా ! రా ! నెమ్మదిగా రా
కనులనేవి ఎవరికైనా ఒకేలా ఉంటాయి
ఉన్నావారికెలానో లేనివారికీ అలానే
అదృష్టం చాటేసిన కన్నులపైకి
నిదురా ! రా ! నెమ్మదిగా రా``
https://www.youtube.com/watch?v=8h94Qg1g-JI