Saturday, October 21, 2017

‘బహుత్ షుక్రియా..బడీ మెహర్బానీ.ంఎరీ జిందగీ మే హుజూర్ ఆప్ ఆయి

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-105
‘బహుత్ షుక్రియా..బడీ మెహర్బానీ.ంఎరీ జిందగీ మే హుజూర్ ఆప్ ఆయి’
ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా (1962)లో పాట.ఎస్‌. హెచ్.బిహారి రచన,ఓ.పి. నయ్యర సంగీతం. రఫీ, ఆశాభోన్స్లే గానం.
హీరో జాయ్ ముఖర్జీ సినిమాలు థియేటర్లో చూడలేదు. అతని పేరు చెబితే గుర్తొచ్చేసినిమా ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీన’. బహుళ ప్రాచుర్యంపొందిన పాటలు అందులో ఉండటం దానికి కారణం. ఆ పాటల్లో ఒకపాట ‘బహుత్ శుక్రియా’ మరింత నచ్చుతుంది.
సంగీతపరికరాల్లో నన్ను హార్మొనీ(యం) పట్టిలాగుతుంది. నేను మొదట విన్న,చూసిన వాయిద్యం అదే కావటం వల్ల కావచ్చు. భజనల్లో, పౌరాణిక నాటకాల్లో అది విస్తృతంగా వాడబడేది. అలాగే ‘డోలక్ సంతలో గారడీవాళ్ళు,పాములు ఆడించేవాళ్ళద్వారాపరిచయమే.వాటి శబ్దం వింటుంటే బాల్యమిత్రుల్ని కలిసినట్టో,బాల్యాన్ని తిరిగి అనుభవిస్తున్నట్టో ఉంటుంది.
ఆ రెండూ వాద్యాలు (హార్మొనియం, డోలక్) లు ఈ పాటలో వినపడటమే కాదు, కనపడతాయి కూడా.
కథాస్థలం కాశ్మీరం,కథాకాలం స్వతంత్ర అనంతరం. కథానాయకుడు సైనికుడు. హీరోయిన్ ను రక్షిస్తూ దెబ్బతిని గతం మరచిపోయాడు. అప్పట్నించీ ఆమె అతన్ని రక్షిస్తూ ఉంది. పాట చిత్రీకరణ ఒక నేల మాఌగ లాంటి చోటసాగుతుంది. కథానాయకుడ్ని దాచిఉంచినచోటది. కథానాయికకు జత ఓ కుర్రవాడు ,ఓ కుక్క. మంచిపాట.చక్కని సంగీతం. నాలాంటి సామాన్య సినీ ప్రేక్షకుడికి ఇంకేం కావాలి?
బహుశా లతా మంగేష్కర్ తో ఒక్క పాటా పాడించకుండా, ప్రముఖ సంగీతదర్శకుడిగా నిలబడింది ఓ. పి.నయ్యర్ మాత్రమేనేమో.

“బహు ధన్యవాదాలు.పెద్ద కృపచూపారు
నాజీవితంలోకి ప్రియతమా! మీరు వచ్చారు
పాదాలను చుంబించనా?ఎదురు చూస్తూ ఉండిపోనా?
ఏమిచేయాలో నాకు తోచటం లేదు
మనసు ను కథగా మలచి
నా హృదయాన్ని బహుమతిగా నీకర్పించనా?
ఇలాంటి మధుర ఘడియలు నాజీవితంలో
తిరిగివస్తాయా అన్నది దేవునికే ఎరుక
ఈ పొగడ్తలు విని నిజమనుకుని
నేను అహంకారి నౌతానని , ఆగర్వంతో
నృత్యం చేస్తానేమోననిభయంగా ఉంది
నీదానినై,నన్నునేను మరచిపోతానని కూడా
ఎంతో సంతోషం గా ఉంది ,కాని కొద్దిగా బాధా ఉంది
ఈ మన తోడు ఒకటి రెండు అడుగులేనని.
కాని ఈ ప్రయాణికుడు కోరుతున్నాడు
దేవుడు మరికొన్ని రోజులు మీతో నన్ను కలిపాలని"


లంబీ జుదాయీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-104
లంబీ జుదాయీ (దీర్ఘమైన ఎడబాటు)
హీరో సినిమాలో ‘రేష్మా ‘పాడిన పాట. ఆనంద్ బక్షి రచన లక్ష్మికాంత్ ప్యారేలాల్ స్వర రచన.
‘వాగ్దానం ‘ సినిమాలో హరికథలో ఒక పద్యం …’ఫెళ్ళు మనె విల్లు, గంటలు ఘల్లు మనె, గిభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనె జానకీ దేహము’ ఘంటసాల పాడుతారు.
అలాంటి స్థితి ‘రేష్మా ‘ పాట ప్రారంభంలో నాకు అనుభవానికి వస్తుంది.
జానపద గాయని ‘రేష్మా’ బికనేర్ (రాజస్థాన్) లో దేశ విభజన కాలంలోపుట్టింది. కుటుంబంతో పాకిస్తాన్ కు తరలింది. 1982 లో తొలిసారి(?) భారత్ కు వచ్చింది. హీరో సినిమాలో తొలిసారిగా తన గొంతు హిందీ సినీ సంగీత ప్రేమికులకు వినిపించింది.
ఆమె స్వరమైతే అప్పుడువిన్నారు కాని ఆమె సంగీత పవనాలు అప్పటికే తెరలు తెరలుగా భారత దేశంలోవ్యాపించి ఉన్నాయి.
అప్పటికి ఒక దశాబ్దంక్రితం ‘రాజ్ కపూర్’ తన ‘బాబీ’ సినిమాలో ఆమె పాటను ‘లతా మంగేష్కర్ ‘ స్వరంతో వినిపించాడు. ఆ పాట ‘అఖియోం కొ రెహనేదో ‘. ఆ సినిమా కు సంగీత దర్శకులు ‘లక్ష్మి కాంత్ ప్యారేలాల్’.
మరి కొన్నాళ్ళకు ‘లక్ష్మికాంత్ ప్యారేలాల్’’ మరోపాటతో రేష్మా ను గుర్తు తెచ్చారు. ఆ పాట బాలచందర్ హిందీ సినిమా ‘ఏక్ దూజే కేలియే’ లో అనూప్ జలోటా స్వరంతో ప్రారంభమయ్యే ‘కోశిష్ కర్ కే దేఖ్ లే దరియా సారే ,నదియా సారీ’ పాట.
ఆ తర్వాత ‘ లక్షి -ప్యారే’ లే ‘రేష్మా’ స్వరాన్ని ‘హీరో’ సినిమా ద్వారా వినిపించారు. ఆ పాట ‘లంబీ జుదాయీ’.
“మనం దూరమయ్యింది నిన్నా మొన్ననే
జీవించి ఎలాఉండను ఇలా సంవత్సరాల పాటు?
మృత్యువు రాదుకానీ నీ తలపులెందుకు వస్తున్నాయి?
దీర్ఘమైన ఎడబాటు...
నాలుగు రోజుల ప్రేమ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు..
నా ప్రాణం ప్రార్ధన రూపంలో పెదవులు మీదకు వస్తుంది
దీర్ఘమైన ఎడబాటు…..
నాలుగు రోజుల ప్రేమ ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు…..
మొదటిది ప్రియుడు నా చెంతలేడు
రెండోది కలుస్తాడన్న ఆశా లేదు
దానికి తోడు వర్షఋతువు వచ్చింది
వచ్చి నిప్పులు కురిపిస్తుంది
దీర్ఘమైన ఎడబాటు….
నీ చేతులతో నా ప్రపంచాన్ని ధ్వంసం చేసావు
నీ మనసు తో నా మనసు అద్దాన్ని పగలుగొట్టావు.
యుగాలను మించి ఎత్తైన గోడలు కట్టావు
దీర్ఘ మైన ఎడబాటు…...
పూయటానికి ముందే తోట నాశనమైపోయింది
కలవటానికి ముందే పక్షులు దూరమైపోయాయి
కోయిల కూత వేదన రేపుతుంది “

ఆయినా ముఝ్ కో మేరీ పెహ్లి సూరత్ మాంగి

‘ నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-103
“ఆయినా ముఝ్ కో మేరీ పెహ్లి సూరత్ మాంగి”
(దర్పణం నా తొలినాటి ముఖాన్ని కో రుతుంది)
-డాడి సినిమాలో తలత్ అజీజ్ పాడిన పాట(గజల్),రచన సూరజ్ సనిన్, సంగీతం ‘రాజేశ్ రోషన్’.
నా స్నేహితుడు ఒకాయన ‘ అద్దం అబద్ధం చెప్పదు’ పదాన్ని పదే పదే వాడేవాడు. అద్దంలో ముఖాన్ని యధాతధంగా చూసుకోవటానికి ధైర్యం కావాలి. వయసు తెచ్చేమార్పులే కాదు మనసు తెచ్చే మార్పులూ అద్దంచూపిస్తుంది.భౌతిక రూపాన్నే కాదు ,ఆంతరంగిక రూపాన్నీ చూపుతుంది.
ఆస్కార్ వైల్డ్ తన నవల ‘పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ లో దీనినే మరోలా చెబుతాడు. అందులో కథానాయకుడు సుందర రూపుడు. అతన్ని అభిమానించే ఒక కళాకారుడు అతని చిత్రాన్ని గీసాడు. ఐతే ఆ చిత్రం కథానాయకుని మానసిక మార్పులకు అద్దంపట్టేలా మార్పుచెందుతూ వస్తుంది. చివరికి ఆ చిత్రపు వికృతత్వాన్ని అతను భరించలేని స్థితికి అతను చేరుకుంటాడు.
వీటిగురించి ఆలోచనౌ రేపే పాట అప్పుడపుడు గుర్తుకొస్తుంది. పాట మరీ ప్రాచుర్యమయ్యింది కాదు. దర్శకుడు మహేశ్ భట్ తన కుమార్తె ‘పూజా భట్’ తో ‘డాడీ’ (1989) పేరుతో సినిమా తీశాడు.ఇది కొంతవరకూ అతని ఆత్మకథ అంటారు.
సినిమాలో నాయకుడు ఘజల్ గాయకుడు. ధనవంతుల ఇంటి పిల్ల ను ఆమె తండ్రి ఇష్టానికి వ్యతిరేకం గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. పొరపొచ్చాలు పెద్దల ఇష్టముంటే సర్దుబాటౌతాయి , లేకుంటే పెద్దవౌతాయి. వివాహం విఫలమయ్యింది. అతను మద్యానికి బానిసై సంగీతానికి దూరమయ్యాడు.
పెద్దదైన కూతుర్ని కలిసాక అతను తిరిగి నిలబడే ప్రయత్నం చేసాడు. ఆ సందర్భం లో అతను పాడిన పాట ఇది.
“అద్దం నా తొలినాటి ముఖాన్ని కో రుతుంది
నా వాళ్ళు నన్ను తనవాడిననటానికి గుర్తులడిగారు
దుఃఖభరిత వనాల్లో తిరుగాడుతుంటే
కాలం నా ముఖంపైన లెక్క రాస్తూ ఉంది.
నా కీర్తి నా వెర్రితనానికి ????
నా పాటలపుస్తకాన్ని మద్యపుసీసా తాగేసింది
ఇప్పుడు తిరిగి వచ్చాక నవ్వటమే మరిచాను
ఈ నగరం నన్ను మరచింది ..నేనూ దీనిని మరచిపోయాను
నా వాళ్ళు నన్ను పోల్చటానికి గుర్తులడిగారు
అద్దం నా తొలినాటి ముఖాన్ని కోరుతుంది
నా కళ నన్ను తిరిగి రంగం మీదికి తెచ్చింది
ఇక్కడ ప్రేమ ,నమ్మకం అమ్మకమౌతాయి
తండ్రి అమ్ముడౌతాడు..ప్రియతములు అమ్ముడౌతారు
గర్భం అమ్మబడుతుంది. మనసు అమ్మబడుతుంది ..తల అమ్మబడుతుంది
ఈ మారుతుండే ప్రపంచం దేనిపైనా నమ్మకముంచదు
ఇక్కడరోజూ చౌకగా దేవుణ్ణి అమ్మేస్తారు
ప్రతీ ఖరీదుదారునికీ బజారులో ఖరీదు చేయబడతాడు
నేను పొందగలిగిందేమిటి ? వేరేవారు ఇక్కడ పొందిందేమిటి?
నా భావనా! నా పూజా!! వేరేచోటు కు పద"

గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె

‘నచ్చిన’పాటలు-’లోపలి’ మాటలు-102
“గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె”(తెల్లగా ఉన్నవారిదీ కాదు నల్లగా ఉన్నవారిదీ కాదు, గుండె ఉన్నవారిదే ఈ లోకం).
డిస్కో డాన్సర్ లో పాట అంజాన్ రచన, సురేశ్ వాడ్కర్, ఉషా మంగేష్కర్ గానం ,బప్పిలహిరి సంగీతం
శివ్ ఖేరా రాసిన ‘యు కెన్ విన్’ పుస్తకంలో ఒక చిన్న కథ.
మార్కెట్ లో ఒకతను బెలూన్లు అమ్ముతున్నాడు. కొనేవారిని ఆకర్షించటానికి కొన్నిబెలూన్లలో హీలియమ్(?) నింపి ఆకాశంలోకి వదులుతున్నాడు. అందులో రంగురంగులవివున్నాయి.
ఒక పిల్లవాడు అమ్మేఅతన్ని ప్రశ్నించాడు. నల్లరంగు బెలూను కూడా పైకి వెళుతుందా? అమ్మేఅతని సమాధానం. “ బెలూన్ రంగుకాదు. అందులో ఏమున్నదో అది ముఖ్యం”.
ఈ కథ చదివాక నాకు గుర్తుకొచ్చిన హిందీ పాట “గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె”
క్రీడారంగం,కళారంగం నేపధ్యంలో వచ్చే సినిమాల్లో చాలా చిన్నస్థాయి నుండి మొదలైన ఆటగాళ్ళు/కళాకారులు పైకి రావటం, దానికి అదేరంగంలో విఫలమైన సీనియర్లు వారికి సహాయపడటం ఎక్కువగా చూపబడుతుంది.వీటికి ప్రజాదరణ బాగానే లభిస్తుంది. డిస్కో డాన్సర్ సినిమా కూడా అలాటిదే.
1982 లో డిస్కో డాన్సర్ సినిమా చాలా హడావుడి చేసింది. అంతకుముందు బి గ్రేడ్ హీరోగా ఉన్న మిథున్ చక్రవర్తిని దాన్సింగ్ స్టార్ గా మార్చింది. బప్పీలహిరి ని ప్రధమశ్రేణి సంగీతదర్శకుడిగా మార్చింది.సినిమాలో కథ ఒక పేద పిల్లవాడు వీధి గాయకుడిగా మొదలై పెద్ద గాయకుడిగా ఎదగటం.
కథానాయకుడు చిన్నగా ఉన్నపుడు పాడిన పాట ఇది. ఇందులో కనిపించే బాలనటుడి డాన్స్ మూవ్ మెంట్స్ మిథున్ చక్రవర్తి కదలికల్ని గుర్తుచేస్తాయి. అతని పాటనచ్చి మేడమీదినుండి దిగిన అమ్మాయిచేసిన నృత్యం ధియేటర్లలో విజిల్స్ వేయించింది.కథానాయకుడ్ని ప్రభావితం చేసిన వీధి గాయకుడిగా రాజేశ్ ఖన్నా పాటలో కనిపిస్తారు.
“తెల్లగా ఉన్నవారిదీ కాదు నల్లగా ఉన్నవారిదీ
కాదు గుండె ఉన్నవారిదే ఈ లోకం
నవ్వుతూ బతికి నవ్వుతూ మరణించే
మనలాంటి గుండె కలవారిదే
ఉదయ సాయంత్రాలూ మన పాటలు వీధుల్లో మారుమోగుతాయి.
మనం పాటల బేహారులం అదే మన పని
బంగారం వెండి మీద కాదు పాటమీదే మన ప్రేమ
బ్రతికిన నాలుగు రోజులూ ఆనందం గా బ్రతుకు మిత్రమా
చేయాల్సింది ఉంటే మనస్పూర్తిగా చేయి మిత్రమా
నీదేమిటి? నాదేమిటి? మరచిపో మిత్రమా”

యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -101
‘యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే’
కలతచెందిన నా హృదయమా,దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
మాన్ -అభిమాన్(1980) సినిమాలో జేసుదాస్ పాడిన పాట రవీంద్రజైన్ సంగీతం,సాహిత్యం అందించారు.
ఏ మనిషీ వేరే వారికి పూర్తిగా అర్ధంకారు.ఎవరికి వారైనా అర్ధమైతే కనీసం తమతో తామైనా మాటాడుకోవచ్చు. అలాంటి ఏకాంతం లో లోపలి సంభాషణతో కొంత సమాధానపడవచ్చు.
వేరేవారి సంగతి అటుంచి కొన్నిసార్లు ఎవరికి వారే పూర్తిగా అర్ధంకారు.అప్పుడు ఒంటరితనమే. అది మరింత వేదనాభరితం.
పై రెండు స్థితులూ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురైయ్యే ఉంటాయి. చుట్టు ఉన్న పరిస్థితులతో ఇమడలేని సందర్భాలు,ఎవరికీ మనసు మాట చెప్పలేని చెప్పటానికిరాని ,ఏదోలా చెప్పినా దానిని విన్నవారు సంపూర్ణంగా అర్ధంచేసుకోలేని స్థితి.
అప్పుడు మనమే మనకి తోడు. మన మనసే మన మిత్రుడు. మనసు కలత చెందితే మనం దానిని ఓదారుస్తాం. కొన్నిసార్లు మనపట్ల మనసును సానుభూతి చూపమంటాం.
మనం విని ఉన్న పాట ఉంటుంది. చాలాసార్లే వినిఉంటాం. ఎప్పుడో ఓ సారి ఆ పాట మనసుకు బాగా దగ్గరైపోతుంది. అంటే ఆ పాటకు అవసరమైన మానసిక స్థితిలో మనమపుడు ఉండి ఉంటాం.
’ పాట అలా దగ్గరైన పాటల్లో ఒకటి.
‘ఉధాస్ ‘ హిందీ పదానికి ‘ఉదాసీనత ‘ తెలుగు పదం దగ్గరదేమోననుకుంటాను. మనసు ఉదాసీనంగా ఉన్నపుడు , జగమంతా పరాయిదైనట్టనిపించినపుడు మనదైన ప్రపంచం ఇదికాదు అది ఎక్కడో ఉన్నట్టనిపిస్తుంది.
జేసుదాసు తన గానంతో పాటకు ,భావానికీ మరింత సాంద్రత పెంచాడు.
“కలతచెందిన నా హృదయమా
దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
నా ప్రాణమా ! నీ గమ్యం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఈ తోటలో ప్రతి పువ్వూ ముళ్ళతో గుచ్చుతుంది
స్వప్నాలు ధూ ళి గా మారుతుంటే ,వాటిగురించి చెప్పేదేముంది
నా మిత్రమా! నీ ప్రపంచం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఎవరూ మరువలేపోతున్న నా తప్పు ఏమిటి ?
పశ్చాత్తాపంతో కళ్ళు, నిండా ఆశృవులు నింపి రోదిస్తున్నాయి!
ఓ వెర్రివాడా! నీ సొంతం అనుకోగలిగింది
ఇది కాదు ..ఇది కాదు . వేరేదేదో ఉంది.
రాయి కూడా ఒకనాటికి కరుగుతుంది
గడ్డకట్టిన నీరు జలపాతం గా మారుతుంది
నీ క్లేశం అలా కరిగేదా
కాదు కాదు అది వేరే ఉంది.”


Friday, June 30, 2017

మై పల్ దో పల్ కా శాయర్ హు

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -100
1.మై పల్ దో పల్ కా శాయర్ హు, 2.మై హర్ ఎక్ పల్ కా శాయర్ హు
( నేను ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని) ( నేనుప్రతిక్షణం నిలిచిఉండే కవిని)
కభీ కబీ సినిమాలో ముకేశ్ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, ఖయ్యామ్ సంగీతం.
ప్యాసా ,కభీ కభీ , రెండు సినిమాలూ సినీ ప్రేమికుల్ని, సినీ సంగీత ప్రేమికుల్నీ అలరించాయి. రెంటికీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ కథానాయకులు కవులు. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ విఫలమయ్యింది. ఇద్దరి జీవితాలలోనూ తర్వాతి రోజుల్లో పాత ప్రేమికలు తారసపడ్డారు. ఐతే తర్వాత వారు సాగిన దారులు వేరు.
రెండు సినిమాలకు సాహిత్యం ‘సాహిర్ లూధియాన్వి’దే.నిజజీవితలో భగ్న మనస్కుడైన ‘సాహిర్ లూధియాన్వి’ కొన్ని పాటల్లో తాను నిజంగానే ప్రవేశిస్తాడు. కథానాయకుడు కూడా తనవంటి కవి ఐనప్పుడు ,పాత్ర మనసిక స్థితిలో కూడా సామాన్యత ఉన్నపుడు ‘సాహిర్ ‘ తనే ఆ పాత్ర ఐపోయాడు. ‘సాహిర్’ అలా పాత్రగా మారి సాహిత్యం అందించిన ఈ రెండు సినిమాలూ రెండు కళాఖండాలు గా నిలిచిపోయాయి.
‘ప్యాసా’ విషాదాంతం అనలేము ,అలాగే ప్రమోదాంతం అనలేము. చివర్లో కథానాయకుడు తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు.
కభీ కభీ లో కథానాయకుడు ప్రేమను పొందలేని చోట ఆగిపోలేదు. అతనిది మరీ ప్రత్యేక ప్రపంచం కాదు. సమాజంతో మరీ ఫిర్యాదు లేదు.వేరే జీవితాన్ని నిర్మించుకున్నాడు. తండ్రి వ్యాపారాన్ని తను చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు.
తన తొలినాళ్ళలో జీవితం పట్ల అతని ఆలోచనల్ని అతను గానంచేసాడు. తన జీవితం తనది మాత్రమే అనుకున్నాడు. తనతో పాటు అది అంతమౌతుందనుకున్నాడు. తనున్న రెండు క్షణాల జీవితం ఎవరికీ పట్టనిదనుకున్నాడు. తనని ‘రిప్లేస్’చేసేవారితో తనకేమీ సంబంధం లేదనుకున్నాడు.
అప్పటి రోజుల్లో అతని గానం:
“రేపు కొత్త మొగ్గలు తొడుగుతాయి.రేపు కొత్త పువ్వులు నవ్వుతాయి
కొత్తనేలమీద,కొత్త పచ్చికపై కొత్త పాదాలు నడయాడుతాయి
అవి నన్ను పట్టించుకోవు.నేనూ వాటిని పట్టించుకోను
వాటి ఉదయ సాయంత్రాలలో ఒక లిప్త కాలమైనా నాదిగా ఎలా చేసుకోగలను?
నేనూ ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని
ఒకటి రెండు క్షణాల సంతోషం నాది,ఒకటి రెండుక్షణాలు ఉండే యవ్వనం నాది
నాకంటే ముందు ఎంతమంది కవులు రాలేదు ? వచ్చి వెళ్లిపోలేదు
కొందరు నిట్టూర్పులు విడిచి వెళ్ళారు కొందరు పాటలు పాడి వెళ్ళారు
వారూ ఒక్క క్షణపు కథలే, నాదీ ఒక్క క్షణపు కథే
ఇప్పుడు మీలో భాగాన్నినేను ,రేపు మీనుండి దూరమౌతాను.
రేపు వికసించే పాటల మొగ్గల్ని ఏరుకునేవారు మరొకరు వస్తారు
నాకంటే ఉన్నతంగాగా చెప్పేవారు, మీకంటే ఉన్నతంగా వినేవారు
రేపెవరో నన్ను గుర్తుచేసుకుంటారు. ఐనా ఎందుకు గుర్తుచేసుకోవాలి?
తీరికలేని ప్రపంచం నాకోసం తన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటుంది?”
సినిమా చివరిలో ఒకతరంలోని వ్యక్తులు తమ తర్వాతతరం వారిలో తమని తాము చూసుకుంటున్నారు. అపుడు
వినిపించే పాట మొదటి పాట వరుసలోనే మరొక అర్ధంతో వినపడుతుంది.
జీవితమంటే ఒకరి జీవితం కాదు. అది రూపాలు మార్ర్చుకుంటూ వేరే వారిని వాహిక చేసుకుని కొనసాగుతుంటుంది అని చెప్పే పాట అది. జీవితానికున్న ‘కొనసాగింపు’ ను తన జీవితానుభవాలద్వారా కథానాయకుడు గమనించగాడని అనిపిస్తుంది.
“ ప్రతిక్షణం నిలిచిఉండే కవిని నేను
కలకాలం నిలిచి ఉండే కథ నాది
ఎల్లవేళలా ఉండే సంతోషం నాది
అనుక్షణం ఉండే యవ్వనం నాది
అనుబంధాల రూపం మారుతూ ఉంటుంది
బంధాల పునాదులు నాశనం కావు
స్వప్నాలు, ఆకాంక్షలు నాశనం కావు.
ఒక పువ్వులో నీ రూపం నిలుస్తుంది
ఒక పువ్వులో నా యవ్వనం ఉంటుంది
ఒక ముఖం లో నీ గుర్తులుఉంటుంది
ఒక ముఖంలో నా గుర్తులుంటాయి
నువ్వు నేను జీవన అమృతాన్ని
ఈ చేతులతో తాగాలి
వీరి గుండె చప్పుడులో నివాసముండాలి
వీరి శ్వాస లో జీవించాలి
నీ సోయగాల్ని ఒకరికివ్వు
నేను నా నమ్మకాన్ని ఒకరికిస్తాను
ని కోసమే చేసిన ఆలోచనలు
అన్నింటినీ దీవెనలు చేస్తాను.”



ముఝే నవ్ లఖా మాంగాదే రే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -99A
‘ముఝే నవ్ లఖా మాంగాదే రే ‘, ‘లోగ్ కెహతే హై మై షరాబీ హు’
(ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.),( ‘లోకులనుకుంటారు నేను తాగుబోతునని’)
...
షరాబి సినిమాలో ఆశా భోన్స్లే, కిశోర్ కుమార్ పాడినపాట.రచయిత అంజాన్,సంగీతం బప్పిలహిరి.
నాకుతెలిసి లిరిక్ గా అతిపెద్ద పాట. రెండు పాటలుగా కూడా చెప్పవచ్చేమో.
పాట మొదటి భాగం ఆశాబోన్స్లే స్వరంతో ఏదో జానపద గీతం ఆధారంగా తయారయ్యిందనిపించేలా ఉంటుంది.
రెండో భాగం కిశోర్ స్వరంతో మనుషులంతా ఏదో ఒక మత్తులోనే ఉంటారని చెబుతూ సాగుతుంది.భానుమతి పాడిన ఒక తెలుగుపాట ‘పిచ్చి పిచ్చి పిచ్చి,రకరకాల పిచ్చి’ ని ఈ పాట గుర్తుచెస్తుంది.

డెబ్భైలలో దర్శక నిర్మాత ‘ప్రకాశ్ మెహ్రా’ కు అమితాబ్ తో అనేక విజయాలందాయి. తొలి ఎనభైలలో కూడా వీరి కాంబినేషన్ ఆర్ధిక విజయాలనిచ్చింది కానీ పాత కీర్తిని పెంచలేదు. ఎనభైల తర్వాతి వాటిలో నాకు నచ్చిన సినిమా ‘షరాబి’. అమితాబ్ ,అమితాబ్ గా కనపడిన అతికొద్ది సినిమాలలో ఇది ఒకటి(పూర్తి స్థాయి కథానాయకుడిగా).
ముకద్దర్ కా సికందర్ లో ‘సలామె ఇష్క మేరీ జాన్’ పాట ఆ సినిమాకు పెద్ద ఆకర్షణ. ఆ సినిమా ప్రకాశ్ మెహ్రాదే. ఆ పాట దారిలో ‘షరాబీ’లో కూడా ఒక పాట పెట్టారు.
సంగీత దర్శకుడు బప్పిలహిరి. బి గ్రేడ్ సినిమాలకు సంగీతమందిస్తూ ఎనభైలలో పెరిగి ప్రధాన సంగీతకారుడయ్యాడు. నమక్ హలాల్, షరాబి వంటి అమితాబ్ సినిమాలకు సంగీతమిచ్చి, అమితాబ్ -ఆర్ డి బర్మన్, అమితాబ్ - లక్ష్మి ప్యారే ల కాంబినేషన్ కన్నా ముందుకెళ్ళాడు.
పాట

తనువెల్లా అలంకరించుకుంటాను
గుండె చప్పుడు లా నా కాలి అందెలు మోగినప్పుడు
ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.
నుదుట బొట్టు(?) చెవులకు జూకాలు
కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులు
నిన్ను చేతుల్లోకి తీసుకుంటాను,నాకు దుస్తులు కుట్టించు
నిన్ను తనువుకు హత్తుకుంటాను,మెరిసే చుక్కలతో చునిరీ
అవి కట్టుకుని వస్తే అందరి చూపులూ నాపైనే
నన్ను అలంకరించు
ఈ అందం ...ఈ వయసు తో
నీకోసం నాట్యం చేస్తున్నాను
సూర్యుడి నడిగి సౌందర్య సామగ్రి తెప్పించు నా కోసం
నీ పెదవులు స్పృశిస్తా ప్రియతమా
జీవితమంతా ఎదురు చూస్తూనే ఉన్నా
ప్రియుని కళ్ళలోని అల్లరి కోసం
నీప్రేమలో కోల్పోయిన
నా జన్మజన్మల కలల్ని అలంకరించుకుని కూర్చున్నా
ఇప్పుడు అర్ధంచేసుకుని ఒప్పుకున్నా
హృదయం అర్పిస్తే ఏమౌతుందో
ప్రపంచం ఏడ్వనీ, లోకులు కోపగించనీ
నేను ప్రియుని ఇంటికి వెళ్ళవలసిందే
పూలదండ నవ్వినట్టు
నువ్వు కళ్ళతో నవ్వినట్టు
కిరణాలను నా పాపిట్లో అలంకరించు
పున్నమి చంద్రుని నా నొసట బొట్టుగా తే
నిన్ను నా నుదుట దిద్దుకుంటాను
మొత్తం మద్యశాలను నీ పాదాలపై చిలకరిస్తాను
**************
“లోకులనుకుంటారు నేను తాగుబోతునని
నువ్వు ,బహుశా అదే అనుకును ఉంటావు
అవును, లోకులనుకుంటారు నేను తాగుబోతునని
కొందరిలో యౌవన సౌందర్యాల నిషా
కొందరిలోప్రేమతరంగాల నిషా
కొందరికి కొందర్ని చూస్తే శ్వాస నుండి ఉబికివస్తుంది నిషా
తాగనప్పటికీ హద్దులుదాటి నడిచే నిషా
నిషా లో లేని వారెవరో కొద్దిగా చెప్పునాకు
తెలివి తో ఉన్నఎవరినైనా నా ముందుకు తీసుకురా
అందరూ నిషాలోనే ఉన్నారు..తేడా వాటి రంగుల్లోనే
వెలుగురేఖల ఉదయానికి తుషారపు నిషా
పవనానికి సుగంధాల నిషా, మేఘానికి వాన చినుకుల నిషా
కొందరికి సుఖమే నిషా, కొందరి కి బాధే నిషా
నిషా అనేది మద్యంలో ఉంటే మద్యపు సీసా నాట్యం చేస్తుంది
మద్యశాల ఊగుతూ ??????
ప్రియతమా! కళ్ళతో మధువు తాగించు కొద్దిగా
ప్రియతమా! నిన్ను నేను , నా శ్వాసలో బస చేయిస్తాను
ప్రియతమా! నీకు (9 లక్షలవిలువైన ) హారం చేయిస్తాను”