Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-37’
ధరతి కహె పుకార్ కే  10 February

(ధరణి పిలిచి చెబుతుంది)
(దో బిఘా జమీన్ (1953) సినిమాలో పాట, సంగీతం సలీల్ చౌధురి,రచన శైలేంద్ర,గానం లతా మంగేష్కర్,మన్నాడే)
...
ఉన్న చోటగడవని స్థితి కొందర్ని, వేరేచోట మరిన్ని అవకాశాలు కొందర్ని ఉన్నచోటునుండి వేరే చోటుకు కదులుస్తాయి. కదలిక పట్ల 'ఇనెర్షియా' సహజం.దాన్ని అధిగమించి కదలటానికి కారణాలు ఒకటి అవసరం మరొకటి అవకాశం.
మొదటిదానివల్ల కదిలేమనిషిపట్ల సానుభూతి ఎక్కువ కలుగుతుంది.
ఈ చిత్ర దర్శకుడు బిమల్ రాయ్. ఇటాలియన్ సినిమా బైసికిల్ థీవ్స్ స్పూర్తి తో ఈ సినిమా తీసాడంటారు. సినిమా చూస్తే పూర్తి భారతీయత ప్రతిబింబించే కళాఖండమనిపిస్తుంది. కథానాయకుడు బలరాజ్ సాహ్ని నటన అత్యంత సహజంగా ఉండి మనకెంతో పరిచయమైన,ఇంటిలోని మనిషిని చూసినట్టే ఉంటుంది.
రెండు బిఘాల భూమి అంటే ఎనభై సెంట్ల భూమి.ఎకరం కంటే తక్కువ.అదే అతని ఆస్తి...అతని అభిమానం.ఆధారం..జీవనాధారం. దాన్నుండి పండింది పండించుకోవటమే కాదు , దాన్ని రక్షించుకోవటమూ పెద్దపనే. మామూలు వడ్డీతో కూడిన అప్పునే కష్టంతో భరించగలిగినప్పుడు అది దొంగ వడ్డిలతో లెక్కిస్తే సన్నకారు రైతు ఏమౌతాడు? ఆ అప్పు తీర్చటానికి పొలంసాగు కన్నా ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగే పనిని వెతుక్కుంటూ పోతాడు.
వడ్డి పెరుగుదలకూ, అతని ఆదాయపు పెరుగుదలకూ పరుగు పందెం.
విజయం ఎవరిది?అతను ఎక్కడ బయలు దేరాడు?ఎక్కడ తేలాడు?
1953 లో ఈసినిమా వచ్చింది.రైతుల స్థితి ఇప్పటికీ మారలేదనిపిస్తుంది.
'ధర్తి కహే పుకార్ కే పాట సందర్భం’:
అప్పులపాలైన రెండు బిఘాల రైతు ఆ అప్పు తీర్చి తన భూమిని కాపాడుకోవటానికి కలకత్తా బయలుదేరాడు.అతన్ని సాగనంపుతున్నట్టు వివిధ పనుల్లో మునిగివున్నకష్టజీవులు..దూరం నుండి బిందెలతో నీరు మోసుకునేవారు,భూమిని పెళ్ళగించేవారు(దున్నటానికి బదులుగా?), కుప్పలువేసేవారు, లోతైన బావుల్లో నీరు చేదుకునేవారు...తమభాషలో అతన్ని ఊరడిస్తున్నారు.
“గంగా యమునలు ఎలా సాగిపోతున్నాయో చూడు.
ఎప్పుడోఒకప్పుడు అందరూ సాగిపోయేవారే
ధరణి పిలిచి చెబుతుంది
ప్రేమ గీతం పాడమని
కాలం గడచిపోతుంది...
నీ కథను విడిచివెళ్ళు
నీ గుర్తులు కొన్ని విడిచెవెళ్ళు
నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.
కాలం గడచిపోతుంది...
నువు తిరిగొచ్చే దారిలో మొగ్గలు కన్నులు విప్పార్చి ఉంచాయి
కొమ్మకొమ్మల్లో కోయల్లు నీపాట పాడుతున్నాయి
నీలాకాశం నవ్వుతూనే వుంది
చేలన్నీ గీతాలు ఆలపిస్తున్నాయి.
మరి నీమనసెందుకు దిగులుగా ఉంది
మనసనే వేణువును పలికించు
ఏవో రాగాలు పలికించు
నువ్వూ నవ్వుతు ఉండు.”
"ఒక నదిలో నువ్వు రెండుసార్లు అడుగు పెట్టలేవు" అంటాడు తత్వవేత్త హెరాక్లిటస్.
ఒక వృత్తిలోనుంచి మరో వృత్తి లోకి మారి తిరిగి పాత వృత్తిలోకి మారటం కష్టమైన దే.అది కూడా నదీప్రవాహంలా వెనక ప్రయాణం ఉండనిదేనేమో. 'కౌన్ కహె ఇస్ ఓర్ తు ఫిర్ ఆయే న ఆయే' (నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.)పదం లో నాకు అదే కనిపిస్తుంది. కథలో జరగబోయేది కూడా అదే. దాని సూచన కూడా కావచ్చు.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-36’
“తుమ్హే యాద్ కర్ తె కర్ తె , జాయేగి రైన్ సారీ”8 February

(నీ జ్ఞాపకాలతో రాత్రంతా మెలుకువతోనే ఉండిపోతాను.)
'అమ్రపాలి ' సినిమాలో లతా మంగేష్కర్ పాడిన పాట.శంకర్ జైకిషన్ సంగీతం,శైలేంద్ర రచన.నటి వైజయంతిమాల.
...
ఈపాటంటే గుర్తుకొచ్చేవి సితార్,వయొలిన్ల వాదనలు. పాట మధ్యలో వచ్చే సితార్ ధ్వని కొన్నిక్షణాలు మైమరపు కలుగజేస్తుంది. పాట అర్ధం తెలియకుండా విని తర్వాత అర్ధం తెలుసుకుంటే మొత్తంతెలిసిందే అనిపించేంతగా లతా మంగేష్కర్ ఆలపించిందనిపిస్తుంది.
యుద్ధము-శాంతి
అమ్రపాలి కథ గౌతమ బుద్ధుని కాలం నాటిది. అజాతశత్రు మగధ రాజ్యాధిపతి.వైశాలి నగర ఆక్రమణ అతనికోరిక.అది వీలుకాలేదు.మారువేషంలో వైశాలికి వచ్చి అక్కడ రాజనర్తకి 'అమ్రపాలి 'పట్ల ఆకర్షితుడయ్యడు.ఇప్పుడు నగరమే కాదు అమ్రపాలి ని కూడా అజాత శత్రు పొందాలి.
శత్రువును ప్రేమించినందుకు అమ్రపాలి ని రాజు ఖైదు చేశాడు. అజాతశత్రు వైశాలిపై దండెత్తి విధ్వంసానంతరం నగరాన్ని చేజిక్కించుకున్నాడు.అమ్రపాలి ని రాణిని చేస్తానన్నాడు. విధ్వంసం,హింస,జననష్టం చూసిన అమ్రపాలి అన్నింటిని తృణికరించి గౌతమ బుద్ధుని చెంత స్వాంతన చెందింది.
అజాతశత్రు రాజ్యసీమ గెలిచాడు కాని అమ్రపాలి హృదయసీమలో చోటుకోల్పోయాడు.
'అమ్రపాలి ' అజాతశత్రు ను సాధారణసైనికునిగా భావించి అతని ప్రేమలో ఉన్నప్పుడు వచ్చే పాట ఇది.
“నీ జ్ఞాపకాలతో రాత్రంతా మెలుకువతోనే ఉండిపోతాను.
నీతోనే నా నిద్రనూ తీసుకుపోయావు
మనసు నాకేతెలియని నగరంలో బస చేసింది.
తప్పిపోయిన దారుల్లో ఏదో వెతుకుతుంది.
ఇంత పెద్ద భవనంలో ఏదో భయం కలుగుతుంది
ఈ విరహపు చితి నుండి నీవే నన్ను తప్పించు
నువ్వు రాలేకపోతే నన్ను స్వప్నంలోకైన పిలువు.
నన్నిలా కాల్చేయకు, చిరుప్రాయపు ప్రేమ నాది.”
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-35
'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి '.6 February
(హృదయం తిరిగి వెతుకుతుంది.)
('మౌసం సినిమా లో భుపేందర్ ,లతా పాడిన పాట,రచన గుల్జార్,సంగీతం మదన్ మోహన్ )
...
దిలీప్ కుమార్,దేవానంద్,షమ్మి కపూర్,రాజేంద్రకుమార్ తర్వాతితరం కథానాయకుల సినిమాలు ఒకవెల్లువలా వచ్చిన సంవత్సరాలు మిడ్ సెవంటీస్.ప్రత్యేకంగా 1975 లో కభీ కబీ,ఆంధీ,మౌసం, షోలే,దీవార్,చుప్కే చుప్కే,అమానుష్,ధర్మాత్మ,ఖుష్బూ వంటి పెద్ద హీరోలసినిమాలు, జూలీ,ఖేల్ ఖేల్ మే, గీత్ గాతా చల్ వంటి చిన్న హీరోలసినిమాలు వచ్చాయి.చాలాభాగం విజయవంతం అయ్యాయి. వీటన్నింటిలోనూ డజన్లకొద్దీ పాటలు జనం నోళ్ళలో నానుతూండేవి.
ఆ సంవత్సరం సంగీతదర్శకుడు మదన్ మోహన్ పాటలవరకు సంగీతమిచ్చిన సినిమా 'మౌసం ' (తెలుగులో ఋతువు అనాలా కాలం అనాలా? హిందీలో సంవత్సరానికి 4 మౌసం లు.
తెలుగులో 6 ఋతువులు,మూడు కాలాలు).
కిశొర్ కుమార్ అప్రతిహతంగా వెలుగుతున్న కాలం లో అతని పాట లేకుండా వచ్చిన సినిమా మౌసం. తనచేతనే గాయకుడిగా పరిచయం చేయబడ్డ 'భుపేందర్ ' తో రెండు పాటలు మదన్ మోహన్ ఇందులో పాడించాడు. రఫీ,లతా లు మిగతా గాయకులు.
సంగీతం,సాహిత్యం, గానంసరైన మేళవింపు జరిగితే అమర(ఇమ్మోర్టల్) గానం ఆవిష్కృతమౌతుంది. 'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి ' పాట అలాంటిదే.
సినిమా పేరు 'మౌసం '.అవి సంవత్సరానికి నాలుగు (ఏక్ బరస్ కే మౌసం చార్ ..ఒక పాటకూడా వేరే సినిమాలో ఉంది). నాలిగింటిలో మూడు 'మౌసం ' ల ప్రసక్తి ఈ పాటలో ఉంది.ఆ ఋతువుల్ని(?)వాటితో పాటు ప్రేమను అనుభూతిస్తూ చెప్పిన పాట.
నాలుగో 'మౌసం 'రికార్డు చేయబడింది కాని సినిమాలోకి రాలేదని చదివాను.
“విశ్రాంతంగా కూర్చుని ప్రేమించినవాని తలపుల్లో మునిగిన నాటి
రేబవళ్ళ కోసం హృదయం తిరిగి వెతుకుతుంది.
శరత్కాలపు నీరెండలో నీ చెంగు లో కళ్ళు దాచుకుని
ఇంటి వాకిట్లో పడుకుని
ఒక్కోసారి తలదించుతూ, వేరే వైపు వత్తిగిలుతూ...
హృదయం తిరిగి వెతుకుతుంది.
లేకుంటే, వెచ్చనైన వేసవి రాత్రుల్లో,తూర్పుగాలి వీచినపుడు
మేడమీదచల్లటి తెల్లటి చద్దర్లపై పడుకుని
పొద్దుపోయే వరకు మేలుకుని తారల్ని చూసినప్పుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.
మంచుకురిసే శీతవేళల్లో ఏదైనా కొండమీద
లోయల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దాలను వింటూ
కళ్ళపై తెలిమంచుతెరలు కప్పుతున్నపుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.”
ఈ పాట రఫీ తో ఎందుకు పాడించలేదా అని రఫీ అభిమానిగా ఇదివరకు అనుకున్న క్షణాలున్నాయి. ఐతే ఆ కోరిక వేరే రకంగా తీరింది.
పాటలో ఒక పాదం "తసవ్వుర్-ఎ-జానా కియె హుఎ " కొత్తగా అనిపించేది. వెతికితే తెలిసిన విషయం ఈ పాట పల్లవి గాలిబ్ ఘజల్ "ముద్దత్ హుఈ హై యార్ కో మెహ్మాన్ కియే హుఏ " లో ఆఖరి స్టాంజా లలో ఒకటి. ఆ ఘజల్ ను మహమ్మద్ రఫీ 'మీర్జా గాలిబ్ ' సినిమాలో పాడాడు. అలా నాకోరిక తీరింది.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-34’
'యే దౌలత్ భి లేలొ,యే షొహరత్ భి లేలొ '4 February

  (ఈ సంపదలు తీసేసుకో,ఈ కీర్తి,కిరీటాలు తీసేసుకో)
(గానం జగ్జిత్ సింగ్ & చిత్రా సింగ్, సుదర్శన్ ఫాకిర్ రచన)
ఈ పాటను తొలిసారి 86 లో విన్నాను.నా మరాఠీ మిత్రుడు వినిపించాడు.గాయకులు జగ్జీత్ సింగ్, పంకజ్ ఉధాస్ లు 'ఆధునిక ' గజల్ ను వ్యాప్తిలోకి తెస్తున్నకాలం.ఈ పాట గజల్ ఔను కాదు అనేవారున్నారు.నాకు ఇది గజల్ అనిచెప్పి వినిపించారు.ప్రక్రియ తో సంబంధంలేకుండా ఈ పాట నన్ను ఆకట్టుకుంది.ఆకర్షిస్తూనే ఉంది....
సొంతింటికి,మనుషులకు,వూరికి తపాలా అందేకాలంలెక్కేస్తే ఐదు రోజుల దూరం,రైలు ప్రయాణం లెక్కేస్తే 20 గంటల దూరం.ఫోను అనేది ఆలోచనకే అందనంత ఖరీదు.సొంతప్రపంచం విస్తృతం అవ్వని రోజులు నాకు.

బాల్యానికి దూరం అప్పటికే అయ్యాను.జీవన పోరాటానికి సన్నధ్ధం ఔతున్నాను.వెనక్కి చూసినప్పుడు బెంగ,ముందుకు ఆలోచిస్తే భయం. అలాంటి మానసిక స్థితి లో ఉన్నప్పుడు విన్నపాట ఇది.
“ఈ సంపదలు తీసేసుకో
ఈ కీర్తి,కిరీటాలు తీసేసుకో
ఇంకా చాలదంటే ఈ యవ్వనాన్ని లాగేసుకో
కానీ నా చిన్ననాటి వానాకాలాన్ని..
ఆ కాగితపు పడవను, వాననీటిని వాపసు ఇవ్వు.
వీధిలో పాతకాలపు గురుతులా ఆ ఇల్లు
పిల్లలందరం బామ్మ అనిపిలిచే ఆ ముసలామె
ఆ బామ్మ మాటల్లోపటి కల్పితకధల మజిలీ
ఆమె ముఖంలో ముడతలు చెప్పే శతాబ్దాల కథలు
మరువలేదు..ఎవరూ మరువలేరు
ఆ చిన్నచిన్న రాత్రులు..పెద్ద పెద్ద కథలు
ఆ కాగితపు పడవ, వాన నీరు
ఎర్రటి ఎండలో ఇంటినుండి బయటపడటం
పిట్టలు,కోయిల్లు,సీతాకోక చిలుకలు..వీటి వేట
బొమ్మలపెళ్ళిలో కయ్యాలు,జగడాలు
ఉయ్యాల్నించి పడటం,పడుతూ సంబాళింపు
రాగి రింగుల చక్కటి బహుమతులు
విరిగిన గాజుల గురుతులు
ఆ కాగితపు పడవ, వాన నీరు
ఇసుక గుట్టల ఎత్తుల ఆరోహణలు
బొమ్మరిళ్ళు కట్టటం వాటిని తొక్కి పాడుచేయటం
ఆ అమాయక కోరికల చాయాచిత్రాలు
ఆ ఆటబొమ్మల,కలల నా జాగీరు
ప్రాపంచిక బాధలు,బంధుత్వపు బంధనాలు ఉండవు
ఎంతో అందమైన లోకం
ఆ కాగితపు పడవ, వాన నీరు”
ఈ పాట గుర్తుచేసే వివరాలు ఎన్నోకొన్ని చాలామందికి అనుభవం అయ్యి ఉంటాయి.
బాల్యంఅందమైనదో,ఆనందమైనదో కావటానికి కారణం అప్పటి మన బరువును ఎవరో మోస్తుండటం కావచ్చు. దేనికీ పూచీ లేని bratuku ఎప్పటికీ బ్రతకాలనుకోవటం అత్యాశో,అతి స్వార్ధమో కూడా అనిపిస్తుంది.
----ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-33’'బాలం ఆయొ బస్ మొరే మన్ మె ' 2 February
'ప్రియతమా వచ్చి నా మనసులో వసించు '
హిందీ 'దేవదాస్ '(1936)సినిమాలో కె.ఎల్.సైగల్ పాడి నటించిన పాట.
...
ఒక నవల ఒకటికన్నా ఎక్కువసార్లు సినిమా రావటం అసాధారణంకాదు(నిన్నటి మీనా నేటి అ ఆ లు ఒ ఉదాహరణ). మరి ఒకే సాంఘిక నవల సుమారు పదిసార్లు వివిధభారతీయ భాషల్లో రావటం విశేషమే (అందునా తొంభై యేళ్ళ కాలవ్యవధి లో).అంటే ఆ నవలా ఇతివృత్తంలో ఏదో సర్వకాలీనత ఉంది.ఆ నవల శరత్ చంద్ర రాసిన 'దేవదాస్ '.
దేవదాస్ మూకీ సినిమాకాలంలో అంటే ముప్ఫైలకు ముందు సినిమాగావచ్చింది.35/36 లలో బెంగాలీ, తమిళ, హిందీ దేవదాసు సినిమా వచ్చింది. తర్వాత తిరిగి హిందీలో రెండుసార్లు,తెలుగులో రెండు సార్లు వచ్చింది. అభయ్ డియోల్ నటించిన 'దేవ్ డి ' కూడా దేవదాసే. కాకుంటే అతను ఆధునిక దేవదాసు.
ఐతే 36లో వచ్చిన హిందీ దేవదాసు భరతఖండం ఆమూలాగ్రనికి తనను పరిచయంచేసుకుని వారిలో ఒకడైపోయాడు.ఆ పాత్ర ధరించిన 'కుందన్ లాల్ సైగల్ ' నటగాయకుడు. భారత దేశపు తొలి స్టార్ సింగర్ కూడా.భౌతికంగా బ్రతికింది 43 యేళ్ళేకాని, గత ఎనభైయేళ్ళు గా సంగీతప్రియుల మదిలో బ్రతికేఉన్నాడు.
తొంభల తొలి సంవత్సరాలలో ఎదో కూల్ డ్రీంక్ అడ్వర్టైజ్ మెంటులో అక్షయకుమార్ డ్రింకు తాగకముందు నెమ్మదిగా సాగే సైగల్ పాట పాడుతుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. ఆతను వెంటనే కూల్ డ్రింక్ తాగి హుషారైన పాటేదో పాడుతాడు.ఆ యాడ్ పట్ల చాలా నిరసన వ్యక్తమై, కొందరు సైగల్ అభిమానులు కోర్ట్ కెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అంతగాఢమైన అభిమానం సైగల్ పట్ల ఇప్పటికీ ఉండటం నాకు అనూహ్యం.
రేడియో సిలోన్ సైగల్ కు చాలాప్రాముఖ్యత ఇచ్చింది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ముందు పురానె ఫిల్మోంకె గీత్ ప్రోగ్రాం అఖరి పాటగా సైగల్ పాట ప్రసారం అయ్యేది.అప్పుడు ఇష్టంగా వినకపోయినా సైగల్ పేరు చెబితే కొన్ని పాటలు గుర్తొస్తాయి.
సైగల్ పాటలు పాడే విధానాన్ని తర్వాతి గాయకులైన ముకేశ్, కిశోర్ కుమార్ తొలినాళ్ళలో అనుసరించారు.సైగల్ పా టల్ని,అతన్ని అభిమానించే తరానికి చెందినవారు ఇప్పుడు చాలా కొద్ది మంది ఉండుంటారు. తర్వాత తరాలకి చెందినవారికి సైగల్ సంగీతం గతకాలపు చరిత్ర కావచ్చు.కాని అది సినిమా సంగీతానికి పునాది. సినిమా సంగీత ధోరణుల పరిణామ అధ్యయనం కోసమైనా సైగల్ పాటలు వినాలి. ఐతే ఆ అధ్యయనం చేసేక్రమంలో సైగల్ మత్తులో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనిపిస్తుంది కొన్నిపాటలు వింటుంటే.
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-32’'మేరే మహబూబ్ కయామత్ హోగీ'.31 January
ఇప్పటి ప్రముఖ పాకిస్తానీ గాయకుడు 'సజ్జద్ అలి ' హిందీ సంగీత ప్రియులకు తెలిసిన పేరే. మహాగాయకులైన బడే గులాం అలిఖాన్,మెహ్దీ హసన్,గులాం అలి వంటి వారి పాటల్ని పదమూడేళ్ళవయసులోనే తిరిగి పాడి అల్బం వెలయించి పేరుతెచ్చుకున్నాడు.
బహుశా అదేకారణంతో కావచ్చు అతనికి ప్రముఖ హిందీ గాయకుల పాటలు తిరిగి పాడే అవకాశం వచ్చింది.
ఆ అవకాశం వెనుక కథ.......
ఎనభైల మొదట్లో సుమారు 500 రూపాయిల ఖరీదుతో టేప్ రికార్డర్లు సామాన్యజనానికి అందుబాట్లోకి వచ్చాయి.ఎల్.పి,ఇ.పి రికార్డులనుండి కాసెట్టు మీదికి రికార్డింగు చేసే సెంటర్లు వొచ్చాయి. ఖరీదు పరంగానూ,అందుబాటు పరంగానూ కాసెట్టులు ప్రజల అవసరాలను తీర్చేవికావు.సోనీ వాక్ మాన్ వంటివు వున్నవారివంక ఆరాధన గా చూసే రోజులవి. ఢిల్లీ మార్కెట్లో వాక్ మన్ కు ప్రత్యామ్నాయ ప్లేయర్లు 350 రూపాయలకి దొరికేవి. ఐతే దానిలో ప్లే చేసుకోవటానికి హెచ్.ఎం.వి వారి కేసెట్ కొనాలంటే నలభై రూపాయలపైనే.పది గంటలకు సరిపడా కేసెట్లు కొనాలంటే ప్లేయర్ ను మించి ఖరీదు.ఏతా వాతా ..కేసెట్ల డిమాండ్ కు సరిపడా సప్లై లేదు. సప్లై చేయాల్సిన వారు సినిమా పాటలమీద ఇంచుమించు మోనోపలీ ఉన్న హెచ్.ఎం.వి వారే. మరి వారి అప్పటి స్ట్రేటజీ ఏమిటోగాని మార్కెట్లోనైతే బోలెడంత గేప్.

ఎన్ని చిన్నచిన్న ప్రయత్నాలు జరిగాయోగాని చాలా తక్కువ రేట్లకు సినిమా పాటలు అందసాగాయి. టి.సీరీస్,ఎస్ సి ఐ (సుపర్ కాసెట్ ఇండస్ట్రీ)పేరుతో 15రూపాయలకే కాసెట్ దొరికేది.అందులో పాటలు ఒరిజినల్ సింగర్స్ వి కావు.అదేసంగీతం,దగ్గరదగ్గర అదే స్వరంతో తిరిగి పాడించిన పాటలు.ఐతేనేం అసలు దొరకనిదానికన్నా మంచిదేగా!ఆ పాటలకి జనాలెంత అలవాటు పడిపోయారంటే అవే అసలు పాటలనేటంత.
అలా ప్రజలకు దగ్గరైన గాయకుడు ‘సజ్జద్ ఆలి’. ఒరిజినల్ గాయకుడు రఫీఐనా,ముకేశ్ ఐనా,కిశోర్ ఐనా,చివరికి లతా మంగేష్కర్ ఐనా ..సజ్జద్ అలి తనగొంతుతోనే పాడి ఒక తరహా ప్రజల్ని అలరించాడు.
టి సిరీస్ ఓవర్ నైట్ పెద్ద సంగీత సంస్థ ఐపోయింది, ఒరిజనల్ సింగర్లకు మరింత దగ్గర స్వరం వున్న గాయకుల్ని వెతికి 'ఇంచుమించు సరిపాటి ' అనేలా కాసెట్లు మార్కెట్ చేసింది. హెచ్.ఎం.వి నిద్రలేచి కాపీ రైటు చట్టం తిరగేసేలోపే అందులో ఉన్న కొన్ని సెక్షన్ల వెనక టి సిరీస్ దాక్కుంది.
హెచ్.ఎం.వి చౌకగా కాసెట్లు ఇవ్వటం ప్రారంభించేలోపే టి సిరీస్ పద్ధతిలో వీనస్,టిప్స్ సంస్థలు సంగీతోత్పత్తి ప్రారంభించాయి.
మార్కెట్లో ఉన్న చిన్న ఖాళీ గమనించి దానిని పూరించి సంస్థ గా ఎదిగిన టి సిరీస్ తర్వాత సంగీతంతో పాటు అనేక వ్యాపారాల్లోకి డైవర్సిఫై అయ్యింది.
టీ వీలూ, ఫాన్లు, గృహోపకరణాలు,సినిమా నిర్మాణం,చివరకు భక్తి మార్కెట్ ను కూడా వదిలి పెట్టలేదు.
ఇందులో ఐరనీ ఏమిటంటే మొదట్లో తాను ఎలాంటి పెద్ద సంస్థను గురిపెట్టిందో అలాంటి సంస్థగానే తాను మారటం. దాని ముగింపు ఎటు దారి తీసిందో 'నిన్నటి చరిత్రే '
'సజ్జద్ అలీ పాడిన కిశోర్ కుమార్ పాట 'మిస్టర్ ఎక్స్ ఇన్ బోంబే' లో'మేరే మహబూబ్ కయామత్ హోగీ'. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం,ఆనంద్ బక్షి రచన. చిత్రీకరణ ఒరిజినల్ సినిమా పాటపైనే.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-31’
“యే జిందగీ ఉసీ కి హై జో కిసీ క హో గయా,ప్యార్ హి మే ఖో గయా” 29 January

(వేరేవారి పరమై, ప్రేమలో సర్వం మరచినవారిదే ఈ జీవితం)
...
'విజయచిత్ర ' సినిమా పత్రికలో 'వినవేడుక ' అనే సినిమాపాటలకు సంబంధించిన కాలమ్ వస్తుండేది. అందులో నవ్వుతూ,వెడల్పైన మొహంతో ఉన్నాయన ఫొటో ఉండేది. ఆ ఫొటో ఆ కాలమ్ రాస్తున్న వి.ఎ.కె.రంగారావు (తెలుగు సినిమా సంగీత విమర్శకుడు)ది అనుకునేవాడ్ని.ఐతే ఆ ఫొటో సి.రామచంద్ర అనే హిందీ సినిమాసంగీతదర్శకుడిదని తర్వాత తెలిసింది.సి.రామచంద్ర 'చితల్కర్ ' పేరుతోకూడా పరిచితుడు. వి.ఏ.కే రంగారావు సి.రామచంద్ర కు వీరాభిమాని.
సి.రామచంద్ర తెలుగులో ఎన్.టి.ఆర్ తీసిన 'అక్బర్ సలీం అనార్కలి ' సినిమాకు సంగీతమందించారు.దీని వెనుకకథ ఆరా తీసినపుడు తెలిసినసంగతులు....
హిందీలో అంతకుముందెన్నడో అనార్కలి సినిమా వచ్చింది.దానికి సి.రామచంద్ర సంగిత దర్శకుడు.ఆ అనార్కలి స్పూర్తి తో తెలుగులో అంజలీ ఆదినారాయణరావుల 'అనార్కలి ' వచ్చింది. దానికి ఆదినారాయణరావు సంగీతం అందించారు.
ఎన్.టి.ఆర్ 1979 లో 'అక్బర్ సలీం అనార్కలి ' సినిమా తీసారు.సినిమా తీయటానికి రామారావు ను ప్రేరేపించినది మొఘల్ ఎ అజ్మ్ సినిమాలొ అక్బర్ గా పృథీరాజ్ కపూర్ నటనఅని చెబుతారు..మొఘల్ ఎ అజ్మ్ కు సంగీతకారుడు నౌషాద్. కాని ఎన్.టి.ఆర్ హింది అనార్కలి సంగీతదర్శకుడైన సి.రామచంద్ర ను telugu సినిమా రంగానికితీసుకొచ్చారు..(సి.నారాయణరెడ్డి ఏకవీర సినిమాతరవాత ఈ సినిమాకే మాటలు రాశారు)
అందులో పాటలు 'తారలెంతగా మెరిసేనో','తానే మేలిముసుగు తీసి ','సిపాయీ ఓ సిపాయీ..హసీనా' వంటిపాటలు చిత్రజయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ చిత్రసంగీతప్రేమికుల్ని అలరిస్తున్నాయి.
సి.రామచంద్ర అంతకుముందు తెలుగులో చెయ్యకపోయినా అతని ట్యూనులు మనం చాలానే విన్నాం.అందులో తెలుగు అనార్కలీ లో 'జీవితమే సఫలము ' కూడా ఒకటి.
దీనికి ఆధారం హింది అనార్కలీ లో సి.రామచంద్ర పాట ' యే జిందగీ ఉసీకి హై '
“వేరేవారి పరమై, ప్రేమలో సర్వం మరచినవారిదే
ఈ జీవితం
ఈ వసంతం,ఈ గాలీనేలా ప్రేమించమని చెబుతున్నాయి
ఎవరిపట్లైనా తీరనివలపు తో మనసును కలవరపరచుకోమంటుంది
జీవితానికి భరోసా లేదు
ప్రేమలో ఆనందాన్ని కొనిపో
హృదయం స్పందిస్తుంటేనేం ,స్పందనల్ని లెక్కించకు
ఇంత విశ్రాంతి తిరిగి ఎక్కడిది,ఇలాంటి రేబవలు మరి ఎక్కడ?
పిలుపు వినవస్తుంది
ప్రేమమైకంలో మునిగిపో”
హిందీ అనార్కలి లో పాటలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. లతా పాడిన ఈ పాట ఆమె పాటల్లో ఒక అద్భుతమైనదిగా చెబుతారు.(గీత రచన రాజిందర్ కిషన్)
-ముళ్ళపూడి సుబ్బారావు