Saturday, May 13, 2017

నయన్ లడ్ జైహె తొ మనవా మె కసక్ హొయి బె కరి

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-80

నయన్ లడ్ జైహె తొ మనవా మె కసక్ హొయి బె కరి
(కన్ను కన్ను కలిస్తే గుండెలో నెప్పి మొదలౌతుంది). గంగా జమునా సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన పాట. నౌషాద్ సంగీతం,షకీల్ బదాయుని రచన.

మదర్ ఇండియా సినిమాలో నర్గీస్ కొడుకుగా నటించటానికి దర్శకుడు మెహబూబ్ ఖాన్ ,దిలీప్ కుమార్ ను సంప్రదించాడు. అంతకు పూర్వం నర్గీస్ తో హీరో గా నటించిన దిలీప్ కుమార్ కొడుకుగా నటించటానికి విముఖత చూపాడు. వేరే నటులతో వచ్చిన ఆ సినిమా చూసిన దిలీప్ కుమార్ ఆ తరహా సినిమా చేయాలనుకున్నాడు. స్వయంగా చిత్ర నిర్మాణానికి చేపట్టాడు. నటుడుగా ఒడుదుడుకులు ఎదుర్కుంటున్న తన సోదరుడు ‘నాసిర్’ తోడ్పడాలన్న తలంపుతో అతన్నీ సినిమాలోకి తీసుకున్నాడు.

ఆ సినిమా ‘గంగా జమునా’. మదర్ ఇండియా సినిమాతో కొన్ని పోలికలున్నా,ఆ సినిమాకు కొనసాగింపుగా కూడా ఉంటుంది.గ్రామీణ నేపధ్యం తో సహజ వాతావరణంలో అవుట్ డోర్ లో నిర్మింపబడింది. 1960ల నాటి సాంఘిక స్థితి గతుల్ని స్పృశిస్తూ సాగుతుంది.

భోజ్ పురి భాష ఎంతో సహజంగా మాట్లాడుతూ, పరిణామం చెందిన పల్లె యువకునిగా దిలీప్ కుమార్ నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది.సినిమా అత్యంత ప్రజాదరణతో ఒక బెంచ్ మార్క్ చిత్రంగా మారింది. ఐతే దిలీప్ కుమార్ ఆశించిన మరో ఫలితం..సోదరుడు నాసిర్ ఖాన్ కి లిఫ్ట్ ఈ సినిమా ఇవ్వలేకపోయింది.

సినిమాలోని పాట ‘నయన్ లడ్ జైహె తొ’ కూడా భిన్నమైన డయలెక్ట్ ( భోజ్ పురి?) తోనే ఉంది. పాట్ చిత్రీకరణలో దిలీప్ కుమార్ కదలికలు చూస్తే దానికోసం అతను చేసిన సాధన అర్ధమౌతుంది.

“ఆ అందగత్తె చుట్టూ నాకళ్ళు తిరుగాడుతుంటే
నా పని మొత్తం పాడయ్యింది.

కన్ను కన్ను కలిస్తే గుండెలో నెప్పి మొదలౌతుంది
ప్రేమ తారాజువ్వ ఎగిరితే పెద్ద చప్పుడౌతుంది

నీ రూపాన్ని మనసులో పెట్టుకుంటే తప్పేమిటి?
నీ మీద మనసైతే తప్పేమిటి?

నాకూ ప్రేమనగరంలో ఉండటానికి కొంచం హక్కు ఉంది.
నీ చిలిపి చూపులు నాగుండెను గుద్దుకున్నాయి

ఆ అందగత్తెను చూడకుంటే నాకు నిదరే పట్టదు.
ఉరి చుట్టుకున్నట్టు నా మనసు ని ఇబ్బంది పెడుతుంది.

తనతో కళ్ళు కలిసాక నాట్యం మొదలుపెట్టాను
మనసు ప్రేమతో తీయని పాట పాడుతుంది

తాళం మోగుతుంటే నడుము మెలికలు తిరుగుతుంది

బట్టలు ఉతుకుతూ మనసు ఎత్తుకు పోయింది..ఎలా మాయ చేసింది
ఎలాంటి మంత్రమేసింది. మాయ చేసింది?”

-ముళ్ళపూడి సుబ్బారావు


ఆ చల్ కే తుఝే మై లేకే చలూ

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-79
‘ఆ చల్ కే తుఝే మై లేకే చలూ’
(“పద నిన్ను తీసుకెళతాను అలాంటి ఒక ఆకాశం కిందికి).

కిశోర్ కుమార్ గాయకుడుగానే కాక నటుడుగానూ ప్రసిద్ధుడే.అతను నటించిన సినిమాలలో ఎక్కువభాగం సరదాగా సాగేవే.ఐతే అతను స్వయంగా దర్శకత్వం వహించిన తొలిచిత్రం ‘దూర్ గగన్ కి చావ్ మె’ (1964) అలాంటిది కాదు.

సైన్యంలో పనిచేసిన వ్యక్తి తిరిగివచ్చాడు. ప్రమాదంలో భార్య చనిపోయిందనితెలుసుకున్నాడుఽప్పుడే కొడుకు స్వరం కోల్పోయాడు.కొడుకును తీసుకుని ప్రయాణం కట్టాడు. అతని లక్ష్యం కొడుకు చేత తిరిగి మాట్లాడించటం. ఇది సినిమా కథ. ఇదే కథ తెలుగులో ‘రాము’ సినిమా గా పరిణామం చెందింది. మాతృక కు దక్కని విజయం రిమేక్ కి దక్కింది.

కిశోర్ కుమార్ ఎంతో ఇష్టంగా ఈ సినిమా తీసాడు. సినిమాపై సత్యజిత్ రే ప్రభావం వుంది. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత గా కిశోర్ కుమార్ తన ప్రజ్ఞ చూపారు.

ఇందులోని పాటల్లో ‘ఆ చల్ కే తుఝే మై లేకే చలూ’,’కోయి లౌటాదే ముఝే బీతే హుయె దిన్’ చాలా బాగుంటాయి.
కిశోర్ కుమార్ ప్రేమికులు తప్పని సరిగా గుర్తు తెచ్చుకునే పాట ‘ఆ చల్ కె తుఝే మై లేకె చలూ’.
పాటకు గీతరచన, స్వర రచన, గానం అతనే చేసారు. చిత్రీకరణ అతను, అతని కుమారుడు అమిత్ కుమార్ పైనే సాగింది. అలా ఈ పాట కిశోర్ కుమార్ ‘పూర్తి స్వంత గీతం’.
పాట అర్ధం:
“పద నిన్ను తీసుకెళతాను అలాంటి ఒక ఆకాశం కిందికి
అక్కడ ఎలాంటి వ్యధ ఉండదు, కన్నీరుండదు..ప్రేమ మాత్రమే ఉంటుంది.

అక్కడ సూర్యుని తొలి కిరణాలు తో ఆశల ఉదయం మేల్కుంటుంది
అక్కడ చంద్రుని కిరణాలతో పెను చీకట్లు పరుగెడతాయి.
దూరపు దారులు కనపడనట్టు కొన్ని సార్లు ఎండ విచ్చుకుంటుంది కొన్ని సార్లు నీడ కమ్ముకుంటుంది

అక్కడ చూపు సాగినంతమేరా, స్వతంత్ర గగనం రెపరెపలాడుతుంది
అక్కడ రంగురంగుల పక్షులు ఆశల సందేశాలు మోసుకొస్తాయి
స్వప్నాల్లోఆనందపు మొగ్గలు వికసిస్తాయి.సాయంత్రాలు ఆనందమయమౌతాయి.

అక్కడ కలల ప్రపంచంలో ప్రేమమాత్రమే వికసిస్తుంది
అక్కడకు మనమెళ్లి పోదాం.. ఎలాంటి చింతా విచారం లేకుండా
అక్కడ విరోధులు లేరు. అపరిచితులు లేరు. అందరూ కలసి నడవవచ్చు”
-ముళ్ళపూడి సుబ్బారావు


Tuesday, May 9, 2017

తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-78

‘తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’
(“ఉపాయంతో ,చెదిరిన తలరాత మార్చుకో)
‘బాజీ’ (1951) సినిమాలో గీతాదత్ పాడిన పాట.

పాటలు విని ఇష్టపడే క్రమంలో  చాలా పొరలుంటాయి.హిందీ పాటల విషయంలో పాటలో భావం లేదా అర్ధం తెలియకుండానే వినటం మొదలయ్యింది. పాట బాణీ, సంగీతం, గాయనీగాయకుల స్వరం ఇవి కొన్ని పొరలు.దృశ్యం,దృశ్యీకరణ,నటులు,నటన ఇవి మరికొన్ని పొరలు. పాట లోని భావం లేదా అర్ధం వీటన్నిటికన్నా లోతైన పొర.
అర్ధంతో నిమిత్తం లేకుండానే,చాలాకాలంగా వింటున్న,లిరిక్ పెదాలపై ఆడుతున్న కొన్ని పాటల అర్ధం తెలిసిన క్షణంలో అరే! ఇంతకాలం మిస్సయ్యామే అనిపిస్తుంది.
అలాంటి ఒక పాట ‘తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’. తటస్థంగానో సందిగ్ధంగానో ఉన్న మనిషిలో కదలిక తెచ్చేలా, కొద్దిగా రెచ్చగొట్టేలా ఉన్న పాట. ఏ చరణానికి ఆ చరణం చూస్తే ఇండిపెండెంట్ గా కొటేషన్ లా అనిపిస్తుంది.

ఐతే సినిమాలో ఇది పాన/జూద శాల లో నర్తకి హీరోనుద్దేశించి పాడేపాట. పాట రాసింది సాహిర్ లూధియాన్వి.సంగీతకారుడు ఎస్. డి. బర్మన్. ఈ పాట అప్పటి మిగతా పాటలతో పోలిస్తే చాలా వరస, ఆర్కెస్ట్రా పరంగా ఆధునిమైనదిగా వినిపిస్తుంది.  


“ఉపాయంతో ,చెదిరిన తలరాత మార్చుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

లోకంచూపులకు అంత భయపడతావెందుకు?
న్యాయం నీవైపు వుంది, నిందను తలకెత్తుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

నీ కోసమే నువ్వు బ్రతికితే అదీ బ్రతుకేనా?
నువ్వు మరణించయినా మిగతావారిని బ్రతికించు
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

పడవ తెడ్లు విరిగిపోతే మనం ఓడినట్టా?
చేతులనే తెడ్లు గా మార్చుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో”

Sunday, May 7, 2017

పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-77
“పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే”
(నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను)
‘దో బూంద్ పానీ’ సినిమాలో పర్వీన్ సుల్తానా ,మినూ పురుషోత్తమ్ పాడిన పాట.

రచయిత గా కె.ఎ. అబ్బాస్ , రాజ్ కపూర్ తో చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. ఐతే కె.ఎ. అబ్బాస్ స్వంయంగా దర్శకుడు. అలా డజన్ పైగా సినిమాలు తీసాడుకానీ ఏవీ కమర్శియల్ గా సక్సెస్ కాలేదు. ఐతే వాటిలో ప్రతి సినిమా విలువైనదే.  వాటిలో ఒక సినిమా ‘దో బూంద్ పాని’. సాధారణ సినీ ప్రేక్షకులకు పేరు పరిచయం కూడా అనుమానమే. 80 లలో దూరదర్శన్ లో ప్రదర్శితమయ్యింది.
రాజస్థాన్ ఎడారి ప్రాంతాల నీటికొరతసమస్యను రియలిస్టిక్ గా చూపిన సినిమా.

ఈ పాట కు రచయిత ‘కైఫి ఆజ్మి’.‘జయదేవ్’ సంగీత దర్శకుడు. వీరిద్దరు ఇంచుమించు  అదేకాలం లో , రాజస్థానీ ఎడారుల నేపధ్యంతో ‘రేష్మా ఔర్ షేరా’ సినిమాకు పనిచేశారు.

జయదేవ్ తక్కువ సినిమాలకుపనిచేసాడు. ఎక్కువ గుర్తుండే పాటలు ఇచ్చాడు. జానపద తరహాలో సాగే  పాటవరస ,సాంప్రదాయ సంగీత వాద్యాలు ఈ పాటను ఒక్కసారి వింటే మరచిపోలేనట్టు చేసాయి.
గాయని పర్వీన్ సుల్తానా పాడిన బహుకొద్ది సినిమాపాటల్లో ఇది ఒకటి.

అపజయం తనతో పాటు తనతో ఉన్న అనేక మంచి విషయాలనూ చీకట్లోకి తీసుకుపోతుంది. చిత్ర అపజయంతో ఈ పాటా మరుగున పడిపోయింది.

నీటికోసం కొందరు యువతులు కడవలు పట్టుకుని పోతున్నారు. వారిలో ఒకరి దగ్గరే ఇత్తడి బిందె వుంది. పోయేటప్పుడు శ్రమను మరిచేంత ఆనందంలో ఉండి ఉత్సాహవంతమైన పాట పాడుకుంటున్నారు.

“నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను(??)
కాళ్ళకు గజ్జలు కట్టుకుని , నీళ్ళు నింపుకోవటానికి వచ్చాను

మువ్వలు చప్పుడుతో నడక మారింది..యవ్వనపు నడక మారింది
చెంగు అటు ఇటు జారుతుంటే ..చూడు సిగ్గులేనివాడు
ఊరిలో నింద పడాలి ..
చెంగు చెప్పేదానికి  నువ్వే సాక్ష్యం

బిందె నీటిలో మునుగుతుందంటే   గుండె చప్పుడౌతుంది
నా ముఖం కొత్తగా కనపడుతుంది
నీళ్ళలో చూసుకుంటుంటే
బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి ..
ఈ మంట రేపిందెవరు?”

ఒకామె బావిలోకి తాడు వేస్తూనే వుంది.బొక్కెన నీటికి తగులుతుందని చూస్తున్న వారికి బొక్కెన రాతికి తగిలిన చప్పుడు వినిపించింది.వారి నీటి ఆశ నీటి పాలయ్యింది. నిరాశ తో వెనుతిరిగారు. వెళ్ళేటప్పటి ఉత్సాహం ఆవిరయ్యింది.పాట సాగుతుంది.

“అలాంటి రోజులుండేవి..వూరిలో నీరుండేది.
చుక్కల నీడలో బిందెనిండా నీరు తెచ్చేవారం.
ఇప్పుడు ఎక్కడనుండి నీరు తేవాలి? దాహం ఎలా తీర్చాలి?
ఎండలో మాడిపోతూ ?????”
 -ముళ్ళపూడి సుబ్బారావు.


Friday, May 5, 2017

జానే కహా వో దిన్

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-76’

“జానే కహా వో దిన్ “(ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?)
మేరా నామ్ జోకర్ లో పాట ,గానం ముఖేష్, సంగీతం శంకర్ జైకిషన్, సాహిత్యం హస్రత్ జైపురి

‘మేరా నామ్ జోకర్’   సినిమా ఫలితం  రాజ్ కపూర్ కు నిరాశ కలిగించిందంటారు. ఐతే రోజులు గడిచాక సినిమా ఒక క్లాసిక్ గా మారింది.
రిపీట్ రన్ లో సినిమా చూసాను. . పేజీ లోపు ఉన్న ‘జాన్ కీట్స్’  కవిత  ‘హ్యూమన్ సీజన్స్ ‘ కు మూడు గంటల చిత్రరూపమనిపించింది. వ్యక్తి పూర్తి జీవితాన్ని అంటే బాల్యం నుంది వృద్దాప్యం వరకూ చూపే సాంఘిక చిత్రాలు అరుదు. ఈ సినిమా లో అది చూస్తాము.

కథానాయకుని జీవితంలో వివిధ దశల్లో అనుభవాలు (బాల్యంలో,యవ్వనంలో, మాన్ హుడ్(?) లో), ఆ దశల్లో ఎదురైన స్త్రీలు, వారితో ఏర్పడ్డ/ తెగిన బంధాలు, చివరిలో ఆ అనుభవాల నెమరువేత ,ఆంతరంగికశోధన ..వీటిని చెబుతూ కథానాయకునిఅనుభవాలతో ప్రేక్షకుల సహానుభూతుల్ని చేస్తుందీ సినిమా.

బాల్యంలో అతను తన తండ్రి లానే జోకర్ కావాలనుకుంటాడు. జీవిత భాగస్వామి జోకర్ జీవితాన్నిచూసి ఉన్న అతని తల్లి అదివద్దని వారించింది. తల్లి  అనుభవం అతనికి అక్కరకు రాలేదు.సర్కస్ లో జోకర్ గా అతని చేష్టలు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటే, అతనికి జరగబోయే ఆపదల్ని తలుచుకుని తల్లి తల్లడిల్లుతుంది. తల్లి మరణం కారణంగా  అతను  కార్చే కన్నీరు కూడా ప్రేక్షకుల్ని ఆనందపరుస్తుంది.

బాల్యంలో తననభిమానించే టిచర్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆమెకు దూరమై బాధపడ్డాడు. యువకుడైనాక ఒక యువతి కి సాయపడి ఆమెకు దగ్గరయ్యాననుకున్నాడు. ఆమె తారగా ఎదిగి దూరమయ్యింది. మరోదశలో సర్కస్ లో జోకర్ గా ఉన్నపుడు, ఓ రష్యన్ యువతి ఇతనిపట్ల ఇష్టాన్ని చూపింది. ఆ కథా సఫలంకాలేదు.

జీవితపు మలి సంధ్యలో సర్కస్ లో అతని పెర్ఫార్మెన్స్ చూడటానికి వీరంతా వచ్చారు.ఆ సందర్భం లో ఈ పాట .చూస్తున్న వారికి  గతం కళ్ళముందు కదలాడింది. వారి మనసూ కదులుతుంది.

“ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?
చెబుతుండేవారు
నా దారిలో చూపులు పరచి వుంచుతామని

నువ్వు ఎక్కడ ఉన్నా
నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే వుంటాను
నున్ను మరువలేను

నా పాద ముద్రలు పడిన చోటల్లా
నా మిత్రులు వంగి ఆ నేలను ముద్దాడేవారు.
వెళ్లిపోయే వసంతం
నన్ను ఎంతగానో రోదింపజేస్తుంది

నిన్నాఈరోజూ ,నా కళ్ళకు
పగళ్ళు కూడా చీకటి రాత్రులే
నా నీడ మాత్రమే నా సహచరి”

మరో పాట ‘జీనా యహా మర్నా యహా ‘ కు కొనసాగింపు పై పాట తర్వాత వస్తుంది.

రేపటి ఆటలో నేనున్నా లేకున్నా
ఆకాశంలో తారలు ఎప్పటికీ ఉంటాయి
నువ్వు మరుస్తావు..వారు మరుస్తారు
కాని నేను ఎప్పటికీ మీవాడినే
నా గుర్తులు ఇక్కడ ఉంటాయి
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?


నువ్వు కోరినపుడు నన్ను పిలువు
నేనిదివరకెక్కడున్నానో ఇప్పుడూ అక్కడే ఉన్నాను
నా రెండు లోకాలు ఇక్కడే.
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?

-ముళ్ళపూడి సుబ్బారావు


Wednesday, May 3, 2017

బూఝ్ మెరా క్యా నామ్ రె,నదీ కినారా గావ్ రె

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-75

బూఝ్ మెరా క్యా నామ్ రె,నదీ కినారా గావ్ రె
(“నాపేరు చెప్పుకో,నది ఒడ్డున మా వూరు),సి. ఐ.డి (1956) సినిమాలో పాట.


ఒక కాలంలో లతామంగేష్కర్, ఆశాభోస్లే కాకుండా వేరే నేపధ్య గాయనుల పేర్లు అరుదుగా వినిపించేవి. అలాంటి వేరే పేర్లలో ఒకటి  షంషాద్ బేగమ్.

మిగతా గాయనిలతో ఆమె పాడిన పాటలు వింటుంటే ఆమె స్వరంలో ప్రత్యేకత కొట్టొచ్చినట్టు తెలుస్తుంది.

గీతా దత్ ‘ఠండి హవా ‘అని అంటే , ఎంతో కాంట్రాస్ట్ తో  శంషాద్ బేగమ్’కాలి ఘటా’ అంటుంది.(మిస్టర్ అండ్ మిసెస్ 55 సినిమా)

ఆశా భోస్లే ‘కజ్రా మొహబ్బత్ వాలా’ అంటే ఉలిక్కిపడేట్టు షంషాద్ బేగమ్ ‘దునియా హై మేరే పీచే’ అంటుంది.(కిస్మత్ సినిమా)

‘తేరి మెహఫిల్ మె కిస్మత్ ఆజ్మాకర్ హమ్ భి దేఖేంగే ‘ అని లతామంగేష్కర్,షంషాద్ బేగమ్
లు  పాడుతుంటే రెండు నదులసంగమిస్తూ కూడా తమ రంగులను తమతో పాటు తీసుకెళుతున్నట్టనిపిస్తుంది.(మొఘల్ ఎ అజమ్ సినిమా)

చిత్రపరిశ్రమతో పాటు పెరిగిన షంషాద్ బేగమ్ 60ల వరకూ తన ఉనికిని ‘గట్టిగా’ చాటుకుంది.
వెల్లువలాంటి లతామంగేష్కర్ గాన ప్రవాహానికి ఎదురునిలబడి పదేళ్ళపాటు పోటి ఇచ్చింది. పెద్దవయసులో తన లిమిటేషన్ తెలుసుకుని శాస్త్రీయ సంగీతం అభ్యసించింది.

ఆమె పాట ప్రాకృతం గా ఉంటుంది. పెద్ద షాపింగ్ మాల్ లో  పెర్ ఫ్యూమ్స్ అమ్మేచల్లనిచోటులో వచ్చే సుగంధం లతామంగేష్కర్ పాట అనుకుంటే వేసవి సాయంత్రం,వెన్నెలవేళ  అడవి మల్లెల గుబాళింపు షంషాద్ బేగం పాట.

 
సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్ కి నేను పెట్టుకున్న కొండగుర్తు ,పాటలో ‘చిడతల ‘శబ్దం. చేతిలో ఇమిడే రెండు చిన్న చెక్క ముక్కలను సంగీత వాద్యం  చేసే విద్యను చిన్నప్పుడు సంతలో చూసాను. అదే శబ్దం ఓ.పి. నయ్యర్ అనేక పాటల్లో విన్నాను. ఆ  చిడతల శబ్దం పాటకొక  అశ్వ వేగాన్ని ఇస్తుంది.

వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ పాట ‘సి. ఐ.డి’ సినిమాలోనిది.రచన మజ్రూహ్ సుల్తాన్ పురి. సినిమాలో హీరో హీరోయిన్లు నగరీకులు. వారు పల్లెకు వచ్చినప్పుడు వారికి ఎదురైన పాట. అప్పటివరకూ వున్న నగరవాతావరణానికి భిన్నమైన వాతావరణం.భిన్నమైన సంగీతం,గానం,అభినయం.


“నాపేరు చెప్పుకో
నది ఒడ్డున మా వూరు
మా వాకిట్లో ఉన్న రావిచెట్టు ఊగుతూ
చల్లని నీడ నిస్తుంది

లోకులంటారు నన్నువెర్రిదానినని
నా ఎగిరే కురులు..
నా నల్లని పుట్టుమచ్చ ..
నా ఎర్రని ముఖం తో
నేను వీధుల్లో తిరిగితే నాతో ఊరంతా ఊగుతుంది


నా వంక జాగ్రత్తగా  చూడు
నా కురుల్లో నీ గుండె చిక్కుకుండా చూసుకో
చంచలిని.. నేను కదిలితే
అందరూ మనసుపడతారు.

మనసుపారేసుకునే వారిమధ్య
నా కళ్ళకు మంచిపేరు లేదు
ఐనా నేనొక చిక్కుముడిని
.. నాపేరెందుకు చెప్పలేరు.

నే వెళుతున్నాను
ఎక్కడికెళుతున్నానో చెప్పగలవా?”

-ముళ్ళపూడి సుబ్బారావు


Monday, May 1, 2017

ఇక్ హసీన్ షామ్ కో దిల్ మెరా ఖోగయా

నచ్చిన పాటలు-లోపలి మాటలు-74


ఇక్ హసీన్ షామ్ కో దిల్ మెరా ఖోగయా”(ఒక అందమైన సాయంత్రం హృదయాన్ని పోగొట్టుకున్నాను)
దుల్హన్ ఎక్ రాత్ కి  సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన పాట. మదన్ మోహన్ సంగీతం,రాజా మెహ్ది అలి ఖాన్ రచన.

రేడియో తనపని తను చేసుకుంటూ మననీ పనిచేసుకోనిస్తుంది.  సిడి ప్లేయరో, ఐ పాడ్ వంటి మ్యూజిక్ ప్లేయరు కూడా తమమానాన తమ పని చేసుకుంటాయి. కానీ ఒక తేడా వుంది. రేడియో లో రాబోయే పాటలలో ఒక రకమైన ‘సర్ప్రైజ్ ఎలిమెంటు’ ఉంటుంది.ఏ పాట రాబోతుందో నన్న ఒక ఎదురు చూపు ఉంటుంది. . కొన్నిసార్లు రేడియో నడుస్తూ ఉంటుంది. మనం రెండు అవస్థల (జాగృత,సుశుప్త) మధ్య ఉంటాము. ఆ స్థితిలో ప్రత్యేకమైన ఇష్టంలేని పాటలు వచ్చిపోతుంటాయి. ‘అన్ నోటీస్డ్’గా కొన్ని పాటలు సాగిపోతుంటాయి.
కొన్ని పేర్లు విన్నప్పుడో,కొన్ని కాంబినేషన్లు విన్నపుడో హఠాత్తు గా పూర్తి మెలకువ వచ్చి పాటమీద మనసు లగ్నమౌతుంది.


నావరకూ సంగీత దర్శకుడు మదన్ మోహన్, గీత రచయిత  రాజా మెహ్ది అలి ఖాన్ కాంబినేషన్ అలాంటిది. ఆ కాంబినేషన్ కూ మహమ్మద్ రఫీ  కలిస్తే  మరింత ప్రత్యేకం.

రాజా మెహ్ది అలి ఖాన్ పాటలకు  మిగతా సంగీత దర్శకులు చాలానే వరుసలు కట్టారు కాని రేడియో లో వినిపించే  రాజా మెహ్ది అలి ఖాన్ పాటలకు సంగీతకారుడు ఎనభై శాతం మదన్ మోహనే.

దుల్హన్ ఎక్ రాత్ కీ సినిమాలో ఈ పాట ధర్మేంద్ర ,నూతన్ మీద చిత్రీకరించారు.సాధారణంగా నలుపు తెలుపు సినిమాలు ,పాటల్ని అలసట తీర్చేవి (stress busters) గా చెబుతారు. ఇలాంతి పాటలు విన్నప్పుడు అది నిజమనిపిస్తుంది.


“ఒక అందమైన సాయంత్రం హృదయాన్ని పోగొట్టుకున్నాను
ఇంతకు ముందు నీదాననే అనేది, ఇప్పుడు వేరే వారిదైపోయింది


ఎప్పటినుండో కోరిక
జీవితంలోకి ఎవరో రావాలి
శూన్యం గా ఉన్న జీవితంలో ఒక దీపం వెలిగించాలి
తనొస్తే లోకం వెలుగులమయం ఔతుంది.


నా హృదయ గమనాన్ని
ఎవరో చేతుల్లోకి తీసుకున్నారు.
ఎవరివో మంచుతెరలు కట్టిన కళ్ళు
కొద్దిగా మెలకువతో,కొద్దిగా నిద్రతో ఉన్నాయి
తనని చూసి ఋతువు అహ్లాదకరమౌతుంది.”

-ముళ్ళపూడి సుబ్బారావు