Saturday, December 19, 2020

सजन रे झूठ मत बोलो, మిత్రుడా! అబద్ధాలు చెప్పకు

మిత్రుడా! అబద్ధాలు చెప్పకు 
(చివరకు) దేవుని దగ్గరకు వెళ్ళాలి 
అక్కడికి ఏనుగులు గుర్రాలు రావు 
కాలినడకనే అక్కడికి చేరాలి 

నీ ఈ మహళ్ళు , భవనాలు 
ఇక్కడే ఉండిపోతాయి 
అంత పట్టింపు దేనికి 
ఈ తల చివరకు వంచాల్సిందే 


మంచి చేస్తే మంచి జరుగుతుంది 
చెడు చేస్తే చెడు జరుగుతుంది 
వాటినే లెక్క రాసుకుంటే ఏమౌతుంది 
అక్కడ అన్నింటికీ చెల్లింపు  చేయాల్సి ఉంటుంది. 


బాల్యం ఆటలతో గడచిపోయింది 
యవ్వనం నిద్రతో గడచిపోయింది 
వృద్ధాప్యం  దుఃఖం తో గడుస్తుంది 
ఈ కథ పురాతనమైనదే 





Tuesday, December 15, 2020

वफ़ा जो ना की - Wafa Jo Na Ki - ముకద్దర్ కా సికందర్

నా ప్రేమ నీకు అంగీకారం కాకుంటే ఏమి?

హితుడా! నీ శతృత్వాన్ని నిలుపుకోవటానికైనా రా !

నీ గొప్పదనానికి  తగినదానిని కానని నాకు తెలుసు 

నా మనసును కష్ట పెట్టటానికైనా రా!

****

నాపై నమ్మకముంచకపోయినా బాధ మాత్రం పెట్టకు

ప్రియా!  అన్యాయం చేయకు

మరణించాలనే కోరికతో మనసు ఎటూ మరలదు 

నమ్మకం .. 

నిన్ను చూసినప్పటి నుండి నాకనిపిస్తుంది 
నౌక కు ఇపుడు  నావికుడు దొరికాడని 
నా హృదయా రాధనకు ఇలా 
నా మనసుకు దేవుడు దొరికాడని 
 వరం .. 
వరమివ్వకపోయినా పరవాలేదు కానీ  శపించవద్దు 
హింస .. ప్రియా ! ఇలా హింసించకు 
మరణించాలనే కోరికతో మనసు ఎటూ మరలదు 
నమ్మకం.. 

నేనంటే నీకు ప్రేమ లేదు .. సరే 
నాకుమాత్రం నువ్వంటే ప్రేమ .. నేనేం చేయను 
చస్తూ బ్రతకటం నాకు అలవాటే 
నేను ఉన్నా  లేకున్నా నీకేమి?
మంచిది 
మేలు చేయకున్నా కీడు మాత్రం చేయకు 
హింస .. ప్రియా ! ఇలా హింసించకు 
మరణించాలనే కోరికతో మనసు ఎటూ మరలదు 
నమ్మకం .....





Saturday, November 28, 2020

హృదయం .. హృదయమే ... హృదయాన్ని నమ్మేదెలా? -दिल तो है दिल, दिल का ऐतबार, क्या कीजै- dil to hai dil, dil kaa aitabaar

హృదయం .. హృదయమే ... హృదయాన్ని నమ్మేదెలా? 

ఎవరిమీదైనా ప్రేమ కలిగితే చేయగలిగింది ఏముంది?


నీజ్ఞాపకాలలో తప్పిపోయాను, రాత్రులు నిద్రకు దూరమయ్యాను
నా హృదయపు స్థితి తెలిసిన వారేలేరు
ఎన్నోయేళ్ళు గా కళ్ళు ఎదురుచూస్తున్నాయి, దాహపు రాత్రులు మేలుకునే గడిపాను
మనసులోని మాటలు పెదవులమీదికి వచ్చిచేరాయి
నీమీద ప్రేమతో, నా మనసుమాట  పర్యవసానం ఏదైనా కానీ


హృదయం .. హృదయమే ... హృదయాన్ని నమ్మేదెలా? 

ఎవరిమీదైనా ప్రేమ కలిగితే చేయగలిగింది ఏముంది?

అశాంతిలోనే నాకు ప్రశాంతి, చేయగలిగిందేముంది?

ఎవరిమీదైనా ప్రేమ కలిగితే చేయగలిగింది ఏముంది?


మత్తుగొలిపే నీ చూపులు నా మనసును ఆవరించాయి
నీ బాహువులు నా తనువును చుట్టుకున్నాయి
దూరాన్ని సహించలేను, పోయిన శాంతిని వెతకలేను
నడవాలంటే ఇప్పుడు  నీ చూపుల నీడలో మాత్రమే
ఉదయ సాయంత్రాలు నీ పేరు తలచుకుంటూ గడుపుతున్నాను
గుండె పదేపదే కొట్టుకుంటుంది .చేయగలిగింది ఏముంది?




Friday, November 6, 2020

 Nainon mein badra chhaye

కళ్ళలో మేఘచ్చాయలు

విద్యుల్లతల్లా మెరుస్తున్నాయి

అలాటివేళ  ప్రియా నన్ను

చేతుల్లోకి తీసుకో

కనులు మత్తులో మునిగి ఉన్నాయి

ఆ చెలులు రెండూ చంచలంగా ఉన్నాయి

కనురెప్పలు 

నీకోసం తపిస్తూనే ఉంటాయి

సిగ్గుపడుతూ నీకందిస్తాయి

మధువుతో నిండిన పాత్రను

కళ్ళలో మేఘచ్చాయలు

విద్యుల్లతల్లా మెరుస్తున్నాయి

నీ ప్రేమ పిచ్చిలో ఉన్నాను

నీ స్వప్నసుందరిని నేను

కిందటి జన్మనుండీ నీ

ప్రేమ కథను నేను

ఈ జన్మలోనూ 

నీ దానిని చేసుకో



 బహారో! మేరా జీవన్ భీ సవారో!


వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు!

ఎవరో ఎక్కడనుండో వచ్చి పిలిచినట్టు !వసంతమా

వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు!

మనసు కు బాధపడటం నువ్వే నేర్పావు

దానికి నిన్నే దోషిని చేస్తాను

సుందర దృశ్యమా! వసంతమా!
నా జీవితాన్నీ అలంకరించు!వసంతమా! 
(కంటికి) కాటుక దిద్దు! మల్లెలమాల తీసుకురా
వంగిన కొమ్మలనుండి నువ్వు
పూలు తీసుకురా
వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు!
నా ఈచేతులకు గోరింటాకు పెట్టు
నా   పాపిట  సింధూరం పెట్టు
జ్ఞాపకాల ధారలు! వసంతమా!





Saturday, October 31, 2020

 Dil ka bha.Nwar kare pukaar

దిల్ క భవర్ కరే పుకార్

తెరే ఘర్ కె సామ్నె (1963)

హస్రత్ జైపురి  ఎస్. డి. బర్మన్, మహమ్మద్ రఫీ ల కలయిక వీనులవిందు చేస్తే  దేవానంద్, నూతన్ లు నేత్రపర్వం చేసారు. కాలంతో నిమిత్తం లేకుండా విన్నప్పుడూ,చూసినప్పుడూ కొత్తలోకాలకు తీసుకెళ్ళే పాట. 

పాటకు నేపధ్యం లో కనపడేది కుతుబ్ మినార్ లోపల ఉన్న మెట్లు. మినార్ పైభాగంనుంది ప్రేమికులు కిందకు వస్తున్నారు. ఇరుకైన మార్గం, అందులో ప్రేమికుడు ఆమెతో మనసు మాట తెలియజేస్తున్నాడు. వివిధరకాల పర్యాటకులు అతని మాటకు అడ్డువస్తున్నారు. కిందకు దిగేసమయానికి అతనామెకు చెప్పాల్సింది చెప్పాడు.

పాట దృశ్యీకరణకు కుతుబ్ మినార్ ఇరుకైన మెట్లు సహకరించక పోవటంతో కుతుబ్ మినార్ సెట్ లో నే చిత్రీకరణ జరిగింది. పాట చూస్తున్నపుడు అది తెలియకపోవటానికి ఒక కారణం చూపరులదృష్టి దేవానంద్, నూతన్ లపైనుండి మరలకపోవటం.

*******

హృదయ భ్రమరం పిలుస్తుంది
ప్రేమరాగం విను

నీవొక గులాబివి..నీకు సరి ఏది
నీ శైలే ఒక వసంతం
మనసు లోపలి సందిగ్ధం పెదవిపైకి  వచ్చింది
నీవంటే ప్రేమనే మాటగా
నీకే మనసిచ్చాగా
ప్రేమరాగం విను

కావలిస్తే నన్ను మాయం చెయ్యి కాని కిందకు తోయకు
నీ కంటి అశ్రుకణంలా!
నాప్రేమ ఉన్నతి, లోతును
నా నిట్టూర్పులనడుగు
అవి ఆకాశాన్ని అంటుతున్నాయి.
ప్రేమరాగం విను

ఈ అందమైన చోట నేను ఓడిపోయి కూర్చోను
నీడనై నీవెంట నడుస్తాను
నేడు నాపక్కన నీవు.. మనసు కోరిక ప్రతిధ్వనిస్తుంది
నీతో నా చూపు కలిసినపుడు
నువ్వేమి చేసావో తెలియదుగా
ప్రేమరాగం విను

నీ ఈ పైట ఒక ప్రేమ మేఘంలా
తిరిగి నన్ను నేలమీదకు తెచ్చింది
నా చేయి అందుకో ఇపుడు, నీచూపు మధుపాత్ర ఇవ్వు
ఈ కొత్తయాత్ర కోసం
నీవు నా సాకీ వి
ప్రేమరాగం విను


Saturday, October 17, 2020

జీవితాన్ని ఎంతో దగ్గరనుండి చూసాను-देखा है ज़िंदगी को कुछ इतना करीब से

देखा है ज़िंदगी को कुछ इतना करीब से - dekhaa hai zindagii ko kuchh itanaa kariib se


ఏక్ మహల్ హో సప్నో కా (1975) సినిమాలో పాట. సాహిర్ లూధియాన్వి రచన, రవి సంగీత దర్శకత్వం, కిశోర్ కుమార్ గానం. 

కథానయకుడు ఒక కవి. అతనికి రావలసినంత ఖ్యాతి రాదు. బాధ్యతలున్నాయి. ప్రేయసి ఉంది. ఆమె కొద్దిరోజుల్లో కంటిచూపు కోల్పోబోతుందని తెలుసుకుంది. కథానాయకునికి బరువు కాకూడదని అతనికి దూరమై ఒక పెద్ద మనిషి ని పెఌచేసుకుంది. ఆ పెద్దమనిషి కూతురు కథానాయకుని పట్ల ఇష్టం పెంచుకుంది. కథానాయకుడు తన ప్రేయసిని వేరేవ్యక్తి భార్యగా పార్టీలో చూసాడు. ఆమె తనకు తన పేదరికం వల్లే దూరమైందనుకున్నాడు. ఆ సందర్భంలో పాట ఇది. 


సాహిర్ లూధియాన్వి ,కథానాయకులు కవులుగా కనపడే ప్యాసా, కభీ కభీ  సినిమాలకు పాటలు రాసాడు. అవి మన్ననలనందుకున్నాయి. ఐతే ఈ సినిమాలో పాటలకు ఆ స్థాయి ఖ్యాతి రాలేదు.


 జీవితాన్ని ఎంతో దగ్గరనుండి చూసాను

ప్రతి ముఖమూ ఎంతో వింతగానే తోస్తుంది


మనసులో మాట చెప్పటాని ఎవరికోసం వెతుకుతున్నానో

తానే ఈ వేడుకకు నా అదృష్టాన వచ్చింది


అందాలరాశి ప్రేమ వేలానికి పెట్టబడింది

ఒక నిరుపేద ఆ వెలను చెల్లించలేడు.


 నీ  నమ్మకపు మృతదేహం పై 

ప్రత్యర్ధి ఇచ్చిన  పట్టు ముసుగు పరచుతాను




Wednesday, October 14, 2020

ఆప్ కి నజరో నె సంఝా ప్యార్ కె కాబిల్ ముఝే,आप की नज़रों ने समझा


ఆప్ కి నజరో నె సంఝా ప్యార్ కె కాబిల్ ముఝే

आप की नज़रों ने समझा


అన్ పఢ్ (1962) సినిమా లతా మంగేష్కర్ పాడిన పాట. హిందీ సినిమా లో ఉత్తమమైన ఘజల్ లో ఒకటిగా చెప్పబడే ఈ పాట 'రాజా మహ్ది అలి ఖాన్' విరచితం. స్వరకర్త మదన్ మోహన్. సంగీత దర్శకుడు నౌషాద్ కూ ఈ పాత ఎంతో నచ్చి, మదన్ మోహన్ ను ప్రత్యేకంగా అభినందించాడట. ఆరు దశాబ్దాలుగా ఈ పాత శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. 

2015 లో 'ఆలిఘర్' సినిమా వచ్చింది. అందులో 'మనోజ్ బాజ్ పాయ్' ప్రొఫెసర్ గా నటించాడు. ఏవో కారణాలతో ఒంటరిగా కాలంగడుపుతుంటాడు. అతని ఒంటరితనాన్ని చూపటానికి ఈ పాటను ఉపయోగించారు.

 


నీ చూపులు చెబుతున్నాయి నేను నీ ప్రేమకు తగినదాననని

హృదయమా! స్పందించటం ఆపు. నేను గమ్యం చేరుకున్నాను.


నీ ఈ నిర్ణయం నాకు సమ్మతమే

నా ప్రతీ చూపూ దేవునికి కృతజ్ఞత చెబుతుంది

నవ్వుతూ నీజీవితంలో నన్ను కలుపుకున్నావు



నేను నీ గమ్యాన్ని , నువ్వు నా గమ్యానివి
నా ఒడ్డువు నువ్వైనపుడు   నేను తుఫానుకు ఎందుకు భయపడతాను? 
ఎవరైనా తుఫానుకు చెప్పండి నేను గమ్యానికి చేరానని


నా హృదయం పై నీ ఛాయ పరచుకుంది
అన్నిదిక్కులనుండి వందలాది షెహనాయి మోతలు మొదలయ్యాయి
రెండు లోకాల ఆనందం నేడు  నాకు దొరికింది
                                                                     -ముళ్ళపూడి సుబ్బారావు



Tuesday, October 13, 2020

హుస్న్ పహాడో కా, ఓ సాహిబా, हुस्न पहाड़ों का ओ साहिबा

 Husn Pahadon Ka, O Sahiban, Husn Pahadon Ka 

हुस्न पहाड़ों का ओ साहिबा
హుస్న్ పహాడో కా, ఓ సాహిబా, హుస్న్ పహాడో కా

రాజ్ కపూర్ ఎక్కుభాగం సొంత సినిమాలకు శంకర్-జైకిషన్ లు సంగీతం అందించారు. గీతకారుడు మాత్రం ఎక్కువగా
 శైలేంద్రనే.  
తర్వాత    కాలంలో మూడు సినిమాలకు లక్ష్మికాంత్ ప్యారేలాల్ లు పనిచేసారు.  ఆనంద్ బక్షి గీతకర్త.

రాజ్ కపూర్ చివర సినిమాలు 'రామ్ తెరి గంగా మైలీ' , 'హెన్నా' సినిమాలకు రవీంద్ర జైన్ పాటలు రాసి స్వరపరచాడు.

'రామ్ తెరి గంగా మైలీ' సినిమా లో కథానాయిక పాత్ర గంగానదిని పోలిఉంటుంది. గంగోత్రినుండి కలకత్తావరకూ
 ప్రవహించే గంగ  మలినమౌతున్నక్రమాన్ని కథానాయికకు అన్వయిస్తూ కథ సాగుతుంది. పర్యావరణం, మతం,
రాజకీయం,ధనస్వామ్యం ..ఇవన్నీ కానవస్తాయి.

కలకత్తా నగరవాసి ఐన హీరో గంగోత్రిలో హీరోయిన్ చూసి ప్రేమించి అక్కడే పెఌ చేసుకున్నాడు. వారి మధ్య ప్రేమ 
చోటుచేసుకున్న సందర్భంలో వచ్చే పాట ఇది. లలితమైన పదాలతో కూడుకున్నది. సందర్భానికితగినట్టు, 
సూచన ప్రాయం గా  భవిష్యత్తు ను తెలియజేస్తున్నట్టు ఉంటుంది. 



ఈ అందమైన పర్వతాలలో ,
పన్నెండు నెలలూ శీత కాలమే!

ఋతువు ఎంతో ఆహ్లాదకరం
ఇక చలి పట్ల భయమెందుకు! ఋతువు ఎంతో ఆహ్లాదకరం
ఇక చలి పట్ల భయమెందుకు! చెంత వేడి వయసుండగా

విరిసిన పూలతో లోయ నిండి ఉంది
రాత్రికి రాత్రి ఎవరు   దీనిని  అలంకరించారు?
మన కల్యాణం ఇక్కడే జరుపుకోవాలనిపిస్తుంది.
పూలు, పొదలు, కొండలు ఏమి చెబుతున్నాయి?
పరదేశులు అబద్దాలకోరులని!!

నువ్వు పరదేశివి,ఎక్కడినుండి వచ్చావో
వచ్చి నామనసులో చేరావు
ఏమిచేయను మనసు చేజారింది.

చిన్నచిన్న జలపాతాలున్నాయి, వాటి నీటిని తాకుతూ కొన్ని మాటలు ఇవ్వాలి..
జలపాతాలు సాగిపోతుంటాయి, పర్వతాలపై ఒట్టు పెట్టు , అవి ఎప్పుడూ నిలిచి ఉంటాయి.

చేతిలో చెయ్యి , ప్రేమభాషణలతో దారి తరిగిపోతుంది
లోకం  ఇదే గానం చేస్తుంది  ! విను! 
ప్రేమలో దారులే కాదు జీవితమూ గడచిపోతుంది.



Sunday, October 4, 2020

ये दिल और उनकी, निगाहों के साये

ये दिल और उनकी, निगाहों के साये

నటుడు ఎమ్.బాలయ్య మంచి అభిరుచి కలిగిన నిర్మాత. విభిన్న కథాంశాలతో సినిమాలు తీసాడు. చెల్లెలి కాపురం,నేరము-శిక్ష, అన్నదమ్ములకథ, ఈనాటిబంధం ఏనాటిదో, ప్రేమ పగ ,  చుట్టలున్నారు జాగ్రత్త  వాటిలో కొన్ని . చిత్రాలన్నింటిలోనూ సంగీతానికి ప్రాధాన్యతనిచ్చాడు. మొదటి రెండు సినిమాలకు  కె విశ్వనాథ్ దర్శకుడు.  కేవి మహదేవన్, ఎస్. రాజేశ్వరరావు (మూడు సినిమాలకు), ఎమ్ ఎస్ విశ్వనాథన్ వంటి లబ్ద ప్రతిష్టులతో సంగీతం తీసుకున్నాడు.


'ఈ నాటి బంధం ఏనాటిదో'  సినిమానాటికి కృష్ణ పూర్తిస్థాయి కమర్షియకల్ హీరో గా ఉన్నాడు. ఐతే ఈ సినిమాలో అతని పాత్రలో గొప్ప హీరోయిజమ్ తో కూడిలేదు. సినిమా జయప్రద చుట్టూ తిరుగుతుంది, అల్లు రామలింగయ్య పాత్ర కూడా ప్రాముఖ్యతతో కూడినదే. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానిఈ సినిమా పాటలద్వారా ఎక్కువ గుర్తింపు పొందింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి -ఎస్ రాజేశ్వర రావులు అందుకు కారకులు. సినిమాలో ఒక  పాట సుశీల పాడిన 'ఎవరికి చెప్పేది ఏమని చేప్పేది ' . ఆ పాట పై నిర్వివాదంగా హిందీ పాట 'ఏ దిల్ ఔర్ ఉన్ కి' పాట ప్రభావం ఉంది. ఆ పాట తెలుగునాటనూ బహు ప్రసిద్ధం.

లతా పాడిన హిందీ పాట 'ప్రేమ్ పర్బత్' (1973)సినిమా లొది. స్వరకర్త 'జై దేవ్' , గీతకారుడు 'జాన్ నిసార్ అఖ్తర్'. సినిమా దర్శకుడు,రచయిత  వేద్ రాహి డోంగ్రీ భాష లో పేరున్న రచయిత. ప్రేమ్ పర్బత్ సినిమా ఇపుడు అందుబాటులో ఉన్నట్టులేదు

*********
అతని చూపుల నీడ నా మనసుపై వాలితే 
అతని చేతులు నన్ను చుట్టుముట్టినట్టుంటుంది.

చంచలించే సూర్యకిరణాలు పర్వతాలను ముద్దాడుతున్నాయి
గాలికెరటాలు నదులతనువుల్ని ముద్దాడుతున్నాయి
ప్రతీచోటా ప్రేమ నీడలు పరచుకున్నాయి

చెట్టు కొమ్మల్ని దట్టమైనమేఘాలు పెనవేసుకున్నాయి
ఒక్కక్షణం కాంతివంతం , మరోక్షణం అంధకారం
 చల్లని  నీడలతో దారులు నిండాయి


గుండె స్వేచ్చగా కొట్టుకుంటుంది
ఈ  ప్రకృతిని అనుకరిస్తూ
వర్ణమయ ప్రేమ ఛాయలు పరచుకున్నాయి

**** 
ఎవరో ఔత్సాహికులు ఈ పాటను  వైజయంతి మాల (మధుమతి సినిమా) విజువల్స్ తో కలిపారు.






Tuesday, September 22, 2020

ఈ చిత్రకారులెవ్వరు? ये कौन चित्रकार है ये कौन चित्रकार

ఈ చిత్రకారులెవ్వరు? ये कौन चित्रकार है ये कौन चित्रकार

ఈ చిత్రకారులెవ్వరు? ఈ చిత్రకారులెవ్వరు

పచ్చపచ్చని వసుధపై నీలి నీలి ఆకాశం

అందులో మేఘాల పల్లకి ని గాలులు మోస్తున్నాయి

రంగులమయం,మెరుపులమయం, ఉల్లాసమయమైన దిక్కులు చూడు


ఈ చిత్రకారులెవ్వరు? ఈ చిత్రకారులెవ్వరు? 

పర్వతాశిఖరాలు తపస్సులోమునిగిన యోగులలాఉన్నాయి

లోయమార్గాలు మెలికలు తిరుగుతూ సాగే సర్పాలలాఉన్నాయి

దేవదారు వృక్షాలు ధ్వజస్థంభాలలా నిలిచిఉన్నాయి

గులాబీల తివాచీలు , వసంతకాల వనాలు

ఇవి ఏ కవి అద్భుత కల్పనలో!


ఈ చిత్రకారులెవ్వరు? ఈ చిత్రకారులెవ్వరు? 

ప్రాకృతమైన ఈ పవిత్రతను ఆరాధించు

ఈ గుణాలను నీ మనసులో నింపుకో

నీనుదిటిపై లాలిమ ను మెరవనివ్వు

ప్రకృతినిన్ను అణువణువునా నిన్ను చూస్తూనే ఉంటుంది

నీకున్నవి రెండుకళ్ళైతే  ప్రకృతికి వేల కళ్ళున్నవి







Saturday, August 29, 2020

హే నీలె గగన్ కి తలే

హే నీలె గగన్ కి తలే

సంగీత దర్శకుడు రవి కృషికి గుర్తింపు చౌద్వీ క చాంద్ సినిమాతో లభించింది. మహమ్మద్ రఫి -రవి (రవి శంకర శర్మ) కాంబినేషన్ లో అజరామరమైన గీతాలు కొన్ని వచ్చాయి. 

నిర్మాత బి ఆర్ చోప్రా , సంగీత దర్శకునిగా రవి ప్రోత్సహించాడు. బి ఆర్ సినిమాలకు రఫీ చాలాపాటలు పాడాడు. 

ఐతే బి ఆర్ చోప్రా కు రఫీ కి విబేధాలు వచ్చాయి. దానికి కారణాలు వివిధరకాలు  వినిపిస్తాయి.  ఒక పాటలో తన సహ గాయకుడుగా 'మహేంద్ర కపూర్' ను రఫీ వద్దన్నారని, దానికి బి ఆర్ అంగీకరించలేదని ,అందువల్ల విబేధాలు వచ్చాయన్నది ఒక వెర్షన్. 

మహేంద్ర కపూర్ గాత్రం తొలినాళ్ళలో రఫీ గాత్రానికి దగ్గరగాఉండేది.(కొన్ని మహేంద్ర కపూర్ పాటల్ని రఫీ పాటలని శ్రోతలు భ్రమపడటం నాకు తెలుసు). అందువల్ల  ఇద్దరు కలిసి పాడితే వైవిధ్యం ఉండదనేది రఫీ వాదనగా చెబుతారు. ఏదిఏమైనా చివరకు బి ఆర్ చోప్రా , మహేంద్ర కపూర్ ను తన సంస్థ ద్వారా ప్రోత్సహమిచ్చాడు.   రవి ఒక రకంగా వారి ఆస్థాన సంగీతదర్శకుడు. అలా రవి- మహేంద్ర కపూర్ కాంబినేషన్లో చాలానే పాటలు- మంచిపాటలు వచ్చాయి. 

హమ్ రాజ్ సినిమా (బి ఆర్ చోప్రా-సాహిర్ లూధియాన్వి- రవి- మహేంద్రకపూర్ ల కాంబినేషన్) లో ఇద్దరు హీరో లకు (రాజ్ కుమార్ , సునీల్ దత్ ) కు నేపధ్య గానం మహేంద్రకపూర్ చేయటం హమనార్హం.

ఆ సినిమాలో ఒక పాట  'హే నీలె గగన్ కి తలే'. 

నీలాకాశపు నీడలో 

పుడమి ప్రేమ ఫలించింది


ఇలాంటి చోటే పొద్దుపొడుపులు

అలానే పొద్దుకుంకులు


మంచుముత్యాలు పూలమీద రాలాయి

రెండింటి ఆశలూ ఫలించాయి


చెట్టును ఆలింగనం చేసుకున్న లత

మత్తులోన తూలింది


సెలయేరు నదితో కలిసి

సాగరునివైపు సాగింది




పర్బతోం కె పేడోం పర్ షామ్ క బసేరా

 

పర్బతోం కె పేడోం పర్  షామ్ క బసేరా


గాత్రం,రూపం ప్రాధాన్యత ఉన్న గానం, నటన వంటి కళలలో, ఆ కళలో మేరునగాలవంటివారితో  పోలిక ఉండటం కొంత కాలం వరం, ఆపైన శాపం. ఎంట్రీ దశలో ఆ పోలిక కొన్ని అవకాశాలనిస్తుంది. అదీ పెద్దకళాకారులకు ఒక ప్రత్యామ్నాయంగా వారి అందుబాటు లేనపుడు మాత్రమే. తమదైన గుర్తింపు పొందటం లో మాత్రం ఆ పోలిక పెద్ద అడ్డుగోడావుతుంది.

సుమన్ కల్యాణ్ పుర్ సంగీతకారుల కుటుంబంలో పుట్టింది. సంగీతసాధన చేసింది. మూడున్నర దశాబ్దాలపాటు సినిమారంగంలో కృషి చేసింది. గణనీయమైన సంఖ్యలో పాటలు పాడింది. ఐతే సాధారణ సినీసంగీతప్రియులకు గాయనీమణులంటే లత, ఆశా లే గుర్తొస్తారు. 

సుమన్ కల్యాణ్ పుర్ వరమూ శాపమూ ఆమె స్వరం  లతామంగేష్కర్  స్వరానికి బహుసమీపంగా ఉండటం. అమె పాడిన అనేకపాటల్ని శ్రోతలు లతామంగేష్కర్ పాటలుగానే భ్రమిస్తారు. 

 ఓ పి నయ్యర్ లతామంగేష్కర్ తో పొరపొచ్చాలు వచ్చి ఆమె తో పాడించటం మానేసాడు. ఎంచేతనో  అతను ఆశా భోస్లే తోనే పనిచేసాడు కాని 'సుమన్ కల్యాన్ పుర్' కు అవకాశమివ్వలేదు.

మహమ్మద్ రఫీ ,లతా లమధ్య విభేధాలు వచ్చి కొంతకాలం కలిసి పాటలు పాడలేదు. ఆ సమయంలో రఫీ - సుమన్ కల్యాణ్ పుర్ కాంబినేషన్లో వందకుపైగా పాటలు వచ్చాయి. 

. అందులో ఒకటి  'పర్బతో కే పేడో పే షామ్ క బసేరా హై'  . ఈ పాట ఇప్పటికీ  శ్రోతల్ని ఆకర్షిస్తూనె ఉంది.  సినిమా పేరు 'షాగున్ ' 1964 .  కేవలం పాటలవల్ల మాత్రమే గుర్తున్న సినిమా.

ఈ పాట లో కనిపించేవారు వహీదారెహ్మాన్- కమల్ జిత్ లు. కమల్ జిత్ నటుడుగా గుర్తింపు పొందలేదు. ఐతే అతడు వహీదారెహ్మాన్ నిజజీవితపు కథానాయకుడు. 

***********

పర్వత తరుశాఖలలో సాయం సంధ్య బస చేస్తుంది

కాటుకలాంటి చీకటి లో వెలుతురు, సంపెంగ రంగు వెలుగులో చీకటి


రెండుహృదయాలు రెండుసార్లు కలుస్తాయి

అంబరం ఆనందంతో రంగులు విరజిమ్ముతుంది


స్థబ్దుగా ఉన్న నీటిని పాట కదిలిస్తుంది

తడిచిన శ్వాస లో సుగుంధం బస చేస్తుంది


ఇంతమంచికాలంలో కలయిక సంపూర్ణమవ్వదెందుకో?

చిక్కనైన కాంతి రేఖలు ,సుళ్ళు తిరిగే మైకం







Thursday, February 8, 2018

చౌద్వీ కా చాంద్ హో

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-150
చౌద్వీ కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో
(“పున్నమినాటి చంద్రునివా! లేక సూర్యునివా!)
చౌద్వీ కా చాంద్(1960) సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.
సమిష్టి విజయాన్ని పంచుకోవటంలో చాలాసార్లు స్పర్ధలు వస్తాయి. ‘ప్యాసా’ సినిమా వాల్ పోస్టర్లపై దర్శక నిర్మాతల పేర్ల పరిమాణంలోనే ఆ సినిమా కు సంగీత సాహియాలందించిన ఎస్ డి బర్మన్, సాహిర్ లూధియాన్వీ ల పేర్లు కనిపిస్తాయి. ఆ సినిమా విజయంలో పాటల పాత్ర ఎంతో ఉంది. ఆ విజయం లో ఎవరి పాలు ఎక్కువ అన్న సమస్య వారిద్దరిమధ్య దూరం పెంచింది. ఆ చిత్ర దర్శక నిర్మాత, నటుడు ‘గురుదత్ ‘ కు ఇద్దరూ కావలసిన వారే.
ఆ తరువాత ‘కాగజ్ కె ఫూల్ ‘ సినిమాతో గురుదత్ కు ఎస్ డి బర్మన్ తోనూ తగువైపోయింది. ఇది గురుదత్ తర్వాత సినిమాలో ‘చౌద్వీ కా చాంద్ ‘ లో కొత్త కలయికకు కారణమయ్యింది. గీత రచయిత ‘షకీల్ బదాయుని’ సంగీత దర్శకుడు ‘నౌషాద్ ‘ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు. అతను వేరేవారితో పనిచేసింది తక్కువ. ఈ సినిమాతో సంగీత దర్శకుడు ‘రవి’ తో కలసిపనిచేసాడు. తద్వారా అద్భుతమనదగిన పాట పుట్టింది. తర్వాత ఆ పాటననుసరించి లెక్కకు మిక్కిలి పాటలు వచ్చాయి.
పరిమిత సంఖ్యలోనే వచ్చిన గురుదత్ సినిమాలలో విలక్షణత ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కో తరహాలో ఉంటాయి. స్థల కాలాలు సినిమాలో కనపడుతుంటాయి. ప్యాసాలో కలకత్తా కనపడితే చౌద్వీ కా చాంద్ లో లక్నో కనపడుతుంది. ముస్లిం నేపధ్యంతో సాగిన ఈ సినిమాలో ఈ పాట పాTaగానే మధురం, దృశ్యీకరణ ద్వారా పాట విలువ మరింత పెరిగింది.
ఈ పాట తెలుగు రూపం ‘పి బి శ్రీనివాస్ ‘ పాడినది ఉందికాని తెలుగు శ్రోతలకు దానికన్నా హిందీ పాటే దగ్గర. ‘అబ్దుల్లా’ సినిమాలో ‘మైనే పూచా చాంద్ సే ‘ పాటకు స్పూర్తి 'చౌద్వీ క చాంద్’ కావచ్చని నా కనిపిస్తుంది.

“పున్నమిచంద్రునివా! లేక సూర్యునివా!
ఏమైనాకాని దేవునిపై ఆన… నువ్వు సాటి లేనిదానవు.
భుజాలపై వాలిన మేఘాలవంటి కుంతలాలు
నిండిఉన్న మధుపాత్రల వంటి నయనాలు
ప్రేమ మైకం కలిగించే మధువువు నువ్వు
సరస్సులో హసించే కమలం వంటి వదనం
జీవన వీణ పలికించే గేయానివి
వసంతానికి ప్రాణమయ్యేదానా! నువ్వు కవి కనే స్వప్నానివి
విద్యుత్తు వంటి చిరునవ్వు పెదవులపై ఆటలాడుతుంది
తారామండలం నువ్వొచ్చే దారిలో సాగిలబడుతుంది
సౌందర్య భరిత ప్రేమలోకానికి యవ్వనానివి నువ్వే”


సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-149
‘సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్’
(జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు)
పర్ దేశ్ (1997) సినిమాలో పాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం. ఆనంద్ బక్షి రచన. హరిహరన్,శంకర్ మహదేవన్,కవితా కృష్ణమూర్తి ,ఆదిత్య నారాయణ్ గానం.
రోదసి లో ఉన్న రాకేశ్ శర్మ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అడిగింది `అక్కడినుండి భారతదేశమెలా కనపడుతుంద`ని. `సారే జహాసే అచ్చా` అని ఆయన వెంటనే సమాధానమిచ్చాడు.దూరంనుండి అలానే ఉంటుందేమో.
ఎ బి సి డి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ )అని 90లలో ఇండియా టుడే లో ఒక ఆర్టికల్ వచ్చింది. భిన్న సంస్కృతులను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం సంఖ్యాపరంగా గణనీయమైన సమూహానికి అప్పటికి వచ్చినట్టుంది. ప్రత్యేకంగా యువతకు. హిందీ సినిమాలకు చక్కని సబ్జెక్ట్ దొరికింది. చాలానే సినిమాలు ఈ సబ్జెక్ట్ పై వచ్చాయి.
అలాంటి సబ్జెక్ట్ పై వచ్చిన `దిల్ వాలె దుల్హనియా లేజాయెంగే ` వచ్చిచరిత్రాత్మక విజయం సాధించింది. తర్వాత `పర్ దేశ్ `వచ్చింది. రెండు సినిమాలలోనూ మాతృభూమిపై మమతను చాటే పాటలున్నాయి.
అమ్రిశ్ పురి గొంతు ఇనుపగొలుసులు రాపిడితో వచ్చే శబ్దాన్ని పోలిఉంటుందంటారు. తెలుగు సినిమాలలో అతని సంభాషణల్ని మిమిక్రీ కళాకారులు అనుకరిస్తారు. అతను ‘పర్ దేశ్’ సినిమాలోని ఈ పాటలలో గొంతుకలిపాడు.
‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమాలో ఒకపాటలో రచయిత ‘ఇందీవర్’ భారత దేశాన్ని మూడు రంగుల చీరలో ఉన్న వధువు తో పోల్చాడు. ఈ పాటలో భారత దేశాన్ని వధువు నుదిటి పైని బొట్టు తో పోల్చాడు రచయిత ఆనంద్ బక్షి.


“లండన్ చూసాను
పారిస్ చూసాను
ఇంకా జపాన్ చూసాను
మైఖేల్ జాక్ సన్ ను చూసాను,ఎల్విస్ ప్రిస్లీ ని చూసాను
సర్వం చూసాను నా ప్రాణమా!
జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు
ఈ లోకం ఒక వధువైతే
ఆ వధువు నుదుటి బొట్టు
నా ఈ భారతదేశం
ఐ లవ్ మై ఇండియా
ఒకరు మేఘ్ మల్హార్ ఆలపిస్తే
వర్షం తరలివచ్చింది
దీపక్ రాగం వినిపిస్తే
నీటితో దీపం వెలిగింది
సప్త స్వరాల సంగమం ఈ జీవన గీతమాల
మేము మా భగవానునీ వంశీధరుడని అంటాం
వంశీధరా! వంశీధరా!
ఇది నా భారతదేశం”
కోయిల కుహు కుహు పాడుతుంది
హసనాన్ని రోదనను జీవన గీతాలుగా మార్చుకున్నాము
లోకులంతా వారి వారి గీతాలు గానం చేసుకుంటారు
వారు పాడే పాటనుండి ఈ మట్టివాసన గుబాఌస్తుంది
నా మాతృభూమి ఇండియా,నా ప్రేయసి ఇండియా
నా విధి ఇండియా,నా ధర్మం ఇండియా

`యే జిందగీ గలె లగాలే`

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-148
`యే జిందగీ గలె లగాలే`
(జీవితమా! నన్ను కౌగిలించుకో)
`తదియ నాటి చంద్రుడు` అని అర్ధమొచ్చే తమిళ సినిమా తెలుగులో `వసంతకోకిల` గా డబ్ అయ్యింది.సినిమా చూసినా రెండు భాషల సినిమా పేర్లు సినిమాకు అన్వయం చేసుకోలేకపోయాను. అదే సినిమా హిందీ లో `సద్మా` గా వచ్చింది. ఆ పేరు సినిమా కథకు సరైనదే అనిపించింది.
ఒక సెలబ్రిటి , అతన ఉనికిని దాచి మారుమూల ప్రాంతంలో కథానాయకునితో కాలంగడపటం,తర్వాత అతనికి దూరమై చివరికి దగ్గరవ్వటం ..ఇలాంటి కథనంతో అనేక సినిమాలు వివిధభాషల్లోవచ్చాయి. ఆకథకు `మరపు` ను కలిపి దుఃఖాంతం చేసిన కథ తో ఈ సినిమా వచ్చింది.
నటీనటులకు మంచి అవకాశమిచ్చిన సినిమా.దానిని కథానాయికా నాయకులు సద్వినియోగం చేసుకున్నారు.
వస్తుతః ఛాయాగ్రాహకుడైన దర్శకుడు బాలూ మహేంద్ర సినిమాను దృశ్యకావ్యం చేశాడు. దానికి ఇళయరాజా సంగీతం ,గుల్జార్ రచన మరింత జీవం పోసాయి.
సురేష్ వాడ్కర్ పాడిన పాటల్లో అమితంగానన్ను ఆకుట్టుకున్నవాటిలో ఇది ఒకటి.పాట మధ్యలో వచ్చే వయొలీన్ల వాదనం మనోహరం.
``జీవితమా! నన్ను కౌగిలించుకో
నేనూ నీవిచ్చే ప్రతిబాధనూ
కౌగిలించుకున్నాను. ఔనా,ఔనా!
నేను ఒక సాకుతో ,లోకానికి చాటుగా
కనురెప్పల తెరలకింద కనుల ఇంటిని నింపుకున్నాను
జీవితమా! నాకు నీ ఆసరా దొరికింది.
చిన్న మేఘం(నీడ?) కంటిలో ప్రవేశించింది
నేను రెండు చుక్కలతో మనసును నింపుకున్నాను
జీవితమా!నాకు తీరం దొరికింది``
https://www.youtube.com/watch?v=0BXqAnZWqdQ

కచ్చా కచ్చా చోటా చోటా నింబుడా లాయిదో

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-147
‘’కచ్చా కచ్చా చోటా చోటా నింబుడా లాయిదో”
(పచ్చిపచ్చిగా, చిన్నచిన్నగా ఉన్న నిమ్మ తెచ్చిపెట్టు)
‘హమ్ దిల్ దే చుకే సనమ్’(1998) సినిమాలో పాట.
రాజస్థాన్ యాత్రల్లో జానపదకళాకారుల నృత్యంలోనూ , తోలుబొమ్మల ఆటలోనూ ‘పల్లో లట్ కే రె మారో పల్లో లట్ కె’ అంటూ సాగే జానపద గీతం బాగా వినపడుతుంది. నాకు అదే పల్లవితో కిశోర్ కుమార్ ,ఆశాభోన్స్లే పాడిన సినిమా పాట తెలుసు.(ఎనభైలలో ఇది బాగా వినపడేది).
‘లోక్ సంగీత్ ‘ రేడియో కార్యక్రమంలో విన్న మరోరాజస్థానీ జానపదగీతం ‘నింబూడా,నింబూడా’. ఆకర్షణీయమైనరంగురంగుల టర్బన్లతో, సాంప్రదాయ సంగీతవాయిద్యాలతో, బృందగానంచేసే రాజస్థానీ కళాకారులూ ఈ గీతాన్ని ఆలపిస్తూ టీ.వీ ల్లో కనిపిస్తారు.
ఆ గీతం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో వచ్చింది. కవితా కృష్ణమూర్తి,కర్శన్ సర్గతియా గానంచేసారు.సంగీతం ఇస్మాయిల్ దర్బార్ ,రచన ‘మహబూబ్’. జానపదగీతాలు సినిమాపాటలుగా వచ్చినపుడు పాట క్రెడిట్ సినిమా రచయితలు తీసేసుకుంటారు.బహుశా చేసిన మార్పుల నిమిత్తమనుకుంటా.
‘పల్లో లట్ కే ‘పాట సినిమాలో చూడటానికి చాలా సాధారణంగా ఉంటుంది. ‘నింబూడా నింబూడా ‘ పాట చిత్రీకరణ భారీగానూ,సౌందర్యభరితంగా ఉంటుంది.
పచ్చినిమ్మకాయలను ‘దిష్టి ‘ తీయటానికి వాడటం ఇక్కడ తెలుసు. రాజస్థాన్ జానపదుల్లోనూ అదే నమ్మకంఉన్నట్టుంది. పాటలో అదే వినపడుతుంది. పైకి వినపడేది కాక వేరే అర్ధం ఏమైనాఉండవచ్చు.


“నిమ్మ,నిమ్మ,నిమ్మ
పచ్చిపచ్చిగా, చిన్నచిన్నగా ఉన్న నిమ్మ తెచ్చిపెట్టు
పో! పచ్చని పొలంనుండి నిమ్మకాయ తీసుకురా!
తీసుకురా! తీసుకురా!
ప్రేమికుల చెడు చూపునుండి
తప్పించుకోవాలంటే విను
పుల్లపుల్లని నిమ్మ ను పదునైన ఛురికతో తలపై కొయ్యి
అప్పుడు చిన్నచిన్నని నిమ్మ
ఏమి మాయ చేస్తుందో చూడు
ఆ చెడు చూపు
పుల్లనై పోతుంది
ఆపై నాలుగు దారుల్లో
జారిపడుతుంది
చిన్నదే కాని రసభరితం
మంచి కుదుపునిస్తుంది
దీని వాసన మనసులో కోరిక పెంచుతుంది
నాలికపై వేసుకుంటే అంతే
కాని ప్రేమలో ప్రేమికుడు ప్రేయసి
ఒకరి తో ఒకరు కళ్ళకలుపుతారు
అప్పుడు వారిమధ్య చాలాసార్లు
తీయని యుద్ధం జరుగుతుంది
నిమ్మకాయ చెబుతుంది అదే ప్రేమ అని.
నా స్నేహితురాళ్ళూ పోయి తీసుకురండి
చిన్న నిమ్మకాయ”


బహారో ఫూల్ బరసావో !

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-146
``బహారో ఫూల్ బరసావో ! మేరా మెహబూబ్ ఆయా హై``
(వసంతమా! పూలను వర్షించు,నా ప్రియతమ వచ్చింది)
సూరజ్(1966) సినిమాలో మహమ్మద్ రఫీ పాడినపాట.శంకర్ జైకిషన్ సంగీతం ,రాజిందర్ కిషన్ సాహిత్యం.
హీరో రాజేంద్రకుమార్ ను `జూబిలీ హీరో` అంటారు. అతని సినిమాలు ఎక్కువ జూబిలీలు చేసుకున్నయనో లేదా ఇరవై ఐదు హిట్ సినిమాల్లో నటించినందుకో తెలియదు.
నటుడు దిలీప్ కుమార్ ను చాలా మంది నటులు అనుకరించారు.రాజేంద్రకుమార్ కూడా నాకు దిలీప్ కుమార్ ను గుర్తుకుతెస్తాడు. పూర్తి దిలీప్ కాదు. ఆయనలో ఒక పార్శ్వం.( మరో పార్శ్వాన్ని అమితాబ్ బచన్ లో నేను చూశాను)
దిలీప్ కుమార్ తరహా నటనతో రాజేంద్రkumar ఆయనకన్నా ఎక్కువసినిమాల్లో నటించాడు,విజయవంతమయ్యాడు.అతని సినిమాలు విజయంలో సంగీతానిదీ పెద్ద పాత్రే.
ఎన్నో సూపర్ హిట్ పాటలు అతని సినిమాలలో ఉన్నాయి. అందులో రఫీ పాడినవిఎక్కువ.
సూరజ్ సినిమా లో పాటలన్నీ హిట్ ఐనవే. నేను చూసేనప్పుడు(1980లు) సినిమా పెద్ద ఉత్సుకత కలిగించలేదు. అలాంటివి తెలుగులో అప్పటికే చాలావచ్చిఉన్నాయి.(సూరజ్ కూడా సౌత్ నిర్మాతలు,దర్శకుడు ద్వారా వచ్చిందే). సినిమాలో గుర్తుండేట్టు చేసింది పాటలే. వాటిల్లో అమిత ప్రజాదరణ పొందిన ఒకపాట ఇది.
`దీక్ష` తెలుగు సినిమాలో `మెరిసే మేఘమాలికా` పాట దీనిని కొంత పోలి ఉంటుంది.


``వసంతమా! పూలను వర్షించు
నా ప్రియతమ వచ్చింది
పవనమా! రాగమాలపించు
నా ప్రియతమ వచ్చింది
పూల ఎర్రదనమా! మైదాకులా
ఆమె తెల్లని చేతులను చేరు
Naల్లని మేఘమా! దిగివచ్చి
ఈ అందమైన కళ్ళకు కాటుకలా మారు
తారకలారా! ఆమె పాపిడి నింపండి
నా ప్రియతమ వచ్చింది
ప్రకృతీ! ప్రతిచోటా
కాంతి కంబళ్ళు పరుచు
ప్రేయసి బహు సిగ్గరి
సిగ్గుపడి వెఌపోతుంది
కొద్దిగా నువ్వు మనసు ను ఉత్సాహపరచు
నా ప్రియతమ వచ్చింది
లేత మొగ్గలుఈ ప్రేమశయ్యను
అలంకరించాయి
వాటికి తెలుసు
ప్రేమ ఋతువు ఒకనాటికి వస్తుందని
వీచేగాలీ! రంగులు వెదజల్లు
నా ప్రియతమ వచ్చింది``


పియా బసంతీ రే , కాహే సతాయే ఆజా

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-145
పియా బసంతీ రే , కాహే సతాయే ఆజా
ప్రియా! వసంత మిది ..ఎందుకు బాధిస్తున్నావు? రా!
’పియా బసంతీ రే’’ (2000) వీడియో ఆల్బమ్ లో పాట.
ఉస్తాద్ ‘సుల్తాన్ ఖాన్’ రాజస్థానీ సంగీతకుటుంబం నుండి వచ్చాడు. ‘సారంగి’ వాద్యకారుడు.శాస్త్రీయసంగీతం తెలిసినవాడు. ప్రముఖ సంగీతకారులెందరితోనో వేదిక పంచుకున్నాడు. ప్రత్యేక ఆహ్వానం మీద గాయకుడిగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ లో ఒక పాట పాడాడు.
చదువుకు సంబంధించిన పరీక్షా? తనకిష్టమైన సినిమా పాట రికార్డింగా? వీటిమధ్య ఎంపిక సమస్య వచ్చినపుడు రికార్డింగు నే ఎంచుకుంది గాయని ‘చిత్ర’. దక్షిణాది భాషలన్నింటిలో పాటలుపాడి ప్రముఖగాయని అయ్యింది.
సుల్తాన్ ఖాన్, చిత్ర కలిసి ‘పియా బసంతి’ అల్బమ్ లో పాటలు పాడారు. అందులో టైటిల్ సాంగ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గాయకులిద్దరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
పాట చిత్రీకరణ అందమైన నటులున్నారు. అందమైన లొకేషన్లు ఉన్నాయి. చక్కని ఫొటోగ్రఫీ ఉంది.


“ప్రియా! వసంత మిది ..ఎందుకు బాధిస్తున్నావు? రా!
ఏమి మాయ చేసావో తెలియదు
మనసు ప్రేమ ధ్వని ని వినిపిస్తుంది
ఎందుకు బాధిస్తున్నావు? రా!
మేఘం ఒళ్ళు విరుసుకున్నపుడు
ధరణి పైట చెంగు రెపరెపలాడుతుంది
ఈ ఆకులు ఈ పొదలు
ఏదో అలికిడి చేస్తున్నాయి
మనసు ఊగులాడుతుంది, ఏమంటుందో తెలియదు
మనసు ఒప్పుకోదు
నేను నీ సొంతం ప్రియా!
భావి స్వప్నాలు కనురెప్పలపై కూర్చుని ఉన్నాయి
మనసు లోతుల్ని పైకి తెస్తున్నావు
మనసులో ప్రేమను మేలుకొలుపుతున్నవాడా!
సప్తవర్ణ స్వప్నాలు అంటున్నాయి ...ఎందుకు బాధిస్తున్నావు? రా!”


కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-144
‘కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి’
(గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది)
...
కొన్ని పాటల్లోని సంగీతం మనసు ను తేలికపరుస్తుంది, అర్ధం మనసును బరువెక్కిస్తుంది. అలాంటి పాటల్లో ఇది ఒకటి.
మాటల రచయిత ‘సాగర్ సర్హది’ బాల్యంలో దేశ విభజనతో పాకిస్తాన్ నుండి కాందిశికుడిలా ఢిల్లీ కివచ్చాడు. అక్కడినుండి బొంబాయికి. రచయితగా యశ్ చోప్రా తో కలిసి విజయవంతమైన సినిమాలకు పనిచేసాడు. అందులో కభీ కభీ, సిల్ సిలా ,చాందిని వంటివి ఉన్నాయి. అమితాబ్ బచన్ తో ‘మీరు బరువైన గుండె తో రాస్తారు’ అనిపించుకున్నాడు.
‘బజార్’ సినిమాతో దర్శకుడయ్యాడు. ‘బజార్’ సినిమా కన్యాశుల్కం వంటి కథకు మరో రూపంలో హైదరాబాద్ నేపధ్యంగా నడుస్తుంది. (హిందీ సినిమాల్లో అప్పట్లో నాకు హైదరాబాద్ కొత్తగా కనిపించేది. అంతకు ముందటి ‘మెహబూబ్ కి మెహంది’, తర్వాతి ‘నిఖా’ సినిమాల్లో).
సినిమాలో సంగీతం, పాటలు మరపురానివి. పాటలు సినిమాకోసం రాసినవి కాకుండా సాహిత్యం నుండి అవసరం మేరకు ఎంచుకున్నవి. మీర్ తకి మీర్ (దిఖాయి దియె) , మఖ్దూమ్ మొహియుద్దిన్( ఫిర్ చిడీ రాత్ బాత్ ఫూలోన్ కి) కవితలు/గజల్లు అలాంటివే.
‘కరోగి యాద్’ పాట బషర్ నవాజ్ రచన. ఖయ్యాం సంగీతం, భుపెందర్ స్వరం ..వీటి విలువను మరింతపెంచిన నటినటుల నటన, చిత్రీకరణ ...వీటన్నింటితో పాట ఓ గొప్పానుభూతినిస్తుంది.


“గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది
కదిలిపోయే కాలపు, ప్రతి కెరటం ఆగిపోతుంది
ఈ చంద్రుడు కరగిపోయిన కాలానికి అద్దం ఔతాడు
కదలాడుతున్న మబ్బుల్లో ఏదో ముఖం రూపుకట్టింది
బరువెక్కిన దారులు ఏదో కథ వినిపిస్తుంది
వర్షంతో చెమ్మగిల్లిన ఋతువు పొగ గా మారుతుంది
కరగిపోతున్న కొవ్వొత్తి నిచూసి మనసు గర్విస్తుంది
అరచేతిలోని గోరింట ఏవో జ్ఞాపకాలు రేపుతుంది
వీధి మలుపులో ఒక గుమ్మం శూన్యంగా ఉంది
తపించే కళ్ళతో ఎవరిరాకకో ఎదురుచూస్తుంది
చూపులు దూరంవరకూ వెళ్ళి తిరిగి వస్తున్నాయి “