Sunday, March 26, 2017

'నచ్చిన ' పాటలు - 'లోపలి 'మాటలు -2   'ఆజ్ పురానీ రాహోంసె కోయీ ముఝే ఆవాజ్ న దే’
మనిషి అంతరంగాన్ని మించి కదన రంగం ఉంటుందా? అది మంచిచెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలాంటి అంతరంగిక సంఘర్షణను చాలా ఎఫెక్టివ్ గా ప్రతిఫలింపజేసిన సినిమా గుడిగంటలు.దానికి మాతృక తమిళ చిత్రం ఆలయమణి. దానికి హిందీ రూపం ‘ఆద్మీ ‘. శివాజీగణేశన్,ఎన్ టీ ఆర్, దిలీప్ కుమార్ లు హీరో పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. కథానాయకుడు, ప్రతినాయకుడు ఒకరే.ఒకే పాత్రే.ముఖ్యపాత్ర అంతరంగంలోనే అనునిత్యం పోరాటం.స్థూలం గా అది మంచి చెడు మధ్య .
మంచిని చెడు వశం చేసుకునే సన్నివేశంలో ...ఓడిపోతున్న మంచిని చూసి మనసు చెమ్మగిల్లుతుంది. ఒక్కసారి అంతరావలోకనం చేసుకుంటాం.ఏమేమో గుర్తొస్తాయి..
చివరగా బుసకొట్టిన క్రోధలోభ మోహాలను జయించి మనసుని దివ్యమందిరం చేసుకున్న ‘మనిషి’ ధర్మజ్యోతి ఆదరణలో సేదతీరుతాడు.
ఆ నేపధ్యంలోని హిందీ సినిమా ‘ఆద్మీ ‘ లో పాట “ ఆజ్ పురానీ రాహోంసె కోయీ ముఝే ఆవాజ్ న దే’
ఈ పాట నౌషాద్ అలీ(సంగీతం),షకీల్ బదాయుని(గీతం), మహమ్మద్ రఫీ(గానం) త్రయం సృష్టి. కడలి కెరటాలు, ఎత్తైన శిఖరం నేపధ్యం గా దిలీప్ కుమార్ పై చిత్రీకరించిన ఈ పాట చూసినపుడల్లా ఫెటిల్లన పగిలి లావాను వెదజల్లి పూర్తిగా శాంతించి, సెలయేరుకు నెలవైన అగ్నిపర్వతం గుర్తుకొస్తుంది.
గతంనుండి ,అప్పటి చేదుపాటలనుండి, పాత గమ్యాలనుండి, నేరాలనుండి విముక్తుడయ్యాడు.
బంధనాలు తెగిపోయాయి, హృదయ సీమలో లో ఏ కోరికల చిత్రపటాలూ లేవు. సర్వ స్వతంత్రుడయ్యాడు. తనలో ఒక కొత్త మనిషిని కనుగొన్నాడు. దేవుడు కూడా అతని చూపులకు అందుతున్నాడు.
అలాంటి ‘మనిషి ‘ ఎలుగెత్తి పాడే పాటే ఈ గీతం.
పాట చివర మహాబలిపురం లో సాగరజలాలతో నిత్యం పోరాటం చేస్తూ నిలిచి ఉన్న తీర దేవాలయం (షోర్ టెంపుల్) ని చూపుతారు . ఆ గుడి మనిషికి ప్రతీక అనిపిస్తుంది.



No comments:

Post a Comment